Sunday, September 29, 2019

కథా మంజరి: కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే ....

కథా మంజరి: కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే ....: చెప్పఁదగుఁగవిత రసముల్ జిప్పిల, నప్పప్ప ! భళి భళీయన. లేదా యెప్పుడుఁజేయక యుండుటకవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే కదా. మన కవులు రస బంధురమయి...

Thursday, September 19, 2019

సంస్కృతం యొక్క గొప్పదనం తెలిపే పద్యం

తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః||೧||

శ్రీఃయాదవం భవ్యభతోయ దేవం
సంహారదాముక్తిముతాసుభూతం ||೨||

మొదటి శ్లోకం శ్రీ రాముని స్తుతి.
రెండవ శ్లోకం శ్రీ కృష్ణుని స్తుతి.

అద్భుతం ఏమిటంటే ......

మొదటి శ్లోకాన్ని తిరగేసి చదివితే రెండవ శ్లోకం వస్తుంది.

రెండో శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది.
👌🙏👏

కనకధారా స్తోత్రం - అర్థం

కనకధారస్తోత్రం అర్థం తెలుసుకుని చదివితే ఇంకా ఆనందంగా ఉంటుంది

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి .

కనకధారా స్తోత్రం :

శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥2

 తాత్పర్యము : ఆఁడు తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క ఓరచూపు నీలమేఘశ్యాముఁడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక !

శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే:
ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని ।
మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥3
తాత్పర్యము : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక !

శ్లో॥ విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షమ్
ఆనంద కంద మనిమేష మనంగ తంత్రమ్ ।
ఆకేకర స్థిర కనీనిక పద్మనేత్రమ్
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా: ॥4
తాత్పర్యము : తనను భజించువారికి దేవేంద్ర పదవిని సైతమివ్వజాలినవియు, మానవుఁ డనుభవింపఁగోరు ఎల్ల ఆనందములకును మూలమైనవియు, (దేవత యగుటచే) ఱెప్పపాటు లేనివియు, భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మథ బాధను కలిగింపఁగలవియు, అర్ధ నిమీలితము (మాఁగన్ను) గా చూచునవియు నైన శ్రీ మహాలక్ష్మీ మాత యొక్క నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించు గాక !

శ్లో॥ కాలాంబుదాళి లలితోరసి కైటభారేర్
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
మాతస్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: ॥5
తాత్పర్యము : మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క (వెంట్రుకలతో వల్లనై) నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !

వివరణము :- భార్యానురాగాతిశయముచే భగవాన్ శ్రీ మహావిష్ణువు ఆమెను తన వక్ష:స్థలమునందు దాఁచుకొన్నారని పురాణ వచనము.

శ్లో॥ బాహ్యాంతరే మురజిత: శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి ।
కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయా: ॥6
తాత్పర్యము : శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !

శ్లో॥ ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్
మాంగల్య భాజి మధుమర్దిని మన్మథేన ।
మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్
మందాలసం చ మకరాలయ కన్యకాయా: ॥7
తాత్పర్యము : దేని ప్రభావముచేత మన్మథుఁడు సమస్త కల్యాణ గుణాభిరాముఁడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా) మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !

శ్లో॥ నుద్యాద్ దయానుపవనో ద్రవిణాంబుధారామ్
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే ।
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: ॥8
తాత్పర్యము : లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు, ఈ దరిద్రుఁడనెడి విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతముగా, దూరముగా తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !

విశేషార్థము : రెండవ పాదమునందలి "అకించన" శబ్దమునకు 'దరిద్రుఁ' డనియు, 'పాపములు లేనివాఁ'డనియు రెండర్థములు.

శ్లో॥ ఇష్టా విశిష్ట మతయో౭పి నరా యయా౭౭ర్ద్ర
దృష్టాస్ త్రివిష్టప పదం సులభం భజంతే ।
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: ॥9
తాత్పర్యము : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు) తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను పొనరించు గాక !

శ్లో॥ గీర్ దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి ।
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితా యా
తస్యై నమస్ త్రిభువనైక గురోస్ తరుణ్యై ॥10
తాత్పర్యము : విష్ణుమూర్తికి భార్యయైన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్నియైన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగియైన అపరాజితగా, శాకంభరీదేవిగా - ఇట్లనేక రూపములతో ఏ విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్నదో, ఆ విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమోన్నమహ.

శ్లో॥ శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై ।
శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై ॥ 11
తాత్పర్యము : శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలముల నొసంగు వేదమాతృ స్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు ప్రణామము. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టిస్వరూపురాలగు ఇందిరాదేవికి దండములు.

శ్లో॥ నమో౭స్తు నాళీక నిభాననాయై
నమో౭స్తు దుగ్ధోదధి జన్మభూమ్యై ।
నమో౭స్తు సోమామృత సోదరాయై
నమో౭స్తు నారాయణ వల్లభాయై ॥12
తాత్పర్యము : పద్మము వంటి ముఖము గలిగిన మంగళదేవతకు నమస్కారము. పాల కడలిని తన జన్మస్థానముగా గల శ్రీ పద్మాలయా దేవికి వందనము. అమృతమునకును, దానితో పాటుగా ఉద్భవించిన చంద్రునికిని తోబుట్టువైన మాదేవికి ప్రణామము. భగవాన్ విష్ణుమూర్తికి ప్రేమాస్పదురాలైన లోకమాతకు దండములు.

శ్లో॥ నమో౭స్తు హేమాంబుజ పీఠికాయై
నమో౭స్తు భూమండల నాయికాయై ।
నమో౭స్తు దేవాది దయాపరాయై
నమో౭స్తు శార్ఙ్గాయుధ వల్లభాయై ॥13
తాత్పర్యము : బంగారు పద్మమునే తన పీఠముగా అధివసించి యున్న శ్రీమన్మహాలక్ష్మీ భగవతికి నమస్కారము. సమస్త భూమండలమునకున్ను ప్రభుత్వము వహించి యున్న శ్రీ భార్గవీమాతకు వందనము. దేవ, దానవ, మనుష్యాదులందఱి పట్లను దయఁ జూపఁజాలిన ఆ మహాశక్తి సంపన్నురాలికి ప్రణామము. శార్ఞ్గమను ధనుస్సును ధరించిన భగవాన్ విష్ణుమూర్తికి మిక్కిలి కూర్చునదైన శ్రీ కమలాదేవికి దండములు.

శ్లో॥ నమో౭స్తు దేవ్యై భృగు నందనాయై
నమో౭స్తు విష్ణో రురసి స్థితాయై ।
నమో౭స్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమో౭స్తు దామోదర వల్లభాయై ॥14
తాత్పర్యము : బ్రహ్మ యొక్క మానస పుత్త్రులలో ఒక్కడైన భృగువను ఋషి యొక్క వంశమునం దుద్భవించినదియు, లోకోత్తరమైన భర్తృ వాల్లభ్యమును చూఱగొన్న మహిమాతిశయముచే తన భర్తయైన భగవాన్ విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు శ్రీ ముకుందప్రియాదేవికి నమస్కారము.

శ్లో॥ నమో౭స్తు కాంత్యై కమలేక్షణాయై
నమో౭స్తు భూత్యై భువన ప్రసూత్యై ।
నమో౭స్తు దేవాదిభి రర్చితాయై
నమో౭స్తు నందాత్మజ వల్లభాయై ॥15
తాత్పర్యము : కమలముల వంటి కన్నులు గల కాంతిస్వరూపురాలికి నమస్కారము. ప్రపంచములను గన్న తల్లియగు అష్టసిద్ధి స్వరూపురాలికి వందనము. దేవ, దానవ, మనుష్యాదులచే పూజింపఁబడు లోకైక శరణ్యురాలికి ప్రణామము. నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని చెలికత్తె యగు శ్రీదేవికి దండములు.

విశేషార్థము : ఇచ్చట "కమలముల వంటి కన్ను" లనఁగా 'కమలముల వలె అందమైన కన్ను' లని లోకానబోధము. పూర్వవ్యాఖ్యాతలందఱును అట్లే వ్యాఖ్యానించి యున్నారు. కాని, దీని నిజమైన అర్థము వేఱు. దేవతల కన్నులు మనుష్యుల కన్నుల వలె తెల్లగా కాక కమలముల వలె ఎఱ్ఱగా నుండును.

శ్లో॥ సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి ।
త్వద్ వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే ॥16
తాత్పర్యము : దేవతలందఱిలోను మాన్యురాలవైన ఓ మహాలక్ష్మీ ! మేము నీకుఁ జేయు వందనములు మాకు సంపదలను గలిగించునవి. మా యొక్క సమస్త ఇంద్రియములను సుఖపెట్టునవి. అవి రాజాధిరాజత్వమును సైతము ప్రసాదింపఁ జాలినవి. పాపములను పోకార్చుటకు సదా సన్నద్ధమైనట్టివి. అవి నన్నెల్లప్పుడును (పసిబిడ్డను వలె) పట్టుకొని యుండు గాక !

శ్లో॥ యత్కటాక్ష సముపాసనా విధి:
సేవకస్య సకలార్థ సంపద: ।
సంతనోతి వచనాంగ మానసైస్
త్వామ్ మురారి హృదయేశ్వరీమ్ భజే ॥17
తాత్పర్యము : హే మహాలక్ష్మీ ! ఎవరి కటాక్షమును గోరుచు మనసా, వాచా, కర్మణా ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడునో, అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను.

శ్లో॥ సరసిజ నయనే సరోజ హస్తే
ధవళ తరాంశుక గంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥18
తాత్పర్యము : అందమైనదానా ! కమలములవంటి కన్నులును, చేతులును గలదానా ! మిక్కిలి తెల్లనైన దువ్వలువల తోడను, గంధపు పూత తోడను, పూల దండల తోడను ప్రకాశించుదానా ! విష్ణుమూర్తికి ప్రేయసివైనదానా ! ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానా ! హే భగవతీ ! శ్రీ మహాలక్ష్మీ ! నాయందు సంప్రీతురాలవు కమ్ము !

శ్లో॥ దిగ్ దంతిభి: కనక కుంభ ముఖావసృష్ట
స్వర్ వాహినీ విమల చారు జలప్లుతాంగీమ్ ।
ప్రాతర్ నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధి పుత్రీమ్ ॥19
తాత్పర్యము : అభ్రము, కపిలా, పింగళాదులైన దిగ్గజముల భార్యలు (ఆఁడేనుఁగులు) బంగారు కలశముల యందు పవిత్రమైన ఆకాశగంగ నుండి పట్టి తేరఁగా, ఆ పరిశుద్ధమగు జలములతో అనునిత్యమున్ను స్నానము చేయు జగజ్జననియు, లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణుని యిల్లాలును, పాల కడలి యొక్క కూఁతురును అగు శ్రీశ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రొద్దుననే లేచి భక్తితో స్మరించెదను.

శ్లో॥ కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణా పూర తరంగితై రపాంగైర్ ।
అవలోకయ మా మకించినానామ్
ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయా: ॥
20
తాత్పర్యము : అమ్మా ! కమలాదేవీ ! దరిద్రులలోకెల్ల దరిద్రుడను నేనే. అందుచేత నీ కృపకు అందఱి కంటె ముందు పాత్రుడనైనవాఁడను నేనే. నా మాటలలో నటన (కృత్రిమత్వము) లేదు. కనుక నీ కరుణాపూరిత కటాక్షముల (ఓరచూపుల) తో నన్నొకమారు చూడుము తల్లీ ! దేవీ ! ముకుందప్రియా !

శ్లో॥ బిల్వాటవీ మధ్య లసత్ సరోజే
సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్ ।
అష్టాపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణ వర్ణామ్ ప్రణమామి లక్ష్మీమ్ ॥
21
తాత్పర్యము : మారేడు చెట్ల తోఁట మధ్యలో వేయి దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించునదియు, బంగారు కమలములను తన చేతినుండి జారవిడచుచున్నదియు నైన శ్రీ మహాలక్ష్మీ భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను.
వివరణము :
౧."అష్టాపదమ్" అనఁగా బంగారము.
౨. "సంవిష్ట" అనఁగా 'నిదురించినది' అని అర్థము. కానీ ఆ అర్థమిచ్చట పొసఁగదు. "నివిష్ట" ప్రయోగమును బట్టి 'ఇమిడినది' అని చెప్పికొనవలసి యుండును.

శ్లో॥ కమలాసన పాణినా లలాటే
లిఖితామక్షర పంక్తి మస్య జంతో: ।
పరిమార్జయ మాతరంఘ్రిణా తే
ధనిక ద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్ ॥22
తాత్పర్యము : ధనికుల యిళ్ళ ముంగిట పడికాపులు కాచుమని ఆ బ్రహ్మదేవుఁడు ఈ హీనజీవి యొక్క నుదుట వ్రాసిన వ్రాతను దయచేసి నీ కాలితో తుడిచి వేయుమమ్మా ! తల్లీ ! శ్రీ మహాలక్ష్మీ !

విశేషార్థము : శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క ఎడమకాలి తన్నులు కూడా ఎవరికిని అంత సులభముగా లభింపవని భావము.

శ్లో॥ అంభోరుహం జన్మగృహం భవత్యా:
వక్ష:స్థలం భర్తృ గృహం మురారే: ।
కారుణ్యత: కల్పయ పద్మవాసే
లీలాగృహమ్ మే హృదయారవిందమ్ ॥23
తాత్పర్యము : హే పద్మాలయా దేవీ ! నీ పుట్టినిల్లు కమలము. మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలమే. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసమేర్పఱచుకొని దానిని నీ కేళీగృహముగాఁ జేసికొనుము.

విశేషార్థము : ఇచ్చట ఆదిశంకరులు కేవలము "నా యింటికి వచ్చి యుండు"మనుట లేదు. "నా హృదయమునందే నిలుకడగా ఉండు"మనుచున్నారు. ఇంటికి భౌతికముగా వచ్చిన లక్ష్మి సహజ చాంచల్యముచే ఎప్పుడైనను వెడలిపోవచ్చును. కాని హృదయమునందు నిలిపికొన్న లక్ష్మి మట్టుకు భక్త పరాధీనురాలు గనుక తన చాంచల్యమును వీడి భక్తునితో ఉండిపోవునని భావము.

లక్ష్మీదేవిని సంపదల కొఱకు ఉపాసించుటొక్కటే చాలదు, సంపదలు సిద్ధించిన పిమ్మట కూడ ఆమె చేసిన మేలు మఱువక ఆమెను తరతరములుగా అర్చించినప్పుడే ఆ సంపదలు కలకాలము నిలబడునని తాత్పర్యము.

శ్లో॥ స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్ ।
గుణాధికా గురుతర భాగ్య భాజినో
భవంతి తే బుధ భావితాశయా: ॥24
తాత్పర్యము : ఎవరైతే ఈ స్తుతిపూర్వములైన శ్లోకములతో వేదమాతయు, జగజ్జననియు అయిన శ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రతి దినమున్ను స్తోత్రము సేయుదురో, వారు తమ సద్గుణములచేత ఇతరుల కంటె అధికులై, విద్వాంసుల చేత గౌరవింపఁబడుచు మిక్కిలి విస్తారములైన సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు.

విశేషార్థము : విద్వాంసుల చేత గౌరవింపబడుటయే లౌకిక జీవన పరమార్థము. అది విజ్ఞాన సముపార్జనము వలననే సిద్ధించును. అనఁగా ధనమునకు సహితము విజ్ఞాన సముపార్జనమే ధ్యేయము.

ఫలశ్రుతి:

శ్లో॥ కనకధారా స్తవం యత్ శంకరాచార్య నిర్మితమ్ ।
త్రిసంధ్యం య: పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్ ॥25
తాత్పర్యము : జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు కూర్చిన ఈ కనకధారా స్తవమును దినమునకు మూఁడుసారులు - అనఁగా ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలలో - పారాయణము చేసినవారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు.

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి .

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం..మేము ఇది వరకు పోస్ట్ చేసిన పోస్టులను కూడా గమనించ ప్రార్ధన.

" సంభవామి యుగే యుగే " ఫేసుబుక్ పేజీ ద్వారా పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్ లు కూడా చూడండి మీకు కొన్నైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని మా ఆశ

మీరు చూసి తరించండి

అందరం " ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం

ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే

తథాస్థు దేవతలు అంటే ఎవరు

💐తథాస్థు దేవతలు అంటే ఎవరు💐

వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు.  సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి  మూలంగా వీరు జన్మించారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు.. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది

ఉత్తరానికోఉత్తరం

#ఉత్తరానికోఉత్తరం

పూజ్యనీయులైన ఉత్తరం గారి పాదపద్మాలకు నమస్కారం 🙏
ఉభకుశలోపరి.. !
సెల్ టవర్ల దెబ్బకి పిచ్చుకలు మాయమైపోయినట్టు, సెల్ ఫోన్ల దెబ్బకు తమరు ఎటు వెళ్లిపోయారో జాడ తెలియక అల్లాడుతున్నాం..
మీరున్నప్పుడే బాగుంది ఇక్కడ.. రాసేటప్పుడు చేతికి అబద్ధాలు వచ్చేవి కాదు.. ఇప్పుడన్నీ ఫోన్లో మాటలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు ఆడేస్తున్నాం.. 'ఎక్కడున్నావ్' అంటే అమీర్ పేటలో ఉన్నా 'అంబర్ పేటలో ఉన్నా' అని సిగ్గులేకుండా బొంకేస్తున్నాం.. ఈ నెట్ వర్క్లు మనుషుల్ని దగ్గర చేస్తాయంటే నమ్మి మిమ్మల్ని వదిలేసుకున్నాం.. కానీ ఇప్పుడు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా, మెడలు వంచి ఫోన్లో తప్ప ముఖాముఖి మనసిప్పి మాట్లాడుకోవడం దాదాపు మానేసామ్..

ఉత్తరం రాస్తున్నప్పుడు హృదయావిష్కరణ జరిగేది.. ఫోన్ మాటల్లో ఆచితూచి అడ్డంగా అబద్ధాలాడేస్తున్నాం, లోపలొకటి పెట్టుకుని బయటకు ఇంకో మాట చెప్తున్నాం.. బొత్తిగా పాడైపోయాం.. ఒళ్ళంతా కుళ్ళుపోయి జబ్బుచేసున్నాం.. ఒక్కసారి మళ్ళీ మీ హవాతో మాకు ట్రీట్మెంట్ మొదలెట్టండి ఉత్తరం గారూ.. పుణ్యముంటుంది..🙏

పోనీ పెరిగిన సో కాల్డ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే అవకాశం ఉంది కదా, అందులోనే మనస్ఫూర్తిగా ఒక ఉత్తరం లాంటి సందేశాలు పంపుకుందాం అనుకుంటే, అది కూడా ఇష్టానుసారంగా వాడేస్తున్నాం.. ఎవరో పంపిన మెసేజెస్ అటూఇటూ పంపేసి, అదేదో మా మేధావితనం అన్నట్టు గొప్పయిపోవడం,పిచ్చి
పిచ్చి ఇమేజ్లు,పనికి మాలిన వీడియోలు షేర్ చేసుకుంటూ 'కిక్కిక్కిక్కికిక్కి' అని నవ్వుకుంటూ పెద్ద మేధావుల్లా మెదళ్లను సానపట్టుకోవడం తప్ప ఏదీ ఎందుకూ పనికిరావట్లేదు..
మళ్ళోకసారి రండి ఉత్తరం గారూ ప్లీజ్ 🙏

మీరు లేకపోవడం వల్ల..
ప్రేయసి మళ్ళీ మళ్ళీ చదువుకునే ముత్యాల పొగడ్తల ప్రేమలేఖ పత్తాలేకుండా పోయింది..
బామ్మ-తాతయ్యల ముసలి ప్రాణాలకు ఓదార్పునిచ్చే కుశల సమాచారం కరువైపోయింది..
భార్యాభర్తల వియోగం, విరహాల్లో ఉండే మాధుర్యం మాయమైపోయింది..
బిడ్డల క్షేమం అక్షరాల్లో చూసుకుని ఆప్యాయంగా చెమర్చే తల్లితండ్రుల కన్నీటి తడి ఆవిరైపోయింది..
ఉత్తరం కోసం వీధివాకిలి వైపు ఎదురుచూసి, రాగానే గబగబా చదివేసి, గుండెలు నింపుకుని, తిరిగి జాబు రాయడంలో ఉన్న ఆత్మ సంతృప్తి అడుగంటిపోయింది..

"అమ్మా.. అన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందే అని చెంగున గెంతి చెప్పే చెల్లాయిలకి కరువొచ్చింది..
"ఏమేవ్.. అల్లుడు ఉత్తరం రాసాడు..అమ్మాయి నెల తప్పిందట" అని మురిసిపోయే కన్నవాళ్లు కనిపించడం లేదు..
ఇలాంటి ఎన్నో ఎన్నో భావాల బంధాలు మృగ్యమైపోయాయి..

'గుండె గొంతులో కొట్లాడటం'
'మనసు ఆర్తితో ద్రవించడం'
'అక్షరాలు ఆనందంతో స్రవించడం'
మానేసాయి..
మాటలు పెదాలనుండి తప్ప గుండెల్లో నుండి రావడం ఆగిపోయాయి..

మొత్తంగా మాటల్లో అక్షరాలున్నాయి కానీ, వాటికి ఎమోషన్ లేకుండా పోయింది.. చాలా కృతకంగా, అసహజంగా ఉన్నాయిప్పుడు మానవ సంబంధాలు.. అందుకే ఉత్తరం గారూ.. మళ్ళీ రండి.. 🙏

సాంకేతిక పరిజ్ఞానం ఎంతైనా పెరగడం అభివృద్ధి కావచ్చు.. దానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ మాయమైపోతున్న మానవ సంబంధాలు తిరిగి రావాలనే ఆకాంక్ష నాది..

ఈ ఉత్తరం కూడా నేను టైప్ చెయ్యడం వల్ల యధావిధిగా మనసులో ఉన్నదంతా చెప్పలేక, ఇంకా ఏదో ఆవేదన మిగిలిపోయి బాధపడుతున్నాను..

ఇట్లు..
సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఉత్తరాల ఉనికి కోరుకునే చాదస్తపు మనిషి..😔

దేవాలయంలో గడప వలసిన విధానం

"నేను మళ్ళీ ఆలయానికి  రాను"

ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రి తో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అంది.  "నేను ఇకపై ఆలయానికి రాను"

తండ్రి ఇలా అడిగాడు: "ఎందుకో నేను తెలుసుకోవచ్చా?"

ఆమె ఇలా అన్నది: " భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము, కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ  మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడు మాటలు వినిపిస్తున్నాయి , వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె

తండ్రి నిశ్శబ్దంగా విన్నాడు, ఆపై ఇలా అన్నాడు: "సరే ... నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నాకోసం చిన్న పని చేయగలవా?" అన్నాడు  తండ్రి

ఆమె అన్నది: "చెప్పండి .. నాన్నగారు, ఏమిటది?"

తండ్రి ఇలా చెప్పాడు: "దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ 2 సార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి వచ్చినా కూడా నీళ్ళు  ఏమాత్రం క్రింద పడకుండా రావాలి."  రాగలవా? అన్నాడు తండ్రి

కుమార్తె చెప్పింది: "ఓ ... తప్పకుండా నేను చేయగలను."

అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్లు తిరిగి వచ్చి ఇలా చెప్పింది:

"చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను"

అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలు అడిగాడు:

1. ఈసారి వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్ తో ఉండగా నీవు  చూశావా?

2.  ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్  చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నీవు చూశావా?

3. ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నారా?

ఆమె ఇలా చెప్పింది: "నేను ఏమీ చూడలేదు. నేను నా దృష్టి  గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను, నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతావారిని నేను గమనించలేదు "

అతను ఆమెతో చెప్పాడు: "నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసినదిదే. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయనగురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు, పైగా నీవంటి వారిని చూసి వారుకూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రతా సాధనా మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నతపథంలో నడిపిస్తాయి" .....

దేవాలయంలో గడప వలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలిపింది .....🙏 ఏకాగ్రత.....🙏సాధన ముఖ్యం ..... 🙏🙏

🌷 దసరా పాట🌷


🌷 దసరా పాట🌷


దసరా వచ్చేసింది కదండి.
నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.
 దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే
ఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే...

ఇదే ఆ దసరా పాట

పల్లవి-

1⃣
ఏదయా మీదయ మామీద లేదు!
ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!

దసరాకు వస్తిమని విసవిసల బడక!
చేతిలో లేదనక  ఇవ్వలేమనక !

ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!
రేపురా మాపురా మళ్ళి రమ్మనక!

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!
2⃣

పావలా బేడైతె పట్టేది లేదు!
అర్థరూపాయైతె అంటేది లేదు!
ముప్పావలైతేను ముట్టేది లేదు!
రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!
హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

3⃣
అయ్యవారికి చాలు ఐదు వరహాలు!
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!
మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!
శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

 *
దసరా పండుగను గిలకల పండగంటారు చక్కగా కొత్త దుస్తులు ధరించి  వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.

పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటాఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.

లోగుట్టు


ఒక వ్యక్తి అభివృద్ధి గాని
కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.

ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు.
వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి
ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు.
దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు.

పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు.
ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు
విద్యార్ధులకు
ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో.
దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు.
ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే.

అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు.
ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది...
💐💐💐💐💐💐

Total Pageviews