Wednesday, February 13, 2019

*పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి* బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన సుధా రసధారామృతం!

*పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి* బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన సుధా రసధారామృతం!
కాల విభాగంలో తప్పకుండా గుర్తు పెట్టుకొని తాను జరుపుకోవలసినవి కొన్ని ఉంటాయి. అందులో పుట్టినరోజు ఒకటి. నేను నా పుట్టినరోజు చేసుకోనండీ అనకూడదు. తన పుట్టినరోజు తాను చక్కగా జరుపుకోవాలి. ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించింది. పుట్టినరోజు జరుపుకొనే వ్యక్తి ఆ రోజు తెల్లవారు ఝామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఒంటికి నూనె రాసుకుంటే అలక్ష్మి పోతుంది. నూనె అలదుకొని తలస్నానం చేస్తారు. చేసేముందు పెద్దవాళ్ళు తలమీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం, వెన్నుపాము నిమరడం, ఆచారంగా వస్తోంది. స్నానం చేసిన తర్వాత ఇష్టదేవతారాధన చేయాలి. ఇంట్లో కులదైవం, ఇష్టదైవం ఉంటారు. వారిరువురినీ ఆరాధన చేయాలి. తర్వాత ఆవుపాలలో బెల్లంముక్క, నల్ల నువ్వులు, కలిపిన పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి మూడుమార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తీసుకుంటామో అలా మూడుమార్లు లోపలికి పుచ్చుకోవాలి. ఇలా ఆ పదార్థాన్ని మూడుమార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే అది తొలగిపోతుంది అని. ఆ తర్వాత ఏడుగురు చిరంజీవులు - పుట్టుకతోనే చిరంజీవిత్వాన్ని పొందారు, ఇంకొంతమంది చిరంజీవిత్వాన్ని సాధించుకున్న వాళ్ళున్నారు.  పుట్టుకతో చిరంజీవులైన వాళ్ళు -
శ్లో|| అశ్వత్థామ బలిర్వాసో హనూమాంశ్చ విభీషణః !
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః !!
ఈ ఏడుగురు పేర్లు మనసులోనన్నా స్మరించాలి. పైకన్నా చెప్పాలి. ఆరోజున తల్లిదండ్రులకి, గురువుగారికి తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి. ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేయాలి. చక్కగా మృష్టాన్న భోజనం చేయవచ్చు. రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తన శక్తికొలదీ దానధర్మాలు నిర్వహించాలి. తనకి ఐశ్వర్యం ఉందా? దానం చేస్తాడు. ఐశ్వర్యం లేదు - గోగ్రాసం అంటారు. చేతినిండా కాసిని పచ్చగడ్డిపరకలు పట్టుకెళ్ళి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు. ఇవి పుట్టినరోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని చేయవలసిన విషయాలు. వీటికి విరుద్ధంగా పుట్టినరోజును చేసుకోకూడదు. పుట్టినరోజు సరదాకోసం, వినోదం కోసం చేసుకొనేది కాదు. ఆయుర్దాయ సంబంధమైనటువంటిది. ఆరోజు దీపం చాలా ప్రధానం. పొరపాటున అక్కర్లేని విషయాలు పిల్లలకి నేర్పితే అవే విశృంఖలత్వాన్ని పొందుతాయి రేపు ప్రొద్దున. ఎన్నో పుట్టినరోజు చేసుకుంటున్నాడో అన్ని కొవ్వొత్తులు వెలిగించడం ఉఫ్ అని ఊదుతూ దీపాలార్పేయడం పరమ అమంగళప్రదమైన విషయం. దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకొని ఏదో నిన్నరాత్రో మొన్నరాత్రో తయారుచేసిన ఒక పదార్థం, ఎవడు చేసిన ఆశీర్వాదమో అర్థం కాదు రంగురంగులుగా వ్రాసిన Happy Birthday, అర్థం లేకుండా అందరూ నిలబడి కొడుతున్న తప్పట్లు, వీటి మధ్యలో కత్తితో కోసి నిర్లజ్జగా భార్య నోట్లో సభాముఖంగా పెట్టడం, ఇలాంటి పిచ్చపనులు చేయమని శాస్త్రాలలో లేదు. దీపాన్ని గౌరవించు, దీపం వెలిగించు. దీపం దగ్గర మట్టుమీద అక్షతలో, ఒకపువ్వో వేసి నమస్కారం చెయ్యి. అది నీ ఇంట కాంతి నింపుతుంది. జీవితాన్ని నిలబెడుతుంది. గురువుగారికి, తల్లిదండ్రులకి, పెద్దలకి నమస్కారం చెయ్యి. వాళ్ళనోటితో వాళ్ళు ఆశీర్వదించాలి "శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి" అని. చక్కగా దేవాలయానికి వెళ్ళి నీపేరు మీద పూజ చేయించుకో. ఈశ్వరుడి అర్చన చెయ్యి. అపమృత్యు దోషం కబళించకుండా ఉండడానికి నల్లనువ్వులు, బెల్లం, ఆవుపాలు కలిసిన పదార్థాన్ని మూడుమార్లు పుచ్చుకో. సప్తచిరజీవుల పేర్లు మనస్సులో స్మరించడం, లేదా పైకి చెప్పడం, అదీ పుట్టినరోజు జరుపుకొనే విధానం.

------------------
సప్త చిరంజీవులు.
చిరంజీవులు అంటే చిరకాలం జీవించిఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు.
పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం.
అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||
దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ; బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు.
1) అశ్వద్దామ:- ద్రోణాచార్యుని కుమారుడు,మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు. ఇతడు చిరంజీవి.
2) బలి:- ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు,ఇంద్రుని జయించినవాడు,వామనమూర్తి కి మూడడుగుల భూమిని దానం చేసి,అతని చే పాతాళమునకు తొక్కబడిన వాడు. కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గధాధారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు. ఇతడు చిరంజీవి. ఇతని సత్య సంధతకు మెచ్చిన మహా విష్టువు ఈమన్వన్తరములో దైత్త్యేద్రత్వమును, పై మన్వంతరములో దేవేంద్ర పదవిని అనుగ్రహించాడు .
3) వ్యాసుడు :- సత్యవతీ పరాసరుల కుమారుడు. కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబడేవాడు. అష్టాదశ పురాణాలనలు, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను ఇంకనూ అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వానిని వ్యాసుడు అని పేర్కొంటారు. ఒక్కొక్క యుగములో ప్రశంసింప బడినారు .
4)హనుమంతుడు:- కేసరి భార్య అగు అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో వున్నా శివుని శక్తిని ఆమెకు ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టినాడు. సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు. పరమేశ్వరుని అవతారముగా కొలవబదడినవాడు హనుమంతుడు. రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చటంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ. మహా భారత యుద్ధంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయమునకు కూడా దోహదకారి అయినాడు . ఇతడు చిరంజీవుడు. రామ భక్తాగ్రేస్వరుడైన ఆంజనేయుడు చిరంజీవిగా తన భక్తులకు సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉంటాడు.
5) విభీషణుడు:- కైకసికిని విశ్వబ్రహ్మ కలిగిన మూడవ కుమారుడు. బ్రహ్మపరమున ఈతడు సుశీలుడైనాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి , సన్మార్గము గూర్చి చెప్పేవాడు. సముద్రమును దాటుటకు శ్రీ రామునకు ఉపాయము చెప్పినవాడు . రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పినవాడు. రావణుని అనంతరం లంకాధిపతి అయినాడు. ఇతడు చిరంజీవుడు.
6) కృపుడు:- శరద్వంతుని కుమారుడు. శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు , ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపినాడు. ఆమెను చూడగానే యితడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి మరియొక చోటుకు వెళ్ళినాడు ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు. కృపునితో పాటుగా సరద్వాన్తునికి మరియొక ఆడపిల్ల కల్గినది. ఆ పిల్లలను వదిలి తపస్సుకి మరి ఒక చోటికి వెళ్ళినాడు. అటువంటి సమయమున వేటకు వచ్చిన శంతనుడు. ఈ పసికందులను చూచి కృపతో పెంచినాడు. అందులకే వీనికి కృప కృపుడని పేర్లు వచ్చినవి. శరద్వంతుడు కృపునకు ఉపనయాదికములను చేసి ధనుర్వేదమును నేర్పినాడు. భీష్ముని కోర్కె మన్నించి ధర్మజాదులకు ధనుర్విద్యను నేర్పినాడు. భారత యుద్ధంలో దుర్యోధనుని పక్షమును నిలిచి యుద్ధం చేసినాడు. యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు. దృతరాష్ట్రుడుతో కూడి తపోవనమునకు వెళ్ళినాడు రాబోవు సూర్య సావర్నిక మన్వంతరములో సప్తరుషులలో కృపునకు ఒక స్థానము పొందు వాడుగా వున్నాడు . ఇతడు చిరంజీవుడు.
7) పరశు రాముడు:- ఇతడు రేణుకా జమదగ్నుల కుమారుడు .తండ్రి ఆజ్ఞను మన్నించి తల్లిని కూడా సంహరించినాడు. ఇతనిని మెచ్చుకొన్న తండ్రి వరం కోరుకొమ్మనగా తల్లిని బ్రతికించమన్నాడు. తన సోదరులకు తండ్రివలన శాపమును తొలగింప చేసాడు జమదగ్నికి తాత బృగు మహర్షి, ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయమునకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసినాడు. ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించినాడు. శివుని ఉత్తర్వుతో తీర్ధ యాత్రలు చేసినాడు, శివ అనుగ్రహముతో భార్గవాస్త్రమును పొందినాడు.
నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా వందేళ్ళు జీవిస్తారు. ఎనిమిదో వానిగా మార్కండేయున్ని స్మరించడం ద్వారా మృత్యు భయం వీడిపోతుంది.

No comments:

Post a Comment

Total Pageviews