Thursday, November 3, 2016

సత్యప్రభావం.

సత్యప్రభావం.

పూర్వం ఒక రాజ్యంలో గజదొంగ యుండేవాడు. అర్ధారాత్రి పూట దొంగతనాలు చేసేవాడు. బాగా చీకటి పడేవరకు గ్రామాలలోయున్న దేవాలయములలో సత్కాలక్షేపాలలో పాల్గొనేవాడు. అలా చీకటి పడేవరకు వేచియుండేవాడు. దీని కారణంగా అతనికి తన జీవిత తరుణోపాయం ఏమిటి అనే వ్యధ అతనిలో జనించింది. ఒకరోజు అతడు ఆధ్యాత్మిక బోధ చేసే ఒక పండితుని వద్దకు వెళ్ళి నా జీవిత తరుణోపాయం సెలవివ్వండి అని ప్రార్ధించాడు. “నీవు దొంగతనం మానివేయమన్నాడు” ఆ పండితుడు. “అది నా వృత్తి. దానిని మానలేనన్నాడు.” “సరే భగవన్నామము మానసికంగా” చేయమన్నాడు”. అదీ కుదరదన్నాడు. అయితే “సత్యవ్రత దీక్ష స్వీకరించి సత్యము” పలకమన్నాడు. దానికి గజదొంగ తన దగ్గరకి ఎవ్వరు రారు కనుక సత్యం పలకటం తేలికయని “సరే”నన్నాడు. ఒకరోజు రాజుగారి కోటలో దొంగతనానికి బయలుదేరి వెళ్ళాడు. ఇంతలో రాజు, అతని సేనాని మారువేషాలలో తిరుగుతూ అతనిని గమనించి “ఎక్కడికి బయలుదేరావు” అని అడిగారు. దానికి ఆ గజదొంగ నేను రాజుగారి కోటలో దొంగతనానికి బయలుదేరానని చెప్పాడు. “అరె! ఇంత పెద్ద విషయాన్ని ఇంత ధైర్యంగా ఎలా చెప్పావు ప్రమాదం కదా” అన్నారు. దానికి “అయ్యా! నేను ఒక స్వామి వద్ద సత్యం పలుకుతానని ప్రమాణం చేశాను. కనుక మీతో సత్యమే చెప్పాను” అన్నాడు. ఆరోజు రాత్రి కోటలో గజదొంగ నాలుగు వజ్రాలు కాజేశాడు. సేనాని చాకచక్యంగా గజదొంగను పట్టుకున్నాడు. దొంగవద్ద నాలుగు వజ్రాలు దొరికినవి. కాని మంత్రి ఐదో వజ్రం ఎక్కడ అని గదమాయించాడు. అయ్యా! నేను అబద్దమాడను. అది నా నియమము. నేను నాలుగు వజ్రాలే దొంగిలించాను అన్నాడు. దొంగతనం జరుగగానే ప్రధమ విచారణ మంత్రిగారే చేసినందువల్ల ఆ అయిదో వజ్రం మంత్రిగారే అపహరించి దొంగపై అబాంఢము వేశాడని రాజు గ్రహించి మంత్రిని సోదా చేయగా అతని వద్ద అయిదవ వజ్రం దొరికింది. మంత్రిని ఆ పదవినుండి తొలగించి గజదొంగకు తన ఆస్థానంలో నగర రక్షణ పదవి ఇచ్చి అతనిని రాజు సత్కరించాడు.
సత్యానికి కట్టుబడ్డ దొంగ నగర రక్షణ పదవిలో నియమింపబడ్డాడు. సత్యానికి యుండే విలువని ప్రాధాన్యతను గుర్తెరిగి భారతజాతి ఔన్నత్యానికి వెన్నెముక అయిన సత్యధర్మ దీక్షను అందరు స్వీకరించాల్సియున్నది. సత్యం జాతి ఔన్యత్యం ఆయు:ప్రమాణాలని పెంచుతుందని అందరూ గ్రహించాలి.

No comments:

Post a Comment

Total Pageviews