Friday, October 31, 2014

ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ...దృశ్య రూపం 4 వ భాగం.


ముఖపుస్తక బంధుమిత్రులకు శుభోదయం! ఈ దిగువ లంకె నొక్కండి..ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...దృశ్య రూపం 4 వ భాగం...సత్యసాయి విస్సా ఫౌండేషన్!!
https://www.youtube.com/watch?v=GfN9n57HLgQ

Thursday, October 30, 2014

ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ...దృశ్య రూపం 3 వ భాగం


ముఖపుస్తక బంధుమిత్రులకు శుభోదయం! ఈ దిగువ లంకె నొక్కండి..ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...దృశ్య రూపం 3 వ భాగం

https://www.youtube.com/watch?v=JvjMDaxvHhE

వినమ్ర ధన్యవాదాలు!!

ఈ రోజుతో మా విస్సా ఫౌండేషన్ బ్లాగ్ కు 4 నెలలు నిండాయి. మా బ్లాగ్ అందించే సమాచారం పట్ల ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నఆదరణ మా భాద్యతను మరింత పెంచుతోంది. మన భాష సంస్క్రతి సంప్రదాయాలకు సంబంధించి ప్రామాణిక మైన సమాచారం ఎక్కడున్నా, తేనేటీగ మకరందం సేకరించి తేనెపట్టు లో నిక్షిప్తం చేసినట్లు మేము మా బ్లాగ్ ను ఎప్పటి కప్పుడు మరింత సర్వాంగ సమగ్రంగా, పెద్దలతో చర్చించి మరింత ప్రామాణికంగా అందించే ప్రయత్నం చేస్తాము..ఈ క్రమంలోనే కార్తికపురాణం కూడా మరింత విపులంగా అందిస్తున్నాము ఈ రోజు నుండి గమనించగలరు... సదా మీ సేవలో...సత్యసాయి విస్సా ఫౌండేషన్!   

Tuesday, October 28, 2014

శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం ఈ దివ్య స్తోత్రాన్ని స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు అందరూ చదవాలి. ప్రతిరోజూ 18 సార్లు వరుసగా చదివి కర్పూర హారతి ఇస్తే శ్రీ వారి దివ్య మంగళమూర్తి దర్శనమవుతుంది. ఓం శిరసివజ్ర కిరీటం - వదనే శశివర్ణ ప్రకాశం ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణే వజ్ర కుండల శోభితం నాసికాయాం సువాసిక పుష్పాదళం - నయనే శశిమండల ప్రకాశం కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం కరే కరుణాభయసాగరం భుజేశంఖ చక్రగదాధరం స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం - సర్వాంగే స్వర్ణపీతాంబరం ధరం పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం సర్వం స్వర్ణమయం - నామ పావనం శ్రీ వేంకటేశం శ్రీనివాసం - తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం !!

శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం
ఈ దివ్య స్తోత్రాన్ని స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు అందరూ చదవాలి. ప్రతిరోజూ  18 సార్లు వరుసగా చదివి కర్పూర హారతి ఇస్తే శ్రీ వారి దివ్య మంగళమూర్తి దర్శనమవుతుంది.

ఓం శిరసివజ్ర కిరీటం - వదనే శశివర్ణ ప్రకాశం
ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణే వజ్ర కుండల శోభితం
నాసికాయాం సువాసిక పుష్పాదళం - నయనే శశిమండల ప్రకాశం
కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం
కరే కరుణాభయసాగరం భుజేశంఖ చక్రగదాధరం
స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం - సర్వాంగే స్వర్ణపీతాంబరం ధరం
పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం  
సర్వం స్వర్ణమయం - నామ పావనం శ్రీ వేంకటేశం 
శ్రీనివాసం - తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం !!!

Monday, October 27, 2014

"ఏక బిల్వం శివార్పణం" ...మారేడు దళం!!

"ఏక బిల్వం శివార్పణం" ...మారేడు దళం!!

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము. 


ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచింది. ఈ మూడు రేకులకు ఆధ్యత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థితి ,లయ కారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంత్రయామి!
బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది.వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి. 
అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది. 
"పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే" - అనే భావంతో శివుని పూజించుతయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.

ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటఒ చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.

బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం.

మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణ లో , ఈశాన్య భాగం లో మారేడు చెట్టు ఉంటే , ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!

తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.
పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!

హర హర పార్వతి పతయే మహాదేవ శంభో శంకర !


మారేడు దళం!!
 మారేడు దళం శివునికి ప్రీతికరమైనది. భస్మంతో అభిషేకం తర్వాత, మారేడు దళంతో శివుని పూజిస్తారు మూడు ఆకులు, మూడుగుణాలు సూచిస్తాయి. మారేడు కొమ్మలే వేదాలు. వేరులు రుద్రుడు. మారేడు దళం త్రినేత్రాలను సూచిస్తాయి. వీటిని పౌర్ణమి నాడు కోయరాదు. పశ్చిమ దేశాలలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మారేడు మొక్కలను పరిశోధనలకై పెంచు తున్నారు. కీళ్లవ్యాధులు, వాంతులు, క్షయ, విరేచనాలకు మారేడు అద్భుతంగా పనిచేస్తుంది. మారేడు దళాల రసాన్ని మంచినూనెలో కలిపి వేడిచేసిన తర్వాత చెవివ్యాధులకు ఉపయోగిస్తారు.

విభూతి
విభూతి శివునికి యిష్టం.విభూతిని నుదట ధరిస్తే, చెమటను పీలుస్తుంది. శరీరంలోని ఉష్ణాన్ని అదుపుచేస్తుంది. విభూతిని మెడ, భుజాలు, చేతులకు రాసుకుంటారు. విభూతి శివునికి యిష్టం. దేహంలోని నరాలు ఉబ్బటం, బాధపెడుతుంటాయి. విభూతి సక్రమంగా రాస్తే, వీటిని అరికట్టవచ్చు. మన శరీరంలో 72,000 నరాలుంటాయి.
హోమంలో విభూతిని, ఆవునెయ్యి, ఔషధమొక్కలతో హోమంలో వేస్తుంటారు. ఈ విధంగా చేస్తే, వాతావరణ కాలుష్యం బారినుండి రక్షించుకోవచ్చు. సంస్కృతిలో విభూతిని భస్మం అంటారు. 'భాసతియత్‌ తత్‌ భస్మ' అని బ్రహ్మపురాణం చెబుతుంది. శైవపురాణం ' భస్మకల్మష భక్షనాత్‌' అని పేర్కొంది. అంటే భస్మం పాపాలను హరిస్తుంది. 'భక్షణత్‌ సర్వపాపానామ్‌ భస్మేతి పురికీర్తితమ్‌' పాపనాశిని కాబట్టే, దానిని భస్మమ్‌ అని కొనియాడారు.విభూతికి భారతీయ సంస్కృతిలో విశిష్టస్థానముంది.

Sunday, October 26, 2014

టోరీ అంతర్జాతీయ తెలుగు ఆకాశవాణి లో 'మారిషస్ తెలుగు తల్లి ప్రేమ'లో తేది 25/10/2014 శనివారం 'మా అంతర్జాతీయ విస్సా పీఠం' కుమారి ఏలూరిపాటి అపర్ణ, మరియు ఇతరులతో నిర్వహించిన కార్యక్రమం వినడానికి...ఈ దిగువ లంకే పై నొక్కండి!! .

టోరీ అంతర్జాతీయ తెలుగు ఆకాశవాణి లో 'మారిషస్ తెలుగు తల్లి ప్రేమ'లో తేది 25/10/2014 శనివారం 'మా అంతర్జాతీయ విస్సా పీఠం' కుమారి ఏలూరిపాటి అపర్ణ, మరియు ఇతరులతో నిర్వహించిన కార్యక్రమం వినడానికి...ఈ దిగువ లంకే పై నొక్కండి!! .   
http://www.teluguoneradio.com/archivesplayer.php?q=15180&host_id=61

27-10-2014, సోమవారం, కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి


కార్తీక పురాణము 4వ అధ్యాయము (దీపారాధనా మహిమ)



కార్తీక పురాణము 4వ అధ్యాయము (దీపారాధనా మహిమ) 

ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతముయొక్క మహిమవల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తినొందెదరని చెప్పుచుండగా జనకుడు 'మాహాతపస్వీ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలదీ తనివితీరకున్నది. కార్తీకమాసములో ముఖ్యముగా యేమేమి చేయవలయునో, యెవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్ఠులవారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా! కార్తీక మాసమందు సర్వసత్కార్యములునూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము, శివాలయమునగాని విష్ణ్యాలయమునందుగాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరినూనెతోగాని, అవిసె నూనెతో గాని, విప్పనూనెతో గాని, యేదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యాత్ములుగాను, భక్తిపరులుగాను నగుటయేగాక అష్టయిశ్వర్యములూ కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందు కొకకథ గలదు, వినుము.

శతృజిత్కథ:

పూర్వము పాంచాలదేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి, తుదకు విసుగుజెంది గోదావరీ తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, "పాంచాల రాజా! నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీకోరికయేమి?" యని ప్రశ్నించగా, "ఋషిపుంగవా! నాకు అష్టయిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక, కృంగి కృశించి యీ తీర్థస్థానమున తపమాచరించు చున్నాను" అని చెప్పెను. అంత మునిపుంగవుడు "ఓయీ! కార్తీకమాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతికొరకు దీపారాధనము చేసినయడల నీ కోరిక నెరవేరగలదు" యని చెప్పి వెడలిపోయెను.

వెంటనే పాంచాల రాజు తనదేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరోజులూ దీపరాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన నారాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొకకుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములుచేసి, ఆ బాలునకు 'శత్రుజి' యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందు వలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడగుచు సకలశాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాబముచేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను.

తల్లిదండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచీ చూడనట్లు - వినీవిననట్లు వుండిరి. శతృజి ఆరాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పువారలను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొకదినమున నొక బ్రాహ్మణపడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మథునకైననూ శక్యముగాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారములో నామెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యిపట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగముల ననుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము నర్థరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, భార్యనూ, రాజకుమారునీ ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.

ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, యెవరికివారు రహస్యమార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున "చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా," యని రాకుమారుడనగా, ఆమె తన పైటచెంగును చించి అక్కడనున్న ఆముదపుప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురునూ మహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదునుగా నామెభర్త తన మొలనున్న కత్తితీసి ఒక్క వ్రేటుతో తన భార్యనూ, ఆ రాజకుమారునీ ఖండించి తానుకూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలదీ ఆరోజు కార్తీక సుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుటవలననూ శివదూతలు ప్రేమికులిరువురినీ తీసుకొనిపోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకునూ అక్కడకు వచ్చిరి. అంత యా దూతలను చూచి బ్రాహ్మణుడు "ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్లుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారులకొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే!" అని ప్రశ్నించెను. అంత యమకింకరులు "ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, యీ పవిత్రదినమున, అనగా కార్తీకపౌర్ణమీ సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుటవలన అప్పటివరకూ వారు చేసిన పాపముల్న్నియును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు" అని చెప్పగా - యీ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు "అలా యెన్నటికినీ జరుగనివ్వను. తప్పొప్పులు యేలాగున్నప్పటికినీ మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మాయందరికీ వర్తించవలసినదే" అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి.

వింటివా రాజా! శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక, కైలాసప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచినవారు జన్మరాహిత్యమొందుదురు.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి నాలుగో యధ్యాయము
నాల్గవ రోజు పారాయణము సమాప్తము.

Saturday, October 25, 2014

కార్తీక పురాణము 3వ అధ్యాయము (కార్తీకమాస స్నాన మహిమ)....బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి సౌజన్యం తో...మీకోసం...



కార్తీక పురాణము 3వ అధ్యాయము (కార్తీకమాస స్నాన మహిమ)

జనక మహారాజా! కార్తీకమాసమున యే ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తీకస్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు.

అధమము కార్తీకమాస శుక్లపౌర్ణమి రోజు నయిననూ స్నానదాన జపతపాదులు చేయకపోవుటవలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.

బ్ర్హహ్మరాక్షసులకు ముక్తి కలుగుట: ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్ఠు'డను బ్రాహ్మణుడొక డుండెను. ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థసమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ, దీర్ఘకేశములతోనూ, బలిష్టంబులైన కోరలతోనూ, నల్లని బాన పొట్టలతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ, ఆ దారినబోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము జేయుచుండిరి. తీర్థ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరీ పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణకుచు యేమియు తోచక నారాయణస్తోత్రము బిగ్గరగా పఠించుచు "ప్రభో!ఆర్తత్రాణపరాయణా! అనాధ రక్షకా! ఆపదలోనున్న గజేంద్రుని, నిండుసభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదినీ, బాలుడగు ప్రహ్లాదునీ రక్షించిన విధముగానే - యీ పిశాచాల బారినుండి నన్ను రక్షించు తండ్రీ!" యని వేడుకొనగా, ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి "మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది. మమ్ము రక్షింపుడు" యని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని "ఓయీ! మీరెవరు? ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు" యని పలుకగా వారు "విప్రపుంగవా! మీరు పూజ్యులు. ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శనభాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇకనుండి మీకు మా వలన యే ఆపదా కలుగదు" అని అభయమిచ్చి, అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును యీ విధముగా చెప్పసాగెను.

"నాది ద్రావిడదేశం. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడనై యుంటిని. న్యాయాన్యాయవిచక్షణలు మాని పశువువలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థులవద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు, దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరచుచు, లుబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని.

ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీకమాస వ్రతమును యథావిథిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధసంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మాయింటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకుని యింటినుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి, 'ఓరి నీచుడా! అన్యాక్రాంతముగా డబ్బుకూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామాగ్రిని దోచుకొంటివి గాన, నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక' యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణశాపమును తప్పించలేము గదా! కాన నాయపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందుల కాతడు దయదలచి 'ఓయీ! గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు. నీవందు నివసించుచూ యే బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాక' యని వెడలిపోయెను. ఆనాటినుండి నేనీ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్నూ నా కుటుంబము వారినీ రక్షింపు"డని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

ఒక రెండవ రాక్షసుడు - "ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించి వారికి తిండిపెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా యను నటులచేసి, వారి యెదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగను, నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసునివలె ప్రవర్తించితిని. కాన, నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాపపంకిలమునుండి ఉద్ధరింపుము" అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను.

మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియజేసెను. "మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైననూ చేయక, కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక, భక్తులు గొనంతెచ్చిన సంభారములను నా వుంపుడుగత్తెకు అందజేయుచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము యీ రూపమును ధరించితిని, కావున నన్ను కూడా పాపవిముక్తుని కావింపు" మని ప్రార్థించెను.

ఓ జనక మహారాజా! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపము లాలకించి 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలలో చేసిన ఘోరకృత్యంబులవల్ల మీకీరూపములు కలిగెను. నావెంట రండు. మీకు విముక్తిని కలిగింతును 'యని వారినోదార్చి తనతో గొనిపోయి ఆమువ్వురి యాతనావిముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారివారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకేగిరి. కార్తీకమాసములో గోదావరీ స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన, ఎంత ప్రయత్నించయినాసరే కార్తీకస్నానాలనాచరించాలి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి మూడవ యధ్యాయము
మాడవ రోజు పారాయణము సమాప్తము.


Friday, October 24, 2014

కార్తికమాస పుణ్య కాలంలో పవిత్ర కృష్ణానదీ స్నానం...అనంతరం అమ్మఅయ్యవార్ల దివ్య దర్శనం( శ్రీ దుర్గా మల్లేశ్వరదివ్య దర్శనం. విజయవాడ.)

  







కార్తిక స్నానం ఎలా చేయాలి?
కార్తిక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నప్పుడు ఒకమాట గుర్తు పెట్టుకోవాలి. కార్తీకమాసంలో నదీస్నానం చేయడమంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఎక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు. ఉదాహరణకు, కార్తిక మాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే ముందు దగ్గరగా ఉన్న నదీ స్నానం చేయాలి. ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది పక్కర ఉండే నదే! ఎప్పుడైనా ప్రవహించే నదిని గమనిస్తే అది రకరకాల శబ్దాలు చేస్తూ సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెళుతుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా వెళ్ళిపోయే నది నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది.
శాస్త్రాల ప్రకారం ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తుంది. ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరిచెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆడుకుంటూ ఉంటుంది. అందుకే కార్తిక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్లి ఉసిరిచెట్టు కింద కూర్చోవటం మంచిదంటారు. కార్తీకమాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృత ధారగా మారుస్తుంది. అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరుని నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్రకిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. చంద్ర కిరణాల వల్ల ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే శరీరానికి అనారోగ్యాలు కలుగకుండా కాపాడుతుందన్న మాట.
అంతేకాక, చంద్రస్పర్శ కలిగిన తరువాత మనసు సాత్వికమై, పరమేశ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. మనసంటే చంద్రుడే. మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్తీకమాసంలో నదీస్నానం ఉపయోగపడుతుంది. ఈ నదీ స్నానం చేయడానికి కూడా కొన్ని నిబంధనలున్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. "నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను. ఆ విషయం ఈశ్వరుడికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి?" అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే పాపనాశనం అవుతుందో పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు. అందుకే - "గంగా కావేరీయోః మధ్య దేశస్థే, గంగా గోదావరీయోః మధ్య దేశస్థే" అని సంకల్పం చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపలు నశిస్తాయి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా నిలబడి సంకల్పంతో నదీ స్నానం చేస్తే, అది తప్పకుండా రక్షిస్తుంది. అయితే స్నానం చేసి వెళ్ళిపోతే సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత పుణ్య కర్మాచరణ చేయాలి. అంటే దానమో, ధర్మమో ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాలి....బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి సౌజన్యం తో!


కార్తిక మాస మహాత్మ్యం...ద్వితీయాధ్యాయం - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి సౌజన్యం తో !

కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం

అథద్వితీయాధ్యాయ ప్రారంభః
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును.
కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు.  మిత్రశర్మ ఆమెయందు మిక్కిలి ప్రేమకలవాడై   ఆమెయందనురాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె ప్రియుడు  ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి  స్వేచ్చగా సంచరించుచుండెను, నీతి తప్పి చరించువారితో నీతి తప్పి ప్రవర్తించు చుండెను.  నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. ఈ విధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము. ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వితీయోsధ్యాయస్సమాప్తః

Wednesday, October 22, 2014

దీపావళి పై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మహాద్భుత ప్రవచన సుధా సారం...మీ కోసం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.



దీపావళి (అక్టోబర్ 23, 2014, గురువారం)

భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు!

భూదేవి- మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ -సత్యభామ గా జన్మిస్తారు . అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుడని తెలిసుకొన్న సత్యభామ ...తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి.

దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.

దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.

అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు.

స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం



1)  దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...

అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.





ఆశ్వయుజ కార్తీకములలో అత్యంత ప్రధానమైనది దీపము. దీపావళి అనగా దీపముల వరుస. దీపావళి అమావాస్యనాడు గంగ ఎక్కడున్నా మనం స్నానం చేస్తున్న నీటిలోనికి ఆవాహన అవుతుంది. 'తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్! అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే!! దీపావళి నాడు గంగ నీటిని, లక్ష్మి నూనెను ఆవహిస్తుంది. అందుకే నూనె రాసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే లక్ష్మీ స్పర్శవల్ల అలక్ష్మీ పోతుంది. గంగ స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆరోజు తప్పకుండా దీపముల వరుస వెలిగించి వాటి కాంతిలో అలక్ష్మిని తొలగగొడతారు. అంతరమందు జీవుని యొక్క ఉన్నతినీ, బాహ్యమునందు అలక్ష్మిని పోగొట్టుకొంటున్నాము అని చెప్పడానికి పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడిన వివిధరకములైన బాణా సంచా కాలుస్తాము. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసురవధ అని కాదు...'అలక్ష్మీ పరిహారార్ధం'. పితృదేవతలకు మార్గం చూపించడానికి ఇంట్లోకి వెళ్లి కాళ్ళూ చేతులూ కళ్ళూ కడుక్కొని ఆచమనం చేసి లక్ష్మీ పూజ చేస్తారు. తరువాత దీపముల వరుసలు పెడతారు. ఆకాలమందు అమ్మవారు ఉత్తరేణి చెట్టు వ్రేళ్ళయందు ప్రవేశిస్తుంది. ఈరోజు మట్టితో కూడుకున్న ఉత్తరేణి తీసుకొని స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమీదనుంచి నీళ్ళు పోసుకుంటూ ఆ ఉత్తరేణి చెట్టు యొక్క మట్టి మీద పడేట్లుగా తిప్పుకోవాలి.





ఆచార్య జె జె బి ప్రసాద్ గారి ధన్వంతరి, దీపావళి పై సమగ్ర వ్యాసరచన






Tuesday, October 21, 2014

టోరీ అంతర్జాతీయ ఆకాశవాణి ద్వారా 18/10/2014 వ తేదిన ప్రసారమైన 'తెలుగు తల్లి ప్రేమ' కార్యక్రమంలో దీపావళి మరియు కార్తీక మాస విశిష్టత ల గురించి మా మాతృమూర్తి శ్రీమతి విస్సా బుచ్చి మహాలక్ష్మి గారి శుభాభినందనా సందేశం ఈ లంకె పై నొక్కి వినగలరు.

టోరీ అంతర్జాతీయ ఆకాశవాణి ద్వారా 18/10/2014 వ తేదిన ప్రసారమైన 'తెలుగు తల్లి ప్రేమ' కార్యక్రమంలో  దీపావళి మరియు కార్తీక మాస విశిష్టత ల గురించి మా మాతృమూర్తి శ్రీమతి విస్సా బుచ్చి మహాలక్ష్మి గారి శుభాభినందనా సందేశం ఈ లంకె పై నొక్కి వినగలరు. 



http://www.teluguoneradio.com/archivesplayer.php?q=15067&host_id=61

Saturday, October 18, 2014

ఆచారము అంటే ఏమిటి?

ఆచారము అంటే ఏమిటి?
ఆచరణీయమైన దానిని ఆచారము అంటారు. బుద్దివంతులు, మేధావులు,పండితులు,ధరమవేత్తలు, కుల పెద్దలు, ఆగమకోవిదులు ఎందరెందరో ఆలోచించి, తర్కించి మనిషిని మహోన్నతుని చేయటానికి దురాచారం నుండి దూరం చేయడానికి ప్రవేశ పెట్టిన ఆలోచననే ఆచారం అనవచ్చు.చాలా ఆచారాలు కట్టుబాట్ల కోసమే సృష్టింపబడ్డాయి. కాల గమనంలో ఆచారాలు కొన్ని వికృతరూపం దాల్చాయి. ఆచారాల పేరుతో దురాచారాలు చోటు చేసుకున్నాయి. ఇది దురదృష్టం!! ఆచారాలు,ఆనవాయితీలు, సంప్రదాయాలు, కులధర్మాలు మొదలైనవన్నీ ద్వాపరయుగం నుండే ఎక్కువగా మనకు సంక్రమించాయి అంటారు కొందరు.
శ్రీరాముని కాలంలో ధర్మం వుంది. అచారాలింతగా లేవు. మనుష్యుల వృత్తినిబట్టి,ప్రవృత్తిని బట్టి వర్ణ విభజన జరుగుతూ వున్నత్రేతాయుగ సమయంలో హిందూ సమాజంలో నాలుగే కులాలు ఉండేవి.ఇప్పుడు వున్న ఇన్ని తెగలు అప్పుడు లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్న నాలుగు వర్ణాలు మాత్రమే ఉండేవి. ఒక్కొక్క వర్ణం వారికీ ఒక్కొక్క ఆచారం వుండేది.కాలక్రమంలో శూద్రవర్ణం వివిధ రకాల మార్పులకు, వివిధమైన విభాగాలకు, లోనైపోయింది.ఫలితంగా నూరారు తెగలుగా విడిపోయి ఎవరికి ఇష్టమైన ఆచారాలను వారు స్థిరపరచుకొన్నారు. ఒక్కొక్క తెగకు ఒక్కొక్క గురువు ( కులపెద్ద) వుండటంవల్లనే రకరకాల ఆచారాలను నెలకొల్పటం జరిగింది.గంనిచవలసిన విషయమేమిటంటే శూద్రవర్ణం ఒక్కటే వివిధ కులాలుగా విడిపోవటం జరిగింది. కారణం ఏమిటంటే ఆనాటి శూద్రులు విద్యా వంతులుకారు. సమిష్టి జీవనానికి వుండే బలం విలువ వారికివిద్యవతులు కాకపోవటం వలన వారికి తెలియదు.బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు ఎక్కువ తక్కువగా ఒకే రకమైన ఆచారాలు నియమాలు పాటించారు.అతిజన సంఖ్యాబలం వున్న శూద్ర వర్ణం వారందరూ వివిధ కులాలుగా మార్పు చెంది రకరకాల ఆచారాలను, సంప్రదాయాలను,కట్టడి చేసుకున్నారు.అయితే కొన్ని ఆచారాలు అన్ని వర్ణాలకూ ఒక్కటిగానే ఉండేవి. బాధాకరమైన విషయమేమిటంటే ఆచారాలన్నీ ఎక్కువగా స్త్రీలకే, స్త్రీలకోసమే ఉండేవి అని చెప్పక తప్పదు.
                                        సర్వేజనా సుఖినోభవంతు!!!!

Thursday, October 16, 2014

బిక్షకి కివచ్చేవారు కాదు.పెద్ద పెద్ద ముగ్గులు పక్కన పెడితే సాదారణంగా త్రికోణం గా పెట్టెడం వలన అది ఒక యంత్రంగా  ఉండి రక్షణ గా కాపాడుతుంది . ఉదయం, సాయంత్రం ముగ్గు పెట్టుకోవడం,బియం పిండి తో ముగ్గు పెటడం వలనపశు పక్షాదులకు  కూడా ఆహారం  అందుతుంది.ఫ్లాట్స్ వచ్చాక గోమయం తో అలకడం కుదరదు కాబట్టిఎలాంటి రంగవల్లులు పెట్టాలి ?తొక్కే చోట ఎప్పుడు కూడా దేవుడి బొమ్మల వేయకూడదు ,దీపం పెట్టే  చోట అష్ట దళ పద్మం , గోవు పాదుకలు ,శంకం , చక్రం పెట్టుకోవచ్చు. ప్రత్యేకమయినహోమం జరిగేటప్పుడు సర్వతో భద్రం అని పెట్టుకోవచ్చు.వాకిట్లో పెట్టుకునే ముగ్గులు - రధం , గీతాలు , కలసాలు ,పద్మాలు పెట్టుకోవచ్చు. దేవుడి దగ్గర పెట్టేముగ్గు వేరు గాను , వాకిట్లో పెట్టుకునే ముగ్గు, ఇంట్లోలోపల వేరుగానూ ఉండాలి.నలుపు , నీలమ్ రంగులు ముగ్గులో వాడకూడదు. దేవుడిదగ్గర మాత్రం పసుపు, కుంకుమ రంగులు వాడడం వలనలక్ష్మి ప్రదంగా ఉంటుంది.

పెద్దలమాట చద్దిమూట!!!


శుభ శుభోదయం


Wednesday, October 15, 2014

మంగళసూత్రంలో పగడం ఎందుకు?
మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు?
ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు
అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు,
స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు.
కుజగ్రహ కారకత్వము: అతికోపం,కలహాలు,మూర్ఖత్వం,సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని,
విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, ధీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు
శారీకంగా ఉదరము,రక్తస్రావము, గర్భస్రావము,ఋతుదోషములు మొ!! ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరు ఎంత
పాత్రపోషిస్తారో పరిశీలిద్దాము.
ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున
కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.
భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు
జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటో చూద్దామా!
ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం
స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది.
ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు(కుజుడు)తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ
భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను,
దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు.
కనుక చంద్రకుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూ
కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంతశుభపలితాలు సమకూర్చగలవు.
మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు
కుజుడేనన్న మాట మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు.
ప్రతి స్త్రీ జీవితంలో ఈ పై చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే
మాతృస్వరూపులైన స్త్రీలకోసం ఈ సూత్రాలు.అందుకొని అందరికీ పంచండి
శుభాలు పొందుటకు స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలను విధించారు మన పెద్దలు. భర్త అనురాగం పెరగటానికి సంతానభాగ్యానికి సిరిసంపదలు పొందటానికి వ్యాధులు రాకుండావుండటానికి ఈనియమాలు పాటించి చూడండి.
౧. మంగళ సూత్రం లో పిన్నీసులు వుంచరాదు అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి వుంచుతారు .మంగళ సూత్రం వేదమంత్రాల సహితంగా ప్రభావితము కాబడిన భర్త ఆయువు పట్టు.మంగళ సూత్రము రూపములో హృదయం వద్ద చేరివున్నది. ఇనుప వస్తువులు[పిన్నీసులు ,ఇనుముతో చేసినవి] దివ్యశక్తులను ఆకర్షించుకొను గుణముకలవి. కనుక అవి మంగళ సూత్రము లో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి .భర్తకు అనారోగ్యం ,భార్యాభర్తలపట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. కనుక వెంటనే ఈ అలవాటు వెంటనే సరి చేసుకోవాలి.
౨. స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలామంచిది. . ఈగాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక ,వీని శబ్దము శుభాలను ,అనురాగాలను పెంచుతుంది.
౩.ఇంట్లో గుర్రం బొమ్మలు వుంచుట అంత క్షేమము కాదని డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలామంది నమ్మకం .
౪.సంపదలను ,ఎక్కువగా ప్రదర్షించటం వలన నరఘోష ఏర్పడుతుంది .తద్వారా చెడు జరుగుతుంది. కనుక [అలంకారాదులు]సాధారణం గా వుండేలాచూసుకోవటం సాధారణ జీవిత విధానాన్ని పాటింఛటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు..
౫. పిల్లలు తమ మాటవినలేదనేవారు ఈ చిన్నచిట్కాలు పాటించి చూడండి. ఆడపిల్లలకైతే ఐదుపోగుల ఎర్రదారం కుడిభుజమునకు కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి . అలాగే మగపిల్లలైతే ఆకుపచ్చదారం తొమ్మిది పోగులు వేసి కుడిభుజానికి కట్టి గంధమునుదుట ధరించటం అలవాటు చేసి చూడండి పిల్లలు మీ మాటను శిరసావహిస్తారు.
౬.ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే ,వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పనుకునేదిండు క్రింద తులసి వేరు వుంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగాచూసుకుంటారు విరోధాలు తగ్గి.
౭. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరం గాను వుంటాయి.
౮. పని మనిషిరానప్పుడు విసుగుచెంది కోపంతో బాధపడేకంటె ,పనిమనిషికంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను,వాల్లకంటె నేనైతే శుభ్రంగా వుంచుకోగలనని[ నిజాన్ని] మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీపనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి అసలు పనిమనిషిని మానిపించాలనే అని పిస్తుంది మీకు.
౯.భర్త తాగి వచ్చి హింసపెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒకచిన్నస్పూన్ [అంటె సుమారు అరగ్రాము] కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటి లో కలిపి త్రాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే వాల్లకు తాగుడు పై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది ,నల్లవెంట్రుకలను కూడా తెల్లబరుస్తుంది .మొదట దీనిని త్రాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటూ చేయండి ఈ ఔషధాన్ని.తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
౧౦.సుఖసంతోషాలు కరువైనవారు పసుపురంగుపూలు ధరించండి ,క్రమేపీ స్థితి మెరుగవుతుంది.
౧౧.అప్పుల బాధ ఎక్కువగావుంటె తెలుపు పూలు ధరించటం వలన రుణబాధలు తగ్గుతాయి.
౧౨.ఆరోగ్యం సరిగాలేనివారు ,శరీరం నొప్పులు వున్నవారు మరువం ,మందారాలు కలిపి ధరించండి ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
౧౩. పెల్లిచూపులప్పుడు ఎరుపు పూలు ,పసుపు పూలు కలిపి మాలకట్టి దరించండి వివాహం విషయం లో కన్యలకు ఎంతో శుభకరం గా ఫలితాలొస్తాయి .
౧౪.మంచి తీర్ధం లో రెండు తులసి దలాలు వేస్తే అవి మానససరోవర జలాలంత పవిత్రమవుతాయి.
౧౯.కూర్చునే పీఠమునకు శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగావాడితే కుంకుమ బొట్లను పెట్టండి .
౨౦.భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి . మీకుడు చేతితో తాకి వెళ్లమనండి.భర్తలకు ఆరోజు సంపాదనా ,విజయము సంతోషము వెంటనుంటాయి .
ఆ……. ఇవన్నీ మూఢనమ్మకాలు .అలాజరుగుతుందా ..ఇలాఎందుకు జరుగుతుందనే సోమరిపోతువాదనలు చేయకండి. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి . వీటిని పాటించటానికి మీకు ఖర్చేమీ కాదుకదా ? కొంచెం శ్రద్ద .కావాలి అంతే . ఇందులో మీరు నష్టపోయే విషయాలేవీ లేవుకనుక నిరభ్యరంతరంగా పాటించవచ్చు. చెప్పటం మావంతు .ఆచరించిఫలితాలు పొందటం మీ ఇష్టం . ఏదన్నా మీకు మేలుజరిగిందనుకుంటే మాకు చెప్పండి సంతోషిస్తాము . ఇదేమీ కార్పోరేట్ కౌన్సిలింగ్ కాదుకనుక మీరేమీ చెల్లించాల్సొస్తుందన్నభయం అక్కరలేదు.

Total Pageviews