భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Thursday, September 25, 2014
శుక్రవార శుభ శుభోదయం
శుక్రవార శుభ శుభోదయం..........................ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రులను జరుపుకుంటాం. పదవ రోజు.. అంటే ఆశ్వయుజ దశమిరోజు విజయదశమి పర్వదినం. ఇది శరదృతువు గనుక ఈ పండుగ దినాలను శరన్నవరాత్రులు అంటారు. దుర్గాదేవి ఆలయాల్లో అమ్మవారిని మొదటిరోజు శైలపుత్రి, రెండోరోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రఘంటాదేవి, నాలుగో రోజు కూష్మాండాదేవి, ఐదోరోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని, ఏడోరోజు కాళీమాత, ఎనిమిదోరోజు మహాగౌరి, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రీదేవి - రూపాల్లో ఆరాధిరిస్తారు. దేవి రూపానికి తగినట్లు ఆవేళ ఆ నైవేద్యం సమర్పిస్తారు. మహిషాసురుడు దేవేంద్రుని ఓడించి, దేవలోకానికి అధిపతి అయ్యాడు. ఆ రాక్షసుడు పెట్టే హింస భరించలేక దేవతలు త్రిమూర్తులతో మొర పెట్టుకున్నారు. దాంతో మహిషాసురుని మట్టు పెట్టేందుకు త్రిమూర్తులు ఒక దివ్యశక్తిని సృష్టించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నుండి వెడలిన మహోజ్జ్వల శక్తి ఒక మహా శక్తిగా అవతరించింది. ఆ దివ్య మంగళ రూపానికి మహాశివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, హిమవంతుడు సింహవాహనాన్ని ఇచ్చారు. ఇక ఆ మహాశక్తి దేవతలను పీడిస్తున్న మహిషాసురునితో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి, చివరికి సంహరించింది. మహిషాసురుని వధించింది కనుకనే, మహిషాసురమర్దిని అయింది. మహిషాసురుని పీడ విరగడవడంతో ప్రజలు సంతోషంగా ఉత్సవం జరుపుకున్నారు. అదే విజయదశమి పర్వదినం. తొలిరోజు కనకదుర్గాదేవి రెండోరోజు బాలా త్రిపుర సుందరి, మూడోరోజు గాయత్రీదేవి, నాలుగోరోజు అన్నపూర్ణాదేవి, ఐదోరోజు లలిత త్రిపుర సుందరీదేవి, ఆరోరోజు సరస్వతీ దేవి, ఏడో రోజు మహా లక్ష్మీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని, పదవ రోజు రాజరాజేశ్వరీదేవి రూపాలతో అమ్మవారిని అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి వరుసగా కేసరి, పొంగలి, అల్లం గారెలు, దద్దోజనం, అప్పాలు - పులిహోర, పెసరపప్పు పాయసం, వడపప్పు - చలిమిడి, చక్రపొంగలి, కేసరి పూర్ణాలు, లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
Total Pageviews
340,715
No comments:
Post a Comment