Tuesday, January 23, 2018

రథ సప్తమి

రథ సప్తమి శుభాకాంక్షలు.

రథ సప్తమి రోజు సూర్యుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి? ఏం చదవాలి?
రథసప్తమి. చాలా విశిష్టమైన రోజు.సూర్యుడు మాఘ శుద్ధ సప్తమి నాడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఇదేరోజున సూర్య భగవానుడు తన రథాన్ని ఉత్తరం వైపుకు మరలించినట్లు చెప్పబడింది.ఆ దేవదేవుని అనుగ్రహం మన అందరిపైనా కలగాలని కోరుకొంటూ సప్త సప్త మహాసప్త రథసప్తేన సప్తతే
సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి!!

తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా
చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి.
ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఇదే "సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది.ఈ రోజున అరుణోదయకాలంలో  జిల్లేడు ఆకును అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని

సప్త సప్త మహాసప్త రథసప్తేన సప్తతే
సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి!!

అను శ్లోకం చదువుకునిస్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట.  నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.
సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి దండకం కానీ, స్తోత్ర పాఠాదులు కానీ, ఈరోజు మనం పారాయణ చేయాలి. అలాగే నమస్కారం చేస్తే ఆయన సంతోషిస్తాడు గనుక సూర్య నమస్కారాలు కూడా ఆచరించాలి. వేదం తెలిసినవారు కానీ, ఎవరైనా బ్రాహ్మణులు లభిస్తే అటువంటి వారిని ఇంటికి పిలిపించి వారిచేత సూర్య నమస్కారాలను ఆచరింపజేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. "ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్" "నమస్కార ప్రియ భానుః" సూర్య నారాయణ మూర్తికి ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శ్రీమద్రామాయణంలో 107వ సర్గలో యుద్ధకాండలో వస్తుంది. రామచంద్రమూర్తి రావణాసురుని యుద్ధరంగంలో ఎదుర్కొనడానికి పూర్వం అగస్త్యుల వారు రాముల వారికి ఈ స్తోత్రాన్ని బోధిస్తారు. ఈ స్తోత్రాన్ని ఈరోజు 12 మార్లు స్తోత్రం చేస్తే విశేషమైన ప్రయోజనం లభిస్తుంది. ఇదివరకు చేయనివారు ఈరోజు ప్రారంభం చేయాలి. అది రథసప్తమి మనకు అందించే సందేశం.



ఆ దేవదేవుని అనుగ్రహం మన అందరిపైనా కలగాలని కోరుకొంటూ రథ సప్తమి శుభాకాంక్షలు.

No comments:

Post a Comment

Total Pageviews