Wednesday, April 4, 2018

పూరి జగన్నాధ ఆలయంలోని రత్న భాండాగారం

పూరి జగన్నాధ ఆలయంలోని నగల భాండాగారం తాళాలను 34 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తీస్తున్నారు. 800 ఏళ్ళ నాటి ఈ పురాతన ఆలయంలో స్వామివారి నగలను భద్ర పరిచిన గదిని రత్నభండార్ అంటారు. 1984లో ఈ రత్న భాండారాన్ని తెరిచి స్వామి వారి సంపదను చూసిన తర్వాత మూసివేశారు.
మళ్ళీ ఇన్నాళ్ళకు బుధవారం నాడు (04-04-2018) పది మంది సమక్షంలో ఈ తలుపులు తెరవబోతున్నారు. ఈ పది మంది మాత్రమే ఆ గదిలోకి ప్రవేశిస్తారు. ఇందులో పురావస్తుశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు ఉంటారు. 34 ఏళ్ళుగా తలుపులు తీయకపోవడంతో లోపల పాములు వుండే అవకాశాలున్నాయి. అందువల్ల వీరితో పాటు పాములు పట్టే ఇద్దరిని లోపలికి అనుమతిస్తారు.
ఒరిస్సా హైకోర్టు ఆదేశాల మేరకు రత్న భాండాగారం నిర్మాణం లోపల ఎలా వుందో చూసేందుకు ఈ ప్రత్యేక బృందం ఆ తలుపులు తెరవబోతోంది.
రత్న భాండాగారంలో లైట్లు కూడా వుండవు. కేవలం టార్చి లైట్ల సహాయంతోనే ఆ గదిలోకి ప్రవేశించి గోడలు, ఫ్లోరింగ్ ఎలా వుందో పరిశీలిస్తారు. పది మందిని లోపలికి పంపేముందు.. బైటికొచ్చిన తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.
గదిలో స్వామివారి ఆభరణాలను లెక్కించడంగానీ, వాటిని తాకడం గానీ చేయకూడదు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ భాండాగారం ఎలా వుందో చూడడం వరకే వీరి బాధ్యత. రత్న భాండాగారంలోకి ప్రవేశించే పది మందిలో ఒరిస్సా మహరాజు గజపతి మహారాజ్ దివ్యసింగ్ దేవ్, లేదా రాజు పంపే ప్రతినిధి, ఇద్దరు ఆర్కియాలజీ శాఖ అధికారులు, హైకోర్టు నియమించిన న్యాయవాది, వార్తా సంస్థల నుంచి పీటీఐ ప్రతినిధి వుంటారు.
రత్న భాండాగారంలో ఏడు అరలు వుంటాయి. 1984లో ఈ ఏడింటిలో మూడింటిని మాత్రమే తెరిచారు. మిగిలిన నాలుగు అరలను గత 98 ఏళ్ళుగా తెరవలేదు. వాటిలో ఏముందో కూడా ఎవరికీ తెలియదు. పూరి జగన్నాధుడికి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వజ్రవైఢూర్యాల నగల సంపద వుందని ఎప్పటి నుంచో ప్రచారంలో వుంది. అయితే ఆ సంపదను ఇంతవరకు కంటితో చూసిన వారెవరూ లేరు. స్వామి వారి సంపద వున్న ఆ రత్నాభాండాగారం పటిష్టమైన భద్రతను కలిగి వుంటుంది.
ఈరోజుకు కూడా హైకోర్టు ఆదేశాలతో ఆ గది తలుపులు తీస్తున్నారు. ఇక లోపలికి వెళ్ళే ప్రత్యేక బృందం కూడా స్వామి నగలను తాకకుండా, చూడకుండా, కనీసం టార్చి లైట్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంటే, పూరి జగన్నాధుడి సంపదను ఊహించడమే తప్ప ఎవరూ లెక్కకట్టలేనిది.
త్రివేండ్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్షల కోట్ల ఆభరణాల సంపదను మదింపు వేసిన తర్వాత దానిని కేంద్ర భద్రతా దళాల నిఘాలో పెట్టి జాగ్రత్త చేశారు. ఇప్పుడు పూరి జగన్నాధస్వామి ఆలయంలో ఖజానా ఒక్కటే ఈ దేశంలో ఇంతవరకు లెక్కించకుండా, చూడకుండా వున్న నిధి. అందువల్ల దాని విలువ ఎన్ని లక్షల కోట్ల విలువ వుంటుందో ఊహకందనిది.

No comments:

Post a Comment

Total Pageviews