Tuesday, January 9, 2018

కోనసీమలో “జగ్గన్నతోట” ప్రభల తీర్థం వైభవo.

*కోనసీమ అంటేనే అందం.
అది వేదసీమ అని పెద్దల ఉవాచ.*
శ్రీశైల పర్వత సానువుల తరువాత తొందరగా మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవ క్షేత్రాలు.
ఇచ్ఛటగల కోనసీమరుద్రులు.
కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న “జగ్గన్నతోట” ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని చెప్పరానిది. మకరసంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని “మొసలిపల్లి శివారు జగ్గన్నతోట” లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన,చారిత్రాత్మకమైన,అతిపురాతనమైన,పవిత్రమైన సమాగమము. ప్రాచీనకాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే ఈ11గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది ఏకాదశ రుద్రుల కొలువు. హిందూధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీద,ఈ భూమండలం మొత్తానికీ ఒక్క చోటే అదీ వేదసీమ అయినటువంటి కోనసీమలోనే.
లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశంఅయ్యి లోకవిషయాలు చర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచొట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానాదీశులైన శ్రీరాజా వత్సవాయి జగన్నాధమహారాజు కు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.
ఈ ఏకాదశ కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుసగా.....
1-వ్యాఘ్రేశ్వరం- శ్రీవ్యాఘ్రేశ్వర స్వామి(బాలాత్రిపురసుందరీ)
2-పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలా త్రిపుర సుందరి)
3-మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి
4-గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు
5-గంగలకుర్రు (అగ్రహారం)-వీరేశ్వరుడు
6-పెదపూడి-మేనకేశ్వరుడు
7-ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు
8-వక్కలంక-విశ్వేశ్వరుడు
9-నేదునూరు–చెన్న మల్లేశ్వరుడు
10-ముక్కామల-రాఘవేశ్వరుడు
11-పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు.
ఇవీ గ్రామాలు, ఆగ్రామాల రుద్రుల నామాలు. ఈ స్వామివారలను “ప్రభలపై” అలంకరించి మేళ తాళాలతో,మంగళ వాయిద్యాలతో,భాజా బజంత్రీలతో “శరభా శరభా” హర హర మహాదేవ” అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు.
ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లికి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామరుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ. ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు
“శ్రీ వ్యాఘ్రేశ్వరుడు”. ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.
ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోటకి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి. ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా “హరా హరా” అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది. ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేనుని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏకకాలంలో ఏకాదశ రుద్రుల(11)దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.
*నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవా త్రయంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః*
అంటూ రుద్రంలో ఏకాదశ రుద్రుల గురించి ప్రస్తావన ఉంటుంది.
ఆ ఏకాదశ రుద్రులు ఏకకాలంలో సమాగం అయ్యే సన్నివేశం చూస్తే మనసు పులకిస్తుంది. ఈతీర్థమును దర్శించడానికి ప్రపంచవ్యాప్తం గా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక,దేశ విదేశీయిలు వచ్చి దర్శించి తరిస్తారు.

No comments:

Post a Comment

Total Pageviews