Monday, May 22, 2017

గోరుముద్ద:--


నేడు స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులో వుంది. సాంకేతికంగా ప్రపంచమంతా మన చేతిలోనే వుంది. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
ఇవి మన వివేకాన్ని పెంచుతున్నాయా? 
మన జ్ఞానాన్ని పెంపొందిస్తున్నాయా?
ఇవి నిస్సందేహంగా మన సమయాన్ని ఆదాచేయడంతో పాటు మన జ్ఞానాన్ని పెంపొందించేవే!
కానీ మనం మన విచక్షణాజ్ఞానాన్ని ఉపయోగించకపోతే ఇవి మనకు విజ్ఞానాన్ని కలిగించడం అటుంచి, తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. వారికి ఏది మంచో ఏది చెడో తెలియదు కాబట్టి మనమే తెలియజేయాలి.
దేవలోకంలో మన గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం!
ఒకసారి దేవేంద్రుడు, బృహస్పతిని గురువర్యా!
నేడు భూలోకంలో అందరూ స్మార్ట్ ఫోన్ తో బిజీగా కాలం గడుపుతున్నారు. కానీ ఎవరి ముఖంలో కూడా ఆనందం కనబడటం లేదు, ఎందువల్ల? అని అడిగాడు. అందుకు బృహస్పతి దేవేంద్రా! మనం కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నాం.
నీకు కడుపు నొప్పి గురించి నిన్న ఒక మెయిల్ పంపాను దానిని నీవు చదివావా? అని అడిగారు. దానికి దేవేంద్రుడు నేను ఆ మెయిల్ ను చదవలేదు కానీ మిత్రులకు ఫార్వర్డ్ చేశాను అని చెప్పాడు. అప్పుడు బృహస్పతి దేవేంద్రా! భూలోకవాసులలో కూడా ఇదే సమస్య. వాళ్లు తమకు వచ్చిన సమాచారాన్ని చదవకుండానే ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. రోజూ అరగంట నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబితే, దాన్ని ఆచరించకుండా ఆ విషయాన్ని ఫార్వర్డ్ చేయడంలోనే సమయాన్ని వృధా చేస్తున్నారు.
మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారిని రక్షించకుండా వీడియో తీయడంలో ఆనందపడుతున్నారు.ఇలాంటి పరిస్థితి మనలోకంలో రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం మంచిదనుకుంటాను..అని ఇంద్రునితో అన్నారు.
ప్రపంచం ఎలాగైతే మంచీచెడులతో నిండివుందో అలాగే సాంకేతికజ్ఞానం కూడా మంచిచెడులతో నిండివుంది.దానిలో ఏది అనర్ధమో, ఏది మనకు నష్టాన్ని కలిగిస్తుందో దాన్ని మన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి తొలగించాలి.
నేడు స్మార్ట్ ఫోన్ వున్నవారు లేనివారిని హేళన చేస్తున్నారు. మనం వాటిని ఉపయోగిస్తూ బోల్తా పడితే ఇతరులు కూడా బాల్తా పడాలని అనుకుంటున్నారు.
కొన్నేళ్లు వెనకకు వెళ్తే గ్రామానికంతటకూ ఒకటో రెండో ఫోన్లు ఉండేవి.
ఆతరువాతకాలంలో ఇంటింటికి ఒక ఫోన్ ఉండేది. అప్పుడు అందరూ ఒకదగ్గర చేరి మాట్లాడేవారు.దానివల్ల వారిమధ్య ప్రేమ ఆప్యాయతలు పెంపొందేవి.
నేడు ఒకరికి రెండు మూడు ఫోన్లు వుంటున్నాయి.
ఎవరి మాటల్లో వారు ఉంటున్నారు.దానివల్ల మనుష్యుల మధ్య దూరం పెరుగుతుంది.
స్మార్ట్ ఫోన్ తో మనం ఏమి సాధించాం? ఏమి సాదించాలనుకుంటున్నాం? స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ మనం విజ్ఞానాన్ని పొందుతున్నామా? లేదా యాంత్రికంగా మారుతున్నామా?
నేడు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో మంచికన్నా చెడే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది
ఇది సరియైనదేనా?
విచక్షణాజ్ఞానం లేని చురుకుదనం వ్యర్ధం.
ఏది మనకు అవసరం, ఏది అనవసరం అన్న విషయాన్ని స్మార్ట్ ఫోన్ మనకు తెలియజేయదు.
మనమే మన విచక్షణాజ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని తెలుసుకుంటే స్మార్ట్ ఫోన్ కంటే స్మార్ట్ గా తయారవుతాము.
లేకుంటే మూర్ఖులుగా తయారవుతాము.మన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించకుండా కేవలం స్మార్ట్ ఫోన్ పైనే అధారపడితే నిప్పుతో చెలగాటం ఆడినట్లే! స్మార్ట్ ఫోన్ ఉపయోగకరంగా ఎప్పుడు ఉంటుందంటే మనం దానికంటే స్మార్ట్ గా ఉన్నప్పుడే.

No comments:

Post a Comment

Total Pageviews