Wednesday, June 21, 2017

"ప్రసాదం‌"

"ప్రసాదం‌" వివరణ
ఒక పిల్లవాడికి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు?” అని ప్రశ్నించాడు.
గురువుగారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం.
పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని కంటస్ధం చేయమని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత, నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి "నేర్చుకున్నావా?" అని అడిగారు. "నేర్చుకున్నాను" అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు.
శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువుగారు తల అడ్డంగా ఆడించారు.
దానికి ప్రతిగా శిష్యుడు, "కావాలంటే పుస్తకం చూడండి..!" అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు.
"శ్లోకం పుస్తకంలోనే ఉందిగా, నీకు శ్లోకం ఎలా వచ్చింది...?" అని అడిగారు గురువు గారు.
శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ ఇలా అన్నారు
"పుస్తకంలో ఉండే శ్లోకం
స్థూలస్థితిలో ఉంది. నువ్వు చదివినప్పుడు నీ బుర్రలోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది.
అదేస్థితిలో నీ మనస్సులోనూ ఉంది. అంతే కాదు, నువ్వు చదివి నేర్చుకోవడం వల్ల పుస్తకంలో స్థూలస్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు కదా!
అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి, స్థూలరూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం!" అని వివరణ చేశారు.
అందుచేత మనం ఏది తినాలనుకున్నా, ముందుగా భగవంతునికి మనస్సులో నివేదన చేసి తింటే ఆ పదార్ధం కాస్త ప్రసాదంగా మారి మనలో పదార్ధదోషము లేకుండా శుభములను చేకూరుస్తాది.

No comments:

Post a Comment

Total Pageviews