Thursday, December 31, 2015

అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో...సత్యసాయి విస్సా ఫౌండేషన్.

నూతన సంవత్సరం లోకి అడుకుపెట్టడం అంటే? 

నూతన సంవత్సరం లోకి అడుకుపెట్టడం అంటే? 
ఒక కొత్త చైతన్యం లోకి ప్రవేశించడం 
కొత్త మార్పును ఆహ్వానించడం 
కొత్త ఆశలు ఆశయాలు ఏర్పరచుకోవడం 
గత తప్పులను ఒకసారి సరిచూసుకుని 
సరిచేసుకుని ముందుకు సాగడం అంతేకాని 
మత్తులో కేరింతలు అర్ధరాత్రి అరుపులు కేకలు 
బైకులపై దూసుకుపోవడాలు, డి.జె లు పెట్టి గుండెలు ఆదరగోట్టడాలు 
ప్రమాదాలు కోరితెచ్చుకోవడం బైకులు కొనిస్తున్నాం! ఖరీదైన సెల్ ఫోన్లూ కొనిస్తున్నాము 
వాటిని ఎలా వినియోగించాలో నేర్పించే తీరికా ఓపికా మనకి లేవు 
ఎలా ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ఒరిగేదేమిటి!
వీటికి క్యాలెండర్లు మారతాయి తప్ప జీవితంలో ఏమి మార్పు రాదు 
ఎంజాయ్ చెయ్యడం ఆంటే అర్ధం మారిపోతోంది 
పీకల్దాకా తాగి తిని రోడ్లపై భాద్యతా రహితంగా ప్రవర్తించడమేనా? 
ఇటువంటి యువకులనేనా వివేకానందుడు కోరుకున్నది! 
కలలు కనండోయ్ అని అబ్దుల్ కలాం మొత్తుకున్నది!! 
తప్పు పిల్లలది కాదు మన సంస్కృతి ఇది అని తెలియ చెప్పని 
మన పెద్దలదే...చాటి చెప్దాం! మన ఘన సంస్కతిని 
ఈ రోజే!! ఇప్పుడే!!! తగిన జాగ్రత్తలతో ఉత్సవాలు జరుపుకోమని    
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
సత్యసాయి విస్సా ఫౌండేషన్.  

Monday, December 28, 2015

దేవాలయంలో ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఎప్పుడూ నమస్కరిస్తూనే ఎందుకు కనిపిస్తాడు ?


దేవాలయంలో ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఎప్పుడూ నమస్కరిస్తూనే ఎందుకు కనిపిస్తాడు ?

రావణవధ అయ్యాక సీతారాములు వెళ్ళిపోతూ ఆంజనేయుడితో " నీకేం కావాలి?" అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు నాకు మరేవిధమైన కోరికలూ వద్దు. ఏరూపం చూచినా అందులో నీ రూపమే కనిపించేలాగ, ఏ శబ్దం వినిపించినా అందులో సీతారాముల కథే వినిపించేలా, ఎక్కడ నమస్కరించినా అది మీకే చెందేలాగ ఈ భావం నాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు అని కోరుకొన్నాడు. దానికి రాముడు సరే అన్నాడు. అందుకని ఆంజనేయుని నమస్కారం సీతారాములకే. ఆంజనేయ ధ్యానమంతా సీతారాముల విషయంలోనే.అంతేకాదు సీతారాములకి నమస్కరిస్తున్న హనుమకి నమస్కరించడం ఆ సీతారాములకి మరింత ఇష్టం. ఎందుకంటే భగవంతుడు తనకి చేసిన నమస్కారం కంటే తన భాగవతునికి ( భక్తునికి ) చేసిన నమస్కారానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తాడు కదా!!

(అహం స్మరామి మద్భక్తం.)




పెద్దలమాట చద్దిమూట

పెద్దలమాట చద్దిమూట 

గెలుపుతో మనం ప్రపంచానికి తెలుస్తాం
ఓటమితో ప్రపంచం ఏమిటో మనకి తెలుస్తుంది
రెండూ ముఖ్యమే.గెలుపంటే అత్యాశ...ఓటమి అంతే నిరాశ
గెలిస్తే అహంభావం...ఓడితే నిరాశాభావం ఉండకూడదు.





తిరుప్పావై పాశురములు 13 వ రోజు - తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు

తిరుప్పావై పాశురములు
13 వ రోజు - తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు
ఆండాళ్ తిరువడిగలేశరణం
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు.
వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మధ్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత వాళ్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి "సౌమిత్రే ధనుః" అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.
కృష్ణుడి జట్టు వారు "పుళ్ళిన్ వాయ్ కీండానై" ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు "ప్పొల్లా అరక్కనై" రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు. "కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్" ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.
"పిళ్ళైగళ్ ఎల్లారుమ్" గోపబాలికలందరూ "పావైక్కళం పుక్కార్" వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్పుతున్నారు. "వెళ్ళి యెరుందు" శుక్రోదయం అయ్యింది, "వియారమ్" బృహస్పతి "ఉఱంగిత్తు" అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి, ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం.
"పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు మాటలాడుకుంటున్నాయి "పోదరి క్కణ్ణినాయ్" తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా. తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టించు కోవడం లేదు. "కుళ్ళ కుళిర" చల చల్లటి ఆనీటిలో "క్కుడైందు" నిండా మునిగి "నీరాడాదే" అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. "పళ్ళి క్కిడత్తియో" ఇంకా పడుకుని ఉన్నావా "పావాయ్!" ముగ్దత కల్గిన దానా, " నీ నన్నాళాల్" సమయం అయిపోతుంది, "కళ్ళం తవిరుందు కలంద్" మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.

Sunday, December 27, 2015

12వ రోజు - లక్ష్మణుడి కర్మ విదానం

తిరుప్పావై పాశురములు
12వ రోజు - లక్ష్మణుడి కర్మ విదానం
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్యజ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితికి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.
"ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే |
ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్ || "
వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు.
"దుఃఖేషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:
వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే"
ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు. ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్.
"ఇళంకత్తెరుమై" లేత దూడలు కల్గిన గేదెల "కనైత్త్" అరుపు వినిపిస్తోంది. ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నారు. "కన్ఱుక్కిరంగి" దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే "నినైత్తు" దూడ వచ్చిందని భావించి, "ములై వరియే" పొదుగుల గుండ "నిన్ఱు పాల్ శోర" ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. "ననైత్త్-ఇల్లమ్" ఇల్లంతా తడిసి పోయి , "శేఱాక్కుమ్" అంతా బురద అయ్యింది.
ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.
"నచ్చెల్వన్ తంగాయ్" ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది. "పనిత్తలై వీర" మంచుతో పైన తడుస్తున్నాం, ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం కొట్టుకుపోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి "నిన్ వాశల్ కడై పత్తి" అమ్మా నీ గుమ్మపు పైకప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .
అయితే లోపలున్న గోపబాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు "శినత్తినాల్" కోపంతో "తెన్ ఇలంగై క్కోమానై" అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి "చ్చెత్తమ్" సంహరించి, "మనత్తుక్కినియానై" అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం "ప్పాడవుమ్" పాడుతున్నా "నీ వాయ్ తిఱవాయ్" నీవు నోరు తెరవవా! "ఇనిత్తాన్ ఎరుందిరాయ్" ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా. "ఈదెన్న పేర్ ఉఱక్కమ్" ఇది ఎలాంటి నిద్రమ్మా, "అనైత్తిల్లత్తారుం అఱింద్" లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి.

Saturday, December 26, 2015

తిరుప్పావై 11వ రోజు పాశురము

తిరుప్పావై 11వ రోజు పాశురము
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
గోపికలు "యుగాయితం నిమేషేన చక్షుసా ప్రాప్యుడాయితం శూణ్యాయతా జగత్ సర్వం గోవింద విరహేణమే" అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడు తమనొక నాయికగా భగవంతున్ని ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానం వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే, భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటియందు శ్రద్దలేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన భగవంతున్ని భావిస్తూ, అన్ని పనులూ భగవత్ సంబంధంగానే చేస్తారు . ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు.
ఇవాలటి గోపబాలికది దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆకర్షించేది భక్తి సౌందర్యం. ఈవాల్టి గోప బాలిక అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందినది. చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోపబాలిక. భగవత్ సేవా సంపద గొప్పగా కల్గినది కాబట్టి, ఈవిడని తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ఈవాలటి గోపబాలికను లేపుతుంది.
"కత్తుకఱవై" దూడలకు పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే "క్కణఙ్గళ్" గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల "పలకఱందు" పాలు పితకటంలో నేర్పరులు, "శెత్తార్ తిఱల్ అరియ" శత్రువుల బలం నశించేట్టుగా "చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం" వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు, "కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం" ఏపాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన "పొఱ్కొడియే" బంగారు తీగ, తీగ ఎదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది, ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ.
శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు. అదే సామూహికంగా పాదాది కేశాన్తంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు. మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి ఇలా వర్ణిస్తోంది. "పుత్తరవల్ గుల్" తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక పాములాంటి అందం కల్గి ఉండి, "పునమయిలే" ఏభయంలేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. "పోదరాయ్" రావమ్మా!! నీవెంట మేము నడుస్తాం."శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు" ఈ చుట్టూ ఉండే చెలికత్తెలు అందరూ వచ్చి, "నిన్-ముత్తం పుగుందు" నీ ముంగిట ప్రవేశించి, "ముగిల్ వణ్ణన్ పేర్-పాడ" నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం. నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని చూసి ఎలా పరుగెత్తుతూ వస్తుందో, నీలి మేఘశ్యామున్ని మేం కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, "శిత్తాదే" ఉలుకు లేదు "పేశాదే" పలుకు లేదు "శెల్వప్పెణ్డాట్టి" ఓ సంపన్నురాలా! ఎమమ్మా ఐశ్వర్య మదమా "నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్" లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి.

శ్రీ అయుత చండియాగ దర్శనభాగ్యం 25-12-2015

మన తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్ గారు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి నభూతో నభవిష్యతి అన్న చందంగా అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్న శ్రీ అయుత చండియాగ దర్శనభాగ్యం మాకు నిన్న లభించింది. ఈ సందర్భంలో నా మనోభావనాలు మీతో...లక్షలాది మంది హాజరయ్యే ఇటువంటి మహా కార్యక్రమాలలో నిర్వాహకులు ఎన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా ప్రజలలో కొంత సంయమనం, ఓపిక, సహనం వంటివి కూడా అవసరం. నిర్వాహకులు పదే పదే విజ్ఞప్తులు పలు సూచనలు చేస్తున్నా, మరో వైపు మంత్రి హరీష్ రావు సైతం ఇటు అటూ కలియ తిరుగుతూ ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నా, మూడు నాలుగు చోట్ల విపరీత మైన తొక్కిసలాట జరిగే పరిస్థితులు కన్పించాయి. అది ఒక ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమం కాళ్ళకి చెప్పులతో రావడం, ఇష్టం వచ్చినట్లు సెల్ ఫోన్ లతో ఫోటోలు తీయడం, గంటలతరబడి యాగశాలలోనే వుండిపోయి యాగాన్ని కాక ప్రముఖుల్ని చూడడం, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చెయ్యడం నేను కొంత మందిని మందలించడం వారించడం చేసాను. పుష్కరాలు, ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనే భక్తులకు ముఖ్యమైన మనవి ఏమనగా, కొంత సమయం వెచ్చించండి 1 గంట 2 గంటలు ఎదురు చూడగలిగితే కొంత రద్దీ తగ్గి సులువుగా దర్శనం చేసుకోవచ్చు, వరుస క్రమ(క్యూ) పద్ధతిని అతిక్ర మించవద్దు. హోదాలు, భేషజాలు వద్దు, పిల్లలకి, ఆడవారికి, వృద్ధులకి సహాయం చెయ్యండి. ఎప్పటి కప్పుడు నిర్వాహకులు భద్రతా సిబ్బంది. సూచనలు సలహాలు పాటించండి, వదంతులు నమ్మకండి, విద్యుతు తో పనిచేసే పరికరాలకి దూరంగా ఉండండి. ఒక విహార యాత్రకి వెళ్ళినట్లు కాకుండా త్రికరణ శుద్ధితో, భక్తి భావంతో, భగవన్నామస్మరణతో అంతర్బహిర్ శుద్ధితో దర్శనం చేసుకోండి. అక్కడ జరిగే కార్యక్రమంలో దేవీ దేవతలే వి.ఐ.పి లు మిగతా వారు ఎంత వారైనా సామాన్యులు గానే భావించాలి. క్రమశిక్షణతో శ్రద్ధాభక్తులతో దర్శించుకుని ఆయా దేవతల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదురు గాక!! తిరిగివస్తున్నప్పుడు వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఆ దేవిని స్తుతిస్తూ పోతన, మరి కొందరు కవుల పద్యాలు పాటలు ఆలపించే భాగ్యం లభించింది. మా ఎస్టేట్ కి వచ్చేసరికి అయ్యప్ప స్వామి శోభాయాత్ర సాగుతోంది. ఆ దర్శనం భాగ్యం కూడా లభించింది! ఈ చిత్రాలు కొన్ని మీకోసం!! వీక్షించండి! సర్వేజనాస్సుఖినోభవంతు!!! సమస్త సన్మంగళాని భవంతు!!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.






















Friday, December 25, 2015

తిరుప్పావై 10వ రోజు పాశురము


10వ రోజు - ముని యొక్క దశ
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్
ఆండాళ్ తల్లియొక్క సంకల్పం, అందరూ కలవాలి, వైయత్తు వళ్ వీర్గాళ్ ఈ భూమిమీద ఉన్నవాళ్ళంతా ఒకటి. ఇది మన ఆండాళ్ తల్లి హృదయ వైశాల్యం. ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దూ అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది. శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికకరాలకోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోపబాలికను గోష్టిలో చేరుస్తుంది. పైపైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెపుతున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం.
మానవ జీవితం అనగా సుఖ దుఃఖాలు నదీ తరంగాలుగా ఒక దానివెంట ఒకటి వస్తూనేవుంటాయి. సుఖమైనా దుఖఃమైనా ఎప్పటికి నిలిచి ఉండవు. అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్దం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది, అయితే దుఖం వల్లనన్నా లేక సుఖం వల్లనన్నా చెడుతుంది. సుఖం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు. సుఖః దుఃఖాలు ప్రమాదకరం కాదు, వాటియందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏంచెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.
దుఖేఃషు అణుద్విజ్ఞమనాః సుఖేషు విగతస్పృహః |
వీత రాగ భయ క్రోదః స్తితదీః మునిరుచ్యతే ||
మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి - వాడినే ముని అంటారు. అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై సృహ ఉండకుండా చేసుకోకు! దుఃఖం వచ్చినప్పుడు మనస్సు ఉద్విజ్ఞం చెందకుండా ఉండాలి. మనకు వీటియందు పట్టు ఉండకుండా చూసుకోవాలి. మనలోని రాగం భయంగామారి క్రోదంగా మారుతుంది. ఈరోజు మన ఆండాళ్ తల్లి లేపే గోపబాలిక ఇలాంటి జ్ఞానం కల్గి ఉన్నది.
"నోత్తు" మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు. కానీ నీనోము అయిపోయింది. ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది. "చ్చువర్ క్కం పుగుగిన్ఱ" నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావు, అంటే కృష్ణుడు నీవద్దే ఉన్నాడు. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే. సఖలలోకాలనన్నినింటిని తనలోచూపించాడు కదా! ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సఖలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. "తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః" ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు. "అమ్మనాయ్" ఓ యజమానురాలా! యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి. "మాత్తముం తారారో" ఒక మాట మాతో మాట్లాడరాదా "వాశల్ తిఱవాదార్" తలుపులు తర్వాత తీద్దువుగాని, లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట చాలు మాకు. అది మాకు ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష.
వీళ్ళు కృష్ణుడులోపల ఉన్నాడని అనుమానిస్తున్నారు, ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోపబాలిక ఏం పలకలేదు. లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్ళను పట్టించుకోలేదు. "నాత్తత్తుళాయ్ ముడి" లోపలుండే వాడు మన స్వామియే, ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు. మేము ఆ వాసన గుర్తించాం.
లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి, చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడెక్కడినుండి వస్తాడు అని అంది. "నారాయణన్" అంతటా వ్యాపించినవాడేకదా ఆయన, సఖల చేతన అచేతన వస్తువులకన్నింటికీ లోపన పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులు అడ్డా! "నమ్మాల్ పోత్త ప్పఱై తరుం" దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులరందరికి అందేవాడు ఆయన. "పుణ్ణియనాల్" పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు. ఆయన అందరికి అందాల్సినవాడు నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా!
"పండొరునాళ్" ఇదివరకు ఒకనాడు "కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం" మృత్యువు నోట్లో దూరాడు కుంభకరణుడు. రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు, ఆయన కుంభకరణుడిని చంపలా, కుంభకరణుడే మృత్యువు నోట్లో దూరాడు. దీప కాంతికోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపందా! బుద్దిమంతుడూ ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు, బుద్ది హీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు. "తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో" ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా? పైపైకి సరదాగా చెప్పినా లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది అండాళ్ తల్లి.
ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది. ఎవరు అంటే, కుభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా అంటుంది. అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టిన వాడు. శివుని వివాహానికి హిమాలయాపర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. వింధ్య పర్వతం మేలుపర్వతానికి పోటితో పెరుగుతుంటే దేవతలంతా గాబరాపడి ఈయనని అడిగితే, వింధ్య పర్వతం ఈయన శిష్యుడు. ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తధాస్తు అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్ప తనం. మామూలుగా ఒక్కొక్క పర్వతానికి అదిష్టాన శక్తివిశేషం ఉంటుంది. మనం దాన్నే పర్వతం అంటాం. ఈ భూమినీ మనం అలాగే భావిస్తాం, ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు, అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి ఆంటాం. అగం-పర్వతం స్త- పెరుగుదలని నిలిపిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయ్యింది. మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపజేయువాడు ఆయన. ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు. ద్రావిడ భాషకంతటికి ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు. వాతాపిని సంహరించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ తల్లి చెబుతుంది.
లోపల గోపబాలిక కృష్ణా అంటూ లేచింది, "ఆత్త అనందల్ ఉడైయాయ్!" పెద్ద బద్దకం కల దానా, "అరుంగలమే" అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారుకాదు. "తేత్తమాయ్ వందు తిఱవ్" తొందరగా సర్దుకొని రావమ్మా.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

తిరుప్పావై 9వ రోజు పాశురము

తిరుప్పావై 9వ రోజు పాశురము
భగవంతునికి మనకు ఉన్న సంబంధం
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్
ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. "తూ" పరిశుద్దమైన "మణి" మణులతో చేసిన "మాడత్తు" మేడ, "చ్చుత్తుం విళక్కెరియ" చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అణుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురుకోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటిచుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటిచుట్టూ దీపాలు వెలిగించింది. "దూపం కమళ" దూపం పరిమళిస్తుంది. "త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్" నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా. "మామాన్ మగళే!" ఓ మామగారి కూతురా! "మణి క్కదవం తాళ్ తిఱవాయ్" మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. సంస్కృతంలో వివిద అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆధిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.
1. మనందరికి తండ్రి ఆయనే
2. మనందరిని రక్షించేవాడు ఆయనే
3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేషి అంటారు
4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు
5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు
6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే
7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు
8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు
9. భోక్తా ఆయనే. స్వీకరించగల వాడు ఆయనే
లోకంలో మనం ఎదో ఒక సంబంధం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! "పితా రక్షకః శేషి భర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా" అష్టాక్షరీ మహా మంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ దూప పరిమలాల వంటిది.
అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా, వాళ్ల స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం. మనకు ఈ శరీరంపై దృష్టి ఉండి, ఇకపై దేనియందు మనస్సు అనిపించదు. దీన్ని పోషించుకోవాలి, దీని కోసం దేన్నైనా వదిలేయ్యాలి అని ఇలా దేహ బ్రాంతి పెరిగిపోతుంది. ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్షనమైన దేహం అనే తలుపు తెరుచుకొంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరువాల్సిందే.
"మామీర్!" ఓమెనత్తా, "అవళై ఎళుప్పీరో" మీ కూతురుని లేపమ్మా. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. "ఉన్ మగళ్ తాన్ ఊమైయో" నీపిల్ల ఏమైనా మూగదా లేక "అన్ఱి చ్చెవిడో" చెవిటిదా లేక "అనందలో" అలసిపోయిందా "ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో" ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా. శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం, ఆయన దగ్గర ఉంటే ఇక ఏమంత్రం పనిచెయ్యదు. అక్కడి నుండి బయటకు రావడం కష్టం. భగవత్ జ్ఞానం కల్గిన వ్యక్తి అలానే ఉంటాడు, ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగివాళ్ళ వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటివారివలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని.
ఆయితే లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా, లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరూ ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం. ఏమేమి అని అడిగింది.
"మామాయన్" చాలా ఆశ్చర్యమయిన పనులు చేసేవాడు, ఒకనాడు అడివి దహించి పోతుంటే ఒక్కసారి ఇలా మింగేసాడు, మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు. ఎలాగో ఒకలాగ ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగుకోసం చేసాడిన్ని పనులు. ఇవన్నీ దయ చేత కారుణ్యం చేత చేసాడు.
ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు అయనకు ఒకావిడ ఉంది, మన పాపాలను కనపడకుండా చేసే ఒకావిడ ఉంది, "మాదవన్" మా-లక్ష్మీదేవి దవ-నాథుడు,లక్ష్మీదేవి సంబంధం కల్గిన వాడు ఆయన, మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడంలేదు, ఆయన "వైకుందన్" వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ- త్రిపాద్ విభూది అనిపేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించే వారు. అలాంటి వైకుంఠానికి నాథుడు. మన బాగుకోసం మనకోసం వచ్చాడు. ఇలా "ఎన్ఱెన్ఱు" ఎన్నెన్నో "నామం పలవుం నవిన్ఱ్" నామాలను పలుకుతున్నాం.
ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.'
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

కోపిష్టి మొగుడా మీరు కాస్తిది చదవండి!!!

కోపిష్టి మొగుడా మీరు కాస్తిది చదవండి 
******************************************
అర్ధాంగి ,మనలో అర్ధ భాగం ,మనదో కన్నయితే ఆమెదో కన్ను , ఆ కన్నులో నీరొలికితే మన కన్నులో నీరొలికినట్టే.
చీటికి మాటికి మనం ఉప్పెక్కువయ్యిందని , కాఫీ చల్లారి పోయిందని , అన్నం మాడి పోయిందని భార్యను కసురుకుంటూ వుంటాం [ నేను కుడా]
అబ్దుల్ కలాంగారు చెప్పిన ఆయన నిజజీవితంలోని సంఘటన ఆయన చెప్పినది కాస్త వినండి.
అబ్దుల్ కలాంగారి మాటల్లో
" నా చిన్నప్పుడు ఒక రోజు మా అమ్మగారు పనికెల్లొచ్చి రొట్టి చేసి నాన్నకిచ్చారు , ఆ రొట్టి కాస్త మాడి వుంది , పాపం అమ్మ మళ్ళీ ఇంకొ రొట్టి వేస్తానంది కాని నాన్న అబ్బే నాకు కాస్త మాడిన రొట్టే ఇష్టం , భలే రుచిగా వుంటుంది అంటూ తినేసారు , నాకది కాస్త ఆశ్చర్యంగా అనిపించింది , మేమిద్దరం పైకి మేడమీదకెళ్ళాం పడుకోటానికి ,అప్పుడు నేను నాన్న నడిగా నాన్నా నీకు నిజంగా మాడిన రొట్టి ఇస్టమా అని , దానికాయన నవ్వుతూ మనది మధ్య తరగతి కుటుంబం , అమ్మా , నేను ఇద్దరం పని చేస్తున్నాం , అమ్మ పని నుంచి వచ్చి , వంట చేసి మనకు పెట్టి , తరవాత ఇల్లంతా సర్ధుకుని పడుకోవాలి , ఎంత పనో ,ఒక మాడిన రొట్టి వల్ల నష్టమేమి లేదు , కాని మాటల వల్ల మనసు గాయమైతే ఆ గాయం మానడానికి సమయం పడుతుంది , ఇప్పుడు నేను రొట్టి మాడిందని కోపగించుకుని తిట్టి అది మనసులో గాయమయ్యి , తను బాధపడి , ఆ గాయం మానడానికి కొన్ని రోజులవుతుంది , దానికి బదులుగా ఒక రోజు నేను మాడిన రొట్టి తినడం వల్ల తప్పేమి లేదని అన్నడా తండ్రి , ఎంతటి ఉన్నతమైన ఆలోచన , ఎంతమందిలా ఆలోచిస్తారు.
రేపటినించి ఇలా ఆలోచిద్దామా !
చక్కని కథ. ఇలాంటి కథలు, అనుభవాలు  చదివి కొంతమంది అయినా మారితే బావుంటుంది.

వుండండి ఇంకో కధేమన్నా వుందా అని చూస్తా !!

smile emoticon
-

Wednesday, December 23, 2015

తిరుప్పావై 8వ రోజు పాశురము 8వ రోజు - నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు

తిరుప్పావై 8వ రోజు పాశురము
8వ రోజు - నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి, హింసించి చేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటివాలుకు మనం తెర చాప ఎత్తుకుంటే, దానికి గాలికూడా వాలు అయితే యాత్ర వేగంగా సాగినట్లుగానే, మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావల్సిన పదార్థాలని అందిస్తూ, బాగుపడటానికి ఆలోచనారీతిలో మార్పు వచ్చేలా, మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితికోసం పాటుపడటం, అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. "అస్మాన్ అగ్నే నయ సుపతా రాయే" మా అందరిని కలిపి మంచిమార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే, ఆండాళ్ ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇదీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పొందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు.

మరి ఏంచేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తి గురువుగారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే వారు. పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని, కొంతకాలం అయ్యాక వానప్రస్తం గడుపాలని తన ఆస్తిని విభజించి వాళ్ళకు పంపకం చేసాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది, ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది భహుషా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కాదా. మరి నాకూ ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట భయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేనూ పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేనెలా సాధన చేయ్యాలో చెప్పు అని అడిగింది. "ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః మైత్రేయీ" అంటూ ఉపదేషం చేసాడు. హే మైత్రేయీ "ఆత్మావారే ద్రష్టవ్యః " లోపల ఉండే ఆత్మా అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలె. కానీ ఎట్లా కనిపిస్తుంది ? ద్రష్టవ్యః - చూడాలి అనుకున్న దాన్ని మొదట "శ్రోతవ్యః" వినాలి, మంతవ్యః - దాన్నే పదే పదే తలచాలి, నిదిద్యాసితవ్యః - ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది. అండాళ్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత్ర.

Tuesday, December 22, 2015

హరిదాసు! మరో చిన్నారి హరిదాసు దర్శనం చేసుకోండి



హరిదాసు! 

ధనుర్మాసం లో వేకువజామునే 'హరిలో రంగహరి' అంటూ కీర్తనలతో మన ముంగిళ్ళ రంగవల్లులే వేదికగా చేసుకుని హరినామ సంకీర్తనతో నిలిచే హరిదాసు సాక్షాతూ విష్ణురూపుడే అని నమ్ముతారు. ఆయన తలమీద అక్షయ పాత్ర లో మనం వేసే బియ్యం మనకు శుభాలను కలిగిస్తుంది. శ్రిమద్రమారమణ గోవిందో హరి అంటూ ఒక కాలు మడిచి వంగి ఆయన అక్షయ పాత్రలో బియ్యం వెయ్యడానికి అనువుగా మోకాలు మీద కూర్చుంటాడు. ఏ ఇంట ముంగిటైనా ఎవరూ లేకపోతె మరో ఇంటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే మంచిది కాదు అని ఆయన వచ్చేటప్పటికి ఇంటి ముంగిట చిన్నారులు పెద్దలు బియ్యం పాత్రలతో సిద్దముగా ఉంటారు. పూర్వం పాండవుల వద్ద వుండే అక్షయపాత్రని శ్రీకృష్ణుడు హరిదాసుల పూర్వులకు ఇచ్చాడు అని చెప్పుకుంటారు. అందులో బియ్యం వేస్తె ఆ ఇంట ధన దాన్యాలకి లోటు ఉండదు అని నమ్మకం. ఇలా మన ఘన సంస్కృతి లోని జానపద కళల్ని, కళాకారుల్ని గౌరవిద్దాం! వారిని ప్రోత్సహిద్దాం!! పది కాలాలు పరిరక్షిద్దాం!!!
 సత్యసాయి విస్సా ఫౌండేషన్.


ఈ లింక్ క్లిక్ చేసి హరిదాసు దర్శనం చేసుకోండి ఈ ధనుర్మాసం శుభవేళలొ

ఈ లింక్ క్లిక్ చేసి మరో చిన్నారి హరిదాసు దర్శనం చేసుకోండి ఈ ధనుర్మాసం శుభవేళలొ మా చిన్న బాబు చి. ప్రభవ్ ఒక సంక్రాంతికి హైదరాబాద్ శిల్పారామం లో వేసిన హరిదాసు వేషం!
https://www.youtube.com/watch?v=yhea6kGRa4Y

Monday, December 21, 2015

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?

                     లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే కానీ ప్రామాణిక గ్రంథాలలో యే దేవతామూర్తిని యేవిధంగా అర్చించాలి అనే విశేషాంశాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలే పూజచేయడం శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించే సమయంలో మనం గమనిస్తూంటాం. అన్నమాచార్యులవారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు కదా! అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో తన భార్యయైన వింధ్యావళి నీళ్ళు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇవ్వగా ఆస్వామి పాదాలతో పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అయిన పంచభూతాత్మకమైన ప్రపంచాన్నంతటినీ కూడా ఈపాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ మూడవపాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. "భగవంతు వలగొను పదములు పదములు" అంటారు పోతనామాత్యులు. కనుక శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో పాదములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రం పాదములకు పూజించరాదు అనే ఒక కొత్తగా కనుక్కున్నారు. నిజానికి పరమేశ్వరి - పరమేశ్వరుడు, లక్ష్మీదేవి - శ్రీమన్నారాయణుడు, అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదములు అర్చించవచ్చును. కొల్హాపురంలో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు శఠారిని మన శిరస్సుపైన ఉంచుతాడు. మనం తలవంచి నమస్కారం చేస్తాం. ఆ శఠారి (శఠం అంటే మనలో ఉండే మొండితనం - దానిని తొలగించేవి పరమాత్ముని యొక్క పాదములు. దానిమీద పరమాత్మ పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కరించిన తరువాత అర్చకులు మనశిరస్సుపై ఉంచే శఠారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. పాదపూజ అని చెప్తాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ? అంటే పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా సర్వాంములు నమస్కరించవలసిందే. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కసారి పరిశీలించినా చంచలాయై నమః - పాదౌపూజయామి, ఇలా సర్వాంగాలనూ పూజ చేస్తాం కదా! మరి పాదాలు పూజ చేయకుండా ఎలా? మొట్టమొదటి నామమే చంచలాయై నమః - పాదౌపూజయామి. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పాదములను తప్పకుండా పూజించవచ్చుఅని పెద్దలు చెపుతారు.


మనం ఎప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు
కానీ ఆ ఆనందాన్ని ఇతరులకి పంచడం సాధ్యమే కదా!!


తిరుప్పావై 7వ రోజు పాశురముతో మిత్రులందరికీ శుభోదయం ../\..

తిరుప్పావై 7వ రోజు పాశురము
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్
"కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి. "కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో" పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మాట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, "ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి, అంటూ అండాళ్ తల్లి "ఆనైచ్చాత్తన్" భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.
ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లినప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తిని పరిక్షిస్తాడు. ఏపాపం చేయని రాముణ్ణి ఏం చేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విళాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజ సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా. సార్తకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయిష్షు వేద అద్యయణం కాగానే తనకు ఇంకొక పురుష ఆయిష్షు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయుష్షు భరద్వాజునికి పెంచాడు. మళ్ళీ వేద అధ్యయణం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయుష్షులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట తనే వచ్చి, ఏంకావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయుష్షు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయనకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే. ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ. భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు. అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా అని లోపల ఉన్న గోపబాలికను అంటుంది.
గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం. అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామస్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దొంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దొంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు.
"కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు" గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి. "వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్" గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి."మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం" కవ్వముతో పెరుగు చిలికే శబ్దం "కేట్టిలైయో" వినబడలేదా. "నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!" ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు.
"నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో" పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే "నారాయణ" సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం. అందుకే ఆయన "మూర్తి" మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు.
కేవలం అందమైనవాడేనా! కాదూ, మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, "కేశవన్" కేశి అనే గుఱ్ఱం రూపంలో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేయిపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు.
అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది. "తేశం ఉడైయాయ్" భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా "తిఱవ్" రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది. మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి.

తిరుప్పావై 6వ రోజు పాశురము

తిరుప్పావై 6వ రోజు పాశురము
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికను లేపడం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడం లేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.
శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాళ్లు పడుకొని ఉంటారు, అందరూ పడుకొనే వద్ద వాళ్లు మెలుకువగా ఉంటారు. సామాన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞాణులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని విషయంలో జాగరూపులై ఉంటారు. ఆలోపల ఉండే గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెలితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దశల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.
ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్నపిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ "పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మనవాళ్లు ఒక గుర్తుగా చెప్పారు.
లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది, మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు "పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్!" ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ద్వని కూడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని అండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. "ఎళుందిరాయ్" - మేలుకో. మరి అండాళ్ తల్లి తాను ఎలా మేల్కొందో కొన్ని గుర్తులు చెబుతుంది. "మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్" మునులూ, యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేదా! మరి వాళ్లు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో అండాళ్ తల్లి వివరిస్తుంది.
"పేయ్ములై నంజుండు" పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు - దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "ఆహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు.
"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి" శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురున్ని కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య - పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను - చరణాలను 'శరణం ప్రపద్యే' అంటే చాలు - మనకు అంటి ఉన్న పుణ్య - పాప సంపర్కాన్ని హరించువాడా - హరి.
"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు" - ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి. అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాన్ని చేరే సాధనం వాడి శరణాగతే, వాన్ని చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాన్ని చేరకుండా ఉంచే ఆటంకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి. అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది.

తిరుప్పావై 5వ రోజు పాశురము

తిరుప్పావై 5వ రోజు పాశురము
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
చాలా అందమైనది- అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్-ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే అనందం. ఆనందింపచేయుతత్వము ఐతే రామ-రమయతి అని అంటారు. కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడూ అలాగే అనుకున్నాడు, కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో. అంతటా వ్యాపించిన ఈ తత్వం మనకోసం మనం ఏర్పర్చిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఎదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు, అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించక పోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృదాయే. ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్నచోటే చాలు. అందుకే "నివృత్తరాగస్య గృహం తపోవనం" నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో, ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్టుగా ఉండాలి, నీకు భయం కల్గించనట్లుగా ఉండాలి. ఇలా మనం తయారుచేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటేచాలు. ఆ విశ్వాసం చాలు, పూజకు నిభందనలు ఏమి లేవు. అచంచలమైన విశ్వాసంతో నిశ్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయనా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు. ఆధునిక అణువిజ్ఞానం కూడా చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది - దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రాల ద్వార గుర్తించగల్గుతున్నాం. అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈరోజు పాటలో. రెండో ఆధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు్ - "సంశయాత్మా వినష్యతి". ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరి అయిన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంశయం అవసరం లేదు. దాన్నే అండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల కథగా అందించింది.
ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీజనం అంతా చేరారు. మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నమని తెలియజేసింది. రెండో రోజు వ్రతానికి కావల్సిన నియమాలేమిటో తెలియ జేసింది. మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోకక్షేమం గురించి వివరించింది. నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తే మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోర్పడుతారు అని తెలియజేసింది. ఇకవారంతా శ్రీకృష్ణుడి కోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంశయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకా సంశయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది - అందుకు ఆమె, రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరథుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా! మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయికదా అని సంశయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంశయాన్ని తెలియజేసింది. ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది, ఒక కావ్యంలోని వర్ణణ గురించి చెపుతూ - ఒక తుమ్మెద ఒక పద్మంపై వాలిందట, మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్ర పోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించుకుపోయిందట, లేచి చూడగానే బయటకు వెల్లడానికి మార్గంలేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురుచూసిందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాం కాని నెరవేరుతాయా అని సంశయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది - ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరంపైనే రాసి ఉంటాయి అంటారు కదా! వాటిని మనం అనుభవించక తప్పదు కదా! మరి మనం ఎట్లాంటి కర్మలు చేసామో ఏమిటో మనం విజయం సాదిస్తామో లేదో అని సంశయాన్ని తెలియ జేసింది.
ఇలాంటి సంశయాలన్నిటికి సమాదానం ఇస్తుంది ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో. మనం చేసే కర్మలచే పుణ్య - పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్న విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు - అందుకే ఆయనను సర్వజ్ఞుడు - సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కాని, మాటలలో కాని, చేతలలో కాని చెడు రానివ్వోద్దన్నారు. ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే. ఇప్పుడు వచ్చిన త్రేనుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా. ఇక మనం ఏమిచేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. భగవంతుడికి మనపై కల్గిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కల్గిన కోపమే పాపము అంటారు. వీటన్నిటినుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది. మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి, అవి సంచితములు - ఆగామి - ప్రారబ్దం అని అంటారు. ఇదివరకు మనం చేసుకున్నవాటిని సంచితములని, ఇప్పుడీ శరీరంగా అనుభవిస్తున్నవాటిని ప్రారబ్దం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తిలో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు. మనం కావాలని అనుకుంటే సంచితాలను - ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది. భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటంచే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మనపై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి, పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు. ఇక ప్రారబ్దం కూడా నిర్వీర్యం కావాలంటే - మనం భగవంతునికి చెందిన వాడను - నేను చేసేది వాడి సేవ - వాడికోసం చేస్తునాను ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది.
"మాయనై మన్ను వడమదురై మైందనై"- చిత్ర విచిత్రమైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు శక్తి విశేషములు కల్గి ఉన్నవాడు. అలాంటి వాడు మధురానగరానికి దిగివచ్చాడు. "తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై" మరి పెరగటమేమో యమునానది ఆవల ఉన్న గోకులంలో. పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునానది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ పదిహెనవ పాటలో చెబుతుంది. యమునానది సూర్యుని పుత్రిక, యముడి సోదరి. మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది. మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటికోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు."ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై" గోకులంలో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలె పెరుగుతున్నాడు పరమాత్మ. "తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై" మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టివేస్తే ఏమీ చేతకాని వాడిలా పడి ఉంటాడు - అందుకే ఆయనను దామోదరుడు అంటారు. దామ - ఉదరుడు అయ్యాడు, మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో.
అక్కడ తల్లి ప్రేమతో లోంగబడి ఉన్నాడు, మన జ్ఞానంతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కల్గిన వ్యక్తికి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే, విగ్రహమే ఒక మంచి మార్గం. ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడి వటపత్రశాయిని కోలిచింది, శ్రీరంగనాథున్ని చేరింది, సుందరబాహు స్వామికి మొక్కుబడి చేసింది, వేంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహరూపంలో ఉన్నవారినే కొలిచింది, భగవంతునికోసం ఎక్కడికని పరుగులు పెట్టలా! విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకూ ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనమూ పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. "తూయోమాయ్ వందు" దీనికి మనం పరిశుద్దం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ది ఏర్పడుతుంది. "నాం తూమలర్ తూవి త్తొళుదు" పరిశుద్దమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అన్-జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది. "వాయినాల్ పాడి" నోరు ఉంది కనక ఆయన నామాన్ని పాడుదాం చాలు. "మనత్తినాల్ శిదిక్క" మనస్సు ఉంది కనక ఆయన గుణములని స్మరించుదాం. "పోయ పిళైయుం" మనం గతంలో చేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి "పుగుదురువాన్ రిన్ఱనవుమ్" ఇక రాబోయే ఆగామి "తీయనిల్ తూశగుం" మనకు అంటకుండా ఉంటుంది "శేప్ప్" ఆయన నామాల్ని చెప్పు. ఈ పాటలో ఆండాళ్ మాయానై, మన్నువడ మదురై, దామోదర అని ఇలా కొన్ని నామాల్ని తెలిపింది.
ఆగమములు చెప్పినదేమిటి
పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||
ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది. పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మంత్రం దానికి సమాధానం ఇస్తుంది. "పూర్ణమిదమ్" - ఇదం అంటే చాలా దగ్గరగా ఉంటుంది, నీ లోపలనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియట్లేదు కదా!. "పూర్ణ మద:" - అద: అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. లాభం లేదు గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం. "పూర్ణాత్ పూర్ణముదచ్యతే" - ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది - అదీ పూర్ణమే. సృష్టి, స్తితి, లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది. అదీ పూర్ణ రూపమే, కాని మనం చూడలేం కదా. "పూర్ణస్య పూర్ణమాదాయ" ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణంలో నుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది - అదీ పూర్ణమే. వీటినే అవతరాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేం కదా, ఎలాగా? "పూర్ణమేవా వశిష్యతే" - ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గూణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి.
ఈ స్వరూపాలన్నన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు

ధనుర్మాసం! ముగ్గులు వేద్దాం రండి! మా విస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు!! మణిసాయి విస్సా ఫౌండేషన్.

ధనుర్మాసం! ముగ్గులు వేద్దాం రండి! మా విస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులతో జరిపే రంగవల్లుల పోటీలు!! కొన్ని చిత్రాలు, ప్రతి రోజూ కొత్త కొత్త ముగ్గుల కోసం చూడండి!!!  









Total Pageviews