Monday, December 2, 2019

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవిత

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవిత: "ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ,...

Tuesday, October 8, 2019

'ఈనాడు' సంపాదకీయంలో ఓ extract కి నా బొమ్మలు జోడించాను.

‘మా ఆవిడకు మంత్రాలొచ్చు’ అన్నరు తణికెళ్ళ భరణి తన పరికిణీ కవితలో. ‘ఏడ్చే పసివాడికి పాలసీసా అయిపోతుంది. అత్త్తగారి నడ్డికింద పీటయిపోతుంది. పడగ్గదిలో రాత్రి నాకు రగ్గవుతుంది.. వాకిట్లో పొద్దున్నే ముగ్గవుతుంది’. ఇన్ని రకాల అవతారాలు ఎత్తాలంటే ఆమెకు మంత్రాలు వచ్చే ఉండాలన్నది బలమైన తర్కం. చమత్కారం సంగతి అలా ఉంచి, ఒక ఇల్లాలు నిజజీవితంలో ఎన్ని రూపాలు ధరిస్తుందో, ఎన్నెన్ని పాత్రలు పోషిస్తుందో.. ఆ కవిత స్పష్టం చేస్తోంది. ‘విమల చారిత్రశిక్షకు ఆచార్యశకంబు, అన్వయస్థితికి మూలంలబ్, సద్గతికి ఊత…’ చక్కని నడవడిని నేర్పుతూ, వంశాంగత కీర్తిప్రతిష్టలను కాపాడుతూ, ఇహపరాల్లో ఉత్త్మ గతులకు కారణమయ్యేది ధర్మపత్ని మాత్రమేనంది మహాభారతం. ఒక్కరోజు వంటిల్లు తనమీద వదిలేసిపోతే కాళ్ళుచేతులు ఆడవని, ఇల్లాలు లేకుండా ఇల్లు గడవదన్నది ప్రతి పురుషపుంగవుడికీ అనుభవమే! స్త్రీలేని ఇల్లు ఎలా ఉంటుందో చెపుతూ భాస్కర రామాయణం ‘నలిన సంతతి లేని కొలని కైవడి (పద్యాలు లేని సరస్సులా) రేయి దీపిక లేని మందిరము పగిది (దీపం లేని దీనమందిరంలా) శూన్యంగా తోస్తాయి’ అంది. కాబట్టే ‘భార్య దైవకమైన్ చుట్టము.. దేవుడిచ్చిన బంధువు’ అన్నాడు ధర్మరాజు- యక్ష ప్రశ్నల్లో. ‘ కళింగరాజ్యంలో మధురవాణి లేకుంటే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చి ఉండేది!’ అంటాడు కన్యాశుల్కంలో కరటకశాస్త్రి. గురజాడ కనుక మధురవాణిని ఇంత గొప్పగా సృష్టించకుంటే, ఆ నాటకానికి ఎంత లోటు కలిగేదో భగవంతుడు స్త్రీని పుట్టించకుంటే ఈ సృష్టె శూన్యమై మిగిలేది. (ఆదివారం 6.9.2019 'ఈనాడు' సంపాదకీయం సౌజన్యంతో)

Saturday, October 5, 2019

స్మరణ: వివాహం విశిష్టత

స్మరణ: వివాహం విశిష్టత: భారతీయ సంస్కృతికి మన ఆచారవ్యవహారాలు దర్పణం పడతాయి. అందులో అత్యంత అద్భుతమైనది, ఆదర్శనీయమైనది, అనుసరణీయమైనది మన వివాహపద్దతి.    మానవుడు సంఘ...

Sunday, September 29, 2019

కథా మంజరి: కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే ....

కథా మంజరి: కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే ....: చెప్పఁదగుఁగవిత రసముల్ జిప్పిల, నప్పప్ప ! భళి భళీయన. లేదా యెప్పుడుఁజేయక యుండుటకవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే కదా. మన కవులు రస బంధురమయి...

Thursday, September 19, 2019

సంస్కృతం యొక్క గొప్పదనం తెలిపే పద్యం

తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః||೧||

శ్రీఃయాదవం భవ్యభతోయ దేవం
సంహారదాముక్తిముతాసుభూతం ||೨||

మొదటి శ్లోకం శ్రీ రాముని స్తుతి.
రెండవ శ్లోకం శ్రీ కృష్ణుని స్తుతి.

అద్భుతం ఏమిటంటే ......

మొదటి శ్లోకాన్ని తిరగేసి చదివితే రెండవ శ్లోకం వస్తుంది.

రెండో శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది.
👌🙏👏

కనకధారా స్తోత్రం - అర్థం

కనకధారస్తోత్రం అర్థం తెలుసుకుని చదివితే ఇంకా ఆనందంగా ఉంటుంది

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి .

కనకధారా స్తోత్రం :

శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥2

 తాత్పర్యము : ఆఁడు తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క ఓరచూపు నీలమేఘశ్యాముఁడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక !

శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే:
ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని ।
మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥3
తాత్పర్యము : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక !

శ్లో॥ విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షమ్
ఆనంద కంద మనిమేష మనంగ తంత్రమ్ ।
ఆకేకర స్థిర కనీనిక పద్మనేత్రమ్
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా: ॥4
తాత్పర్యము : తనను భజించువారికి దేవేంద్ర పదవిని సైతమివ్వజాలినవియు, మానవుఁ డనుభవింపఁగోరు ఎల్ల ఆనందములకును మూలమైనవియు, (దేవత యగుటచే) ఱెప్పపాటు లేనివియు, భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మథ బాధను కలిగింపఁగలవియు, అర్ధ నిమీలితము (మాఁగన్ను) గా చూచునవియు నైన శ్రీ మహాలక్ష్మీ మాత యొక్క నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించు గాక !

శ్లో॥ కాలాంబుదాళి లలితోరసి కైటభారేర్
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
మాతస్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: ॥5
తాత్పర్యము : మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క (వెంట్రుకలతో వల్లనై) నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !

వివరణము :- భార్యానురాగాతిశయముచే భగవాన్ శ్రీ మహావిష్ణువు ఆమెను తన వక్ష:స్థలమునందు దాఁచుకొన్నారని పురాణ వచనము.

శ్లో॥ బాహ్యాంతరే మురజిత: శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి ।
కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయా: ॥6
తాత్పర్యము : శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !

శ్లో॥ ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్
మాంగల్య భాజి మధుమర్దిని మన్మథేన ।
మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్
మందాలసం చ మకరాలయ కన్యకాయా: ॥7
తాత్పర్యము : దేని ప్రభావముచేత మన్మథుఁడు సమస్త కల్యాణ గుణాభిరాముఁడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా) మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !

శ్లో॥ నుద్యాద్ దయానుపవనో ద్రవిణాంబుధారామ్
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే ।
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: ॥8
తాత్పర్యము : లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు, ఈ దరిద్రుఁడనెడి విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతముగా, దూరముగా తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !

విశేషార్థము : రెండవ పాదమునందలి "అకించన" శబ్దమునకు 'దరిద్రుఁ' డనియు, 'పాపములు లేనివాఁ'డనియు రెండర్థములు.

శ్లో॥ ఇష్టా విశిష్ట మతయో౭పి నరా యయా౭౭ర్ద్ర
దృష్టాస్ త్రివిష్టప పదం సులభం భజంతే ।
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: ॥9
తాత్పర్యము : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు) తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను పొనరించు గాక !

శ్లో॥ గీర్ దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి ।
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితా యా
తస్యై నమస్ త్రిభువనైక గురోస్ తరుణ్యై ॥10
తాత్పర్యము : విష్ణుమూర్తికి భార్యయైన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్నియైన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగియైన అపరాజితగా, శాకంభరీదేవిగా - ఇట్లనేక రూపములతో ఏ విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్నదో, ఆ విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమోన్నమహ.

శ్లో॥ శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై ।
శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై ॥ 11
తాత్పర్యము : శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలముల నొసంగు వేదమాతృ స్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు ప్రణామము. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టిస్వరూపురాలగు ఇందిరాదేవికి దండములు.

శ్లో॥ నమో౭స్తు నాళీక నిభాననాయై
నమో౭స్తు దుగ్ధోదధి జన్మభూమ్యై ।
నమో౭స్తు సోమామృత సోదరాయై
నమో౭స్తు నారాయణ వల్లభాయై ॥12
తాత్పర్యము : పద్మము వంటి ముఖము గలిగిన మంగళదేవతకు నమస్కారము. పాల కడలిని తన జన్మస్థానముగా గల శ్రీ పద్మాలయా దేవికి వందనము. అమృతమునకును, దానితో పాటుగా ఉద్భవించిన చంద్రునికిని తోబుట్టువైన మాదేవికి ప్రణామము. భగవాన్ విష్ణుమూర్తికి ప్రేమాస్పదురాలైన లోకమాతకు దండములు.

శ్లో॥ నమో౭స్తు హేమాంబుజ పీఠికాయై
నమో౭స్తు భూమండల నాయికాయై ।
నమో౭స్తు దేవాది దయాపరాయై
నమో౭స్తు శార్ఙ్గాయుధ వల్లభాయై ॥13
తాత్పర్యము : బంగారు పద్మమునే తన పీఠముగా అధివసించి యున్న శ్రీమన్మహాలక్ష్మీ భగవతికి నమస్కారము. సమస్త భూమండలమునకున్ను ప్రభుత్వము వహించి యున్న శ్రీ భార్గవీమాతకు వందనము. దేవ, దానవ, మనుష్యాదులందఱి పట్లను దయఁ జూపఁజాలిన ఆ మహాశక్తి సంపన్నురాలికి ప్రణామము. శార్ఞ్గమను ధనుస్సును ధరించిన భగవాన్ విష్ణుమూర్తికి మిక్కిలి కూర్చునదైన శ్రీ కమలాదేవికి దండములు.

శ్లో॥ నమో౭స్తు దేవ్యై భృగు నందనాయై
నమో౭స్తు విష్ణో రురసి స్థితాయై ।
నమో౭స్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమో౭స్తు దామోదర వల్లభాయై ॥14
తాత్పర్యము : బ్రహ్మ యొక్క మానస పుత్త్రులలో ఒక్కడైన భృగువను ఋషి యొక్క వంశమునం దుద్భవించినదియు, లోకోత్తరమైన భర్తృ వాల్లభ్యమును చూఱగొన్న మహిమాతిశయముచే తన భర్తయైన భగవాన్ విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు శ్రీ ముకుందప్రియాదేవికి నమస్కారము.

శ్లో॥ నమో౭స్తు కాంత్యై కమలేక్షణాయై
నమో౭స్తు భూత్యై భువన ప్రసూత్యై ।
నమో౭స్తు దేవాదిభి రర్చితాయై
నమో౭స్తు నందాత్మజ వల్లభాయై ॥15
తాత్పర్యము : కమలముల వంటి కన్నులు గల కాంతిస్వరూపురాలికి నమస్కారము. ప్రపంచములను గన్న తల్లియగు అష్టసిద్ధి స్వరూపురాలికి వందనము. దేవ, దానవ, మనుష్యాదులచే పూజింపఁబడు లోకైక శరణ్యురాలికి ప్రణామము. నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని చెలికత్తె యగు శ్రీదేవికి దండములు.

విశేషార్థము : ఇచ్చట "కమలముల వంటి కన్ను" లనఁగా 'కమలముల వలె అందమైన కన్ను' లని లోకానబోధము. పూర్వవ్యాఖ్యాతలందఱును అట్లే వ్యాఖ్యానించి యున్నారు. కాని, దీని నిజమైన అర్థము వేఱు. దేవతల కన్నులు మనుష్యుల కన్నుల వలె తెల్లగా కాక కమలముల వలె ఎఱ్ఱగా నుండును.

శ్లో॥ సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి ।
త్వద్ వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే ॥16
తాత్పర్యము : దేవతలందఱిలోను మాన్యురాలవైన ఓ మహాలక్ష్మీ ! మేము నీకుఁ జేయు వందనములు మాకు సంపదలను గలిగించునవి. మా యొక్క సమస్త ఇంద్రియములను సుఖపెట్టునవి. అవి రాజాధిరాజత్వమును సైతము ప్రసాదింపఁ జాలినవి. పాపములను పోకార్చుటకు సదా సన్నద్ధమైనట్టివి. అవి నన్నెల్లప్పుడును (పసిబిడ్డను వలె) పట్టుకొని యుండు గాక !

శ్లో॥ యత్కటాక్ష సముపాసనా విధి:
సేవకస్య సకలార్థ సంపద: ।
సంతనోతి వచనాంగ మానసైస్
త్వామ్ మురారి హృదయేశ్వరీమ్ భజే ॥17
తాత్పర్యము : హే మహాలక్ష్మీ ! ఎవరి కటాక్షమును గోరుచు మనసా, వాచా, కర్మణా ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడునో, అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను.

శ్లో॥ సరసిజ నయనే సరోజ హస్తే
ధవళ తరాంశుక గంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥18
తాత్పర్యము : అందమైనదానా ! కమలములవంటి కన్నులును, చేతులును గలదానా ! మిక్కిలి తెల్లనైన దువ్వలువల తోడను, గంధపు పూత తోడను, పూల దండల తోడను ప్రకాశించుదానా ! విష్ణుమూర్తికి ప్రేయసివైనదానా ! ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానా ! హే భగవతీ ! శ్రీ మహాలక్ష్మీ ! నాయందు సంప్రీతురాలవు కమ్ము !

శ్లో॥ దిగ్ దంతిభి: కనక కుంభ ముఖావసృష్ట
స్వర్ వాహినీ విమల చారు జలప్లుతాంగీమ్ ।
ప్రాతర్ నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధి పుత్రీమ్ ॥19
తాత్పర్యము : అభ్రము, కపిలా, పింగళాదులైన దిగ్గజముల భార్యలు (ఆఁడేనుఁగులు) బంగారు కలశముల యందు పవిత్రమైన ఆకాశగంగ నుండి పట్టి తేరఁగా, ఆ పరిశుద్ధమగు జలములతో అనునిత్యమున్ను స్నానము చేయు జగజ్జననియు, లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణుని యిల్లాలును, పాల కడలి యొక్క కూఁతురును అగు శ్రీశ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రొద్దుననే లేచి భక్తితో స్మరించెదను.

శ్లో॥ కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణా పూర తరంగితై రపాంగైర్ ।
అవలోకయ మా మకించినానామ్
ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయా: ॥
20
తాత్పర్యము : అమ్మా ! కమలాదేవీ ! దరిద్రులలోకెల్ల దరిద్రుడను నేనే. అందుచేత నీ కృపకు అందఱి కంటె ముందు పాత్రుడనైనవాఁడను నేనే. నా మాటలలో నటన (కృత్రిమత్వము) లేదు. కనుక నీ కరుణాపూరిత కటాక్షముల (ఓరచూపుల) తో నన్నొకమారు చూడుము తల్లీ ! దేవీ ! ముకుందప్రియా !

శ్లో॥ బిల్వాటవీ మధ్య లసత్ సరోజే
సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్ ।
అష్టాపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణ వర్ణామ్ ప్రణమామి లక్ష్మీమ్ ॥
21
తాత్పర్యము : మారేడు చెట్ల తోఁట మధ్యలో వేయి దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించునదియు, బంగారు కమలములను తన చేతినుండి జారవిడచుచున్నదియు నైన శ్రీ మహాలక్ష్మీ భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను.
వివరణము :
౧."అష్టాపదమ్" అనఁగా బంగారము.
౨. "సంవిష్ట" అనఁగా 'నిదురించినది' అని అర్థము. కానీ ఆ అర్థమిచ్చట పొసఁగదు. "నివిష్ట" ప్రయోగమును బట్టి 'ఇమిడినది' అని చెప్పికొనవలసి యుండును.

శ్లో॥ కమలాసన పాణినా లలాటే
లిఖితామక్షర పంక్తి మస్య జంతో: ।
పరిమార్జయ మాతరంఘ్రిణా తే
ధనిక ద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్ ॥22
తాత్పర్యము : ధనికుల యిళ్ళ ముంగిట పడికాపులు కాచుమని ఆ బ్రహ్మదేవుఁడు ఈ హీనజీవి యొక్క నుదుట వ్రాసిన వ్రాతను దయచేసి నీ కాలితో తుడిచి వేయుమమ్మా ! తల్లీ ! శ్రీ మహాలక్ష్మీ !

విశేషార్థము : శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క ఎడమకాలి తన్నులు కూడా ఎవరికిని అంత సులభముగా లభింపవని భావము.

శ్లో॥ అంభోరుహం జన్మగృహం భవత్యా:
వక్ష:స్థలం భర్తృ గృహం మురారే: ।
కారుణ్యత: కల్పయ పద్మవాసే
లీలాగృహమ్ మే హృదయారవిందమ్ ॥23
తాత్పర్యము : హే పద్మాలయా దేవీ ! నీ పుట్టినిల్లు కమలము. మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలమే. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసమేర్పఱచుకొని దానిని నీ కేళీగృహముగాఁ జేసికొనుము.

విశేషార్థము : ఇచ్చట ఆదిశంకరులు కేవలము "నా యింటికి వచ్చి యుండు"మనుట లేదు. "నా హృదయమునందే నిలుకడగా ఉండు"మనుచున్నారు. ఇంటికి భౌతికముగా వచ్చిన లక్ష్మి సహజ చాంచల్యముచే ఎప్పుడైనను వెడలిపోవచ్చును. కాని హృదయమునందు నిలిపికొన్న లక్ష్మి మట్టుకు భక్త పరాధీనురాలు గనుక తన చాంచల్యమును వీడి భక్తునితో ఉండిపోవునని భావము.

లక్ష్మీదేవిని సంపదల కొఱకు ఉపాసించుటొక్కటే చాలదు, సంపదలు సిద్ధించిన పిమ్మట కూడ ఆమె చేసిన మేలు మఱువక ఆమెను తరతరములుగా అర్చించినప్పుడే ఆ సంపదలు కలకాలము నిలబడునని తాత్పర్యము.

శ్లో॥ స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్ ।
గుణాధికా గురుతర భాగ్య భాజినో
భవంతి తే బుధ భావితాశయా: ॥24
తాత్పర్యము : ఎవరైతే ఈ స్తుతిపూర్వములైన శ్లోకములతో వేదమాతయు, జగజ్జననియు అయిన శ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రతి దినమున్ను స్తోత్రము సేయుదురో, వారు తమ సద్గుణములచేత ఇతరుల కంటె అధికులై, విద్వాంసుల చేత గౌరవింపఁబడుచు మిక్కిలి విస్తారములైన సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు.

విశేషార్థము : విద్వాంసుల చేత గౌరవింపబడుటయే లౌకిక జీవన పరమార్థము. అది విజ్ఞాన సముపార్జనము వలననే సిద్ధించును. అనఁగా ధనమునకు సహితము విజ్ఞాన సముపార్జనమే ధ్యేయము.

ఫలశ్రుతి:

శ్లో॥ కనకధారా స్తవం యత్ శంకరాచార్య నిర్మితమ్ ।
త్రిసంధ్యం య: పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్ ॥25
తాత్పర్యము : జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు కూర్చిన ఈ కనకధారా స్తవమును దినమునకు మూఁడుసారులు - అనఁగా ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలలో - పారాయణము చేసినవారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు.

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి .

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం..మేము ఇది వరకు పోస్ట్ చేసిన పోస్టులను కూడా గమనించ ప్రార్ధన.

" సంభవామి యుగే యుగే " ఫేసుబుక్ పేజీ ద్వారా పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్ లు కూడా చూడండి మీకు కొన్నైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని మా ఆశ

మీరు చూసి తరించండి

అందరం " ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం

ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే

తథాస్థు దేవతలు అంటే ఎవరు

💐తథాస్థు దేవతలు అంటే ఎవరు💐

వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు.  సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి  మూలంగా వీరు జన్మించారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు.. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది

ఉత్తరానికోఉత్తరం

#ఉత్తరానికోఉత్తరం

పూజ్యనీయులైన ఉత్తరం గారి పాదపద్మాలకు నమస్కారం 🙏
ఉభకుశలోపరి.. !
సెల్ టవర్ల దెబ్బకి పిచ్చుకలు మాయమైపోయినట్టు, సెల్ ఫోన్ల దెబ్బకు తమరు ఎటు వెళ్లిపోయారో జాడ తెలియక అల్లాడుతున్నాం..
మీరున్నప్పుడే బాగుంది ఇక్కడ.. రాసేటప్పుడు చేతికి అబద్ధాలు వచ్చేవి కాదు.. ఇప్పుడన్నీ ఫోన్లో మాటలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు ఆడేస్తున్నాం.. 'ఎక్కడున్నావ్' అంటే అమీర్ పేటలో ఉన్నా 'అంబర్ పేటలో ఉన్నా' అని సిగ్గులేకుండా బొంకేస్తున్నాం.. ఈ నెట్ వర్క్లు మనుషుల్ని దగ్గర చేస్తాయంటే నమ్మి మిమ్మల్ని వదిలేసుకున్నాం.. కానీ ఇప్పుడు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా, మెడలు వంచి ఫోన్లో తప్ప ముఖాముఖి మనసిప్పి మాట్లాడుకోవడం దాదాపు మానేసామ్..

ఉత్తరం రాస్తున్నప్పుడు హృదయావిష్కరణ జరిగేది.. ఫోన్ మాటల్లో ఆచితూచి అడ్డంగా అబద్ధాలాడేస్తున్నాం, లోపలొకటి పెట్టుకుని బయటకు ఇంకో మాట చెప్తున్నాం.. బొత్తిగా పాడైపోయాం.. ఒళ్ళంతా కుళ్ళుపోయి జబ్బుచేసున్నాం.. ఒక్కసారి మళ్ళీ మీ హవాతో మాకు ట్రీట్మెంట్ మొదలెట్టండి ఉత్తరం గారూ.. పుణ్యముంటుంది..🙏

పోనీ పెరిగిన సో కాల్డ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే అవకాశం ఉంది కదా, అందులోనే మనస్ఫూర్తిగా ఒక ఉత్తరం లాంటి సందేశాలు పంపుకుందాం అనుకుంటే, అది కూడా ఇష్టానుసారంగా వాడేస్తున్నాం.. ఎవరో పంపిన మెసేజెస్ అటూఇటూ పంపేసి, అదేదో మా మేధావితనం అన్నట్టు గొప్పయిపోవడం,పిచ్చి
పిచ్చి ఇమేజ్లు,పనికి మాలిన వీడియోలు షేర్ చేసుకుంటూ 'కిక్కిక్కిక్కికిక్కి' అని నవ్వుకుంటూ పెద్ద మేధావుల్లా మెదళ్లను సానపట్టుకోవడం తప్ప ఏదీ ఎందుకూ పనికిరావట్లేదు..
మళ్ళోకసారి రండి ఉత్తరం గారూ ప్లీజ్ 🙏

మీరు లేకపోవడం వల్ల..
ప్రేయసి మళ్ళీ మళ్ళీ చదువుకునే ముత్యాల పొగడ్తల ప్రేమలేఖ పత్తాలేకుండా పోయింది..
బామ్మ-తాతయ్యల ముసలి ప్రాణాలకు ఓదార్పునిచ్చే కుశల సమాచారం కరువైపోయింది..
భార్యాభర్తల వియోగం, విరహాల్లో ఉండే మాధుర్యం మాయమైపోయింది..
బిడ్డల క్షేమం అక్షరాల్లో చూసుకుని ఆప్యాయంగా చెమర్చే తల్లితండ్రుల కన్నీటి తడి ఆవిరైపోయింది..
ఉత్తరం కోసం వీధివాకిలి వైపు ఎదురుచూసి, రాగానే గబగబా చదివేసి, గుండెలు నింపుకుని, తిరిగి జాబు రాయడంలో ఉన్న ఆత్మ సంతృప్తి అడుగంటిపోయింది..

"అమ్మా.. అన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందే అని చెంగున గెంతి చెప్పే చెల్లాయిలకి కరువొచ్చింది..
"ఏమేవ్.. అల్లుడు ఉత్తరం రాసాడు..అమ్మాయి నెల తప్పిందట" అని మురిసిపోయే కన్నవాళ్లు కనిపించడం లేదు..
ఇలాంటి ఎన్నో ఎన్నో భావాల బంధాలు మృగ్యమైపోయాయి..

'గుండె గొంతులో కొట్లాడటం'
'మనసు ఆర్తితో ద్రవించడం'
'అక్షరాలు ఆనందంతో స్రవించడం'
మానేసాయి..
మాటలు పెదాలనుండి తప్ప గుండెల్లో నుండి రావడం ఆగిపోయాయి..

మొత్తంగా మాటల్లో అక్షరాలున్నాయి కానీ, వాటికి ఎమోషన్ లేకుండా పోయింది.. చాలా కృతకంగా, అసహజంగా ఉన్నాయిప్పుడు మానవ సంబంధాలు.. అందుకే ఉత్తరం గారూ.. మళ్ళీ రండి.. 🙏

సాంకేతిక పరిజ్ఞానం ఎంతైనా పెరగడం అభివృద్ధి కావచ్చు.. దానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ మాయమైపోతున్న మానవ సంబంధాలు తిరిగి రావాలనే ఆకాంక్ష నాది..

ఈ ఉత్తరం కూడా నేను టైప్ చెయ్యడం వల్ల యధావిధిగా మనసులో ఉన్నదంతా చెప్పలేక, ఇంకా ఏదో ఆవేదన మిగిలిపోయి బాధపడుతున్నాను..

ఇట్లు..
సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఉత్తరాల ఉనికి కోరుకునే చాదస్తపు మనిషి..😔

దేవాలయంలో గడప వలసిన విధానం

"నేను మళ్ళీ ఆలయానికి  రాను"

ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రి తో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అంది.  "నేను ఇకపై ఆలయానికి రాను"

తండ్రి ఇలా అడిగాడు: "ఎందుకో నేను తెలుసుకోవచ్చా?"

ఆమె ఇలా అన్నది: " భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము, కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ  మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడు మాటలు వినిపిస్తున్నాయి , వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె

తండ్రి నిశ్శబ్దంగా విన్నాడు, ఆపై ఇలా అన్నాడు: "సరే ... నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నాకోసం చిన్న పని చేయగలవా?" అన్నాడు  తండ్రి

ఆమె అన్నది: "చెప్పండి .. నాన్నగారు, ఏమిటది?"

తండ్రి ఇలా చెప్పాడు: "దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ 2 సార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి వచ్చినా కూడా నీళ్ళు  ఏమాత్రం క్రింద పడకుండా రావాలి."  రాగలవా? అన్నాడు తండ్రి

కుమార్తె చెప్పింది: "ఓ ... తప్పకుండా నేను చేయగలను."

అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్లు తిరిగి వచ్చి ఇలా చెప్పింది:

"చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను"

అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలు అడిగాడు:

1. ఈసారి వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్ తో ఉండగా నీవు  చూశావా?

2.  ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్  చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నీవు చూశావా?

3. ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నారా?

ఆమె ఇలా చెప్పింది: "నేను ఏమీ చూడలేదు. నేను నా దృష్టి  గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను, నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతావారిని నేను గమనించలేదు "

అతను ఆమెతో చెప్పాడు: "నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసినదిదే. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయనగురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు, పైగా నీవంటి వారిని చూసి వారుకూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రతా సాధనా మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నతపథంలో నడిపిస్తాయి" .....

దేవాలయంలో గడప వలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలిపింది .....🙏 ఏకాగ్రత.....🙏సాధన ముఖ్యం ..... 🙏🙏

🌷 దసరా పాట🌷


🌷 దసరా పాట🌷


దసరా వచ్చేసింది కదండి.
నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.
 దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే
ఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే...

ఇదే ఆ దసరా పాట

పల్లవి-

1⃣
ఏదయా మీదయ మామీద లేదు!
ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!

దసరాకు వస్తిమని విసవిసల బడక!
చేతిలో లేదనక  ఇవ్వలేమనక !

ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!
రేపురా మాపురా మళ్ళి రమ్మనక!

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!
2⃣

పావలా బేడైతె పట్టేది లేదు!
అర్థరూపాయైతె అంటేది లేదు!
ముప్పావలైతేను ముట్టేది లేదు!
రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!
హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

3⃣
అయ్యవారికి చాలు ఐదు వరహాలు!
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!
మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!
శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

 *
దసరా పండుగను గిలకల పండగంటారు చక్కగా కొత్త దుస్తులు ధరించి  వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.

పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటాఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.

లోగుట్టు


ఒక వ్యక్తి అభివృద్ధి గాని
కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.

ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు.
వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి
ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు.
దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు.

పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు.
ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు
విద్యార్ధులకు
ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో.
దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు.
ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే.

అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు.
ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది...
💐💐💐💐💐💐

పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?

పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?

శ్లో || ఆదిత్య గణనాథం చ దేవీం రుద్రం చ కేశవం |
పంచదైవత్యమిత్యుక్తం సర్వకర్మసు పూజయేత్ ||
మన హిందూ సాంప్రదాయంలో కులాలకు అతీతంగా ఆస్తికులైన వారందరూ తమ పూజా మందిరాలలో ఐదుగురు (పంచదేవాతలు) విగ్రహాలను ఉంచి పూజించాలి. అవి సూర్యుడు, గణేశుడు, (దేవి) పార్వతి, శివుడు, విష్ణువు. వీరిని సమిష్టిగా పంచాయతన అని వ్యవహరిస్తారు. పంచభూతాలకు ప్రతీకగా కూడా భావించవచ్చు. మన హిందూ, సనాతన సాంప్రదాయ రీత్యా ఈ పంచాయచన పూజ ఎంతో శ్రేష్ఠమైనదిగా మహా ఋషులు తెలిపారు. సకల శుభకార్యాలలోనూ, ప్రతినిత్యం ఈ ఐదుగురు దేవతను పూజించటం ఆ గృహంలో నివశించేవారందరికీ శ్రేయస్సు చేకూరుతుంది. ఈ ఐదుగురు దేవతలా విగ్రహాలు, చిన్నవి మీ గుప్పిటలో సరిపోయే కొలత ఉన్నవి వీటిని ఒక పళ్ళెంలో వుంచుకుని పూర్వాభిముఖంగా కూర్చుని పూజ చేయాలి. ప్రతిరోజూ శుభ్రమైన బట్టతో శుభ్రపరచాలి. సమయాభావం ఉన్నవారు కేవలం ఐదు నిమిషాలలో పూజ పూర్తి చేయవచ్చు. అది ఎలాగంటే ...?

కేవలం పంచ ఉపచార పూజ ... దేవతల పేర్లు చెప్పి
1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం సమర్పయామి అంటే చాలు. అయితే అన్నిటికంటె ముఖ్యంగా భగవంతుని పూజలో, ఉపచార సమర్పణలో అర్చనచేసే వ్యక్తి భక్తిశ్రద్ధలే గీటురాళ్ళు. అందుకే చివరగా శాస్త్రం "తత్ర భక్తి శ్రద్ధా గరీయసీ'' అంటుంది.

Wednesday, September 11, 2019

భోజరాజు, బ్రహ్మచారి,కాళిదాసు భోజరాజా! శంభుడికి దూరం వుంటారో వారు తీర్థ యాత్రలకు వెళతారు

భోజరాజు ఒకనాడు కొలువు దీరి యుండగా,ఒక బ్రహ్మచారి వచ్చి రాజును చిరంజీవ అని
ఆశీర్వ దించాడు.
రాజు ఆ యువ బ్రహ్మచారిని బ్రహ్మచారీ!ఈ కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం
యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించావు?నిత్య వుపవాసాలతో యిలా ఎందుకు
కృశించి పోవడం?గృహస్తాశ్రమము స్వీకరించ రాదా? నేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ
కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.అన్నాడు.
అందుకు బ్రహ్మచారి రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది
ఏముంటుంది?అయినా
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహా: -శాంతి: ప్రియా గేహినీ,
వృత్తి: -- వన్యలతా ఫలై: నివసనం, వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నిర్వృతి:
తేషాం - ఇందు కళావతంస యామినాం మోక్షేపి నో నః స్పృహా
అర్థము:--లేళ్ళు మాకు మిత్రులు, కొండగుహలే ఇల్లు,మనశ్శాంతి, మనోనిగ్రహమే మా
ఇల్లాలు, అడవులలో
తీగేలతో,పండ్లతోనే సహవాసమే మా జీవన విధానం.చెట్టు పట్టలే మాకు వస్త్రాలు,మంచి
మాటలు అనే అమృత ప్రవాహం లో నిరంతర మునిగి తేలే వాళ్ళం, ఎవరికైతే ఈ
సుఖాలు వుంటాయో అలాంటి చంద్ర
మౌళీశ్వరుడి భక్తులము ,యోగులమూ అయిన మాకు మోక్షం మీద కూడా కోరిక
వుండదు.అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము ఏమైనా వుంటే
చెప్పండి.అన్నాడు
అప్పుడు అతడు రాజా!మేము కాశీయాత్రకు వెళుతున్నాము.దయచేసి మీ సభలోని
పండితులను భార్యా సమేతం గా మాతో పాటు యాత్రకు పంపించండి.త్రోవ పొడుగునా
శ్రమ తెలియకుండా పండిత గోష్టులు
జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.అన్నాడు ఆ బ్రహ్మచారి.రాజు అందుకు
సరే అన్నాడు రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళారు,ఒక్క
కాళిదాసు తప్ప.మీరు ఎందుకు వెళ్ళలేదు?అని రాజు కాళిదాసును అడిగాడు.కాళిదాసు
ఒక శ్లోకం లో బదులిచ్చాడు.
తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో: దూర వర్తినః
యస్య గౌరీశ్వరః చిత్తే / తీర్థం,భోజ! పరం హి సః
అర్థము:--భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు
వెళతారు,ఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజుకు కోపం వచ్చింది.కానీ ఏమీ చెయ్యలేక
వూరుకున్నాడు.
కొద్దిరోజుల తర్వాత భోజరాజు కాళిదాసు ను యీ రోజేమైనా విశేష మైన వార్త మీ చెవిన
పడిందా?అని అడిగాడు.కాళిదాసు నా చెవిన పడ్డది వార్త కాదు మహారాజా!అని ఒక శ్లోకం
చదివాడు.
మేరౌ, మందర కందరాసు, హిమవత్ సానౌ.మహేంద్రాచలే,
కైలాసస్య శిలా తలేషు, మలయ ప్రాక్ - భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!, శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గనై: (ణయై:) వుద్గీయ మానం యశః
అర్థము:--చారణులనే దివ్య గాయకుల బృందాల చేత,నీ కీర్తి గురించి
పాడబడుతున్నపాటలు వినబడ్డాయి
మేరు పర్వతం మీదా,మందర పర్వతపు గుహలలో,హిమాలయాల మీదా, మలయ
పర్వత శిఖ రాగ్రాల
మీదా,సహ్యాద్రి మీదా యిలా అనేకానేక ప్రదేశాలలో చారణులనే దివ్యగాయకుల
బృందాల చేత కొనియాడ బడుతున్న నీ కీర్తి వినపడ్డది
.
అప్పుడు భోజుడు సంతోషం తో కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని
నేను వినగలిగే వాడిని కాదు కదా!అనుకున్నాడు.కాళిదాసు మీద అతని కోపం
యెగిరిపోయింది.
------------------శుభరాత్రి -------------------------------

కవయామి వయామి యామి భోజరాజు నేతగాడు

ఒకనాడు భోజరాజు ఆస్థానానికి దక్షిణ దేశం నుండి లక్ష్మీధరుడు అనే కవి వచ్చాడు.
ఆయన ముఖం తేజస్సు తో వెలిగిపోతూ వుంది.భోజరాజు ఆ కవిని గురించి ఎప్పుడూ విని
వుండలేదు .ఆయనను చూడగానే ఈయన మహానుభావుడు అనే అభిప్రాయం కలిగింది.
కవిగారు భోజరాజుకు మంగళ వాక్యాలతో స్వస్తి చెప్పి అభివాదం చేసి కూర్చున్నాడు
రాజా! నీది పండిత,మండిత సభ.నీవు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడివి.అని ఒక శ్లోకం చెప్పాడు
భోజ ప్రతాపం తు విధాయ ధాత్రా
శేషై: నిరస్తై:పరమాణుభి:కిం
హరే: కారే భూత్ పవి,రంబరే చ
భాను:పయోధే:ఉదరే కృశాను:
అర్థము:--ఆ బ్రహ్మ భోజుడి పరాక్రమాన్ని సృష్టించి,మిగిలిపోయి వదిలేసిన
పరమాణువులతో యింద్రుడి చేతిలోని వజ్రాయుధమూ,ఆకాశము లో సూర్యుడు,
,సముద్రం మధ్యలో బడబాగ్ని తయారయ్యాయేమో.
ధాత్రా=ఆ బ్రహ్మ చేత భోజప్రతాపం విధాయ=భోజుడి పరాక్రమం సృష్టించ బడి, శేషై:
నిరస్తై పరమాణుభి:=మిగిలిపోయి పారేసిన పరమాణువు లతో,హరే: కరే అభూత పవి:=ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం ఏర్పడింది,ఆకాశములో సూర్యుడూ,పయోధే ఉదరే కృశాను:=సముద్ర గర్భం లో బడబాగ్ని కూడా ఏర్పడి నాయేమో
రాజు,సభికులు ఆ శ్లోకం విని చకితులయ్యారు.రాజు కవికి అక్షరలక్షలు యిచ్చాడు.
రాజా నీ రాజ్యం లోనే ఉండిపోవాలనే కోరికతో సకుటుంబంగా వచ్చాను అన్నాడు
లక్ష్మీధరుడు. ఎందుకంటే
క్షమీ దాతాః గుణ గ్రాహీ స్వామీ స్వామీ పుణ్య యేన లభ్యతే
అనుకూలః శుఛి: దక్షః కవిహి విద్వాన్ సుదుర్లభః
తా:-- క్షమాగుణం వున్నవాడు,దాత, ప్రతిభ గురించగలవాడు.అయిన ప్రభువు పుణ్యం .
వలననే లభిస్తాడు.దానికి తోడు, అనుకూలుడూ,నిర్మలుడూ,సమర్థుడూ,పైపెచ్చు కవీ, విద్వాంసుడూ అయిన నీలాంటి రాజు దొరకడం చాలా కష్టం..
భోజరాజుకు అలాంటి కవులు ఆశ్రయం కోరి వస్తే యింక కావలిసింది ఏముంటుంది?
ఈయనకు వెంటనే ఒక ఇల్లు ఏర్పాటు చేయ వలిసిందని మంత్రిని ఆజ్ఞాపించాడు.
ఆ సమయము లో ఏ ఇల్లూ ఆయనకు యివ్వద్ఫానికి ఖాళీగా లేదు.మంత్రి వెతికి
వెతికి ఒక నేత గాడు వున్న యింటికి వెళ్లి నీవు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి.ఈ
యింట్లోకి మహా విద్వాంసుడికి ఇవ్వాల్సి వుంది అని చెప్పాడు.ఆ నేతగాడికి చాలా
బాధ కలిగింది.యిప్పటి కిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే తనేక్కడికి వెళ్ళాలి?అని
నేరుగా రాజు గారి దగ్గరకు వెళ్లి నమస్కరించి తన గోడు చెప్పుకున్నాడు.రాజా!నీ
మంత్రి నన్ను మూర్ఖుడిగా లెక్క కట్టేశాడు.అన్యాయంగా నన్నుయింటినుంచి
వెళ్లగొడుతున్నాడు..ఎవరో గొప్ప విద్వాంసుడికి యిస్తాడట.నీవైనా పరీక్షించి చూడు
నేను మూర్ఖుడి నో పండితుడనో అని ఈ శ్లోకం చెప్పాడు.
కావ్యం కరోమి నహి చారు తరం కరోమి
యత్నాత్ కరోమి యది చారుతరం కరోమి
భూపాల మౌళి మణి రంజిత పాద పీట
హే సాహసాంక! కవయామి వయామి యామి
తా:--కావ్యం నేనూ వ్రాస్తాను.కానీ అంత చక్కగా రాయలేను.బాగా ప్రయత్నిస్తే
చక్కగానూ వ్రాయగలను.,శత్రురాజుల శిరస్సు మీది రత్నాల కాంతి చేత ఎర్రగా
ప్రకాశించే పాద పీఠంకల మహారాజా! సాహసమే మారు పేరుగా గలవాడా! కవయామి=కవిత్వమూ వ్రాస్తాను,వయామి=నేతా నేస్తాను,యామి=వెళ్ళమంటే వెళ్ళీ పోతాను. ఈ శ్లోకంలో చమత్కారమేమిటంటే .చివరి పాదం లోని 'కవయామి' 'వయామి' 'యామి' అన్నమాటలు ఎంతో చమత్కార యుక్తములుఎలాగంటే 'కవయామి' అనేది ఒక క్రియాపదం. కవిత్వముచెప్పగలను అని దాని అర్థం.అందులో మొదటి అక్షరం 'క' తీసివేస్తే 'వయామి' అవుతుంది. అంటే మగ్గం నేసుకోగలను అని అర్థం, దానిలోనుండి 'వ' అనే అక్షరం తీసివేస్తే 'యామి' అవుతుంది. వెళిపోగలను అని అర్థం. యిలా ఒకపదం నుండి ఒక్కొక్క అక్షరాన్ని తగ్గిస్తూ పోతే యింకో క్రియాపదం రావడం ఎంతో చమత్కారం.
రాజుకు ఒక నేతగాడు తనను నువ్వు అని సంబోధిస్తుంటే ఆశ్చర్యమూ,ఆ నేతగాడి
కవితా మాధుర్యానికి సంతోషమూ కలిగాయి. కవితా శక్తి మాటయితే కొంచెంఆలోచించ
వలిసిందే కానీ నీ శ్లోకం చాలా బాగుంది.అన్నాడు. ఆ నేత కార్మికుడికి కొంచెం కోపం వచ్చింది.పైకి మాత్రం రాజా!ఒక్క విషయం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం వేరు,విద్వాంసుల ధర్మం వేరు అందుకని చెప్పలేక ,విద్వాంసుల ధర్మం వేరు అందుకని చెప్పలేక పోతున్నాను.అన్నాడు. ఏమిటా విషయం?సంకోచించకుండా చెప్పు అన్నాడు రాజు. దేవా!నేను కాళిదాసును తప్ప ఇతరులను కవులుగా పరిగణించ లేకపోతున్నాను.నీ సభలో కవిత్వ తత్వం తెలిసిన విద్వాంసులు కాళిదాసు తప్ప యింకెవరున్నారు?అని యింకో శ్లోకం చెప్పాడు.
యత్-సారస్వత సౌరభం గురు కృపా పీయూష పాకోద్భవం
తత్ -లభ్యం కవినైవ;హఠతః పాఠ ప్రతిష్ఠాజుషా
కాసారే దివసం వసన్నపి పయః పూరం పరం పంకిలం
కుర్వాణః కమలాకరస్య లభతే కిం సౌరభం సైరిభః
అర్థము:--కవిత్వ సౌరభం అనేది గురు కృప అనే అమృతపాకం వల్ల పుట్టేది.అది కవి
అయిన వాడికే లభిస్తుంది.బలవంతంగా (హఠతః)పాఠాలు చెప్పించుకుని
ఎక్కించుకునే వాడికి దొరకదు.రోజంతా చెరువులో కూర్చొని (కాసారే దివసం వాసన్ అపి) చెరువునంతా పూర్తిగా కలుషితం చేస్తున్న (పయః పూరం పరం పంకిలం కుర్వాణః)
దున్నపోతు(సైరిభః) తామరకొలను సౌరభాన్ని పొందుతుందా?
అయం మే వాగ్గుమ్భః-విశదపద వైదగ్ధ్య మధురః
స్ఫురత్-బంధః, వంధ్యః పరహృది,కృతార్థ: కవిహృది
కటాక్షః-వామాక్ష్యా: దరదళిత నేత్రాంత గళితః
కుమారే నిస్సారః,స తు కిమపి యూనః సుఖయతి.
అర్థము:- ఈ నా పద గుంభనము స్పష్ట మైన పదాల అమరికతో మధురమైనది,పద
బంధాల మెరుపు గలది.అది కవి హృదయాన్నే మెప్పిస్తుంది.యితర హృదయాలలో
అది నిష్ఫల మైపోతుంది. అతివ అరమోడ్పు కన్నుల నుంచి జారే చూపు పసిబాలుడికి
పనికి రాదు,పడుచు వాడి నయితేనే అది ఉల్లాస పరచగలదు. పోతే నేను నిన్ను నువ్వు నువ్వు అన్నానని కోపగించుకోకు.
బాల్యే సుతానాం,సురతేంగ నానాం
స్తుతౌ కవీనాం,సమరే భటానాం
'త్వం' కార యుక్తాః హి గిరః ప్రశ స్తాః
కః ది ప్రభో మోహభరం, స్మరత్వం
అర్థము:--బాల్యం లో కుమారులకూ,ఏకాంత ప్రణయ వేళలలో స్త్రీలకూ,స్తుతించే
టప్పుడు కవులకూ,యుద్ధము లో సైనికులకూ 'నువ్వు' అన్న సంబోధన తో కూడిన
మాటలే ప్రశస్తమయిన మాటలని శాస్త్రం జ్ఞాపకం చేసుకో నీ కెందుకీ అపార్థం?
బోజరాజు బాగా చెప్పావు అని మెచ్చుకొని అతనికి అక్షర లక్షలిచ్చి సన్మానించటమే
కాక వున్న యింట్లోనే ఉండేందుకు అనుమతి నిచ్చి పంపేశాడు.ఆ లక్ష్మీధర కవికి
త్వరగా ఒక భవనం నిర్మించమని,అంతవరకూ అతన్ని అతిథి గృహం లోనే వుంచమని
మంత్రిని ఆదేశించాడు. అలా ఆ నేతగాడు కవిత్వం చెప్పి రాజును మెప్పించి తన యింటిని కాపాడుకున్నాడు.

అందుకో విశ్వనాథ ! జోహార్లు శతము డా .యస్వీ రాఘవేంద్ర రావు

నీరాజనము
సకల సాహితీ ప్రక్రియా స్రష్ట వగుచు
నాంధ్రభాషా ప్రపంచము నద్భుతముగ
"వేయి పడగల " మోసిన "విశ్వనాథ"
ఎటుల సేవించి నీ ఋణ మీగ గలము ?
"చెలియలికట్ట" లేని సువిశేష చిరత్న వినూత్న సాహితీ
జలనిధి ! "కల్పవృక్షము" నొసంగితి, కావ్య సుధారసంబులన్
తెలుగు జనాళి తన్పితివి దివ్యకవీంద్ర ! "కళాప్రపూర్ణ !" నీ
వల "శశిదూతమున్" నెఱపి, తాంధ్రియు వాఙ్మయ కౌముదిం గనెన్.
"ఆంధ్ర పౌరుషము"ను, "నాంధ్ర ప్రశస్తి"యు
దెసల నీ కతమున తేజరిల్లు
"జ్ఞానపీఠ" సు"కవిసమ్రా" డ్ప్రథితకీర్తి !
వీక దనరిన "జగదేకవీర !"
నవ్యులలో నవ్యుడవై,
కావ్య పునర్జీవన ఘనకార్య సవన సం
సేవ్యుడవై మంటివి, సం
దీవ్యత్కవిచంద్ర ! కొనుము నీరాజనముల్.
"గిరికుమారుని ప్రేమగీతాలు" నేర్పి,
"అనార్కలి" భగ్నప్రణయము తెల్పి,
"నర్తనశాల" లో నాట్యాలు నేర్పించి,
"వేనరాజు కథ" ను విశదపఱచి,
"మాస్వామి" కీర్తించి మహితభక్తి,
నల "స్వర్గానికి నిచ్చెనల్" రహిని గూర్చి,
"కోకిలమ్మకు పెళ్ళి కూర్మి చేయించి,
"కిన్నెరసాని" పాటలో కరుణ నింపి,
వివిధ సాహితీ ప్రక్రియా విలసనమున
ఆంధ్ర వాణిని కైసేసి తమరవీర !
ఆర్ష సంస్కృతి "ధర్మచక్రావతార !"
అందుకో విశ్వనాథ ! జోహార్లు శతము
డా .యస్వీ రాఘవేంద్ర రావు

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ " నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని
ఆ కాలంలో అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం
తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహలాడాడు బాణభట్టులాగే.
తీరా నాటకం చదివి నచ్చకపోతే మహాకవి ఏమంటాడో అని (బాణుడిలాగే ) ఒక శంక.
అందువల్ల తను స్వయంగా కాళిదాసుకు నాటకం చూపించటానికి సంశయించి, తన
కుమారుడికి తన కుమారుడికి తన తాళపత్రగ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు.
కాళిదాసు యింట్లో కూచుని చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ
అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. అన్నాడు.
వేరే సమయమెందుకు?వచ్చావుగదా!యిప్పుడే చదివి వినిపించు. ఒక చెవి పడేసి వినేస్తాను. అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కూడా మరల్చకుండా.
భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది. తన తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధపెట్టి వినేందుకు కూడా యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించటం చెవిటివాడి
ముందు శంఖమూది నట్టు గదా! అనిపించింది. కానీ ఏంచేస్తాడు?తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు, అంతకంటే ఎక్కువే. ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప
ఆయనకు మనః శాంతి లేదు. చేసేది లేక నాటకమంతా చదివి వినిపించాడు.
చదివాడు కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇటుపక్కకు తిరిగి చూడనైనా
చూడలేదు. అంతా చదివాక మాత్రం,నోటినిండా తాంబూలం తో అస్పష్టన్గా సున్నా ఎక్కువైంది అని మాత్రం వినిపించింది. భవభూతి కుమారుడికి 'ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది. దానిమీద వున్న
ఆసక్తి గూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.అనుకొన్నాడు. ఆ
నిర్లక్ష్యం, అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి.
ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు. విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు.
తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసేభవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం'
అని మెచ్చుకున్నాడు. భవభూతి ఆయనను కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు.
మాటల మధ్యలో భవభూతి,కాళిదాసుతో మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు. అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా, మీ
తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం ఏది అన్నారని చెప్పాడు. మీరేమో
యిప్పుడు నా నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏదో సాటి కవినని మర్యాదతో
మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను. ఈసారైనా విని మీ సూచనలూ,
అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను. అన్నాడు.
కాళిదాసు నవ్వాడు; 'కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న
ఆసక్తి మరే విషయంపైనా లేదు. మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం
క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను. పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం
ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే
నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను.నేను అన్నమాటలు పై పై మర్యాదకోసం చెప్పినవి కావు.' అన్నాడు.
ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు. నేనన్నది సున్నం గురించికాదు. 'సున్న' గురించి , నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో
ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నాని చిన్న సూచన చేశాను తప్ప మీ అద్భుతమైన నాటకం లో
ఏ చిన్న మార్పూ అవసరం లేదు.
ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగి పోయాడు. ఉత్సాహంగా సున్న ఎక్కువైంది ఏ శ్లోకం లో స్వామీ?నాటకంలో శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.దయచేసి చెప్పండి. అన్నాడు.
ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది? మొదటి అంకం లోనే, రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.
కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్
అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ
అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో
అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్
(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక - ఏక - దోష్ణో: = అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో
ఒకరుగా ఒదిగి ;
అవిరళిత కపోలం - చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా
ఆసక్తి యోగాత్ - అక్రమేణ - కిమపి కిమపి - మందం మందం - జల్పతో: = ఆసక్తి బట్టే తప్ప - మారె వారసలేకుండా - ఏవేవో ముచ్చట్లు - గుసగుసలుగా చెప్పుకుంటున్న
(మనకు)
అవిదిత గతమయామా - రాత్రి: - ఏవం - వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన
జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది.
అవునవును అన్నాడు భవభూతి.
అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులు
రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)
అని చెప్తే మరీ బాగుంటుంది.
పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి.అలా ఉంటూనే ఉంటాయి.
రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది.అన్నాడు
కాళిదాసు.
అవశ్యం మహాకవి! ఎంత అద్భుతమైనమార్పు సూచించారు! అందుకే తమరు కవికుల
గురువులు అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి.
అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు.
నాటకేషు చ కావ్యేషు వయం వా వయమేవ వా
ఉత్తరే రామచరితే భవభూతి: విశిష్యతే
నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమే సాటి. ఉత్తరరామచరిత్ర లో మాత్రం
భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు. అన్నాడు కాళిదాసు.
భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు.
కన్యాకుబ్జ౦ రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ,ఆంద్రుడని కొందరూ వాదించారు.
భవభూతి రచనలు మూడూ నాటకాలే.'ఉత్తరరామచరితం' 'మాలతీమాధవం'
'మహావీరచరితం' భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు'.ఏకో రసః కరుణ ఏవ!'
-----------------------------శుభరాత్రి----------------------------

Friday, August 16, 2019

"కుంచమంత కూతురుమంచం భోజనం" "ముదితల్ నేర్వగరాని విద్యకలదే దేశమంటే మనుషులోయ్"

ఈ వీడియో చూడడానికి వినోదంగానే ఉన్నా ఎన్నో ప్రశ్నలు సంధిస్తోంది. 
"కుంచమంత కూతురుంటే మంచం మీదే భోజనం" అని ఒక సామెత 
అలాగే "ముదితల్ నేర్వగరాని విద్యాకలదే ముద్దార నేర్పింపగాన్" అన్నారు 
పిల్లల పెంపకం అన్నది అత్యంత ముఖ్యమైనది. అత్యంత నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం 
చిన్నప్పటినుంచి పిల్లలని టి.విలకి, కంప్యూటర్లకి, సెల్ల్ ఫోన్స్ కి బందీలుగా చేసి కొద్దిగా ఎదగగానే ప్లే స్కూల్ నుంచి ఐఐటీ చదువుల మత్తులో వారిలో సృజనాత్మకత, మానవీయత లేకుండా చేస్తున్నాం. 
ఈ సందర్భంగా 1910 లో రచించబడి 09/ 08 /1913 లో కృష్ణాపత్రికలో ప్రచురించబడిన గురజాడ వారి "దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్" ఈ పలుకులు ఎప్పటికీ విశ్వజాతి నిర్మాణానికి పునాది రాయి. ఒకసారి దేశం 73 వ స్వేచ్ఛా వాయువులు ఆస్వాదిస్తున్న వేళ మననం చేసుకుందాం! దేశానికీ దశ, దిశా తెలియచెప్పగల సత్తా ఉన్న దేశభక్తి పూరిత పూర్తి గీతం మీకోసం: సత్యసాయి - విస్సా ఫౌండేషన్
దేశమును ప్రేమించుమన్నా
1.దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా!
వొట్టి మాటలు కట్టిపెట్టోయి
గట్టి మేల్‌ తలపెట్టవోయి.
2.పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటుపడవోయి;
తిండి కలిగితె కండ కలదోయి;
కండ కలవాడేను మనిషోయి!
3.యీసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయి?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయి.
4.అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి
దేశి సరుకుల నమ్మవలెనోయి !
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి.
5.వెనక చూసిన కార్యమేమోయి?
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి!
6.పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే,
వ్యర్థ కలహం పెంచబోకోయి
కత్తి వైరం కాల్చవోయి
7.దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని ఏదైనాను వొకమేల్‌
కూర్చి జనులకు చూపవోయి
8.ఓర్వలేమిపిశాచి దేశం
మూలుగులు పీల్చేసెనోయ్,
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయి
9.పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయి?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయి!
10.స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టి కాదోయి
దేశమంటే మనుషులోయి!
11.చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయి
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయి
12.మతం వేరైతేను యేమోయి?
మనసు లొకటై మనుషులుంటే
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయి!
13.దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి,
నరుల చమటను తడిసి మూలం,
ధనం పంటలు పండవలెనోయి!
14.ఆకులందున అణగిమణగీ
కవిత కోయిల పలకవలెనోయి;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయి!

Sunday, August 11, 2019

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవితలు 2

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవిత: "ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ,...

Thursday, July 11, 2019

గుండె లోతుల్లో ఓ జ్ఞాపకం

గుండె లోతుల్లో ఓ జ్ఞాపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తొలకరి వేళ
చిరుజల్లులు కురిసి
పుడమి కాంత మేనుకు
హాయిని కలిగించాయి!
గ్రీష్మతాపంతో
కమిలిన ధరాసుకుమారి
సుందర రూప లావణ్యం
ఆషాఢ మేఘం పలకరింపునకు
స్వాంతన పొంది
చిరుదరహాసంతో
పులకరించింది!
ఇంకా...
నువ్వు వస్తావనే ఆశ
నా గుండెలోతుల్లో
భద్రంగా దాగి ఉంది!
ఉగాదులెన్నో మారాయి
విరహం వేసవికి
నా హృదయంలో
వేడి సెగలు రగిలాయి!
కానీ.. చెలీ!
మునుపెన్నడో
నీతో పంచుకున్న
జ్ఞాపకాల మల్లెలు
సుగంధాలై పరిమళించి
రగులుతోన్న విరహాగ్నిలో
శాంతి ధూపం వేశాయి!
కాలం వేగంగా కదులుతున్నా
నీ ఊహల్లో బతుకుతోన్న నాకు
కాలగమనమే తెలియడంలేదు!
నా వలపు రహదారిలో
నువ్వు నా కోసం
నడిచి వస్తున్నావనే భావనే
నన్నింకా బతికిస్తోంది! *
-విడదల సాంబశివరావు 9866400059

అచ్చతెలుగు గళాకారుడు బాలు --- పున్నమరాజు


‘‘కలువలు పూచినట్లు! చిరుగాలులు చల్లగ వీచినట్లు! తీ

వలు తలలూచినట్లు! పసిపాపలు చేతులు సాచినట్లు! క్రొ 
వ్వలపులు లేచినట్లు! చెలువల్‌ చెలువమ్ముగ చూచినట్లుగా 
పలుకుట పూర్వపుణ్యపరిపాకముగాదె తలంచి చూడగన్‌’’
‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన ఈ పద్యం, శ్రీపతి పండితారాధ్యుల
బాలసుబ్రహ్మణ్యం వాచిక ప్రతిభను గుర్తుకు తెస్తుంది.

ఎందుకంటే...ఆయన స్వరంలో
అక్షరం’ అక్షర ‘మై నిలుస్తుంది...
హాస్యం లాస్యం చేస్తుంది...
శృంగారం సింగారాలు పోతుంది..
విషాదం మన కంట నీరొలికిస్తుంది..
భక్తిభావం భగవద్దర్శనం చేయిస్తుంది!

తరతరాలకు తన్మయ తరంగమై పల్లవిస్తున్న ఆ గాంధర్వ స్వరం- ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం!
పలుకులమ్మ పరిపూర్ణ అనుగ్రహంతో, గానకళాకోవిదుడై, తెలుగు యశస్సుకు
తార్కాణంగా నిలిచిన నిత్య గాయకుడు, నిఖిల గాయకుడు, ‘‘బాలు’’గా కోట్లాది 
మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు 
ఈరోజు!

అన్ని భాషల్నీ అమ్మ భాషలుగా చేసుకుని, ఆయా భాషల్లోని మాటల భావాత్మని
తన గొంతులో పలికించి, ఆ భాషల శ్రోతలకు అవధీరహితమైన గళపరిమళాన్ని
పంచి, స్వరసామ్రాజ్య చక్రవర్తిగా ఎదిగిన బాలు తెలుగువాడు కావడం మనం మరీ
మరీ మురిసిపోవలసిన విషయం!

బాలు నట గాయకుడు. ఏ నటుడి కోసం పాడుతున్నాడో 
ఆ నటుడి హావ భావాల్ని, నటనా ధోరణిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని, తదనుగుణంగా గాత్రాన్ని 
మలిచి పాటకు ప్రాణం పోయడం బాలుకు గొంతుతో పెట్టిన విద్య. 

ఆయన స్వరానికున్న అనితరసాధ్యవిస్తృతి, 
ఏ భావాన్నైనా అలవోకగా పలికించగల అనన్యత్వాన్ని ప్రసాదించింది. 
దానికి తోడు శిఖరాయమైన ఆ ప్రతిభ దైవదత్తమని మనఃపూర్వకంగా నమ్మి, 
ఏ మాత్రమూ అహంకారం లేకుండా, సాధనతో పరిపూర్ణతను సిద్ధింప చేసుకున్న మానవతామూర్తి బాలు!

కవి ఏ సందర్భంగా ఆ పదాన్ని వాడాడో తెలుసుకుని, భాషాభావ సంస్కారంతో, 
సమయోచితరీతిలో ఆ పదాల విలువ పెంచేవిధంగా స్వరచాలనం చేసి, 
పాటకు మన మదిలో శాశ్వత్వాన్ని ప్రతిపాదించిన నాదయోగి బాలు!

శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోయినప్పటికీ, శృత పాండిత్యంతో, అత్యంత 
అభినివేశంతో, దీక్షాదక్షుడై, కఠోర సాధన చేసి, త్యాగయ్య, శంకరాభరణం
చిత్రాల్లో శాస్త్రీయ సంగీత ఆధారిత గీతాలను పండిత పామర మనోరంజకంగా 
ఆలపించి, అత్యున్నత పురస్కారాలను దక్కించుకున్న గాన తపస్వి బాలు!

తొలినాళ్ళలో చేయూత నిచ్చిన గురువు పట్ల అభిమానంతో తన 
ధ్వనిముద్రణాశాలకు కోదండపాణి పేరును ఉంచడం, దైవసమానుడిగా భావించే
ఘంటసాల విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం, జానకమ్మ
ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేసాననే కృతజ్ఞతాభావంతో ఈ
పుట్టినరోజునాడు ఎస్‌ జానకికి జాతీయ పురస్కారాన్ని అందించడం బాలు
సంస్కారానికి, మహోన్నత వ్యక్తిత్వానికి, శుభలక్షణ సంపన్నతకు నిలువెత్తు
నిదర్శనాలు.

ఈటీవీ అధినేత రామోజీరావు గారి సూచన ఆమోదించి, 1996 నుంచి నేటి వరకూ 
అప్రతిహతంగా, అనితర సాధ్యమైన వ్యాఖ్యానపటిమతో బాలు నిర్వహిస్తున్న 
సంప్రదాయబద్ధమైన లక్షగళార్చన ‘‘పాడుతాతీయగా’’ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 
ఉన్న వర్తమాన గాయనీ గాయకుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వారి ప్రతిభకు పట్టం
కడుతూ, తెలుగు పాట కీర్తి కేతనాన్ని విశ్వ వేదికపై రెపరెపలాడిస్తోంది.

బహుముఖీయమైన ప్రజ్ఞా ప్రభాసిగా ఎదిగినా...సముద్రమంత ఆర్తితో 
శిఖరాయమానమైన కీర్తిని సాధించినా...తన సహజాత స్నిగ్ధాపిపాసతో
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని, వేలాదిమంది స్నేహితుల్నీ
సంపాదించుకున్న మనసున్న మనిషి బాలు!

గొంతులో తగ్గని మార్దవం, పలుకుబడిలో ఒలికే అందాలు, పాట భావంలో
ఒదిగేపోయే తత్త్వం, రాజీలేని తపన, సాహితీ అభిలాషతో కూడిన సంగీత ప్రజ్ఞ
ఔచితీవంతమైన గానపద్ధతి, బహుగాత్రదానధురీణత, అద్భుత నటనా కౌశలం
స్వంతం చేసుకున్న బాలు సుస్వర సర్వస్వమై ఎదిగి అందిపుచ్చుకున్న లెక్కలేనన్ని
పురస్కారాలలో పద్మశ్రీ, పద్మభూషణ్‌, శత వసంత భారతీయ చలన చిత్ర 
మూర్తిమత్వ పురస్కారాలు విశిష్టమైనవి.

పాటకోసమే పుట్టి, పామర, పండితారాధ్యుడై ప్రభాసిస్తున్న అచ్చ తెలుగు
గళాకారుడు, నిత్యనూతన పథికుడు బాలు మరిన్ని వసంతాలు సంగీతలోకాన
చిరయశస్సుతో జీవించాలి. ఈ గాన గంధర్వుడి ప్రస్థానం నిర్విరామంగా
కొనసాగాలని అశేష అభిమానుల విశేష ఆకాంక్ష!


- పున్నమరా
జు

Total Pageviews