Tuesday, December 18, 2018

మార్గశిర శుద్ధ ఏకాదశి; గీతా జయంతి

మార్గశిర శుద్ధ ఏకాదశి మామూలు ఏకాదశి కాదు. ఎందుకంటే, 5వేల ఏళ్ల క్రితం ఇదే రోజు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను బోధించాడు! అందుకే, మార్గశీర్ష మొదటి ఏకాధశిని గీతా జయంతి అంటారు. అంటే, ఆ రోజున గీత జన్మించిందన్నమాట! బహుశా ఈ కారణం చేతనే కృష్ణుడు ''మాసానాం మార్గశీర్షోహం'' అన్నాడు. మాసాలలో తాను మార్గశీర్ష మాసం అని భగవానుడు ప్రత్యేకంగా చెప్పాడు. అంతటి విశిష్ఠత ఈ గీతా జయంతి కారణంగానే వచ్చిందనుకోవచ్చు....

మామూలుగా భగవద్గీత కృష్ణార్జునుల సంవాదం అని మనకు తెలుసు. కాని, మనకు తెలియని ఇంకా బోలెడన్ని విషయాలు, విశేషాలు గీతలోనూ, గీత గురించి వున్నాయి. అందులో ముఖ్యమైన అయిదు సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం!

1. భగవద్గీత పార్థుడికి, పార్థ సారథికి మధ్య చర్చ అయితే... గీత అని ఎందుకు అన్నారు? గీత అంటే పాట. భగవద్గీత పాట రూపంలో అనుష్టుప్ ఛందస్సులో వుంటుంది. ప్రతీ శ్లోకంలోని ప్రతీ పాదానికీ 32అక్షరాలు వుంటాయి. కొన్ని చోట్ల కొన్ని కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలకి త్రిష్టుప్ ఛందస్సు కూడా ఉపయోగించటం జరిగింది. అందులో నాలుగు పాదాలు, పాదానికి 11అక్షరాలు వుంటాయి. 2, 8, 11 అధ్యాయాల్లో మనం ఇలాంటి చూడవచ్చు...

2. భగవద్గీత పరిమాణం ఎంత? భగవద్గీత మొత్తం 18అధ్యాయాల్లో విస్తరించి వుంది. అందులో మొత్తం 7వందల శ్లోకలు వున్నాయి.

3. భగవద్గీత ఎన్ని వేల సంవత్సరాల క్రితం, ఎప్పుడు భగవానుడు ప్రబోధించాడు? మహాభారతంలో పేర్కొన్న వివిధ ఖగోళ విశేషాలు, గ్రహాణాల ఆధారంగా లెక్కగడితే క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో కలియుగం ప్రారంభమైంది! అంతకు 35ఏళ్లు ముందు కురుక్షేత్రంలో గీతా బోధ జరిగింది! అంటే... భగవద్గీత క్రీస్తు పూర్వం 3137వ సంవత్సరం నాటిదన్నమాట!

4. భగవద్గీత ఇంగ్లీష్ లోకి ఏ సంవత్సరంలో అనువాదించారు? 1785లో! చాల్స్ వికిన్స్ లండన్లో ఈ తొలి అనువాదం చేశాడు. అంతకు కేవలం 174ఏళ్లే ముందే ఇంగ్లీష్ లోకి బైబిల్ ను అనువదించారు!

5. భగవద్గీత ఇప్పటి వరకూ మొత్తం ఎన్ని భాషల్లోకి తర్జుమా అయింది? గీతాచార్యుడు సంస్కృతంలో చేసిన బోధనని ఇప్పటి వరకూ 175భాషల్లోకి అనువదించారు! 
నేడు గీతా జయంతి
☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?
👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
👉-కర్తవ్యం గురించి చెబుతుంది.
👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
👉నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.
అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.
గీత చదువుకో.....
నీ రాత మార్చుకో.....
గీతా జయంతి శుభాకాంక్షలు

No comments:

Post a Comment

Total Pageviews