Thursday, August 18, 2016

శ్రావణ శుద్ద పూర్ణిమ

ఈరోజున దుర్ముఖ నామ సంవత్సర శ్రావణ శుద్ద పూర్ణిమ. మన ఋషులు, ఋతువుల లక్షణాలను అనుసరించి ప్రతి పనిని ప్రారంభించేవారు. విద్యా ప్రారంభానికి, శ్రావణపూర్ణిమను నిర్ణయించుకుని, అధ్యయనోపకర్మలు చేస్తుండేవారు. అదే  'ఉపాకర్మ' గా మారింది. అధ్యాయనం అంటే వేదాధ్యయనం. అందుకే, ఈరోజు హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు.

ఈ కాలంలో ఉపాకర్మను, బ్రాహ్మణులే ఎక్కువగా పాటిస్తున్నారు. ఈ రోజున పాత యజ్ఞోపవీతాన్ని తీసేసి నూతన యజ్జోపవీతం ధరిస్తారు. ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠించి, ఇంట్లో హోమాలు చేస్తారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల పిల్లలు వేదాభ్యాసం ప్రారంభించే ముందు చేసే ప్రక్రియనే ఉపనయనం, యజ్నోపవీత ధారణం లేక ఒడుగు అని పిలుస్తుంటారు.

పూర్వం వేదకర్మలను ఆచరించేటప్పుడు మాత్రమే యజ్ఞోపవీతాలను ధరించేవారు. వేదాధ్యయన ప్రారంభం, వాతావరణం ఆధారం చేసుకొని శ్రావణంలో జరిపేవారు.  అందుకు నూతన యజ్ఞోపవీతాలు శ్రావణంలో ధరించటం ఆచారమైంది. ఇదే కంకణ సూత్రంగా మారింది. మిగతా కులాల వారిలో రక్షాబంధనంగా మారిందనిపిస్తుంది.

ఇది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. ఎప్పుడూ నియమాలను పాటించని బాలురు సైతం  ఉపనయనం చేసిన తర్వాత ఎంతో నిష్టతో, నియమాలను పాటిస్తారు. ఉపనయన తంతు జరిగి, యజ్జోపవీత ధారణ చేస్తేనే వేదాలను అభ్యసించడం మరియు పితృ సంస్కారాలు చేసే అధికారం వస్తుందని మనుధర్మం చెబుతుంది.

"బ్రహ్మణి వేద గ్రహణకాలే, ఉపనయన సమయే ధృతం యత్సూత్రం ఇతి బ్రహ్మ సూత్రమ్." అంటారు. అంటే, వేదం చదవడానికి ప్రారంభంలో ధరింపబడు సూత్రం గనుక బ్రహ్మసూత్రం అంటారు. విద్యకు చిహ్నము ఈ బ్రహ్మసూత్రం. దీనినే యజ్ఞసూత్రం, యజ్ఞోపవీతం, వ్రతబంధం అని కూడా పిలుస్తారు.

యజ్ఞమునకు ఇంకొక రూపం జన్నము. జన్నము నుండి ఏర్పడినదే జన్నిదము. జన్నిద పదమే జందెముగా మారింది. అనగా యజ్ఞోపవీతమనే సంస్కృత పదానికి, తెలుగులో జన్నిదము, జందెము అంటారు. జంధ్యము అనునది అపభ్రంశ రూపం.

ఉపవీతం అంటే సూత్రం, దారం అని అర్థం. ఉపవీతాన్నే వేదములో పరివీతం అని వాడబడింది. ఈ రెండు శబ్దాలలో ఉప, పరి ఉపసర్గ భేదమేగాని అర్థంలో భేదం లేదు. ఉపవీతమన్నా, పరివీతమన్నా జందెము అనే అర్థం.

తల్లి గర్భంతో లెక్క గట్టి,  బ్రాహ్మణులకు 8వ సంవత్సరం,  క్షత్రియులకు 11 వ సంవత్సరం, వైశ్యులకు 12వ సంవత్సరం ఉపనయనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకీ, ఈ యజ్నోపవీతం ఎందుకు ధరిస్తారనేది తెలుసుకుందాం.

ఉపనయనం జరిగిన వ్యక్తిలో మానసికంగా, శారీరకంగా బలం చేకూరుతుంది. సూర్య ఉపాసన వల్లే ఇది సాధ్యమని చాలా మంది నమ్మకం. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి ప్రోక్తమైన గాయత్రి మంత్ర జపం చేయిస్తారు. మంత్ర మహిమ వల్ల సకారాత్మక కిరణాలు (positive rays) లభించి, మంచి ఆరోగ్యం కలుగుతుంది. అందుకే "ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్" అంటారు.

నా చిన్నతనంలో, ఒక నెల రోజుల ముందు నుంచే యజ్నోపవీతం తయారు చేయడం ప్రారంభించే వాళ్లు. యజ్జోపవీతాన్ని భమిడి ప్రత్తితో వడికించి మెలికలు వేసేవారు. దాని పొడవు సాధారణ వక్తి ఎత్తుకు సమానంగా ఆరు అడుగులు, అలాగే, చేతి నాలుగు వ్రేళ్ల వెడల్పుకి ఇరవైనాలుగు రెట్లుగా కొలతపెట్టేవారు.

నాలుగు వేళ్ళు మనిషి యొక్క జాగరణ, నిస్వపన, స్వప్న, తురీయ స్థితులను తెలియజేస్తాయి. జంద్యానికి మూడు పోగులు, ఒక బ్రహ్మ ముడి వుంటాయి. మూడు పోగులు బుషి బుణం, పితృ బుణం, దేవ బుణాలను గుర్తు చేస్తాయి.

మూడు పోగులను కలిపి వేసే బ్రహ్మ గ్రంథి త్రిమూర్తుల కలయిక. కొందరు ఐదు పోగులు వేసుకుంటారు. "నిత్య కర్మానుష్టాన ఫల సిధ్యర్థం ప్రథమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని, "గృహస్తాశ్రమ ఫల సిద్ద్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని రెండు పోగులను, "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు పోగులను ఒక దాని తరువాత ఒకటి దరిస్తారు.

శుభ కార్యాలలో మరియు మామూలు సమయాలలో, యజ్ఙోపవీతాన్ని ఎడమ భుజం మీద నుండి కుడి వైపు నడము చేరేటట్టు వేసుకుంటారు. అశుభ సమయంలో కుడి భుజం మీదుగా ఎడమవైపు నడుమును తగిలేటట్లు ధరిస్తారు. మలమూత్ర విసర్జనా సమయాలలో మెడలో దండ లాగ వేసుకుంటారు లేదా కుడి చెవికి చుట్టుకొంటారు. కుడి చెవికి ఒత్తిడితో మూత్ర విసర్జన సులువని నిరూపితమైంది.

 నూతన యజ్ఝోపవీత ధారణమప్పుడు ఈ  శ్లోకాన్ని చదువాలి.

                 శ్లో! యజ్ఝోపవీతం పరమం పవిత్రం
                       ప్రజాపతే యత్సహజం పురస్తాత్
                       ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
                       యజ్ఝోపవితం బలమస్తు తేజః

జందెము జీవితాన్ని వ్రతమయం, పవిత్రం చేస్తుంది, ఆదికాలం నుండి ఈ విధానం వస్తుంది, ఆయుస్సును కలిగిస్తూ, అందరిలో ముందు వుంచుతూ, తేజోబలాన్ని కలిగిస్తుంది, కాబట్టి ధరించమని గురువు ప్రబోధిస్తాడు.

జంధ్యం విసర్జించే సమయంలో, ఈ క్రింది శ్లోకాన్ని చెప్పాలి.

                   శ్లో! ఉపవీతం ఛిన్న తంతుం జీర్ణం కశ్మలదూషితం
                         విసృజామి యశోబ్రహ్మవర్ఛో దీర్ఘాయురస్తుమే

ఉపనయనం యొక్క ప్రధాన కార్యక్రమం "బ్రహ్మోపదేశం". అనగా సరియైన గురువు దగ్గర ఆత్మజ్ఙానం తెలుసుకోవడం. దేనినైనా తంతుగా చేయకుండా, ఈనాటి యువత ఆచరించి, అందరికీ మార్గదర్శకంగా వుండి చూపించండి. శుభంభూయాత్.

No comments:

Post a Comment

Total Pageviews