Wednesday, November 11, 2020

బంధాలను చిన్నచూపు చూడవద్దు! సత్యసాయి విస్సా

 బంధాలను చిన్నచూపు చూడవద్దు!  

ఇంటిలోంచి ఒక పెద్ద దిక్కు వెళ్ళి పొతే కొన్నితరాలను చూసిన అనుభవ జ్నానం దూరమైనట్లు 

"ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం" అని  యాపిల్ కంపినీ సృష్టి కర్త స్టీవ్ జాబ్స్ తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న మాటలివి.

బంధాలు, అనుబంధాలు, అప్యాయతలు, అనురాగాలు మన భారతీయ కుటుంబ వ్యవస్థలో మూలస్తంభాలు  

మనుషుల బదులుగా వస్తువులను ప్రేమించే కాల క్రమంలో మనం చాలా దూరం వచ్చేసాం

"చందమామ వుంది వెన్నెల రాత్రులున్నాయి 

కానీ వెన్నెలలో ఆడుకునే పిల్లలు కరువవుతున్నారు  

ఆ వెన్నెల రాత్రిలో ఆరుబయట చందమామ కధలు చెప్పే పెద్దవారు కరువవుతున్నారు  

ఎండా కాలంలో వేసవి సెలవులు వున్నాయి 

కానీ ఆ వేసవి సెలవుల్లో అమ్మమ్మ నానమ్మల ఇంటికి వెళ్ళేవారు కరువవుతున్నారు 

నేటి తరానికి వృత్తిలో రాణించడానికి ప్రతీ అంశంలోనూ క్రాష్ కోర్సులు, వ్యక్తిత్వ వికాస కోర్సులు ఎన్నొ వున్నాయి.   

కానీ నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు బంధాలు అనుబంధాలు చెప్పే పెద్దవారు ఒక్కొక్కరూ కనుమరుగవుతున్నారు  

“ప్రాణం ఉన్నదేది తన కోసం జీవించదు.. అలాగే ఒంటరిగా జీవించదు”  అని విలియం బ్లేక్ అన్న మాటల్ని మననం చేసుకోవాలి, మన జీవితంలో ప్రతీ బంధాన్ని నిలబెట్టుకోవాలి, ఎందుకంటే "

"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".

అందుకే 

When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relationship more than 'EGO'

Let's have a smooth relationships.

ఈ నాలుగు మాటలు, అటు నాలుగు తరాలు ఇటు నాలుగు తరాలు చూసిన కీ.శే చెల్లాయమ్మ (పెద్ద అత్తయ్య గారు)  గారికి అంకితం

Tuesday, November 3, 2020

మిత్రమా! ఈ రేయి కొంత ఎకాంతంలో గడపాలి! వచ్చేది జన్మానికో నీలి వెన్నెల రాత్రి!

 

మిత్రమా!

రేయి కొంత ఎకాంతంలో గడపాలి!

వచ్చేది జన్మానికో నీలి వెన్నెల రాత్రి!

నీలి వెన్నెల వెదజల్లు చంద్రుని అధీనంలో మనం 

శరద్ పూర్ణిమ నీలిమ ఉత్తేజంలో మనం 

శరద్ యామినీ సౌదామిని

సురభామినిలా సిగలో తురిమే నీలి జాబిలి అందాల 

మన జీవితాలు రసభరితం సుధాపూరితం  

నీలి పూర్ణ చంద్రోదయం!

అదో అరుదైన అద్భుత దృశ్యం.

త్వరలో మరలా రాదు అద్భుత సన్నివేశం

కళ్ళు బాగా విప్పార్చి చూద్దాం తనివితీరా

చీకటి దిగంతాల ఆవల జరిగి జారిపోకముందే

కళ్ళు మూసి చిత్రం ముద్రించుకుందాం మనసారా

తెల్లవారి వెలుగుల్లో నీలి వెలుగు కరిగి ఆరిపోకముందే

వచ్చేది జన్మానికో నీలి వెన్నెల రాత్రి!

మిత్రమా!

రేయి కొంత ఎకాంతంలో గడపాలి! 30.12.2020  22:45 to 23.40 hrs

 

Monday, November 2, 2020

పండ్ల రసం గిన్నె---వాడ్రేవు చినవీరభద్రుడు

 పండ్ల రసం గిన్నె

______________
(రాదుగ ప్రచురణలవారి చెహోవ్ రచనల్లో అయిదవ సంపుటం నాటకాలు. ఆ పుస్తకం కోసం ఎన్నేళ్ళుగానో వెతుకుతున్నానని తెలిసి మిత్రుడు నరుకుర్తి శ్రీధర్ ఎక్కడో ఖండాంతరాలనుంచి ఆ పుస్తకం తెప్పించి నాకు పంపించాడు. వచ్చి చాలా రోజులయ్యింది. అప్పణ్ణుంచీ నా బల్లమీదనే ఉంది.)
~
బల్లమీద చెహోవ్ పుస్తకాలు, నాటకాల సంపుటి,
ఉత్తరాలు, సరికొత్త అనువాదంలో మరికొన్ని కథలు-
రోజూ వాటిని చూస్తుంటాను, కిటికీ బయట పొలాలు
రోజురోజుకీ పొంగుతున్న ఆకుపచ్చ,
దూరంగా కొండలు, కొండ కింద పల్లెలు
తెలి నీలిసరసులో మినుకుమనే దీపాలు.
బల్లమీద చెహోవ్ రచనలు,
గుండె ఉగ్గబట్టుకుంటేగాని
తెరవలేను.
ఒకప్పుడు నీకెవరో రాసిన ప్రేమలేఖల బొత్తి
తెరిస్తే చాలు చెప్పలేని శాంతి, సంతోషం, పారవశ్యం
ఇంక నువ్వు నిలవడం కష్టం
వెళ్ళిపోవాలని ఉంటుంది, అన్నీ వదిలిపెట్టేసి,
ఒక్క ఉదుటున, గడప దాటి, వీథి దాటి, ఊరు దాటి
నీ రోజువారీ ప్రపంచాన్ని పక్కకు నెట్టేసి
మరొక రోజువారీ జీవితంలోకి నడిచిపోవాలని ఉంటుంది.
ఒక పల్లె, తోటలో ఇల్లు, చెట్లమధ్య వెనక్కి జరుగుతున్న సాయంకాలపు నీడలు
మీరిద్దరో, ముగ్గురో, నలుగురో
కూచుని మాటాడుకుంటూ టీ తాగుతుంటారు.
ఇప్పుడో మరికొంతసేటికో పల్లెప్రజలు మీ దగ్గరికొస్తారు
పొలాలగురించో, పంటల గురించో
చదువు గురించో, సంధ్య గురించో మాటలు నడుస్తాయి.
మీకు జీవిస్తున్నామన్న స్ఫురణ ఉండదు
కాబట్టి జీవించడం బరువుగా తోచదు.
అట్లాంటి గ్రామంలో నువ్వొక ఉపాధ్యాయుడివవుతావు
ఒక వైద్యుడివవుతావు, నలుగురి అనుభవాలూ వినడం మొదలుపెట్టేక
నువ్వొక కథకుడిగా ఎదుగుతావు.
చెహోవ్ ని చదివిన ప్రతిసారీ ఆ గ్రామం
నన్ను పిలుస్తూనే ఉంటుంది.
ఆ పుస్తకం ముగించిన కొన్నాళ్ళదాకా
నేనొక దయాపూరితమానవుడిగా ప్రవర్తిస్తున్నట్టు
నాకు తెలుస్తూనే ఉంటుంది.
నేనెవరిని కలుసుకున్నా, మాట్లాడినా
వాళ్ళకి నా చూపుల్లో గొప్ప సాంత్వన గోచరిస్తూ ఉంటుంది
ఒక రోగి, అతడి సమస్య ఏమిటో అతడికే తెలియదు
నీ దగ్గరికొచ్చినప్పుడు, నువ్వతడి చేయి పట్టుకుని
చెప్పలేనంత కరుణతో అతడి నాడి కొలిచినట్టుంటుంది.
నా మాటల్లో కొంత స్తిమితం తేటపడుతుంది
కొన్నాళ్ళ పాటు నా సంభాషణల్లోంచి
ఫిర్యాదులు పక్కకు తప్పుకుంటాయి.
ఎవరినీ నిందించాలనిపించదు.
ఎంతసేపూ ఒకటే ఆలోచన:
వీళ్ళు మరికొంత ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?
అప్పుడే కోసి పిండి నింపిన
పండ్ల రసం గిన్నెలాగా
చెహోవ్ పుస్తకం.
పండ్లరసం నీలో ఏ ఉద్వేగాన్నీ రేకెత్తించదు.
నువ్వు తాగి మర్చిపోయేక మొదలవుతుంది
నీ రక్తనాళాల్లో ఒక శుద్ధి ఉద్యమం.
రోజు రోజుకీ కనబడకుండానే పెరిగే పంటపొలంలాగా
నిన్నటికన్నా ఈరోజు మరింత
వివేకంతో నిద్రనుంచి మేల్కొంటావు.

Saturday, October 10, 2020

విస్సా సాయి వైభవ్‌! ఇంటర్వూ ఎయిర్‌ ఈ టీవీ ఇంటర్వూ


విస్సా సాయి వైభవ్‌ ఇంటర్వూ ఎయిర్‌ ఈ టీవీ ఇంటర్వూ

మా పెద్దబాబు చిరంజీవి సాయి వైభవ్‌ వాడు ఎప్పటికీ మా జ్నాపకాల్లో వాడితో ఏ కొద్దిపాటి పరిచయం కలిగిన వారి జ్నాపకాల్లో చిరంజీవి గా ఊంటాడు. బాబు అవయవాలు అన్నీ పదిమందికి జీవితాన్ని ఇచ్చాయి.  ఈటీవీ ఇంటర్వూ మీకు వీలున్నప్పుడు చూడండి. https://www.youtube.com/watch?v=Y37dZc-MyWY


 ఈ లింక్ నొక్కి ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి వాడు మా అబ్బాయి చి. సాయి వైభవ్ ఇంత చేసినా నాకు చెప్పలేదు. నాకు తెలియకుండా ఎంత ఎదిగిపోయాడో అందనంత ఎత్తుకు ఎదిగిపోయి నాకు అందకుండా పోయాడు... నాన్నకు ఆశ్చర్యం, విస్మయం. కలిగించాలని నాకు చెప్పకుండా ఇంతచేసి ఇంత ఆశ్చర్యం, విస్మయం చేసావా నాన్నా, నిన్ను నేను ఇంకా నా చేయి పట్టి నడిచిన నా చిట్టి తండ్రి గానే అనుకున్నాను కానీ నీ చిన్ని గుండెలో విశ్వమంత ఆశయాలను ఆదర్శాలను దాచుకున్నావని తెలుసుకోలేని మూర్ఖుణ్ణి నన్ను క్షమించు నాన్నా నానిబాబు -

అశ్రుతప్త నయనాలతో
నీ మూర్ఖత్వపు నాన్న సత్యసాయి విస్సా

Thursday, October 1, 2020

🌹డ్రోన్ బాయ్ ప్రతాప్🌹సత్యసాయి విస్సా ఫౌండేషన్‌! https://www.youtube.com/watch?v=58ag-EYsOF0&t=189s

 నా దేశం భగవద్గీత

నా దేశం అగ్నిపునీత సీత
నా దేశం రత్నగర్భాన దాగిన
కానరాని ప్రతిభా భాస్కరులెందరో...
పస్తులుండైనా మన మన ఇంటా బయటా ఇటువంటి ప్రతిభావంతులను ప్రొత్సహిద్దాం! సత్యసాయి విస్సా ఫౌండేషన్‌
https://www.youtube.com/watch?v=58ag-EYsOF0&t=189s

"ప్రతాప్" - ప్రతిభావంతుడైన యువ శాస్త్రవేత్త. ఈ ప్రతాప్ వయస్సు 21 సంవత్సరాలు మాత్రమే! ఇతనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ DRDO లో నియమించారు!!
ఇంతకూ ప్రతాప్ ఏమి సాధించాడు?
🌹డ్రోన్ బాయ్ ప్రతాప్🌹
ప్రతాప్ కర్ణాటకలోని ఒక చిన్న కుగ్రామంలో జన్మించాడు. తండ్రి ఒక బీద వ్యవసాయదారుడు. తండ్రి నెలవారీ ఆదాయం సుమారు రూ.2000 మాత్రమే! ప్రతాప్ చిన్న వయస్సులోనే ఎలక్ట్రానిక్స్ ఇష్టపడేవాడు.
ప్రతాప్ డ్రోన్ కు సంబంధిత సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించేవాడు. శాస్త్రవేత్తల యొక్క మెయిలుకు తన సందేహాలను ఈమెయిల్‌ పంపేవాడు బట్లర్ ఇంగ్లీషులో. తను 100 మెయిల్స్ పంపితే తనకు 1 సమాధానం వచ్చేది. గత 2 సంవత్సరాల్లో మాత్రమే తను ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించారు.
ప్రతాప్ కాలేజీలో బిఎస్సి ఫిజిక్స్ చేరాడు. మైసూర్‌లో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు హాస్టల్ ఫీజు కట్టలేదు. బయటకు పంపించేసారు. అతను బస్‌స్టాండ్‌లో, వీధిలో ప్లాట్‌ఫాంపై ఉండి చదివాడు! అతను మైసూర్ నగరాన్ని ఎప్పుడూ చూడలేదు. మైసూర్ బస్‌స్టాండ్ ఒక ప్యాలెస్ లాంటిదని చెప్పేవాడు. అక్కడ పబ్లిక్ టాయిలెట్లో తన బట్టలు ఉతికేవాడు. ట్యూషన్ ద్వారా వచ్చే ఆదాయంతో చదువును కొనసాగించాడు.
ఏదో ఒకవిధంగా తక్కువ ఖర్చుతో ఎగిరే యంత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. దాని పేరు డ్రోన్ అని కూడా అతనికి తెలియదు. కోర్సులో చేరడానికి డబ్బు లేనందున సి ++, జావాకోర్ పైథాన్ అడోబ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాఫ్ట్‌వేర్‌లను నేర్చుకున్నాడు. అప్పుడు అతను బొంబాయి, విశాఖపట్టణం వంటి పట్టణాల్లో అధికంగా పోగుపడిన ఇవాస్ట్ స్క్రాప్ యార్డ్‌లో శోధించాడు. అందువలన అతను తన డ్రోన్ ప్రాజెక్టుకు ఖర్చును 40% తగ్గించాడు. ప్రతాప్ తన డ్రోన్ తయారీ ప్రయత్నాలలో ఎన్నోసార్లు విఫలమై, తన 80వ ప్రయత్నంలో విజయం సాధించాడు.
ఐఐటి పెట్టిన డ్రోన్ పోటీలో పాల్గొనడానికి అతను జనరల్ కంపార్ట్మెంట్లో 3 రోజులు రైలులో ప్రయాణం చేసి ఢిల్లీ వెళ్తాడు. సరైన బూట్లు లేవు. మంచి దుస్తులు లేవు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు పాల్గొన్న పోటీలో అతనికి 2వ బహుమతి లభించింది. దానితో అతనికి ఉత్సాహం వచ్చింది.
"జపాన్‌లో ఇలాంటి పోటీ ఉంది. నేను పాల్గొంటాను" అని ఒకరికి చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ పాస్పోర్ట్, వీసా కొనవలసి ఉందని అతనికి తెలియదు. ప్రతాప్ తన 10th, ఇంటర్ మార్క్‌షీట్‌ను తనఖా పెట్టి కొంత డబ్బు సంపాదించాడు. వివిధ వ్యక్తులు (కళాశాల స్నేహితులు, ప్రొఫెసర్లు) అతనికి వీలైనంత వరకు సహాయం చేసారు. చివరిగా తత్కాల్‌ పాస్‌పోర్ట్, వీసా సంపాదించాడు.
కానీ జపాన్‌లో జరిగే పోటీలో పాల్గొనడానికి, ఒక ప్రొఫెసర్ కు తన ప్రాజెక్ట్ నివేదికను సమర్పించి, ఆమోదం పొందటం తప్పనిసరని తెలిసింది. అతను ఆ పని మీద మద్రాస్ కు 300 రూపాయలతో వెళ్ళాడు. చెన్నై అతనికి కొత్తది. ఏలాగో ఒక ప్రొఫెసర్‌ ఇంటికి వెళ్ళాడు. ఆ ప్రొఫెసర్ ఇంట్లో లేడు. 4 రోజులు తిరిగాడు. చేతిలో ఉన్న డబ్బు కరుగుతోంది. చివరకు ప్రొఫెసర్‌ను కలుస్తాడు.‌ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసిన ప్రొఫెసర్ నిరాకరించారు. "నీవు బిఎస్సి ఆర్ట్స్ గ్రూప్. మీ అధ్యయనం మరియు నువు పనిచేస్తున్న ప్రాజెక్ట్ ఏమిటి?" అని. చేతిలో డబ్బులన్నీ అయిపోయినా, పట్టువిడవకుండా చివరికి సంతకం సాధించి 31 రోజుల తరువాత మైసూర్‌కు తిరిగి వస్తాడు.
*జపాన్ ప్రయాణం : భారతదేశం తరపున పోటీ చేయడానికి ప్రయాణ ఖర్చులు (కనిష్టంగా) రూ.60,000 అవసరం. ప్రభుత్వాలకు మెయిల్ పంపాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మైసూర్‌లో ఉన్న స్వామీజీ ఒకరు విమాన టికెట్ ఇప్పించారు. చివరకు అతను తన తల్లిగారి "మాంగల్యమును అమ్మేస్తాడు".
ప్రతాప్ ఒంటరిగా డిసెంబరు 2017లో టోక్యోకు వెళ్తాడు. అప్పుడు అతని వయస్సు 18 సంవత్సరాలు. కేవలం రూ.1400 మాత్రమే చేతిలో ఉంది. విమానాశ్రయం నుండి ఎగ్జిబిషన్ సెంటర్‌కు బుల్లెట్ రైలు 2 గంటలు మాత్రమే. సాధారణ రైలుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే బుల్లెట్ రైలు ప్రయాణం ఖరీదైనది. రైలు దిగాడు. ఎగ్జిబిషన్ సెంటర్ అక్కడి నుండి 8 కి.మీ. అన్ని పెట్టెల లగేజ్ మోసుకుంటూ, 8 కి.మీ. దూరంలో ఉన్న ఎగ్జిబిషన్ సెంటర్కు చేరుకుంటాడు.
127కు పైగా దేశాలు పాల్గొంటున్న ఎక్స్‌పోలో తనకు ఏ స్ధానం లభిస్తుందో ప్రతాప్ కు తెలియదు! 70వ స్ధానం నుండి ఫలితాలు ప్రకటిస్తున్నారు! వాటిలో ప్రతాప్ పేరు లేదు. 60-50 వ స్థానం విజేతల ప్రకటన వస్తోంది. ప్రతాప్ ఫలితాన్ని చూస్తాడు. ఆయన పేరు లేదు. 30వ స్థానం ప్రకటన వస్తోంది. అతను ఫలితాన్ని చూస్తాడు. చైనా విశ్వవిద్యాలయాలు దీనిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రతాప్ పేరు లేదు.
20వ స్థానంలో వచ్చిన వారి పేర్లు ప్రకటన వస్తోంది. అతను ఫలితాలను చూస్తాడు. ఆ ఫలితాల్లో యూరప్ మరియు జర్మన్ విశ్వవిద్యాలయాల ఆధిపత్యం.
ప్రతాప్ నిరాశతో చివరి వరుసకు వెళ్లి కూర్చున్నాడు. టాప్ 10 జాబితాను ప్రకటించారు. ఆ ఫలితాలన్నీ అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల ఆధిపత్యం.
అందరూ మొదటి ప్రైజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2 వ బహుమతి "స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం" కు ప్రకటించబడింది!
ఆ తరువాత # 1 ఎవరు?
"దయచేసి భారతదేశం నుండి మిస్టర్ ప్రతాప్, గోల్డ్ మెడలిస్ట్ కు స్వాగతం"
ఏడుపే మన హీరో కోసం ఏడుస్తోంది...
పట్టరాని ఆనందం... పరమానంద పరిపూర్ణత్వం...
అతని కళ్ళ నుండి కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి...
భారతదేశ జెండా పైన అవరోహణం....
తన "తల్లి మాంగల్యం" కన్నీటి తెరలో మసకబారి కనపడుతుంది.
భారత మాతా పరవశించి పోతుంది. 10,000 డాలర్ల బహుమతి. ఆ తరువాత ఒక ఉల్లాసమైన వేడుక. అతని ప్రతిభ బయటి ప్రపంచానికి తెలుస్తుంది.
ఫ్రాన్స్‌లో మొదటి బహుమతి. ఫ్రాన్స్ దేశం నుండి ఆహ్వానం! మేము నెలకు 16 లక్షలు ఇస్తాము. మేము 5 బెడ్ రూమ్ ఇంటిని ఇస్తాము. మేము 2.5 కోట్ల విలువైన కారును కూడా ఇస్తాము. కానీ ప్రతాప్ తిరస్కరించాడు!!
"భారతదేశ ప్రధానమంత్రి మోడీ ప్రతాప్ ని పిలిచారు. తన ప్రతిభ దేశానికి ప్రయోజనం. రక్షణశాఖకు చెందిన DRDO తో కలిసి పనిచేసే అవకాశంతో గౌరవించబడినాడు" 🌹🌺🌹
(DRDO - Defence Research Dovelopment Organization. భారతదేశ రక్షణశాఖకు మిలటరీకు సంబంధించిన ఆయుధాల పరిశోధన, అభివృద్ధి కేంద్రం)

మన జీవనాలు ...పుష్ప విలాపాలు లేని పుష్ప విలాసాల ఆనందమయ అందమైన ఉద్యానవనాలు కావాలని ...సత్యసాయి విస్సా.

 నీ పూజ కోసం పూలు కోసుకు వద్దామని ప్రొద్దుననే తోటలోనికి వెళ్ళాను ప్రభూ. ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో ఉద్యానం కళకళలాడు తున్నది. పూల బాలలు తల్లి వొడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు,

నే నొక పూలమొక్క కడ నిల్చి
చివాలున కొమ్మవంచి గో రానెడు నంతలోన
విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా ప్రాణము దీతువా" యనుచు బావురు మన్నవి;
క్రుంగిపోతి;........నా మానస మందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మహాద్భుత సృష్టి లో పుష్పవిలాపం ఒకటి...ఘంటసాల గానమదుర్యం తో జీవం పోస్తే...కాకతాళీయంగా నేను తీసిన చిత్రాలు నాకు ఆ పద్య భావాన్ని స్పురింపచేస్తున్నాయి..మన జీవనాలు ...పుష్ప విలాపాలు లేని పుష్ప విలాసాల ఆనందమయ అందమైన ఉద్యానవనాలు కావాలని ...సత్యసాయి విస్సా.


పూజ్య గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా ఈ కవన కానుక!...సత్యసాయి విస్సా ఫౌండేషన్.

పూజ్య గాంధీ మహాత్ముని జయంతి ఆ సందర్భంగా ఈ కవన కానుక పూజ్య బాపూజీ జయంతి సందర్భంగా కీర్తి శేషులు బ్రహ్మశ్రీ మానాప్రగడ శేషసాయి గారు మహాత్మాగాంధీ గారికి నివాళిగా ఎంతో ఆర్తితో, తాదాత్మ్యతతో ఆలపించిన వారి గానమాధుర్యాన్ని పద్యసుమాలను ఈ యూట్యూబ్ లింక్ లో ఆస్వాదించండి!. https://www.youtube.com/watch?v=3MeYxmp5Ih4 ఆచార్య మానాప్రగడ శేషసాయి గారు విజయనగరం సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా, ప్రధానాచార్యులు గా పనిచేశారు. అయన ప్రముఖ కవి. రచయిత మంచి వక్త. గతంలో వారిని విజయనగరం లో మా విస్సా ఫౌండేషన్ తరపున చిరుసత్కారం భాగ్యం. సత్యసాయి విస్సా ఫౌండేషన్.
పూజ్య గాంధీ మహాత్ముని జయంతి ఆ సందర్భంగా ఈ కవన కానుక పూజ్య బాపూజీ జయంతి సందర్భంగా కీర్తి శేషులు బ్రహ్మశ్రీ మానాప్రగడ శేషసాయి గారు మహాత్మాగాంధీ గారికి నివాళిగా ఎంతో ఆర్తితో, తాదాత్మ్యతతో ఆలపించిన వారి గానమాధుర్యాన్ని పద్యసుమాలను ఈ యూట్యూబ్ లింక్ లో ఆస్వాదించండి!. https://www.youtube.com/watch?v=3MeYxmp5Ih4 ఆచార్య మానాప్రగడ శేషసాయి గారు విజయనగరం సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా, ప్రధానాచార్యులు గా పనిచేశారు. అయన ప్రముఖ కవి. రచయిత మంచి వక్త. గతంలో వారిని విజయనగరం లో మా విస్సా ఫౌండేషన్ తరపున చిరుసత్కారం భాగ్యం. సత్యసాయి విస్సా ఫౌండేషన్.


Total Pageviews