Monday, June 7, 2021

శ్రీ లలితకు చిరు పదకవిత


 https://www.youtube.com/watch?v=yWqK1e-m8EY&list=PLhFZrcu-dWgmK6PhegZka23cJuxHbtiN6&index=4 

శ్రీ లలితకు చిరు పదకవిత  

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే

కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే

ఏ పాట నే పాడను అంటూ ఎంత లలితంగా పాడావు తల్లీ 

ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు

నీ లాంటి చిట్టి తల్లి పాడుతూ వుంటే ఆ దేవుడు అసలు నిద్రేపోడు

ఇంక మేలుకొలుపులెందుకు చిట్టితల్లీ 

బ్రతుకే పాటైన పసివాడను అంటూ పాడావు 

లలితంగా పాడే సలలిత రాగ సుధా రససారం 

నీ పాట వినని బ్రతుకు బ్రతుకే కాదని నేనంటాను 

తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాలకన్నా తీపి పాపాయి కే కాదు తల్లీ 

మనసున్న మనిషికి 

చేరువై హృదయాలు దూరమైతే పాట

జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట

కలలు చెదిరినా పాటే …. కలత చెందినా పాటే

మంజుల సౌరభ సుమకుంజముల లాలిత్యం 

రంజిలు మధుకర మృదు ఝంకారం నీ పాండిత్యం 

వెయ్యేళ్ళు వర్ధిల్లు తల్లీ - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌ 

https://www.youtube.com/watch?v=yWqK1e-m8EY&list=PLhFZrcu-dWgmK6PhegZka23cJuxHbtiN6&index=4

Saturday, May 29, 2021

కరోనానుంచి అందరినీ చల్లగా చూడమ్మా మా చల్లని గొల్లాలమ్మ తల్లీ!

 కరోనానుంచి అందరినీ చల్లగా చూడమ్మా మా చల్లని గొల్లాలమ్మ తల్లీ!  

పినపళ్ళ శ్రీ శ్రీ శ్రీ గొల్లాలమ్మ గ్రామ దేవత! ఈ లింక్‌ నొక్కి చూడండి. 

గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత గ్రామదేవత. ప్రతీ గ్రామదేవతకూ ఓ పేరు వుంటుంది. అలాగే మా పినపళ్ళ గ్రామదేవత పేరు శ్రీ శ్రీ శ్రీ గొల్లాలమ్మ  

తూర్పు గోదావరి జిల్లా లోని ఆలమూరు మండలంలోని ఈ గ్రామంలో పినపళ్ళ గ్రామదేవతగా కొలువున్నగొల్లాలమ్మ వారు ఇంటింటికి ఊరేగుతూ పూజలందుకుంటూ చల్లని దీవేనలందించే చల్లని తల్లి. ప్రతి ఏట ఆవిడకి జాతర సంబరాలు, తీర్థం, జరిపి నైవేద్యాలు కానుకలు మొక్కులు తీర్చుకోవడం కృతజ్ఞతా పూర్వకం మైన ఆచారం. పినపళ్ళ దేవత గోల్లాలమ్మ ఏటా జాతర మహోత్సవాలు జరుగుతాయి.

మన దేశంలో గ్రామదేవతల ఆరాధన అన్నది అనాదిగా వస్తూన్న ఆచారం, ఊరు పొలిమేరలో ఉండి దుష్ట శక్తుల నుండి గ్రామాన్ని గ్రామప్రజలను కాపాడతారు. అందుకు గ్రామప్రజలు కృతజ్ఞతగా ఏటేటా వారికి కొలుపులు, పూజలు చేసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు. మరి అటువంటి గ్రామ దేవతలు ఎలా ఉద్భవించారు ఇలా అనేక విషయాలు ఆసక్తి కరంగా వుంటాయి. ఒకసారి గతంలోకి తొంగి చూద్దాం! ప్రపంచంలో మనిషి జంతువు నుంచి పరిణామం చెంది మానవునిగా మారే క్రమంలో కొన్ని నమ్మకాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యమైంది మానవాతీత శక్తి ఉందనే నమ్మకం. ఈ అతీత శక్తినే దేవత, లేక దేవుడు అని నమ్మేవారు. ముఖ్యంగా అగ్ని, నీరు, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకృతి శక్తులను ఇలా భావించేవారు. తమకు ప్రమోదం కలిగినా, ప్రమాదం కలిగినా కారణం ప్రకృతిలోని ఏదో ఒక శక్తే అని మనిషి నమ్మాడు. అందుకే ప్రకృతిలోనూ, ఆకాశంలోనూ కనిపించే అనేక సహజమైన శక్తులను దైవశక్తులుగా భావించి పూజించడం ప్రారంభించాడు. అలా ప్రారంభమైన ఆరాధన ఇప్పటి ఆటవిక జాతుల్లో పెద్దగా మార్పులేమీ లేకుండానే వేల ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. ఇలాగే ప్రకృతి ఆరాధన విషయంలో ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఎక్కువ ఆధారాలు కనిపిస్తాయి. ఇప్పటికీ మనవారు ప్రకృతిలోని చెట్టు, పుట్ట, కొండ, గుట్ట, నదీనదాలు, కుక్క, పాము వంటి చరాచర జీవులన్నింటినీ పూజిస్తున్నారు.

మన దేశంలో అతి పెద్ద మతంగా ఉన్న హిందూ మతం నిజానికి మతమే కాదు. అది ప్రకృతిలోని ఒక ప్రాంతం పేరు (సింధ్ అనే ప్రాంతం) కాల క్రమంగా హింద్ గా మారటం వల్ల ప్రచారంలోకి వచ్చిన పేరు. హిందూ మతంగా చెప్పుకుంటున్న జీవన విధానంలో ఉన్నదంతా ప్రకృతి శక్తుల ఆరాధనే. ప్రకృతే సృష్టికి మూలంగా భావించి ఒక శక్తిగా కొలవడం మొదట ప్రారంభం అయింది. భూమిపై పెరిగే మొక్కలే మిగిలిన జీవరాసులందరికీ జీవనాధారం కాబట్టి భూమిని భూమాత అన్నారు. సూర్యుడు లేకపోతే జీవ ప్రపంచం మనుగడ కష్టమని అర్థమయిన తరువాత సూర్యభగవానుడన్నారు. బతకడానికి గాలి, నీరు అత్యంత ముఖ్యమైనవి కాబట్టి వాటిని వాయు దేవుడు, వరుణ దేవుడు (వర్షాన్నిచ్చే దేవుడు) అన్నారు. సకల నదులు, ఏరులు గంగాదేవిగా పూజలందుకోవడం ప్రారంభమయింది. ఇక అమ్మవార్ల విషయానికి వస్తే ప్రపంచంలో ఎందరో అమ్మదేవతలు ఉన్నారు. వారిలో మన దేశానికి వచ్చేటప్పటికి అదితి, లజ్జాగౌరి, రేణుక అనేవారు ముఖ్యులు.

చిన్నతనం నుంచి చుట్టుపక్కల గ్రామాలయిన చింతలూరు నూకాలమ్మవారి, పెదపళ్ల, సంధిపూడి గ్రామాల్లో కొలువైన అమ్మవారి జాతరలు తీర్థాలు, మా స్వగ్రామం పినపళ్ళలో కొలువున్నగొల్లాలమ్మ వారి జాతర సంబరాలలో భాగంగా చిన్న జాగారం, పెద్దజాగరం, తీర్థం, ఇలా నెల రోజులనుండి    ఇంటింటికి ఊరేగుతూ పూజలందుకుంటూ చల్లిని దీవేనలందించే చల్లని చక్కని తల్లి. ప్రతి ఏట ఆవిడకి జాతర సంబరాలు, తీర్ధం, జరిపి నైవేద్యాలు కానుకలు మొక్కులు తీర్చుకోవడం కృతజ్ఞతా పూర్వక మైన ఆచారం. ఈ లింక్‌ నొక్కి చూడండి https://www.youtube.com/watch?v=nB3jiz8nr_I&list=PLkR7dgb_wqAAOy-Vi1w88r6CMErP-yTM-&index=25

Tuesday, May 25, 2021

 అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో!


🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔


ఆనాటి రోజులు వేరు. అనుభవించిన మాలాంటి వాళ్లకు అర్థమవుతాయి. ఒక 40, 50 యేళ్ల క్రితం, దాదాపు ప్రతి ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, బాబాయిలు, మేనత్తలు వుండేవారు. అందరూ ప్రేమ, ఆప్యాయతలతో పాటు అప్పుడప్పుడూ చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ వుండేవాళ్లు.


కారణం, పిల్లలమంతా వాళ్లకు ఏదో ఒక రకంగా కోపం తెప్పించే దుర్మార్గపు పనులు చేస్తుండే వాళ్లం. ఒకరో, ఇద్దరో కొంచెం కోపం ప్రదర్శించి కొట్టినా, ఎక్కవగా తెలుగు తిట్లను వెదజల్లి, వాళ్ల కోపాలను మరు క్షణంలో అణచుకొని మరచిపోయే వాళ్లు.


అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో! అదరహో! అంటే, అంత అందంగా వుంటాయన్న మాట. ఎంతో ప్రేమగా కూడా వుంటాయి....ప్రేమతో అంటారు కూడా! తెలుగు తిట్లు అత్యంత మాధుర్యమే గాక, ఒక ప్రత్యేకతను సంతరించుకొని, ఒక రకంగా మరీ మరీ వినేలా వుంటాయి.


తెలుగువారి కొన్ని అచ్చ తెలుగు తిట్లు ఆగ్రహం తెప్పించవు సరికదా, సరదాగా నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్ని తిట్లు ముద్దుగా, మురిపెంగా, మహా గోముగా వుంటాయి.

మచ్చుకు కొన్ని తిట్లను చూడండి:--


""శుంఠా", "అప్రాచ్యుడా", "మొద్దురాచిప్పా", "భడవా", "వెధవాయి",


"చవటాయి", "సన్నాసి", "వాజమ్మ", "ముద్దపప్పు", "బడుద్ధాయి",


"అవతారం", "నంగనాచి", "నాలిముచ్చు", "కుర్రకుంక", "వెర్రిమాలోకం",


"చవట సన్నాసి" లాంటి అచ్చ తెనుగు తిట్లు, ఇప్పుడు కూడా దాదాపు


ప్రతి రోజూ, కొన్ని తెలుగు లోగిళ్లల్లో ముద్దుముద్దుగా ప్రతిధ్వనిస్తుంటాయి.


నిజానికి అవి తిట్లు కాదు.మన పాలిట దీవెనలు. 

🤔🤔🤔

మాట వరసకి పెద్దవాళ్ళు ఆమాటలని ఎలా ఉపయోగిస్తారో గమనించండి.


"నేతి గారెలు వేడివేడిగా తింటాడనుకుంటే, ఈ సన్నాసి, వెధవాయి ఎటు వెళ్ళాడో? ఏమో!" అని బామ్మగారు దిగాలు పడి పోతూంటుంది.


"అయ్యో! అయ్యో! అయ్యో! మడికట్టుకున్నానురా! నన్ను ముట్టుకోకురా భడవా" అని అమ్మమ్మ ముద్దు ముద్దుగా కోప్పడుతూ, వాడి నుంచి, దొంగా - పోలీసు ఆటలోలా తప్పించుకుంటూ వుంటుంది. ఆమెకు అదొక సరదా!


"మా బడుద్ధాయి ఎంత బాగా పాడతాడో" అని తాతగారు అదేపనిగా నలుగురికీ చెప్పి మురిసిపోతుంటారు.


మా చిన్నప్పుడు, మా తాతగారు, కోపం వచ్చినప్పుడు మరీ మా స్నేహితుల ముందు "గాడిద" అంటే నలుగురిలో బాగుండదని, 

"శంఖు మూతి గుఱ్ఱమా" అని తిట్టే వారు.

ఒక్కొక్క సారి "యద్భవిష్యుడా" అని తిడుతూ, వెంటనే నవ్వుతూ దగ్గరకు తీసుకునేవారు. వారి ప్రత్యేకతే వేరు. మేమెంత అదృష్టవంతులమో అనుకునే వాళ్లం.


🤔🤔🤔అలా!


ఒక్కో సందర్భాన్ని బట్టి, కోపంగా, ఇంకొకసారి ప్రేమగా తిట్టిన ప్రతి తిట్టూ ఎంతో అందంగా, ఆనందంగా వుండేది. అందులో ఎంత ఆప్యాయత, అభిమానం, ఆపేక్ష దాగి వుంటుందో అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. ఆ రకంగా, మేమంతా నిజంగా అదృష్టవంతులమే

. ఏమంటారు?


చదివినందులకు ధన్యవాదములు 🙏

శంకరాభరణం సినిమా సంపూర్ణంగా చూడండి.

 మీరందరూ శంకరాభరణం సినిమా చూశారా? 40 ఏళ్ల తర్వాత ఇదేం ప్రశ్నఅంటారా? ఒక్కసారి చాగంటి కోటేశ్వరరావు గారు ఈ సినిమాపై చేసిన నాలుగు రోజుల అద్భుతమైన ప్రసంగాన్ని వినండి. దర్శకత్వ ప్రతిభ, సాంకేతిక నిపుణుల ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ వివరంగా కళ్లకు కట్టినట్లు చేసిన ఈ ప్రసంగం తర్వాత ఈ సినిమాను మరోసారి చూడండి.

దయచేసి కుటుంబం అంతా కలిసి చూడండి. మరీ ముఖ్యంగా పిల్లలతో కలిసి ఈ ప్రసంగం విని, ఆ సినిమా చూడండి. మన సాంస్కృతిక ఘనతను ఘనంగా ఆవిష్కరించిన ఆ సినిమాని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నప్పుడే ఆ చిత్రాన్ని మనం సంపూర్ణంగా చూసినట్లు. ఈ లింకులో
1 వ రోజు ... https://youtu.be/d8rbI6VbMKQ
2 వ రోజు .. https://youtu.be/HowdXu-tO60 3 వ రోజు .. https://youtu.be/Lkcu9uzuMQQ  
  శ్రీ చాగంటి వారి ప్రసంగాలు చూడండి!

ఈ లింక్‌ లో https://www.youtube.com/watch?v=bV6qTLAJlos శంకరాభరణం సినిమా చూడండి. విస్సా పౌండేషన్!

Monday, May 17, 2021

 #45years నిండిన మేము రెండు తరాలకు సాక్షులం..🤷🏼‍♂️

         

స్వచ్చమైన గాలి నీళ్ళు, పచ్చటి  పొలాలు🌾🌴

పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళం... 

👦తలపై నుండి చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకుని...


చేతికి పుస్తకాల సంచి తగిలించుకుని ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను ఒక్కొక్కళ్లను కలుస్తూ పెద్దగుంపుగా 👦👦👩👧 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడచి వెళ్ళిన తరం వాళ్ళం..🚶🏃


జారిపోయే నిక్కరు మీదకు మొలతాడు లాక్కుంటు,చిరుగు బొక్కలకు గుడ్డ ముక్కలు అతుకులేయించుకున్న వాళ్ళం..🕺


10 వ తరగతి అయ్యే వరకు నిక్కరు వేసుకున్న తరం మాదే..


🤸🤹 గోలీలు, బొంగరాలు, కర్రా బిళ్ళ, నేలా బండ, 

ఉప్పాట, ఏడు పెంకులాట ఆడిన తరం మాదే..


🥎 బంతి పుచ్చుకుని నేరుగా కొట్టేసుకుంటే బంతి లాగ  వంటి మీద ముద్ర పడే ముద్రబాల్ లాంటి ఆటలాడిన తరం.,


🚴🏊🤽 బడికి వేసవి కాలం సెలవులు రాగానే తాటి చెట్లూ, సీమ తుమ్మ చెట్లూ, ఈతచెట్లు ఎక్కి కాయలు కోసుకొని తిన్న వాళ్ళం, చెరువులు, కాలవల్లో స్నానాలు     చేసిన వాళ్ళం, తాటి బుర్రలు బండితో ఆడినోళ్లం...


🪔🪔🪔 దీపావళికి తాటి బొగ్గుల రవ్వల దివిటీ కోసం   వళ్ళంతా మసి పూసుకొని మరీ తయారు చేసుకనే వాళ్ళం.


5 పైసల ఐస్ తిన్నది మేమె, పది పైసలతో బళ్ళో మ్యాజిక్   షో చూసింది మేమే.. 


🌦️ వర్షం వస్తె తాటాకు గొడుగూ, యూరియా సంచులు, కప్పుకుని బడికి వెళ్ళిన వాళ్ళం..


📖 second hand text books కోసం పరీక్షలు  అయినప్పటి నుండి ముందు తరగతి వాళ్ళని    బతిమాలిన తరం.


🚴సెకెండ్ హ్యాండ్ సైకిల్ తొ పక్క తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోల్లం మేమే..


✉️ఉత్తరాలు రాసుకున్న, అందుకున్న తరంవాళ్ళం..


పండగ సెలవులు, వేసవి సెలవులు, దసరా, సంక్రాంతి   సెలవులు, ఎన్ని సెలవులు వొచ్చినా ఐదు పైసలు   ఖర్చులేకుండా  ఆటపాటలతో ఆనందాన్ని 🤼  🏃🏻 ⚽ 🏸 🪁🏹  🤸  ⛹️. 🏊   అనుభవించిన తరంవోళ్ళం...,


👨👩👧👦 పెద్దలు, పిల్లలూ అందరం వీధి అరుగుల మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు, రాత్రులు ఆనందంగా    కబుర్లు చెప్పుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నదీ మేమే.... 


ఊర్లో ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా మన ఇంట్లో జరిగినట్లు అంతా మాదే.., అంతామేమే అన్నట్లుగా    భావించి స్వచ్చందంగా, నిస్వార్థంగా పాలుపంచుకున్న    తరం మాదే...🍁


🕵🏻ఉర్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని పిల్లలు, అందరం  కలిసి ఊరు చుట్టూ తెల్లవార్లూ ఎన్నో రాత్రులు టార్చిలైట్స్, కర్రలు పట్టుకుని కాపలా కాసిన వాళ్ళం  మేమే.


🕉️  🚩 🛕 ప్రతీ శ్రీరామ నవమికీ వినాయక చవితికి   గుడి దగ్గర తాటాకు పందిరికి రంగు కాగితాలు అంటించడం, మామిడి తోరణాలు కట్టడం కోసం ముందు రోజు రాత్రంతా జాగారం చేసింది మేమే..😊


👨👩👧👧 చుట్టాలు వస్తేనే అమ్మ ప్రత్యేక వంటలు వండి పెట్టిన తరం..


అత్తయ్యా, మామయ్య, పిన్ని, బాబాయ్, అక్కా, బావ       అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం,


స్కూలు మాష్టారు కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం...


పుల్లల పొయ్యి మీద అన్నం, కూర ఉడుకుతున్నప్పడు   వచ్చే అద్బుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం.   వాళ్ళం..,🌱


పొయ్య మీదనుంచి నేరుగా పళ్ళెంలోకి వచ్చిన వేడి వేడి అన్నంలో ఆవకాయ, వెన్నపూస వేసుకుని పొయ్యి దగ్గరే  

తాతయ్యలు, అమ్మమ్మ,నాయనమ్మ, అమ్మానాన్నా, పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని బాబాయ్, అత్తయ్య    మామయ్య, అక్కలు చెల్లెళ్లు, అన్నయ్యలు, తమ్ముళ్లు   అందరం ఒకే దగ్గర చేరి మధురమై అనుభూతితో  కూర్చుని అన్నం తిన్న తరం..😊😘☺


అమ్మమ్మలు, నాయమ్మల చేత గోరుముద్దలు తిన్నది.. "అనగనగా ఒక రాజు..."కథలు విన్నది మేమే..


నూనె పిండితో నలుగు పెట్టించుకుని కుంకుడు కాయ పులుసుతో  తలంటు స్నానం చేయించుకున్న తరం.,🍀


📻రేడియో, దూరదర్శన్📺, టూరింగ్ టాకీస్📽️కాలం చూచిన వాళ్ళం...🍁


🎥 40 పైసల నేల టిక్కెట్ తో నేల మీద కూర్చుని, 

1.20 రూపాయల chair   టిక్కెట్ తో  rs 2 ticket    బాల్కనీ లో కూర్చుని సినిమా చూచిందీ మేమే...


స్కూల్, కాలేజీ రోజుల్లోనే ఎలక్షన్లు చూచిన వాళ్ళం.. .🍂


అమ్మా నాన్నాతో సంవత్సరానికి ఒక సారి, "పరీక్ష పాస్ అయ్యావా.." అని మాత్రమే అడిగించుకున్న   తరం వాళ్ళం...🌹

 అప్పటికీ ఇప్పటికీ పెద్దవాళ్లకు గౌరవం ఇచ్చే తరం మాదే


ప్రస్తుతం ఉన్న Whatsapp, Fb, skype లు మీతో పాటు సమానంగా వాడేస్తున్న మాతరం..,

మేమే ఆ తరానికి  ఈ తరానికి మధ్యవర్తులం.. మేమే..


అవును....

రెండు తరాల మద్యలో జరిగిన   అనూహ్యమైన మార్పులకు మేమే సాక్షులం..


🔸 మన ముందుతరం


తల్లిదండ్రుల పై భయభక్తులు ...ఉన్న వాళ్లు... మన తరువాత తరం వాళ్లు వాళ్ల పిల్లలకు భయపడుతుంటారు..

మనం మాత్రం అటు తలిదండ్రులకు ఇటు పిల్లలకు భయపడే..అనిశ్చిత తరం😀

Wednesday, May 12, 2021

 "ద్వారానికి తారామణిహారం "   అర్థం ఏమిటి? 10-05-21

ద్వారానికి తారామణిహారం

హారతి వెన్నెల కర్పూరం

మోసం ద్వేషం లేని సీమలో

మొగసాల* నిలిచె నీ మందారం.

        ౼ దేవులపల్లి కృష్ణశాస్త్రి    మొగసాల = ముఖశాల ... ఇంటి  ముందరి శాల       (సాయబాన ... తెలంగాణ పదం)

త్వన్మనోహర వ్యాఖ్యానం అపేక్షించి

- శ్రీ గురిజాల రామశేషయ్య 

--------------------------------------------------------------------------

నమస్కారం.

“త్వన్మనోహర వ్యాఖ్యాన” పదం మీ అభిమానంలోనుంచి పుట్టుకు వచ్చింది.

నేనేమిటో, నా స్థాయి ఏమిటో నాకు తెలుసు.

తన యెఱిగినయర్థంబు… అని మహాభారతం, వెనక ముందరికి బెద్దలకెల్లను వివరపు సమ్మతి యీ వెరవు  (4-432) అని అన్నమయ్య  నన్ను నిరంత రం  ప్రచోదనం చేస్తుంటారు.

అందుకే నిత్య విద్యార్థిని అయిన నేను ఎవరు అడిగినా   వ్యాఖ్యానం చేయటానికి ప్రయత్నిస్తుంటాను. 

మనోహరత్వం మల్లినాథ స్థాయివారిది. నాది కాదు.

 ****

దేవులపల్లివారి ఈ మనోహరమైన  పాటను మీరు ప్రస్తావించిన వెంటనే  “ఇక్షు సముద్రం ఎక్కడుందో నాకు తెలియదు. కాని ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తమూ ఇక్షురసార్ణవమే...” అను  శ్రీశ్రీ వాక్యం గుర్తుకు వచ్చింది.

మీరు అడిగిన చరణాన్ని వివరించాలంటే  ఆపాత మధురమైన ఆ మల్లెల సౌరభ గీతాన్ని ఆద్యంతం ఒకసారి ఆస్వాదించాలి.చరణాలు, పల్లవి పరస్పర సంబంధం కలిగినవి.

ఇది మల్లెల వేళయనీ .....ఇది మల్లెల మాసమనీ

తొందరపడి ఒక కోయిల

ముందే కూసిందీ ........విందులు చేసింది

కసిరే ఎండలు కాల్చునని.....

ముసిరే వానలు ముంచునని...

ఇక కసిరే ఎండలు కాల్చునని.....

మరి ముసిరే వానలు ముంచునని...

ఎరుగని కోయిల ఎగిరింది.....విరిగిన రెక్కల ఒరిగింది ......

నేలకు ఒరిగింది ...... ఇది మల్లెల వేళయనీ…..

మరిగిపోయేది మానవ హృదయం.......

కరుణ కలిగేది చల్లని దైవం ......

వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంతమాసం....

వసివాడని కుసుమ విలాసం....     ఇది మల్లెల వేళయనీ…..

ద్వారానికి తారామణిహారం........హారతి వెన్నెల కర్పూరం..........

మోసం ద్వేషం లేని సీమలో .......

మొగసాల నిలిచె ఈ  మందారం.... ఇది మల్లెల వేళయనీ…..

--------------------------------------------------------------------

సాహిత్యం అనేది అర్థం అయ్యేలానే వ్రాయక్కర్లేదు. అర్థం చేసుకోవాలనే కుతూహలం రేకెత్తించేలా కూడా వ్రాయవచ్చు అని పెద్దలు అంటారు.

అటువంటి  దేవులపల్లి  గీతం ఇది.

ఎక్కడా మల్లెల వేళ ఉండదు. వెన్నెల మాసముండదు. వెన్నెల వేళ ఉండాలి లేదా మల్లెల మాసముండాలి. నిజమే.  

కాని మనసున మల్లెల మాలలు ఊగించిన కృష్ణశాస్త్రి సాహిత్యం ఇది.

ఈ విమర్శకి కృష్ణశాస్త్రి గారే జవాబు చెప్పారట. 

 “తొందర పడి ఒక కోయిలా ముందే కూసిందని – ఈ పాట పల్లవిలోనే సందర్భం చెప్పడం జరిగింది. వెన్నెల మాసం, మల్లెల వేళా అన్న భావం తొందరపడే కోయిలదే నని స్ఫురించేలా వ్రాసాను “ అని దేవులపల్లి చెప్పారట. (తాడేపల్లి)

 1

 మోసపోయిన ఒక నాయిక ఇక్కడ కోకిల.

ఏది నమ్మాలో , ఎవరిని నమ్మాలో, ఎక్కడ నమ్మాలో తెలియక మోసపోయిన  నాయికను  కోకిలగా ఈ గీతంలో దేవులపల్లి ప్రతీకాత్మకంగా చెప్పారు. 

కసిరే ఎండలు కాల్చునని.....

ముసిరే వానలు ముంచునని...

ఇక కసిరే ఎండలు కాల్చునని.....

మరి ముసిరే వానలు ముంచునని...

ఎరుగక కోయిల ఎగిరింది.....విరిగిన రెక్కల ఒరిగింది ......

నేలకు ఒరిగింది ...... 

మండిపోయే ఎండలు వేరు. కసిరే ఎండలు వేరు. కోపం ఎదుటి వాని జీవితాన్ని నాశనం చేస్తుంది.  కోపగించిన ఎండ లోకాన్ని మంటల్లో  కాలుస్తుంది. బూడిద చేస్తుంది. నాయకుడు కసిరే ఎండ అని తెలియక , కోకిల వంటి నాయిక అతని దగ్గరగా వచ్చింది. ప్రేమతో ఎగిరింది. యథార్థ స్వరూపం తెలిసి విరిగిన రెక్కలతో, శిథిలమయిన రెక్కలతో ప్రేమ విరహితగా  నేలకు ఒరిగింది. అలాగే ఎడతెగని వానలు ( ముసురు) ముంచేస్తాయి. నాయకుని దుర్మార్గపు చేత ముసురు. అది తెలియక  కోకిల దగ్గరగా వెల్లింది. అతని దుర్మార్గపు చేష్ట అనే ముసురులో మునిగి ఎగరలేని స్థితిలో కోకిల( నాయిక)  నేలకు ఒరిగింది.

కసిరే ఎండ ,ముసిరే వాన   ఈ చరణంలో దుర్మార్గులయిన వ్యక్తులకు ప్రతీకలు. వారికి దూరంగా ఉండమని కోకిలమ్మలవంటి  నాయికలకు  హెచ్చరిక ఇది. 

(తాడేపల్లి)

మరిగిపోయేది మానవ హృదయం.......

కరుణ కలిగేది చల్లని దైవం ......

వాడే లతకు ఎదురై వచ్చువాడని. వసంతమాసం....

వసివాడని కుసుమ విలాసం.... ఇది మల్లెల వేళయనీ…..

మొదటి చరణంలో  బాధపడిన కోకిలకు ( నాయికకు) ఈరెండో చరణంలో కవి  ఆశ్వాసన కలిగించారు.  సమస్త  బాధోపహత జీవులకు కూడా కవి అశావహ దృక్పథం కలిగించారు. 

అనుకోకుండా బాధ వస్తుంది. దానికి కుమిలిపోకూడదు. మానవ హృదయం బాధ వచ్చినప్పుడు  బాధాకారకాన్ని తలచుకొని  మరిగిపోతుంటుంది.

అది తగదు.

మరిగిపోయే మానవ హృదయం కరుణ కలిగిన  చల్లని దైవాన్ని తలచుకొని విషాదం నుంచి బయటపడాలి.

ముందు పాదంలో మరిగిపోవటం.. తరువాత పాదంలో చల్లని … ఇది ఉత్తమ రచనా కళ.

వాడిపోయిన లతలను(కష్ట జీవులను)  ఓదార్చటానికి   వాడిపోని  వసంతమాసం(దైవ రూపంలో మానవత్వం)  తనకు తానుగా- మనం-  పిలువకపోయినా ఎదురుగా వచ్చి ఓదారుస్తుంది. 

ఆ కుసుమ విలాసం ( ఉత్తముల ఓదార్పు మాటల చల్లదనం) వసివాడనిది. వాడిపోనిది.

 (తాడేపల్లి)

ద్వారానికి తారామణిహారం........హారతి వెన్నెల కర్పూరం..........

మోసం ద్వేషం లేని సీమలో .......

మొగసాల నిలిచేనే మందారం.... ఇది మల్లెల వేళయనీ…..

రెండో చరణంలోని ఆశ్వాసన ఈ మూడో చరణంలో వెన్నెల చల్లదనాన్ని కలుపుకొన్నది.

బాధా జీవులారా ! మీకు ఆశ్వాసన కలగటానికి ఒక పని చేయండి.

ఆకాశమనే ద్వారానికి నక్షత్రాల  మణి హారాన్ని కట్టారు. ఒకసారి చూడండి.

హారం కట్టటమే కాదు.దానికి హారతి ఇస్తున్నారు.

దేనితో? 

వెన్నెల కర్పూరంతో హారతి ఇస్తున్నారు.

మోసం, ద్వేషంలేని ఆ ప్రదేశంలో -

ఆ  ముఖ మండపంలో మందారం ( ఒక పువ్వు , పువ్వు అనే నాయిక) నిలిచింది. 

ఆకాశమనే ద్వారానికి నక్షత్రాల  మణి హారం అద్భుతమైన భావం. దానికి పై స్థాయికి తీసుకు వెళ్లింది వెన్నెలను తెల్లని 

కర్పూరంతో పోల్చటం. 

నక్షత్రం తెలుపు.

 వెన్నెల తెలుపు.

తెలుపు స్వచ్చతకు ప్రతీక.

అందువల్ల మోసం, ద్వేషంలేని ఆ ప్రదేశం కూడా  తెలుపు .

 ఇక్కడే నాయిక నిలుస్తుంది . నిలవాలి కూడా . కసిరే ఎండల, ముసిరే వానల ప్రవృత్తి ఉన్న వ్యక్తుల నీడలో  కాదు.

స్వచ్చతకు మణి హారాలు పట్టే ఆకాశమంత ఎత్తైన  వ్యక్తిత్వమున్న నాయకుల దగ్గర  , నాయికలు నిలుస్తారు. 

 ***

మోసపోయిన స్త్రీ వృత్తాంతాన్ని కోకిల పరంగా  చెబుతూ  గుచ్చుకొనే 

ముళ్లకు-  పూల మృదుత్వాన్ని పంచిన  కృష్ణ శాస్త్రి కి ఏమి 

ఇవ్వగలం? ! హృదయాన్ని తప్ప.  

- తాడేపల్లి పతంజలి

Sunday, May 9, 2021

 *మాతృ_పంచకం : ( సేకరణ )


🕉️💢🕉️💢🕉️🔯💢🕉


👉కాలడిలో ఆదిశంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేశారు.

ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "#మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. మనస్సును కదిలించే 

*ఆదిశంకరుల మాతృ పంచకం* స్మరించుకొందాం.


*ముక్తామణిస్త్వం నయనం మమేతి*

*రాజేతి జీవేతి చిరం సుత త్వం*

*ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః*

*దదామ్యహం తండులమేవ శుష్కమ్.1*


అమ్మా! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.


*అంబేతి తాతేతి శివేతి తస్మిన్*

*ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః*

*కృష్ణేతి గోవింద హరే ముకుందే*

*త్యహో జనన్యై రచితో యమంజలిః.2*


పంటిబిగువున నా ప్రసవ కాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.


*ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా*

*నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ*

*ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః*

*దాతుం నిష్కృతి మున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.3*


అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.


*గురుకుల ముపసృత్య స్వప్న కాలే తు దృష్ట్వా*

*యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః*

*గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం*

*సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః. .4*


కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి, మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను


*న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా*

*స్వధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా*

*న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-*

*కాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.5*


అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ!


ఆది శంకరులకు వారిని కన్న తల్లికి నమస్కారము. సృష్టిలో తల్లిని మించిన దైవము లేదు. అందఱు తల్లులకు నమస్కారము

🙏🙏🙏🙏🙏



Total Pageviews