Sunday, December 4, 2016

అభినవతీర్థుల వారి శివైక్యం

(శృంగేరి శారదా పీఠం 35వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి జీవిత విశేషం)

జీవన్ముక్తుడు ఎన్నడూ తన దేహాన్ని గురించి కానీ దాని అవసరాల గురించి కానీ చింతింపడు. ఘటాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. పాలలో కలిసిన పాలు ఒకటయినట్లు ఆత్మజ్ఞాని బ్రహ్మతో కలిసి బ్రహ్మగానే అయిపోతాడు. జగత్ క్షేమం కోసం మనుష్య రూపంలో నడయాడిన పరమాత్మ శ్రీ మహాసన్నిధానం. మానవుడుగా తన కార్యక్రమాన్ని ముగించాలని 1989లో నిశ్చయించుకున్నారు. ఒక రోజున గురుశిష్యులిద్దరూ పరమేష్టి ఆచార్యుల అధిష్టానం దగ్గర వున్నప్పుడు గురువుగారు ఒక చోటు చూపి తన సమాధి ఇక్కడ కట్టవలసిందని అన్నారు, తద్వారా విద్వత్ సదస్సు ప్రస్తుతం వున్న పద్ధతి మారకుండా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు. అలాగే ఈ శరీరం కనబడకుండా పోతే అందరికీ దుఖం కలగవచ్చు కానీ చివరికి మాంసమయ శరీరం గతి ఇంతే అని పరిహాసంగా చెప్పారు.

1989లో శ్రీ సన్నిధానం విజయయాత్రకు బయలుదేరడానికి కొంచెం ముందు గురువులు శిష్యుడిని తానింకా ఎన్నాళ్ళు వుండాలి అని అడిగారు. అందుకు శిష్యుడు నాకేమి పెద్ద దురాశాలేదు సద్గురూ. కేవలం మరొక 28 ఏళ్ళు అయితే మీ 72 ఏళ్ళ తో కలిపి పూర్ణం అవుతుంది అన్నారు. అందుకు గురువుగారు ఏమీ 72 సంవత్సరాలు సరిపోవా? నాకింకా అంత జీవించాలని ఇష్టం లేదు అన్నారు. ఆయన బయలుదేరిన మూడు మాసాలకు స్వామివారు కాలడి ప్రయాణం చేసారు. అప్పుడు ఒక భక్తుడు స్వామివారితో కార్లో బెంగళూరు వరకు వచ్చి దిగిపోతుంటే దయ గల గురువులు మరొక మజిలీ వరకు నా తోడుండు ఎవరికి తెలుసు మళ్ళీ మనం కలవలేకపోవచ్చు అని మామూలు ధోరణిలో అన్నారు. మరొక భక్తురాలు కాలడిలో స్వామివారితో తాను అక్కడ చాలాకాలం వుండాలని ఆచార్యుల నిత్య దర్శనం చేసుకోవాలని వచ్చానన్నారు. దానికి ఆయన నీకు కావలసినంత దర్శనం చేయి, మళ్ళీ ఇటువంటి అవకాశం కలగకపోవచ్చు అన్నారు.

మద్రాసులో ఒక భక్తునికి 21.9.1989 వేకువజామున 5:30కి స్వప్నంలో సాక్షాత్కరించి ఇటుపై ప్రసాదం స్వాముల వారిదగ్గర తీసుకో అన్నారు. ఆ స్వప్న ఆంతర్యం సాయంత్రానికి తెలిసివచ్చింది. శృంగేరికి చెందిన సాటిలేని తపోధనులు, యోగిశిరోరత్నం, సాటిలేని సద్గురువు అయిన శ్రీ మహాసన్నిధానం శుక్ల నామ సంవత్సర భాద్రపద కృష్ణ సప్తమి గురువారం నాడు ఉదయం 11:30కి నరసింహవనంలో తమ భౌతిక కాయాన్ని త్యజించారు. ఆ బ్రహ్మవేత్త మానద్రుష్టికి అతీతులై అనంతమూ సర్వగాథమూ, అద్వితీయమూ అయిన బ్రహ్మలో ఐక్యం పొందారు. ఈ వార్త విని దేశం చెప్పశక్యం కాని దుఖభారంతో కుంగిపోయింది. పూణేలో వున్న శ్రీ సన్నిధానం ఈ వార్త విని హతాశులై హుటాహుటిన శృంగేరికి వచ్చి పరుగు పరుగున గురువు గారి పాదాలపై పడి ఎంతో సేపు సాష్టాంగ ముద్రలో దుఖంతో వుండిపోయారు.
జీవన్ముక్తులైన వారు మాత్రమే శృంగేరి పీఠానికి అధిపతి అయి మనలను సరైన దారిలో పెట్టడానికి మానవ దేహంతో పుడతారు. వారి కార్యం అవ్వగానే వారు శివైక్యం చెందుతారు.

No comments:

Post a Comment

Total Pageviews