Friday, July 27, 2018

దేశం ‘భాషల మృత్యుదిబ్బ’గా మిగులుతుంది! ప్రొ।। గణేశ్‌ డెవి.ఈనాడు27-07-2018

ఈ అంశంపై పూర్తి వివరాలు నేటి ఈనాడు లో చదవండి.
దేశం ‘భాషల మృత్యుదిబ్బ’గా మిగులుతుంది! 
అర్థశతాబ్దంలో దేశంలో 283 భాషలు మాయమయ్యాయి 
ప్రజల భవిష్యత్తుకు ఇది ప్రమాద సంకేతం 
హెచ్చరిస్తున్న విఖ్యాత భాషా పరిశోధకులు గణేశ్‌ డెవి 
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి 
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి 
మన దేశంలో సగటున ప్రతి 2 నెలలకు ఒక భాష కనుమరుగైపోతోంది!  ఇదేదో జోస్యం కాదు. మూలమూలలూ గాలించి.. ప్రజలు మాట్లాడుతున్న భిన్న భాషలపై విస్తృతంగా అధ్యయనం చేసి.. దేశంలో మొత్తం 780 సజీవ భాషలున్నాయని తేల్చిచెప్పినవిఖ్యాత భాషా పరిశోధకులు, విద్యావేత్త ప్రొ।। గణేశ్‌.ఎన్‌.డెవి చెబుతున్న క్షేత్రస్థాయి వాస్తవం ఇది!
 ఇదే కాదు.. భాషల విషయంలో మనం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రమాదకరమైన ధోరణులు చాలానే చోటు చేసుకుంటున్నాయి. గత ఐదు దశాబ్దాలుగా దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో 3వ స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు 4వస్థానానికిజారిపోయింది. ఒక భాష మాట్లాడే వారి సంఖ్య తగ్గి పోతుండటం మనం ఊహించిన దానికంటే కూడా పెద్ద ప్రమాద సంకేత మని హెచ్చరిస్తున్న ప్రొ।। డెవి
భాషల మృత్యు దిబ్బగా మిగులుతుంది! 
ప్రొ।। గణేశ్‌ డెవి.. కొండలు కోనలు దాటుకుని దేశం మూలమూలలూ తిరిగి.. ప్రతి సమూహంతోనూ మమేకమై.. ప్రజల భాషలను మక్కువగా అక్కున జేర్చుకుని.. దేశ భాషలపై విస్తృతంగా పరిశోధన చేస్తున్న శక్తిలాంటి వ్యక్తి! దేశంలో ప్రజలు మాట్లాడుకొనే సజీవ భాషలు ఎన్ని ఉన్నాయన్న దానిపై విస్తృత అధ్యయనం ‘పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’కు సారథ]్యం వహించిన ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఇంగ్లిషు, మరాఠీ, గుజరాతీలలో ఇప్పటి వరకూ 80కిపైగా పుస్తకాలను ప్రచురించారు. ప్రస్తుతం ధార్వాడలో ఉంటూ ప్రపంచంలోని భిన్న భాషల తీరుతెన్నులపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.  ఇంగ్లిషు,  ఇతర అంతర్జాతీయ భాషలపై ‘పీఎల్‌ఎస్‌ఐ’ ప్రచురించిన తాజా సంకలనాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ముఖ్యాంశాలు..


మీరు భారతదేశం ‘భాషల మృత్యుదిబ్బ’గా (గ్రేవ్‌యార్డ్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌) మారుతుందని హెచ్చరిసున్నారు. ఎందుకలా? దేశంలో అంతటి తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయా? 
జ: కచ్చితంగా! గత ఐదు దశాబ్దాల్లో దేశంలో 283 భాషలు అదృశ్యమయ్యాయి. అంటే ఏడాదికి ఆరు భాషలు.. ప్రతి రెండు నెలలకు ఒక భాష చచ్చిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో 22 భాషలుండగా వాటిలో 17 భాషలు తగ్గిపోయాయి. గత పదేళ్లలో 17 భారతీయ భాషలు తిరోగమనం బాట పట్టాయి. 
ప్రాథమిక విద్యాబోధన మాతృభాషకు దూరం జరగటం మంచిదేనంటారా? 
జ: మాతృభాషలో విద్య.. అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రస్తుతం దేశంలో అన్నిచోట్లా చదువుల్లో ప్రమాణాలు పడిపోయాయి. 5వ తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలు సరిగా చదవలేకపోతున్నారు. అందులో సగం మంది ఏం చదువుతున్నారో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది జాతీయ విపత్తు. మాతృభాషలో విద్యాబోధన తప్పనిసరి. దీంతో పాటు ఇంగ్లీషు చదువూ అవసరమే. ఎందుకంటే అది విజ్ఞానానికి సంబంధించిన భాష. దీన్ని పరిగణలోకి తీసుకొని కొన్ని ‘భాషా నగరాలను’ ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రత్యేక భాషా రిసోర్స్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దేశంలో హిమాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లు రెండూ ఈ ప్రయోగం చేసి మంచి ఫలితాలు కూడా సాధించాయి. అన్ని రాష్ట్రాలూ ఆ బాటను అనుసరించాలి.
భాషలు అదృశ్యం కాకుండా ఉండాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలంటారు? 
జ: చిన్న భాషలు బతికున్న చోట అక్కడున్న జీవనోపాధి విధానాలను సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఈ భాషలకూ, సంస్కృతికీ వలసలు ప్రధాన శత్రువులవుతున్నాయి. ఇదే సమయంలో వలసలు ఆధునికతకు కూడా కారణమవుతున్నాయి. వలసల అవసరం పెద్దగా లేకుండా ఆధునికత సాధించేలా ఉండాలి. దీనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. ప్రస్తుతం విచ్చలవిడిగా వాడుతున్న మొబైల్స్‌ మూకదాడులకే దోహదపడుతున్నాయి. ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు తేవాల్సిన అవసరం ఉంది.

ఏ రాష్ట్రంలో మంచి భాషా విధానం ఉంది? 
జ: ఎలాంటి సందేహం లేకుండా ఝార్ఖండ్‌లోనే. 14 అధికార భాషలను గుర్తించారు. గిరిజన భాషలకూ సముచిత ప్రాధాన్యం ఇచ్చారు.

అనేక భాషల సమ్మిళితంగా ఉన్న సమాజాలు తక్కువ హింసాత్మకంగా ఉంటే.. ఒకే భాషాధిపత్యం కలిగిన ప్రాంతాలు, సమూహాల్లో హింసాత్మక ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి!
----------

No comments:

Post a Comment

Total Pageviews