Saturday, December 1, 2018

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ " నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని
ఆ కాలంలో అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం
తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహలాడాడు బాణభట్టులాగే.
తీరా నాటకం చదివి నచ్చకపోతే మహాకవి ఏమంటాడో అని (బాణుడిలాగే ) ఒక శంక.
అందువల్ల తను స్వయంగా కాళిదాసుకు నాటకం చూపించటానికి సంశయించి, తన
కుమారుడికి తన కుమారుడికి తన తాళపత్రగ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు.
కాళిదాసు యింట్లో కూచుని చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ
అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. అన్నాడు.
వేరే సమయమెందుకు?వచ్చావుగదా!యిప్పుడే చదివి వినిపించు. ఒక చెవి పడేసి వినేస్తాను. అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కూడా మరల్చకుండా.
భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది. తన తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధపెట్టి వినేందుకు కూడా యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించటం చెవిటివాడి
ముందు శంఖమూది నట్టు గదా! అనిపించింది. కానీ ఏంచేస్తాడు?తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు, అంతకంటే ఎక్కువే. ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప
ఆయనకు మనః శాంతి లేదు. చేసేది లేక నాటకమంతా చదివి వినిపించాడు.
చదివాడు కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇటుపక్కకు తిరిగి చూడనైనా
చూడలేదు. అంతా చదివాక మాత్రం,నోటినిండా తాంబూలం తో అస్పష్టన్గా సున్నా ఎక్కువైంది అని మాత్రం వినిపించింది. భవభూతి కుమారుడికి 'ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది. దానిమీద వున్న
ఆసక్తి గూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.అనుకొన్నాడు. ఆ
నిర్లక్ష్యం, అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి.
ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు. విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు.
తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసేభవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం'
అని మెచ్చుకున్నాడు. భవభూతి ఆయనను కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు.
మాటల మధ్యలో భవభూతి,కాళిదాసుతో మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు. అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా, మీ
తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం ఏది అన్నారని చెప్పాడు. మీరేమో
యిప్పుడు నా నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏదో సాటి కవినని మర్యాదతో
మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను. ఈసారైనా విని మీ సూచనలూ,
అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను. అన్నాడు.
కాళిదాసు నవ్వాడు; 'కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న
ఆసక్తి మరే విషయంపైనా లేదు. మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం
క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను. పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం
ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే
నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను.నేను అన్నమాటలు పై పై మర్యాదకోసం చెప్పినవి కావు.' అన్నాడు.
ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు. నేనన్నది సున్నం గురించికాదు. 'సున్న' గురించి , నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో
ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నాని చిన్న సూచన చేశాను తప్ప మీ అద్భుతమైన నాటకం లో
ఏ చిన్న మార్పూ అవసరం లేదు.
ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగి పోయాడు. ఉత్సాహంగా సున్న ఎక్కువైంది ఏ శ్లోకం లో స్వామీ?నాటకంలో శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.దయచేసి చెప్పండి. అన్నాడు.
ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది? మొదటి అంకం లోనే, రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.
కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్
అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ
అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో
అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్
(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక - ఏక - దోష్ణో: = అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో
ఒకరుగా ఒదిగి ;
అవిరళిత కపోలం - చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా
ఆసక్తి యోగాత్ - అక్రమేణ - కిమపి కిమపి - మందం మందం - జల్పతో: = ఆసక్తి బట్టే తప్ప - మారె వారసలేకుండా - ఏవేవో ముచ్చట్లు - గుసగుసలుగా చెప్పుకుంటున్న
(మనకు)
అవిదిత గతమయామా - రాత్రి: - ఏవం - వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన
జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది.
అవునవును అన్నాడు భవభూతి.
అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులు
రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)
అని చెప్తే మరీ బాగుంటుంది.
పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి.అలా ఉంటూనే ఉంటాయి.
రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది.అన్నాడు
కాళిదాసు.
అవశ్యం మహాకవి! ఎంత అద్భుతమైనమార్పు సూచించారు! అందుకే తమరు కవికుల
గురువులు అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి.
అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు.
నాటకేషు చ కావ్యేషు వయం వా వయమేవ వా
ఉత్తరే రామచరితే భవభూతి: విశిష్యతే
నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమె సాటి. ఉత్తరరామచరిత్ర లో మాత్రం
భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు. అన్నాడు కాళిదాసు.
భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు.
కన్యాకుబ్జ౦ రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ,ఆంద్రుడని కొందరూ వాదించారు.
భవభూతి రచనలు మూడూ నాటకాలే.'ఉత్తరరామచరితం' 'మాలతీమాధవం'
'మహావీరచరితం' భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు.
-----------------------------శుభరాత్రి-------------------------------- 

No comments:

Post a Comment

Total Pageviews