Saturday, February 9, 2019

*మాఘ పురాణం - 3 వ అధ్యాయము*_


_*గురుపుత్రికాకథ*_
Image result for *మాఘ పురాణంమంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే, పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై, తన భర్తతో, హరిసాన్నిధ్యమునందినది. అని శివుడు, పార్వతీ దేవితో, పలికెను. అప్పుడు పార్వతీదేవి, "స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు?ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి? వివరముగ చెప్పగోరుచున్నాననగా, శివుడిట్లుపలికెను. దేవి! వినుము. పూర్వము, సౌరాష్ట్రదేశమున, బృందారకమనే గ్రామంలో, సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ, విద్యాభ్యాసం చేస్తూవుండేవాళ్లు. ఆ సుదేవునికి, సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో, ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను, ఎవరికిచ్చి వివాహం చేయగలనని, అతడు విచారిస్తూవుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు, సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం, గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికకూడా, సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును, చాలాదూరముపోయి, ఆ అరణ్యములో, ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున, యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేకవర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే, ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి, మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము, ఒక ఏకాంతమందిరములా వుందిl.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి, అచట వృక్షములకున్న పండ్లను తిని, ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో, నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము, నీకును నాకును నచ్చినది. మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక, సుఖప్రదమగును. ఆలసించక,నావద్దకు రమ్ము, నా శరీరము, దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము. నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మని"పిలిచెను. సుమిత్రుడు "మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై, ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము, చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదము రమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో, నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము" అని పలికెను.
Image result for *మాఘ పురాణంగురుపుత్రిక, ఆ మాటలను విని," ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము, స్వయముగ చెంతకు చేరినపుడు, వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక, సుఖమునందక, నేనింటికిరాను. నేనిచటనే, నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి, నేను రానిచో, మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి, దీని ఫలితము అనుభవింపుము" అని నిష్టురముగ, మన్మధావేశముతో, మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు, గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో, మన్మధశయ్యను తీర్చుకొని, మనోహరమైన ఆ వాతావరణములో, యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత, సమిధలు మున్నగువానిని దీసికొని, గ్రామమునకు బయలుదేరిరి. గురువు, శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి," నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని, విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు, అట్లేయనిలోనికెగెనుv.
తండ్రియామెను, కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు, ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి, నేలపై బడి, దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక, సుదేవుడును, మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే, బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన, ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా, అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు, వాని భార్య, దుఃఖించుచుండగా, దృడవ్రతుడను యోగి, ఆ ప్రాంతమున దిరుగుచు, సుదేవుని, రోదనధ్వనిని విని, వాని వద్దకు వచ్చి, ''జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు, తన దుఃఖకారణమును చెప్పి, మరల దుఃఖించెను. యోగి సుదేవుడను, భార్యపుత్రికలను చూచి, క్షణకాలము ధ్యానయోగమునంది, యిట్లు పలికెను. "ఓయీ! వినుము నీ కుమార్తే9 పూర్వజన్మలో, క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై, చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి, యౌవన వతి యగు ఆమె, తన జారుల మాటలను విని, తన భర్తను వధించెను. భర్తను వధించి, భయపడి, శోకించి, ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ దోషమువలన, ఈమెకీ జన్మమున, యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె, పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని, నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో, మాఘమాసమున, సరస్వతీ నదీతీరమున, గౌరీవ్రతము నాచరించువారితో కలసి, వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా, నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున, నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును, స్వేరిణియై, నీ శిష్యులతో, అధర్మముగ, రమించెను. ఈ దోషమువలన, నీమె తమ కర్మఫలములను, యిట్లననుభవించుచున్నది. చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!l"
సుదేవుడు, యోగిమాటలను విని, చెవులు మూసుకొని, తన కుమార్తె, పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుటను,ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటను, విని, మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, ''తండ్రీ! నా కుమార్తే చేసిన పాపము, యేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయయుంచి చెప్పుడని, పరిపరివిధముల ప్రార్థించెను. అప్పుడా యోగి, ''ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములు, పోవుటకు, ఆమె మాంగల్యము నిలుచునట్లును, చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున, ప్రాతఃస్నానముచేసి, ఆ నదీతీరమునగాని, సరస్సు తీరమున, యిసుకతో, గౌరీదేవిని జేసి, షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు, దక్షిణతో, నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ, నీమముచే, ప్రతిదినముo చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములు, నశించును. మాఘశుద్ద తదియనాడు, రెండు క్రొత్తచేటలను తెచ్చి, వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ, మున్నగు సువాసిని అలంకారములనుంచి, దక్షిణ తాంబూలములతో, వాయనము నుంచి, సువాసినీ పూజచేసి, ముత్తైదువలకిచ్చి, ఏడుమార్లు, ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి, షడ్రసోపేత భోజనము పెట్టి, గౌరవింపవలయును. మాఘమాసమున, ప్రాతఃకాలస్నానముల చేతను, పైన చెప్పిన వ్రతాచరణము చేతను, ఈమెకు పాప క్షయము కలుగును. భర్త పునర్జీవితుడై, ఈమె
మాంగల్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు, విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి, గౌరివ్రతమాచరిoచిన సువాసిని, తన మాంగళ్యమును నిలుపుకొని, చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు, మాఘస్నానము చేసినచో, వారెట్టి వారైనను,Image result for *మాఘ పురాణం
హరియనుహ్రహమునొంది, చిరకాలము సుఖించి, పుణ్యలోకముల నందుదురు. అని, యోగి వివరించి, తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి, తన కుమార్తెచే, మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును, భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత, సుదేవుని కుమార్తె పాపములుపోయి, ఆమె భర్త, పునర్జీవితుడయ్యెను. ఆమెయు, చిరకాలము, తన భర్తతో సుఖించి, తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి, దేహాంతమున, వైకుంఠమును చేరెను. కావున, మాఘమున, ప్రాతఃకాల స్నానము, నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి, తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను, యిహమున, సర్వసుఖములనంది, పరమున, వైకుంఠవాసులగుదురు సుమా, అని, శివుడు, పార్వతీదేవికి, మాఘస్నాన మహిమను వివరించెను.

No comments:

Post a Comment

Total Pageviews