Thursday, October 9, 2014

అందరికీ "అట్లతద్ది" శుభాకాంక్షలు.

















అందరికీ "అట్లతద్ది" శుభాకాంక్షలు.   ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు, అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. దీనినే ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగ అనీ అంటారు.గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనుకే ఈ పండుగకు అట్లతద్ది అనే పేరు వచ్చింది.  త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరీ మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై వున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం.  ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. ఒక పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు. అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.   ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం వుంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. ఋతుచక్రం సరిగా వుండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ వుండవు. మినప పిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలిగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి.  ఈరోజున తెల్లవారు ఝామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి.చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీపూజ చేసి, ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తయిదువులకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనంగా సమర్పించాలి. ఈవిధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తర తరాల నుంచి వస్తున్న నమ్మకం.పది మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికెలగుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు పది అట్లు వాయనమిచ్చి, భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి, ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ,విష్ణు, పరమేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మి, పార్వతులకు ఇష్టమైన మాసం  ఈ ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం.   కథ పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. అంత ఆమె అన్నలు వచ్చి ఆమె అట్లు పడిపోవుటకు కారణమును తల్లివలన గ్రహించిరి. వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చేంతవరకు ఉండలేదని అనుకోని ఒక  చింతచెట్టుకొమ్మకు  అద్దమునుకట్టి, దాని ఎదుట అరికెకుప్పకు అగ్గిని పెట్టి, చెల్లెలిని లేపి  " అదుగో చంద్రుడు వచ్చెను భోజనము చేయమని " చెప్పిరి.అద్దంలో నిప్పును చూచి చంద్రుడే వచ్చెననుకొని ఆమె భోజనము చేసెను. కొంతకాలానికి ఆమెకి యుక్తవయస్సు రాగా  ఆమె అన్నలు పెండ్లి సంబంధములు చూస్తుండగా ఎన్ని సంబంధములు వెతికినా ముసలి వరుడే దొరకుటచే చివరకి వారు విసిగి, తమ  చెల్లిని  ముసలివాడికే ఇచ్చి పెండ్లి చేయ నిశ్చయించిరి.ఆ సంగతి తెలిసి ఆ రాచబిడ్డ  " అయ్యో అట్లతద్ది నోము నోచినవారికి పడచు మగడు దొరుకునని చెప్పిరి, కానీ నాకు ఈ ముసలి మొగుడెల దపురిమ్చుచున్నాడని " విచారించి అతడిని వివాహమాడుటకు అంగీకరించలేదు. అన్నలామెను ఎంతో బలవంతపెట్టి వివాహం చేయనెంచిరి . కానీ ఆమె అందులకు అంగీకరింపక ఒకనాటి రాత్రి అడవికి పోయి, ఒక మఱ్ఱిచెట్టు క్రింద తపస్సు చేయుచుండగా కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరు లామెనుచూచి " ఓ కన్యామణీ!  నీవేల తపస్సు చేయుచున్నావు?మేము  పార్వతీ పరమేశ్వరులము.  నీ కష్టమును మాతో చెప్పుము" అనిరి. అంతటా ఆమె వారికతిభక్తితో నమస్ఖరించి తన వివాహ విషయమును చెప్పెను.వారదివిని " అమ్మాయి  నీవు అట్లతద్దె నోము నోచి చంద్రదర్శనం కాకపూర్వమే భోజనము చేసి నోము ఉల్లంఘన చేసితివి  అందుకే నీకు ముసలి మొగుడి సంబంధం వచ్చుచున్నది. కావున నివు యింటికి పోయి నోము నోచుకొని దీపాలవేళ  వరకు ఉపవాస ముండి పిమ్మట భోజనము చేయమని " చెప్పి అంతర్ధాన మయ్యిరి. అంత ఆమె ఇంటికివెళ్ళి జరిగిన విషయమును తల్లితండ్రులకు చెప్పి, యధావిధిగా నోము నొచుకొనెను. తరువాత ఆమెకు చక్కని పడచు మగనితో పెండ్లి జరిగెను.    ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.   మణిసాయి - విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews