Wednesday, September 11, 2019

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ " నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని
ఆ కాలంలో అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం
తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహలాడాడు బాణభట్టులాగే.
తీరా నాటకం చదివి నచ్చకపోతే మహాకవి ఏమంటాడో అని (బాణుడిలాగే ) ఒక శంక.
అందువల్ల తను స్వయంగా కాళిదాసుకు నాటకం చూపించటానికి సంశయించి, తన
కుమారుడికి తన కుమారుడికి తన తాళపత్రగ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు.
కాళిదాసు యింట్లో కూచుని చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ
అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. అన్నాడు.
వేరే సమయమెందుకు?వచ్చావుగదా!యిప్పుడే చదివి వినిపించు. ఒక చెవి పడేసి వినేస్తాను. అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కూడా మరల్చకుండా.
భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది. తన తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధపెట్టి వినేందుకు కూడా యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించటం చెవిటివాడి
ముందు శంఖమూది నట్టు గదా! అనిపించింది. కానీ ఏంచేస్తాడు?తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు, అంతకంటే ఎక్కువే. ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప
ఆయనకు మనః శాంతి లేదు. చేసేది లేక నాటకమంతా చదివి వినిపించాడు.
చదివాడు కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇటుపక్కకు తిరిగి చూడనైనా
చూడలేదు. అంతా చదివాక మాత్రం,నోటినిండా తాంబూలం తో అస్పష్టన్గా సున్నా ఎక్కువైంది అని మాత్రం వినిపించింది. భవభూతి కుమారుడికి 'ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది. దానిమీద వున్న
ఆసక్తి గూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.అనుకొన్నాడు. ఆ
నిర్లక్ష్యం, అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి.
ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు. విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు.
తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసేభవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం'
అని మెచ్చుకున్నాడు. భవభూతి ఆయనను కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు.
మాటల మధ్యలో భవభూతి,కాళిదాసుతో మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు. అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా, మీ
తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం ఏది అన్నారని చెప్పాడు. మీరేమో
యిప్పుడు నా నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏదో సాటి కవినని మర్యాదతో
మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను. ఈసారైనా విని మీ సూచనలూ,
అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను. అన్నాడు.
కాళిదాసు నవ్వాడు; 'కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న
ఆసక్తి మరే విషయంపైనా లేదు. మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం
క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను. పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం
ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే
నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను.నేను అన్నమాటలు పై పై మర్యాదకోసం చెప్పినవి కావు.' అన్నాడు.
ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు. నేనన్నది సున్నం గురించికాదు. 'సున్న' గురించి , నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో
ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నాని చిన్న సూచన చేశాను తప్ప మీ అద్భుతమైన నాటకం లో
ఏ చిన్న మార్పూ అవసరం లేదు.
ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగి పోయాడు. ఉత్సాహంగా సున్న ఎక్కువైంది ఏ శ్లోకం లో స్వామీ?నాటకంలో శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.దయచేసి చెప్పండి. అన్నాడు.
ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది? మొదటి అంకం లోనే, రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.
కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్
అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ
అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో
అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్
(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక - ఏక - దోష్ణో: = అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో
ఒకరుగా ఒదిగి ;
అవిరళిత కపోలం - చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా
ఆసక్తి యోగాత్ - అక్రమేణ - కిమపి కిమపి - మందం మందం - జల్పతో: = ఆసక్తి బట్టే తప్ప - మారె వారసలేకుండా - ఏవేవో ముచ్చట్లు - గుసగుసలుగా చెప్పుకుంటున్న
(మనకు)
అవిదిత గతమయామా - రాత్రి: - ఏవం - వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన
జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది.
అవునవును అన్నాడు భవభూతి.
అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులు
రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)
అని చెప్తే మరీ బాగుంటుంది.
పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి.అలా ఉంటూనే ఉంటాయి.
రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది.అన్నాడు
కాళిదాసు.
అవశ్యం మహాకవి! ఎంత అద్భుతమైనమార్పు సూచించారు! అందుకే తమరు కవికుల
గురువులు అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి.
అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు.
నాటకేషు చ కావ్యేషు వయం వా వయమేవ వా
ఉత్తరే రామచరితే భవభూతి: విశిష్యతే
నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమే సాటి. ఉత్తరరామచరిత్ర లో మాత్రం
భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు. అన్నాడు కాళిదాసు.
భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు.
కన్యాకుబ్జ౦ రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ,ఆంద్రుడని కొందరూ వాదించారు.
భవభూతి రచనలు మూడూ నాటకాలే.'ఉత్తరరామచరితం' 'మాలతీమాధవం'
'మహావీరచరితం' భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు'.ఏకో రసః కరుణ ఏవ!'
-----------------------------శుభరాత్రి----------------------------

Friday, August 16, 2019

"కుంచమంత కూతురుమంచం భోజనం" "ముదితల్ నేర్వగరాని విద్యకలదే దేశమంటే మనుషులోయ్"

ఈ వీడియో చూడడానికి వినోదంగానే ఉన్నా ఎన్నో ప్రశ్నలు సంధిస్తోంది. 
"కుంచమంత కూతురుంటే మంచం మీదే భోజనం" అని ఒక సామెత 
అలాగే "ముదితల్ నేర్వగరాని విద్యాకలదే ముద్దార నేర్పింపగాన్" అన్నారు 
పిల్లల పెంపకం అన్నది అత్యంత ముఖ్యమైనది. అత్యంత నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం 
చిన్నప్పటినుంచి పిల్లలని టి.విలకి, కంప్యూటర్లకి, సెల్ల్ ఫోన్స్ కి బందీలుగా చేసి కొద్దిగా ఎదగగానే ప్లే స్కూల్ నుంచి ఐఐటీ చదువుల మత్తులో వారిలో సృజనాత్మకత, మానవీయత లేకుండా చేస్తున్నాం. 
ఈ సందర్భంగా 1910 లో రచించబడి 09/ 08 /1913 లో కృష్ణాపత్రికలో ప్రచురించబడిన గురజాడ వారి "దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్" ఈ పలుకులు ఎప్పటికీ విశ్వజాతి నిర్మాణానికి పునాది రాయి. ఒకసారి దేశం 73 వ స్వేచ్ఛా వాయువులు ఆస్వాదిస్తున్న వేళ మననం చేసుకుందాం! దేశానికీ దశ, దిశా తెలియచెప్పగల సత్తా ఉన్న దేశభక్తి పూరిత పూర్తి గీతం మీకోసం: సత్యసాయి - విస్సా ఫౌండేషన్
దేశమును ప్రేమించుమన్నా
1.దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా!
వొట్టి మాటలు కట్టిపెట్టోయి
గట్టి మేల్‌ తలపెట్టవోయి.
2.పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటుపడవోయి;
తిండి కలిగితె కండ కలదోయి;
కండ కలవాడేను మనిషోయి!
3.యీసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయి?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయి.
4.అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి
దేశి సరుకుల నమ్మవలెనోయి !
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి.
5.వెనక చూసిన కార్యమేమోయి?
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి!
6.పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే,
వ్యర్థ కలహం పెంచబోకోయి
కత్తి వైరం కాల్చవోయి
7.దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని ఏదైనాను వొకమేల్‌
కూర్చి జనులకు చూపవోయి
8.ఓర్వలేమిపిశాచి దేశం
మూలుగులు పీల్చేసెనోయ్,
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయి
9.పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయి?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయి!
10.స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టి కాదోయి
దేశమంటే మనుషులోయి!
11.చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయి
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయి
12.మతం వేరైతేను యేమోయి?
మనసు లొకటై మనుషులుంటే
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయి!
13.దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి,
నరుల చమటను తడిసి మూలం,
ధనం పంటలు పండవలెనోయి!
14.ఆకులందున అణగిమణగీ
కవిత కోయిల పలకవలెనోయి;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయి!

Sunday, August 11, 2019

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవితలు 2

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవిత: "ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ,...

Thursday, July 11, 2019

గుండె లోతుల్లో ఓ జ్ఞాపకం

గుండె లోతుల్లో ఓ జ్ఞాపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తొలకరి వేళ
చిరుజల్లులు కురిసి
పుడమి కాంత మేనుకు
హాయిని కలిగించాయి!
గ్రీష్మతాపంతో
కమిలిన ధరాసుకుమారి
సుందర రూప లావణ్యం
ఆషాఢ మేఘం పలకరింపునకు
స్వాంతన పొంది
చిరుదరహాసంతో
పులకరించింది!
ఇంకా...
నువ్వు వస్తావనే ఆశ
నా గుండెలోతుల్లో
భద్రంగా దాగి ఉంది!
ఉగాదులెన్నో మారాయి
విరహం వేసవికి
నా హృదయంలో
వేడి సెగలు రగిలాయి!
కానీ.. చెలీ!
మునుపెన్నడో
నీతో పంచుకున్న
జ్ఞాపకాల మల్లెలు
సుగంధాలై పరిమళించి
రగులుతోన్న విరహాగ్నిలో
శాంతి ధూపం వేశాయి!
కాలం వేగంగా కదులుతున్నా
నీ ఊహల్లో బతుకుతోన్న నాకు
కాలగమనమే తెలియడంలేదు!
నా వలపు రహదారిలో
నువ్వు నా కోసం
నడిచి వస్తున్నావనే భావనే
నన్నింకా బతికిస్తోంది! *
-విడదల సాంబశివరావు 9866400059

అచ్చతెలుగు గళాకారుడు బాలు --- పున్నమరాజు


‘‘కలువలు పూచినట్లు! చిరుగాలులు చల్లగ వీచినట్లు! తీ

వలు తలలూచినట్లు! పసిపాపలు చేతులు సాచినట్లు! క్రొ 
వ్వలపులు లేచినట్లు! చెలువల్‌ చెలువమ్ముగ చూచినట్లుగా 
పలుకుట పూర్వపుణ్యపరిపాకముగాదె తలంచి చూడగన్‌’’
‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన ఈ పద్యం, శ్రీపతి పండితారాధ్యుల
బాలసుబ్రహ్మణ్యం వాచిక ప్రతిభను గుర్తుకు తెస్తుంది.

ఎందుకంటే...ఆయన స్వరంలో
అక్షరం’ అక్షర ‘మై నిలుస్తుంది...
హాస్యం లాస్యం చేస్తుంది...
శృంగారం సింగారాలు పోతుంది..
విషాదం మన కంట నీరొలికిస్తుంది..
భక్తిభావం భగవద్దర్శనం చేయిస్తుంది!

తరతరాలకు తన్మయ తరంగమై పల్లవిస్తున్న ఆ గాంధర్వ స్వరం- ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం!
పలుకులమ్మ పరిపూర్ణ అనుగ్రహంతో, గానకళాకోవిదుడై, తెలుగు యశస్సుకు
తార్కాణంగా నిలిచిన నిత్య గాయకుడు, నిఖిల గాయకుడు, ‘‘బాలు’’గా కోట్లాది 
మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు 
ఈరోజు!

అన్ని భాషల్నీ అమ్మ భాషలుగా చేసుకుని, ఆయా భాషల్లోని మాటల భావాత్మని
తన గొంతులో పలికించి, ఆ భాషల శ్రోతలకు అవధీరహితమైన గళపరిమళాన్ని
పంచి, స్వరసామ్రాజ్య చక్రవర్తిగా ఎదిగిన బాలు తెలుగువాడు కావడం మనం మరీ
మరీ మురిసిపోవలసిన విషయం!

బాలు నట గాయకుడు. ఏ నటుడి కోసం పాడుతున్నాడో 
ఆ నటుడి హావ భావాల్ని, నటనా ధోరణిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని, తదనుగుణంగా గాత్రాన్ని 
మలిచి పాటకు ప్రాణం పోయడం బాలుకు గొంతుతో పెట్టిన విద్య. 

ఆయన స్వరానికున్న అనితరసాధ్యవిస్తృతి, 
ఏ భావాన్నైనా అలవోకగా పలికించగల అనన్యత్వాన్ని ప్రసాదించింది. 
దానికి తోడు శిఖరాయమైన ఆ ప్రతిభ దైవదత్తమని మనఃపూర్వకంగా నమ్మి, 
ఏ మాత్రమూ అహంకారం లేకుండా, సాధనతో పరిపూర్ణతను సిద్ధింప చేసుకున్న మానవతామూర్తి బాలు!

కవి ఏ సందర్భంగా ఆ పదాన్ని వాడాడో తెలుసుకుని, భాషాభావ సంస్కారంతో, 
సమయోచితరీతిలో ఆ పదాల విలువ పెంచేవిధంగా స్వరచాలనం చేసి, 
పాటకు మన మదిలో శాశ్వత్వాన్ని ప్రతిపాదించిన నాదయోగి బాలు!

శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోయినప్పటికీ, శృత పాండిత్యంతో, అత్యంత 
అభినివేశంతో, దీక్షాదక్షుడై, కఠోర సాధన చేసి, త్యాగయ్య, శంకరాభరణం
చిత్రాల్లో శాస్త్రీయ సంగీత ఆధారిత గీతాలను పండిత పామర మనోరంజకంగా 
ఆలపించి, అత్యున్నత పురస్కారాలను దక్కించుకున్న గాన తపస్వి బాలు!

తొలినాళ్ళలో చేయూత నిచ్చిన గురువు పట్ల అభిమానంతో తన 
ధ్వనిముద్రణాశాలకు కోదండపాణి పేరును ఉంచడం, దైవసమానుడిగా భావించే
ఘంటసాల విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం, జానకమ్మ
ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేసాననే కృతజ్ఞతాభావంతో ఈ
పుట్టినరోజునాడు ఎస్‌ జానకికి జాతీయ పురస్కారాన్ని అందించడం బాలు
సంస్కారానికి, మహోన్నత వ్యక్తిత్వానికి, శుభలక్షణ సంపన్నతకు నిలువెత్తు
నిదర్శనాలు.

ఈటీవీ అధినేత రామోజీరావు గారి సూచన ఆమోదించి, 1996 నుంచి నేటి వరకూ 
అప్రతిహతంగా, అనితర సాధ్యమైన వ్యాఖ్యానపటిమతో బాలు నిర్వహిస్తున్న 
సంప్రదాయబద్ధమైన లక్షగళార్చన ‘‘పాడుతాతీయగా’’ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 
ఉన్న వర్తమాన గాయనీ గాయకుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వారి ప్రతిభకు పట్టం
కడుతూ, తెలుగు పాట కీర్తి కేతనాన్ని విశ్వ వేదికపై రెపరెపలాడిస్తోంది.

బహుముఖీయమైన ప్రజ్ఞా ప్రభాసిగా ఎదిగినా...సముద్రమంత ఆర్తితో 
శిఖరాయమానమైన కీర్తిని సాధించినా...తన సహజాత స్నిగ్ధాపిపాసతో
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని, వేలాదిమంది స్నేహితుల్నీ
సంపాదించుకున్న మనసున్న మనిషి బాలు!

గొంతులో తగ్గని మార్దవం, పలుకుబడిలో ఒలికే అందాలు, పాట భావంలో
ఒదిగేపోయే తత్త్వం, రాజీలేని తపన, సాహితీ అభిలాషతో కూడిన సంగీత ప్రజ్ఞ
ఔచితీవంతమైన గానపద్ధతి, బహుగాత్రదానధురీణత, అద్భుత నటనా కౌశలం
స్వంతం చేసుకున్న బాలు సుస్వర సర్వస్వమై ఎదిగి అందిపుచ్చుకున్న లెక్కలేనన్ని
పురస్కారాలలో పద్మశ్రీ, పద్మభూషణ్‌, శత వసంత భారతీయ చలన చిత్ర 
మూర్తిమత్వ పురస్కారాలు విశిష్టమైనవి.

పాటకోసమే పుట్టి, పామర, పండితారాధ్యుడై ప్రభాసిస్తున్న అచ్చ తెలుగు
గళాకారుడు, నిత్యనూతన పథికుడు బాలు మరిన్ని వసంతాలు సంగీతలోకాన
చిరయశస్సుతో జీవించాలి. ఈ గాన గంధర్వుడి ప్రస్థానం నిర్విరామంగా
కొనసాగాలని అశేష అభిమానుల విశేష ఆకాంక్ష!


- పున్నమరా
జు

Thursday, July 4, 2019

అందరికీ నమస్కారం! నా పేరు వైభవ్ గుర్తున్నానా? ఈ రోజు నాపుట్టిన రోజు!

అందరికీ నమస్కారం! నా పేరు వైభవ్ గుర్తున్నానా? నా వీడియోలు చూడాలంటే ఈ లింక్‌ నొక్కండి
ఈ రోజు నాపుట్టిన రోజు! 
ఏ మనిషి జీవితంలోనైనా రెండు గొప్ప రోజులు ఉంటాయి.
ఒకటి అతని పుట్టిన రోజు 
రెండవది ఎందుకు పుట్టాడో తెలుసుకున్న రోజు! 
మన జీవితాలు అశాశ్వతం అని తెలిసినా
అన్నీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాం - ఒక్క ప్రకృతిని తప్ప
ఏడుస్తూ వచ్చి ఏడిపిస్తూ వెళ్ళిపోయే
మధ్యలో నవ్వుతూ నవ్వించే కాలమే మన జీవితం
అందంగా వున్నవారికన్నా...
తన చుట్టూ వున్నపరిసరాల్ని అందంగా
చుట్టూ వున్న వారిని ఆనందంగా
వుంచేవారి జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది!
కొందరిని కొంత కాలం తర్వాత మర్చిపోతాం!
కొందరితో ఉన్నప్పుడు కాలాన్నే మరచిపోతాం!!
అందుకే మన సహచరులతో ఆహ్లాదంగా గడుపుదాం!
పదికాలాలూ మనల్ని గుర్తుంచుకునేలా....ప్రకృతికి ప్రేమిద్దాం
ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం!
అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం!
కానీ మనం ప్రకృతినుంచి ఎంతో తీసుకుని
ప్రకృతికి ఏమీ ఇవ్వడం లేదు.
కొంతైనా తిరిగి ఇచ్చేద్దాం లేకపోతె లావయిపోతాం
మొక్కలు నాటుదాం! వృక్షాలుగా ఎదిగిద్దాం!!
'ఒక పువ్వు రంగు చూస్తూ శతాబ్దాలు బతగ్గలను' అన్నారు కవి శేషేంద్ర.
కానీ మన జీవితంలో కనీసం ఒక్క మొక్కని నాటకుండా
ఒక పువ్వుని పుష్పించకుండా, చూడకుండా బతికేస్తున్నాం!
"మొక్క నాటడానికి అత్యుత్తమ సమయం 20 సంవత్సరాల క్రితం.
రెండవ అత్యుత్తమ సమయం ఇప్పుడు" అని ఒక చైనా సామెత.
ఆనందం అనేది మనం చేసే ఆలోచనల్లోనే ఉంటుంది.
శ్రీశ్రీ గారు చెప్పినట్లు “ఆచరణకు దారి తీస్తేనే ఆశయానికి సార్థక్యం!”
మన సామర్ధ్యాన్ని బట్టి మనల్ని మనం
అంచనా వేసుకుంటాము....
మన మహత్కార్యాలను బట్టి
ఇతరులు మనల్ని అంచనా వేస్తారు
ప్రతి రోజు ఒక సంకల్పంతో నిద్రలేచి
దానిని నెరవేర్చిన సంతృప్తితో నిద్రపోదాం!
మనం సాధారణ వ్యక్తులమే కావచ్చుకనీసం కొంతమందైనా
మనల్ని గొప్పగా భావించేలా జీవించాలి.
డబ్బు దుబారా కన్నా
సమయం వృధా చెయ్యడం మరింత ఎక్కువ నష్టం.
ఎప్పటికప్పుడు మనలో చెడుకలుపు మొక్కలని తొలగించి
మంచి ఆలోచనల విత్తనాలు నాటితే ఆ జీవితం ఆనంద బృందావనం అవుతుంది!
నన్ను చూడాలంటే ఒక మొక్కని నాటండి. అందులో పువ్వులా నవ్వుతూ పలకరిస్తా!
నీటిని వృధా చెయ్యద్దు! అది నా కన్నీరు
రండి మనందరమూ కలిసి ప్రకృతిని ప్రేమిద్దాం! పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!!
భావితరాలకు మంచి పచ్చదనాన్ని అందిద్దాం!
నా పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపిన
మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
ఎప్పటికీ మీలో, మీతో వుండే
మీ ఆదర్శ ఆశయ కార్యాచరణ సాయి వైభవ్ విస్సా!












Total Pageviews