Monday, October 23, 2017

కార్తిక మాస వ్రతము. 4 వ అధ్యాయము... దీపారాధన మహిమ.

కార్తిక మాస వ్రతము. 4 వ అధ్యాయము... దీపారాధన మహిమ.



4 వ అధ్యాయము...     దీపారాధన మహిమ

ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తిక మాసమున ముఖ్యముగ యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా! కార్తిక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొ౦దుదురు. కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.


శతృజిత్ కథ
పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చుటకు ఒక ముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నీ వెందుల కింత తపమాచరించు చున్నావు? నీ కోరిక యేమి?' యని ప్రశ్ని౦చగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని చెప్పెను. అంత ముని పుంగవుడు ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల నీ కోరిక నెర వేరగలదు' యని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలతో నియమాను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముహూర్తమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మాదులు జేసి, ఆ బాలునకు 'శతృజిత్' యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.
రాకుమారుడు శతృజిత్ దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనమునకు రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండి౦చుచు తన
కామవా౦ఛ తీర్చుకోనుచుండెను.
తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శతృజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వ ర్ణి౦చుట మన్మధున కైననూ శక్యము గాదు. అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై కామవికారముతో నామెను సమీపించి తన కామవా౦ఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములనుభవించెను.
ఇట్లుఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్దరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవా౦చ తీర్చు కొనుచు౦డిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.
ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలు దేరి గర్భగుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున' చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహాదానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామా౦ధకారముతో కన్ను మిన్నుతెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను. అంత యమకింకరులు' ఓ బాపడా ఎవరెంతటి నీచులైననూ, యీ పవిత్ర దినమున, అనగా, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ' అలా యెన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు యెలాగునున్నప్పటికి మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తి౦చ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆయనకు దానము చేసెను. శివదూతలు వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి.
వింటివా రాజా! శివాలయములో దీపారాధన చేయుట వలన వారి పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొ౦దుదురు.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి
నాలుగో అధ్యాయము - నాల్గవ రోజు పారాయణము సమాప్తం.

No comments:

Post a Comment

Total Pageviews