Monday, December 17, 2018

అంతా కలిసి మనుషులంతే!

‘ఇదంత అర్రీబుర్రీగా తేలే యవ్వారం కాదు. నువ్వడగ్గానే బోటేసెయ్యడానికి! దానికో కతా కమామీసూ వుంటది. శ్రీ గవర్నమెంటు వారి ఉత్తర్వుండాల. ఆ గుమాస్తాల్నీ ఆళ్లనీ బెత్తాయించాల! ఏటి? ఆఁ! ఓ లకారందాకా కర్చవుద్ది!’ చుట్టపొగ ధారాళంగా వదుల్తూ చెప్పాడు కాంట్రాక్టర్.

‘లకారందాకా అవుతుందిటండీ!’ అంటూ నసుగుతున్నాడు జోగినాథం.

‘సర్లేవయ్యా! విన్నాంగా? అలాగే కానీ! నాకుమాత్రం మాటరాకూడదు. పెద్దింటి వ్యవహారం. ఫంక్షనుకొచ్చే వాళ్లంతా చాలా పెద్దమనుషులు! ఏఁవనుకున్నావో?’ అంటూ దర్పంగా కారెక్కాడు సోమరాజుగారు.

‘దీన్సిగదరగా! ఏం ఫోర్సూ?’ అని మనసులో అనుకుని, ‘మాకు తెల్దేటండీ? మీరెళ్లండి నేజూస్కుంటాను!’ అంటూ సాగనంపేసాడు కాంట్రాక్టర్.

‘ఇదిగో జోగినాథం, ఆ పళ్లంరాజుకి ఫోను కలుపు. అర్జంటుగా ఓ బోటు కావాలన్జెప్పు. డీలక్సే!’ అంటూ లోపలికి అరిచాడు.

‘మీకేఁవండీ! ఎన్నైనా చెబ్తారు. ఇప్పటికిప్పుడు బోటెయ్యాలంటే మాటల్టండీ? ఎన్ని కాయితాలు నింపాలి, ఎన్ని దస్కత్తులు పెట్టించాలి? ఇవాళంతా నాకిక నిద్దరుండదు!’ అంటూ విసుక్కున్నాడు జోగినాథం.

‘మన కిష్టిగాణ్ణట్టుకునెళ్లవయ్యా! ఆ పెద్దమడిసి లకారం ఇస్తానన్నాడు ఆలకించలేదా?’ అన్నాడోలేదో

‘లకారాలన్నీ మీకూ, నకారాలన్నీ నాకునున్నూ! సర్లెండి! బయల్దేరుతున్నా! ’ అంటూ పంచెబిగించి బయటపడ్డాడు.

గోదారిమీద డీలక్సు బోటేసుకుని పాపికొండల మీదుగా లంకలన్నీ తిరుగుతూ బాపుగారి జన్మదినోత్సవం జరపాలని ప్లానేసాడు మంగళా టెక్స్‌టైల్స్ సేట్ గారు.

దానికి జంగమనేని భగవంతరావుగారు, రాజా రామదాసుగారు, కొబ్బరికాయల సుబ్బారాయుడు కూడా వస్తున్నారు. పెద్దవాళ్లతో వ్యవహారం. అంతాజేరి బోటుమీద ఎంచక్కా ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ కావలసింది తింటూ, ఆనక కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిని చూసేసి ఒడ్డుకి చేరాలని ప్రణాళిక వేసేరు.

ఇంకో జనతా బోటుని కూడా బెత్తాయించమని చెప్పాడు సేటు. అలగాజనం వస్తారేమోననీ, పెద్దమనుషులకి ఇబ్బందవుతుందనీనూ!

సేట్ చెప్పిందంతా విన్న భగవంతరావు రెండు బోట్లుండడానికి వీల్లేదన్నాడు. ‘అందరం సమానమేనూ, సీతారాముడు చెప్పింది మర్చిపోయారా?’ అంటూ సున్నితంగా మందలించాడు.

సుబ్బారాయుడు కూడా అదేమాటన్నాడు. ‘మా అమ్మాయి అను, అల్లుడు బాబ్జీ చెప్పీదాకా నేనూ అలాగే గునిసీవోణ్ణి! ఆళ్లే నా కళ్లుతెరిపించారు!’ అంటూ గుర్తుచేసుకున్నాడు.

కాంట్రాక్టర్ తలుచుకుంటే బోటేయించడం అదెంతపని? అందుకే జోగినాథంతో కలిసి సోమరాజుగారిని వెళ్లి మాటాడమని పంపించాడు సేట్.

మొత్తానికి జోగినాథం, కిష్టిగాడూ కలిసి అందమైన డీలక్స్ బోటొకటి సంపాయించారు.

మధ్యలో సామాలమ్మ పెసరట్ల పొయ్యికోసం జాగా వదిలేసి, చుట్టూరా కుర్చీలేయించాడు శ్రీధరంబాబు. అంతాచేరి వేడివేడి పెసరట్లు వేసినవి వేసినట్టే లాగించేస్తున్నారు.

శ్రీధరం భార్య లక్ష్మి, మన రామం పెళ్లాం సీతా,  సుబ్బారాయుడి కూతురు సుశీలా కలిసి వచ్చినవాళ్లందరికీ కాఫీలూ, టిఫిన్లూ అందాయోలేదో చూసుకుంటున్నారు.

ఇక సీతారాముడయితే తల్లో నాలుకే! పెద్దాళ్లూ, పిల్లలూ అందరికీ అతనే కావాలి.

‘రామఁవన్నయ్యా గౌను బొత్తం కుట్టిపెట్టవూ?’

‘రామన్నయ్యా నాకు పెసరట్టొద్దు. ఉత్తి ఉప్మాయే కావాలి. తెచ్చిపెట్టవూ?’

‘ఏఁవోయ్ రామం? ఆ వెనకాలున్నవాళ్లకి కాఫీలందలేట్ట? ఓమారు కనుక్కో!’

‘ఒరేయ్, రాముడూ, ఈ వత్తులపెట్టి ఎక్కడుందో కాస్త వెదికిపెడుదూ నీకు పుణ్యఁవుంటుంది!’

ఇంతమంది హృదయాల్లోనూ ఆ అందాలరాముడు కొలువై వున్నందుకు సీతకీ, భగవంతరావుకీ చాలా గర్వంగా అనిపిస్తోంది.

‘పేరంటాలపల్లొచ్చింది. అందరం దిగి తీర్థాల్లోకెళ్లి కాసేపలా తిరిగొద్దాం!’ అంటూ ప్రకటించారు బాబ్జీ, అనూరాధ!

అప్పులప్పారావుకి పేరంటాలపల్లనగానే ఆశపుట్టింది. ఆవూళ్లోనేగా తీతా వుంట?

బోటలా రేవులో ఆగ్గానే ఒక్కంగలో దూకి పరిగెట్టాడు. నెత్తిన టోపీతో కొంగలా అడుగులేసుకుంటూ నడుస్తూ పోతున్న ముసలతన్ని ‘బావున్నావా తీతా?’ అనడిగాడు.

‘ఒరేయ్ అప్పారావ్, ఎన్నాళ్లయిందిరా నిన్నుచూసి? ఎప్పుడొచ్చావు ఏఁవిటి కథ?’ అంటూ కళ్లనీళ్లపర్యంతమైపోయాడు.

‘ఓ ఫైవిస్తే నీకో గుడ్ న్యూస్ చెప్తాను తీతా!’ అన్నాడు గారంగా!

‘నీ రేటింకా ఫైవేనుట్రా? రోజులెలా వున్నాయి? ఇంద, ఈ అయిదొందలుంచు!’ అంటూ ఫెళఫెళలాడే కొత్తనోటిచ్చాడు తీతా.

‘నాకొద్దు తీతా! అయిదివ్వు చాలు. అదే పదివేలు!’ అని అయిదే తీసుకుని ఎవరెవరొచ్చారో చెప్పాడు.

‘ఏఁవిటీ, మన రాఁవుడొచ్చాడా? డిప్టీకలక్టర్ రాముడు??’ ఆనందం పట్టలేకపోతున్నాడు.

‘వచ్చాడు తీతా! వాణ్ణా బెస్ట్ ఫ్రెండు! నీకుతెలుసుగా?’ అంటూ తీతాని వెంటబెట్టుకుని బోటుదగ్గరకి తీసుకెళ్లాడు. అంతమందినీ ఓసారే చూసేటప్పటికి ఆనందం పట్టలేకపోయాడు తీతా.

ఆనక అతనూ వాళ్లతో కలిసి బోటెక్కాడు.

మాధవాచార్యులూ, బామ్మగారు కలిసి చేసుకునే దైవార్చనకి ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన సదుపాయాలు చేసిపెడుతున్నారు రాముడూ, గోపీ!

సామాలమ్మ ఆధ్వర్యంలో అంతాకలిసి చాకలిబానాట ఆడారు. అందరికంటే ముందు సుబ్బారాయుడు ఔటైపోయాడు. చుట్టూ తిరుగుతూ రుమాలట్టుకెళ్లి అనూరాధకేశాడు. అదిచూసిన బాబ్జీ చెప్పబోతోంటే వద్దని వారించాడు.

మాఁవా అల్లుళ్ల అన్యోన్యత చూసి అన్నపూర్ణమ్మ, రామభద్రయ్య మనసులోనే మురిసిపోతున్నారు.  అంత మంత్రిహోదాలో వుండికూడా తమతో కలిసి బోటెక్కి వచ్చిందని అన్నపూర్ణమ్మని చూసి గర్వపడుతున్నారు మిగతావాళ్లు!

కొబ్బరుండలు పంచింది కాంట్రాక్టర్ పెళ్లాం. ఆవిడ మనసులానే తియ్యగా, ఒక్క రాయైనా తగలకుండా ఎంతో రుచిగా వున్నాయవి. గోపీ వాళ్లావిడ రాధ తెచ్చిన జంతికలు, జోగినాథం భార్య ప్రత్యేకంగా చేయించుకొచ్చిన పూతరేకులు అంతా ఎగబడి తిన్నారు.

ఒకరేవులో బోటాపించి, తన అథార్టీతో మనుషుల్ని పురమాయించి, అప్పటికప్పుడు తీతా తీయించి, పంచిపెట్టిన తిప్పుడు బెల్లం రుచి పిల్లలకి చాలా నచ్చేసింది.

వాళ్లందరితోపాటూ మధ్యలో కూర్చుని భగవంతరావు కూడా చిన్నపిల్లాడికిమల్లే తిప్పుడు బెల్లం తింటోంటే కుర్చీల్లో కూర్చున్న పెద్దాళ్లందరికీ కళ్లు తడిబారాయి. ఆ పసిమనసు కొట్టే కేరింతలకి వాళ్ల మనసులూ మురిసాయి.

సోమరాజుగారి ‘ఇలాకా’ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా పెట్టించాడు కాంట్రాక్టరు. ఆ కాసేపూ సోమరాజుగారిని విపరీతంగా ఆటపట్టించేసారు శ్రీధరఁవూ, రాముడూ, గోపీ! ఆనక మళ్లీ నవ్వేసుకున్నారు అంతాకలిసి.

ఈలోగా చీకటడిపోయింది. పున్నమవడంవల్ల నిండుచంద్రుడు నిగనిగలాడుతూ బయటపడ్డాడు. అప్పుడే పుట్టిన పిల్లాణ్ణి చూసుకున్న గోదారితల్లి కళ్లు వెండివెలుగులతో మెరుస్తున్నాయి. ఆ వెలుగంతా ఆ పున్నమి పున్నెమేనని ఎరగదు ఆ పిచ్చితల్లి!

గలగలలు ఎక్కువయ్యాయి. ఆనందపు అలల్లో సరదాలు సంబరాల మధ్య జనతా బోటులాంటి మహరాజా డీలక్స్ బోటు హాయిగా సాగిపోతోంది.

ఇంతటి ఆనందాన్నీ రెట్టింపు చేస్తూ కృష్ణమూర్తి అందుకున్న పాటకి అతని భార్య సత్యభామ, అతని ఒకటిన్నర కేసు వసుంధర చేసిన నృత్యం అందరికీ కన్నుల పండగే చేసింది.

చివరాఖర్న సేటుగారు మాటాడుతూ....

‘నేనూ....

రూపాయి ఖర్చుపెట్టాలంటే చాలా ఆలోచిస్తాను. దానివల్ల వస్తే లాభఁవన్నా రావాలి. నష్టమన్నా రాకుండా వుండాలి. ఇదే! ఇన్నాళ్లనించీ నేనిలానే అనుకుంటూ వుంటే...

నిన్నా....

ఈ క్రిష్ణమూర్తొచ్చాడు నా దగ్గరకి. ‘మీరు ఖర్చుపెట్టే రూపాయికి వచ్చే లాభంకంటే ఎక్కువ విలువైనది నే రప్పిస్తాను. ఆనక మీరే ఆశ్చర్యపోతారు’ అన్నాడు.

నేన్నమ్మలా! చెప్పొద్దూ? ‘డబ్బుకంటే ఆనందాన్నిచ్చేవి ఏఁవుంటాయయ్యా ఈలోకంలో?’ అంటూ కొట్టిపారేశాను. కోప్పడ్డాను.

కానీ.....

ఇతను వినలేదు. నన్ను నానాయాగీ చేసి, లక్షా పట్టుకుపోయాడు. ఖర్చుపెట్టేశాడు.

ఇప్పుడు చెప్తున్నాను.

నేనూ....

ఓ ఫూల్ని! ఇంతకాలం డబ్బొక్కటే ఆనందాన్నిస్తుందనేసుకున్నవాణ్ణి!

ఈ సుబ్బారాయుడు, భగవంతరావు...వీళ్ల ఆత్మీయత,

ఇంకా నేతివాసన వదలని మన సామాలమ్మ పెసరట్టు రుచీ,

మాధవ మనందరి మంచినీ కోరుతూ చేసే ఆ పూజాదికాలు,

ఈ ఆడపిల్లలు.. రాధ, లక్ష్మి, సీత, అను చేసిన నిస్వార్ధసేవలు, 

‘రాముడూ రాముడూ’ అంటూ ఎంతమంది పిలిచినా విసుక్కోకుండా అతనందించే ఆనందం,

ఇవన్నిటితోపాటు ఆ వెన్నెల పరుచుకున్న గోదారీ, ఎదురుగా ఋషీశ్వరుల్లా కొలువుతీరిన ఆ పాపికొండలూ...

ఇంత సంపద ఎన్ని లక్షలిచ్చినా రాదని అర్ధమైంది. క్రిష్ణమూర్తిని ఇవాళే మేనేజరుగా ప్రమోట్ చేస్తున్నాను. ఇంతలా మేనేజ్‌మెంట్ తెలిసినతను మేనేజరుకాక ఇంకెవరు?

అందరికీ ధన్యవాదాలు! ఇలానే ప్రతీయేడూ మనందరి సృష్టికర్తలైన బాపురమణల్ని మనసారా తలుచుకుంటూ ఆలోకంలో కూడా వారిని ఆనందాల గోదాట్లో స్నానం చేయిద్దాం!

శుభంభూయాత్! సెలవు!’

అంటూ ముగించారు.

అందరి కళ్లల్లోనూ తడి. వెన్నెల పడి ముత్యాల్లా మెరుస్తున్న అందరి కళ్లు ఎలావున్నాయంటే...

ఆ బోటుని దూరాన్నించి చూసేవాళ్లకి ‘అందులో మణిమాణిక్యాలున్నాయా?’ అని అనిపించేంతలా!

అవును. వారిద్దరి కలలూ, కలాలూ కలిసి వెలిసిన మణులేగా అక్కడున్నవారంతా!

మంచీచెడూ వేరేవేరే రాసులుగా పోసుండవు.

కాంట్రాక్టరూ, సుబ్బారాయుడు, భగవంతరావులు దెయ్యాలూ కారు...

మాధవా, కృష్ణమూర్తి, రాముడూ దేవుళ్లూ కారు...

అంతా కలిసి మనుషులంతే!

కష్టాలనే ఇష్టాలుగా మలచుకుని స్పష్టమైన మార్గాన్ని మనకి చూపించిన ఇంతమంది మానవులనీ సృష్టించిన ఆ బాపురమణలకి నా వందనం.

No comments:

Post a Comment

Total Pageviews