Monday, February 26, 2018

మానస సరోవరం

సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో 'బ్రహ్మసరం' అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం.

ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ పెన్నెండేళ్ళపాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గరదాపుల్లోని జలవనరులన్నీ ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీ నదిదాకా వెళ్లాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒకసరస్సు సృష్టించాడు. హంసరూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులోంచి ఒక బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, 'జంబు ద్వీపే, భరతవర్షే, భరతఖండే, అని సంక్పలం చెబుతూంటాం. ఈ జంబూ ద్వీపం అఖండ భారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు.

ఈ పేరు రావడానికి వెనుక కూడ ఓ కథ వుంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు 'జం' అనే శబ్దం వస్తుండేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జంబూద్వీపమనే పేరు రావడానికి కూడా కారణం మానస సరోవరమేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మతం ఓ కథను చెబుతూవుండడం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధ గ్రంథాలు మానస సరోవరాన్ని అనోత్తత అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులూ, కాయలు చాలారకాల వ్యాధులను నయంచేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వలు ఆ పువ్వులపై కూర్చునేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.

మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ ఏడు వరుసల్లొ చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షం ఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటుండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకుని బంగారంగా మారాయని చెబుతూంటారు.

ఈ మానస సరోవరం శక్తిపీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉదంతాన్ని విన్న పరమశివుడు అగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, అ తల్లి కళేబరాన్నిభుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరగసాగాడు. ఫలితంగా లోకాలన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు ముక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

మానస సరోవరాన్ని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారనీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవరతీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు 'ఓం' ఆకారంలో ఉంటుండటం విశేషం.

ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14, 900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.

చాలామంది మానస సరోవర పరిక్రమను చేయడానికి ఉత్సుకతను చూపిస్తుంటారు. మానస సరోవర తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాలు మీదుగా పరిక్రమనం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజులు సమయం కూడా తీసుకుంటుంది. ప్రదక్షిణా మార్గం దుర్గమంగా ఉంటుంది. మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్ని ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడతంతో వాహనాల ద్వారానే పరిక్ర్తమ చేస్తున్నారు.

ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక తప్పదుగా. మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్‌ చైనా అధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీయాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటోంది. శ్రమ కూడా అధికం.

ఈ యాత్రకు సంబంధించి భారతప్రభుత్వం ప్రచార సాధానాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచుకున్నవారు 'అండర్‌ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖవారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చినవాళ్లకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్‌ రాజధాని ఖాట్మంటు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రీకులు చెబుతున్న విషయాలు. శ్రమదమాదులను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానససరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.

హనుమంతుడి సందేశం

🙏ఆంజనేయo మహావీరo బ్రహ్మ విష్ణు శివాత్మికాo 🙏🍃
🙏బాలార్క సద్రుషాభావాo రామదూతo నమామ్యహo 🙏
  🍃🌷హనుమంతుడి సందేశం🌷🍃 ......
🍃హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. 🍃
🍃సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే🍃

🍃హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. 🍃

🍃సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. 🍃
🍃కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.🍃

🍃‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. 🍃
🍃మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.🍃

🍃‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు.
 మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. 🍃

🍃మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!🍃

🍃ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు.🍃
 🍃ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. 🍃
🍃ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాo .🍃
 🌷🙏🍃జై శ్రీ రామ భక్త హనుమాన్ కి జై 🍃🙏🌷

చద్దన్నం ప్రయోజనాలు...

చద్దన్నం అంటే ఎక్కువ మందికి చిన్నచూపు. చద్దన్నం అంటే ఆ ఏం తింటాములే అన్నట్లుంటుంది. రాత్రి పూట మిగిలిపోతే పొద్దున్నే తినేదే చద్దన్నం అన్న సాధారణ అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నం తినాలని చెపుతోంది. ఎందుకో చూడండి..

చద్దన్నం ప్రయోజనాలు...
* అన్నం పులిస్తే ఐరన్, పొటాషియ్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది.
* ఉదా.. రాత్రి 100 గ్రాముల అన్నంలో 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే తెల్లారేసరికి 73.91 మిల్లీ గ్రాములు పెరుగుతుందట.. బీ6, బీ12 విటమిన్లు కూడా బాగా లభిస్తాయి.
* శరీరాన్ని తేలికగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.
* శరీరానికి అవసరయ్యే బాక్టీరియా బాగా పెరుగుతుంది.
* అధిక వేడితో కడుపులో ఉండే దుష్పలితాలు తగ్గుతాయి.
* పీచు అధికంగా ఉండి మల బద్దకం, నీరసం తగ్గుతాయి.
* బిపి అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది.
* దేహాన్ని త్వరగా అలసిపోనివ్వదు. ఎక్కువ సమయం తాజాగా ఉంచుతుంది.
* అలర్జీ కారకాలను, మలినాలను తొలగిస్తుంది.
* పేగుల్లో అల్సర్లను తగ్గిస్తుంది.

చద్దన్నం ఇలా చేసుకోవచ్చు..
* రాత్రి వండిన అన్నాన్ని తెల్లవార్లూ మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
* రాత్రి వండిన అన్నాన్ని ఒక చిన్న గినె్నలో తీసుకుని అది మునిగేవరకూ పాలుపోసి నాలుగు మజ్జిగ చుక్కల వేస్తేతెల్లవారేసరికి ఆ అన్నం మొత్తం తోడుకుని పెరుగులాగా అవుతుంది.
* ఈ తోడన్నం లేదా పెరుగన్నానికి తాలింపు పెట్టుకోవటం. ఉల్లిముక్కలకు, టమాటో, క్యారెట్ లాంటివి కలుపుకోవటం చేయవచ్చు.
* ధనియాలూ, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని ఒకటి లేక రెండు చెంచాల పొడిని తీసుకొని తోడన్నం లేదా చల్లన్నం నంజుకొని తింటే దోషాలు లేకుండా ఉంటాయి.
* ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహారం. బక్కచిక్కిపోతున్న వారు తోడన్నాన్ని, స్థూలకాయులు చల్లలో నానిన అన్నాన్ని తినడం మంచిది.
* ఉదయాన్నే తినాలి. ఆలస్యం అయితే మరింత పులిసి కొత్త సమస్యలు వస్తాయి..

ధర్మో రక్షతి రక్షితః

ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది.ఆయన ఆశ్చర్యపోయాడు .అప్పుడు భార్య చెప్పింది.
"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో  తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."

ఇంటి యజమానిపరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.

ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది.అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు.బంగారు ముద్దలు పొందారు.ఒక్క అర్క సోమయాజి తప్ప.

"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు" అన్నాడాయన.

 ఊరు ఊరంతా ధనవంతులయ్యారు.ఒక్క అర్క సోమయాజి తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు.
"మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు.
చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది.
ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.

ఊరి పొలిమేర దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి.బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది.ఇళ్లు కాలిపోతున్నై.మనుషులు చచ్చిపోతున్నారు.మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది.ఒక్కరూ మిగల్లేదు.
అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.

అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.

"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి,  ధర్మ హీనులను ధ్వంసంచేశాను."అన్నాడు కలిపురుషుడు.

...ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే...

II ధర్మో రక్షతి రక్షితః II

పెద్దలమాట

బిచ్చగాడు అడుక్కనేటప్పుడు 'దానం చెయ్యండి' అని కాక "ధర్మం చెయ్యండి" అని ఎందుకు అడుగుతాడు?
పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే: సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చెయ్యాలి. మొదటి రెండు భాగాలు స్వంతానికి. మూడోభాగం పన్నులు, తదితరాలు. నాలుగో భాగం ఊరుమ్మడి ఖర్చులు (కళాకారులు, పురోహితులు, పనిచేయలేనివారు, పేదలు, సన్యాసులు ఇలాంటి వారికి) ఇవ్వాలి. వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని ధర్మం పాటించడం అంటారు. అందుకే బిచ్చగాళ్లు మన ధర్మం పాటించాలని మనల్ని అడుగుతారు. దానమంటే ఇదికాక నీస్వంత భాగంలో ఇవ్వడం.

దానగుణం
ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు. "నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్ళ మాత్రం తియ్యగా
వుంటాయి. నీవు ఎంతో విశాలంగా ఉంటావు కానీ నీ నీళ్ళ మాత్రం చాలా ఉప్పగా వుంటాయి. దానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.
అప్పుడు సముద్రం ఇలా అంది. "నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తియ్యగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానేగాని, ఎవరికీ ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పగా వుంటుంది" అంది. అందుకే “ఆ చేత్తో తీసుకోని, ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు" అని మన పెద్దలంటారు

మేరా భారత్‌ మహాన్‌

జర్మన్‌ భాషావేత్త మాక్స్‌ముల్లర్‌ను అక్కడి విలేకరులు అడిగారు...
‘పునర్జన్మ ఎలా ఉండాలని ప్రభువును కోరుకుంటారు’ అని...
‘భారత దేశంలో పుట్టించమని అడుగుతాను’... ఠక్కున సమాధానం చెప్పారాయన...

*ప్రఖ్యాత షెహనాయ్‌ విద్వాంసులు, రససిద్ధులు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ను అమెరికాలో స్థిరపడమని, కోరినవన్నీ ఇస్తామని ఒత్తిడి చేశారు అక్కడి ప్రముఖులు ‘అమెరికాకు నాతోపాటు గంగామాయీ ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించారాయన.

* ఈ ప్రపంచాన్ని రైలుబండితో పోలుస్తూ సత్యసాయిబాబా ‘భారతదేశం దానికి ఇంజిను’ అన్నారు. అప్పుడు విదేశీ పాత్రికేయులు ఆయనను అడిగారు ‘దేవతలందరూ మీ దేశంలోనే ఎందుకు పుడతారు?’ అని దానికి బాబా బదులిస్తూ ‘డ్రైవర్‌ ఇంజిన్‌లో కాకపోతే బోగీల్లో ఎక్కుతారా?’ అని ప్రశ్నించారు.

*  స్వామి వివేకానంద చికాగో ప్రసంగాలను సమీక్షిస్తూ

‘‘భారతీయమైన ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి ఆయనలో ఉప్పొంగాయి. ఆ దేశపు ప్రత్యేకత విశ్వానికి వెల్లడయింది’

అని ఒక పత్రిక రాసింది. మహాత్ములు, కారణజన్ములు సైతం ఈ దేశాన్ని అదే విధంగా దర్శించారు. తరించారు!

మేరా భారత్‌ మహాన్‌

‘నాదేశం భగవద్గీత.. నా దేశం అగ్ని పునీత సీత... నా దేశం కరుణాంతరంగ. నా దేశం సంస్కార గంగ’
- డా.సి. నారాయణరెడ్డి

అత్యున్నత ఆశయాలు, ఉదాత్త లక్ష్యాలు, ఉత్తమ భావాలు కలిగిన ఓ వ్యక్తి కోరుకునేవన్నీ భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. ఇది నా దేశం కాబట్టి నేను ప్రేమించడం లేదు. విశిష్ఠ లక్షణాలను ఇక్కడ గమనించాను కాబట్టి ప్రేమిస్తున్నాను

వస్తువులను ఉపయోగించుకోవాలి! బంధాలను ప్రేమించాలి!!

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.

ఆమె పిల్లలు పడుకున్నారు!

భర్త  కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.

చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా  ఏడుస్తూ ఉంది.

ఆ ఏడుపు, వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!

"ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.

 "నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.

"అయితే...?"

"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"

భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"

హెడ్డింగ్ ఇలా పెట్టాడు

"నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక."

అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు!
వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!

నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!

అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా  స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు!
కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...
నేను ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!
వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!

వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు!
అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!

అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు!

అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
పడున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!

కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!!

 భార్య చదువుతుంటే... విన్న భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...
"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.

"మన కొడుకు" అంది భార్య  కన్నీరు కారుతుండగా!

వస్తువులను ఉపయోగించుకోవాలి!
బంధాలను ప్రేమించాలి!!

అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!

Total Pageviews