*_సుమిత్రునికథ_*
సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయువ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నేలోకముకల్గును. మీరు పూజించునది యేదైవమును దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలోనోకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, ఓయీ శ్రద్దగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగ మాఘమాసమున ప్రాతఃకాలమున నది, సరస్సు మున్నగువానియందు స్నానముచేసినవాడు శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాలస్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు, పరులనునిందించువాడు, బ్రహ్మహత్యచేసిన వానితో సమానులు, అబద్దపుసాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘమాసస్నానము మానినవాడు, బ్రహ్మహత్యచేసిన వానితో సమానులేయగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపానలోలుడు, ఆడినమాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు,పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్యభాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు, తల్లిదండ్రులను దేషించు వాడు, వీరందరును పాపాత్ములే సుమా. మేము చేయుచున్న యీమాఘమాస వ్రతమును పాటించినచో యీ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములనందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవునర్చించిన వాని పుణ్య అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘస్నానవ్రత ఫలమును పెక్కువిధములుగ వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున యీ మాసమున యింకను మూడుదినములు మిగిలియున్నది. ఈ మూడుదినములును మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగ గంగాతీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి.

సుమిత్రుడును వారి మాటప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘస్నానమును చేసి గంగాతీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమునారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింప రాని తీరులోనుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు, శ్రీ హరి కృపావిశేషమునంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునేగాక, మోక్షమును కూడా పొందెను. పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాపవినాశమును, పుణ్యప్రాప్తిని వివరించు యీ కథను మాఘస్నానము చేసినవాడు. శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలును తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను.
No comments:
Post a Comment