Sunday, November 18, 2018

కార్తిక పురాణము - పదకొండవ అధ్యాయము




రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము. కార్తీకమాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణవ్రత ఫలము పొందును. కార్తీకమాసమందు గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. కార్తీకమాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునొందును. కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలనుంచువాడును, పురాణమును జెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును బొందుదురు. ఈవిషయమై యొక పూర్వకథగలదు. అది విన్నమాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములనిచ్చును. బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము. కళింగదేశమందు మందరుడను నొక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరుగల భార్యయుండెను. ఆమె పతివ్రతయు, సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలైయుండెను. ఓరాజా! ఆసుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనియందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలిజీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని యుండి దారి నడుచువారిని కొట్టి వారి ధనములనపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యమువలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యముకొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గానవచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ యిద్దరు బ్రాహ్మణులను చంపి ఆధనమంతయు తాను హరించెను. 
తరువాత గుహలోనున్న పెద్దపులి కిరాత మనుష్యగంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒక చోట మృతినొంది యమలోకమునకు బోయి కాలసూత్ర నరకమందు యాతన బడిరి. యమభటులు వారినందరిని పురుగులతోను, అమేధ్యముతోను కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలకాగుచున్న రక్తమందు బడవైచిరి. జనకమహారాజా! ఆబ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును జేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓరాజా! ఇట్లుండగా దైవవశముచేత ఒక యతీశ్వరుడు హరినామముచేయుచు నాట్యముచేయుచు పులకాంకితశరీరుడై హరినామామృతమును పానముచేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పయుతుడై ఆమె యింటికి వచ్చెను. ఆమెయు ఆయతిని జూచి భిక్షమిడి అయ్యా యతిపుంగవా! మీరు మాయింటికి వచ్చుటచేత నేను తరించితిని. మీవంటివారి దర్శనము దుర్లభము. మాయింటివద్ద నా భర్తలేడు. నేనొక్కదాననే పతిధ్యానమును చేయుచున్నదానను. ఆమె యిట్లుచెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునయిన ఆమెతో ఇట్లనియెను. అమ్మాయీ! ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈదిన సాయంకాలము హరిసన్నిధిలో మీయింటిలో పురాణ పఠనము జరుపవలెను, ఆపురాణమునకు దీపముకావలెను. నూనె తెచ్చెదను. గనుక వత్తి నీవు చేసిఇమ్ము.
Image may contain: flower శ్యామయనగా యౌవనవతియని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆచిన్నది విని సంతోషముతో గోమయముతెచ్చి ఆయిల్లు చక్కగా అలికినదై అందు అయిదురంగులతో ముగ్గులను బెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆదూదిచే రెండు వత్తులను జేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆచిన్నది దీపపాత్రను, వత్తిని తాను యిచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆదీపమునందు హరిని బూజించి మనశ్శుద్ధి కొరకై పురాణపఠనమారంభించెను. ఆమెయు ప్రతియింటికిబోయి పురాణశ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యధేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను. అంతలో శంఖచక్రాంకితులును, చతుర్బాహులును, పద్మాక్షులును, పీతాంబరధారులునునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోను, ముత్యాలతోను, పగడములతోను, రచించిన మాలికలతోను, వస్త్రములతోను, ఆభరణములతోను అలంకరించబడిన విమానమును దీసికొని క్వచ్చి సూర్యుడువలె ప్రకాశించెడి ఆవిమానమందు ఆమెను ఎక్కించి జయజయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకుబోవుచు మధ్యమార్గమందు నరకమును జూచి అచ్చట తనపి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది విష్ణుదూతలతోనిట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా! నిమిషమాత్రము ఉండండి. ఈనరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈవిషయమును నాకు జెప్పుడు. వీడు నీభర్త, వీడు కూలిచేసియు, దొంగతనమును జేసియు పరధనాపహరణము జేసినాడు. వేదోక్తమయిన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈరెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతడు బాల్యము నుండి మిత్రుడైయున్న వాి నొకనిని చంపి వానిధనము అపహరించి ఇతరదేశమునకు బోవుచున్నంతలో నీభర్తచేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈమూడవవాడు కిరాతుడు. వీడు నీభర్తను యీబ్రాహ్మణుని యిద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈనాల్గవవాడు, పులి, కిరాతులు పరస్పర ఘాతములచేత మృతినొందిరి. ఈపులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశినాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలనొందుచున్నారు. ద్వాదశినాడు నేయి వాడవలెను. నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏపుణ్యము చేత వీరు నరకమునుండి ముక్తులగుదురని యడిగెను. ఆమాటవిని దూతలిట్లనిరి. అమ్మా! కార్తీకమాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణఫలమును నీభర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆపురాణశ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాతవ్యాఘ్రములకు సమానముగానిమ్ము. దానివలన వారు ముక్తులగుదురు. పురాణశ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు బోయి ప్రజలను బిలిచిన పుణ్యమును ఈకృతఘ్నునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానములచేత వారు వారు ముక్తులగుదురు. విష్ణుదాతలమాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణస్త్రీ ఆయా పుణ్యములను వారివారికిచ్చెను. దానిచేత వారు నరకమునుంి విడుదలయై దివ్యమానములనెక్కి ఆస్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీకమాసమందు పురాణశ్రవణమును జేయువాడు హరిలోకమందుండును. ఈచరిత్రను వినువారు మనోవాక్కాయములచేత సంపాదించబడిన పాపమును నశింపజేికొని మోక్షమును బొందుదురు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకాదశోధ్యాస్సమాప్తః



No comments:

Post a Comment

Total Pageviews