Wednesday, September 16, 2015

త్వరలో శ్రీ వినాయక చవితి పండుగ వచ్చేస్తోంది. ఆ విశేషాలు మరిన్ని తెలుసుకుని ఆచరిద్దాం!! ప్రతి రోజూ ఈ పోస్ట్ చూడండి, రోజూ కొన్ని పత్రాలు పువ్వుల విశేషాలు ఇక్కడ అందిస్తాము సత్యసాయి - విస్సా ఫౌండేషన్.




 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 


 త్వరలో శ్రీ వినాయక చవితి పండుగ వచ్చేస్తోంది. ఆ విశేషాలు మరిన్ని తెలుసుకుని ఆచరిద్దాం!! ప్రతి రోజూ ఈ పోస్ట్ చూడండి, రోజూ కొన్ని పత్రాలు పువ్వుల విశేషాలు ఇక్కడ అందిస్తాము.      .....  సత్యసాయి - విస్సా ఫౌండేషన్.   

            మన ఘన భారతీయ సంస్కృతిలో ఆయా కాలాలు, ఋతువులు, మాసాలను బట్టి పర్యావరణ స్పృహతో వివిధ పండుగలు, ఆచారాలను మన పూర్వ ఋషులు మనకి ఆధ్యాత్మిక రూపంలో విజ్ఞానదాయకంగా అందించారు. మనం ఆ మూల సూత్రాలను గ్రహించి ఆచరించాలి! సాంప్రదాయకంగా మన పూర్వికులు ఎలా ఆచరిస్తున్నారో మనం కూడా ఆచరించాలి. ఆధునికత పేరుమీద వికృత పోకడలు పోరాదు. 

          మనం ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందుగా ఆటంకాలు కలుగకుండా వినాయకుని ప్రార్దిస్తాము. అలాగే ముందుగా మనం వినాయక చవితి పండుగ ప్రాశస్త్యం, శాస్త్రీయ దృక్పధాన్నిగురించి తెలుసుకుందాం! వినాయక చవితి నాడు "ఏక వింశతి పత్రి పూజ" అని 21 పత్రాలతో విఘ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీ కదా మరి ఆ పత్రాల పేర్లు, పువ్వుల పేర్లు వాటి ప్రయోజనాలు ప్రతి రోజూ కొన్నింటిని మనం తెలుసుకుని మన పిల్లలకి నేర్పి ఆ ప్రకారంగా శ్రీ వినాయక పూజ జరుపుకుని ఆ గణనాయకుని సంపూర్ణ అనుగ్రహంతో పాటుగా శాస్త్రీయ ప్రయోజనాన్ని పొందుదాం! 



 

 మట్టి వినాయకుణ్ణి పూజించడమే శ్రేష్టం....వివిధ రంగులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర లోహాలతో ఎన్ని అడుగులు నిర్మించాము అన్నది కాకుండా చెరువుల్లో మట్టి తీసి వినాయకుల్ని చేస్తే చెరువు పూడిక తీసే ప్రయోజనం కలుగుతుంది. అలాగే తొమ్మిది రోజుల అనంతరం వివిధ రకాలు అయిన పత్రి సహితంగా ఆ మట్టి వినాయకులను నిమజ్జనం చేస్తే చెరువు అడుగునకు ఆ బురద మట్టి చేరుకొని ఆ చెరువులో నీళ్ళు ఇంకి పోకుండా కూడా వుంటాయి...అనేక ఔషధ గుణాలు కలిగిన పత్రితో ఆ నీరు శుద్ధమవుతుంది. ఇలాగే తరచి చూస్తే ఎన్నో ప్రయోజనాలు. 
       
       ఇక పత్రి పూజ కి వద్దాం! శ్రీ విఘ్నవినాయకుని కొలిచేటప్పుడు వివిధ నామాలు పలుకుతూ పత్రిని సమర్పిస్తారు. ఉదాహరణకి 1వ నామం ...ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి! అని చదువుతాం 
మాచీ పత్రం అనేది చేమంతి జాతికి చెందినది. దీని ఆకులు చేమంతి ఆకుల్లాగే వుండి, సువాసనా భరితంగా ఉంటాయి. దీనిలో గొప్ప ఆయుర్వేద గుణాలున్నాయి. ఇది మన ఇంటి చుట్టుపక్కల విరివిగా దొరికే మొక్క, ఈ ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్ర రోగాలు నయం అవుతాయి. అలాగే చర్మ వ్యాదులకి కూడా అద్భత మందుగా పనిచేస్తుంది. ఆ ఆకుల్ని పసుపు, నువ్వుల నూనెతో కలిపి ముద్దగా నూరి చర్మ వ్యాదులకి రోజూ పూస్తే తొందర్లోనే నయమవుతాయి. అలాగే రక్తపు వాంతులకు, ముక్కునుంచి రక్తం కారడం వంటివి కూడా అరికట్టవచ్చునట. 




              అలాగే 2 వ నామం.... ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి! బృహతీ పత్రాన్ని వాకుడాకు, నేలమునగాకు అంటారు. దీనిలోనూ ఎన్నో వ్యాధులను తగ్గించగల ఔషదీయ గుణాలున్నాయి, కంఠ రోగాలు, శరీర నొప్పులు, ఎక్కిళ్ళు, కఫ, వాత దోషాలు, అస్తమా, దగ్గు, సైనసైటిస్ తగ్గించడంలో, అరుగుదలకు, గుండె పనితీరు మెరుగుపరిచేందుకు, ఈ చూర్ణం దురదలు, నొప్పి నివారిణిగా, ఈ కషాయంతో నోటి దుర్వాసన, మరియు రక్త శుధ్ధి ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

            3.వ నామం .. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి  అని చదువుతాం  
బిల్వపత్రం అనగా మారేడు. ఈ మారేడు వృక్షాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇది ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన పత్రం. ఈ పత్రానికి నిర్మాల్య దోషం లేదు.ఈ పత్రాన్ని ఆ పరమేశ్వరునికి సమర్పించిన రోజే కాక మరున్నాడు కుడా ఉపయోగించవచ్చు.ఆరోగ్యరీత్యా కూడా ఇది ఎంతోఉపయోగపడుతుంది.  మధుమేహం కలవారు రోజు రెండు ఆకులను నెమ్మదిగా నములుతూ ఆ రసాన్ని మింగితే  దివ్యౌషధంగా పనిచేస్తుంది.  దీని  ఆకులే కాక గుజ్జు, బెరడు,మారేడుకాయలు, వ్రేళ్ళు ఇవన్నీ కూడా ఎన్నో  ఔషధాలుగా ఉపయోగపడతాయి.అన్నిరకాలుగా మనకి ఉపయోగపడే ఈ బిల్వపత్రంతో  ఆ మహా గణపతి ని  

'ఓం ఉమాపుత్రాయ నమః  - బిల్వపత్రం పూజయామి ' అని పూజిస్తాము.


4వ నామం 'ఓం గజాననాయ నమః  దూర్వాయుగ్మం ' సమర్పయామి అని చదువుతాము.

దూర్వాయుగ్మం అనగా గరిక. అనగా రెండు కొసలు కలిగిఉన్న జంటగరికను దూర్వాయుగ్మం అని అంటారు. గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఈ గరిక అతి ముఖ్యమైనది.ఒక్క గరికెపోచ సమర్పిస్తే మహాదానందపడిపోతాడు మహాగణపతి. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరికలో ఔషధ గుణాలు కూడా ఎన్నో వున్నాయి. హిస్టీరియా ఉన్నవారికి దివ్య ఔషధం ఈ గరిక. పైత్యపు తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ గరికను మెత్తగా రుబ్బి నుదిటిమీద లెపనమ్లా వేసుకొంటారు.గరికను పచ్చడిగా చేసుకొని తింటే మూత్రసంబందిత వ్యాధులు తగ్గుతాయి.కఫ, పైత్యదోషాలను నశింపచేస్తుంది. రక్త, చర్మ సంబంధిత వ్యాధులను, ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది.సర్వరోగనివారిణి అయిన ఈగరికను అందుకే ఆ మహా గణపతికి  ' ఓం గజాననాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి ' అంటూ స్వామికి గరికను సమర్పిస్తాము.



5. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి


 దత్త్తూర పత్రం ను మనం  ఉమ్మెత్త అని కూడా అంటూ ఉంటాము. ఈ ఆకు ఉష్ణతత్వం కలిగిన ఆకు.  ఆరోగ్యరీత్యా కూడా ఈ ఉమ్మెత్త ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. కఫ, వాత దోషాలను నశింప చేయటంలో ఈ పత్రం బాగా పనిచేస్తుంది.మానసిక వ్యాధిని నివారించాడంలోను, జ్వరాలు, చర్మరోగాలు, అల్సర్లు, చుండ్రు నివారణలోనూ దివ్యౌషధంగా పని చేస్తుంది.ఈ పత్రం నార్కోటిక్ లక్షణాలను కలిగి ఉన్నందువలన దీనిని వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి.ఈ చెట్టు యొక్క  పత్రాలు, వేర్లు, పువ్వులు, గింజలు కూడా ఎన్నో ఔషధ గుణములు కలిగి ఉన్నాయి. ఇన్ని మంచి ఉపయోగాలు గల ఈ దత్తూర పత్రం (ఉమ్మెత్త ) ను ఆ మహాగణాదిపతికి భక్తితో     ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి అని  సమర్పిస్తాము.



6. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి


బదరీపత్రం అనగా రేగు ఆకు. ఈ చెట్టును సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని  స్వరూపంగా భావిస్తారు. సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ రోగాలకు మందుగా ఈ పత్రాన్ని ఉపయోగిస్తారు. సంక్రాంతి సందర్భంలో చిన్నపిల్లలకు పోసే భోగిపళ్ల కార్యక్రమంలో ఈ రేగుపళ్ళు అతి ముఖ్యమైనవి. జుట్టు ఆరోగ్యంగా పెరగటంలో రేగు ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.  మనకి ఆరోగ్యరీత్యా ఇంతగా ఉపయోగపడే ఈ బదరీ పత్రం తో ఆ గణపతిని 
  ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి  అని భక్తితో పూజిద్దాము. 




7. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి.

    అపామార్గ పత్రం అనగా ఉత్తరేణి. ఆరోగ్యరీత్యా  ఈ పత్రం వలన చాలా ఉపయోగాలున్నాయి.దీని ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు నశించి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయానికి, పైల్స్ కు, వంతులకు మంచి ఔషదంగా పనిచేస్తాయి .దీని ఆకులు నూరి రసం గాయాలకు రాస్తే రక్తం కారడాన్ని అరికడుతుంది. యజ్ఞ యాగాలలో ఈ చెట్టు పుల్లలు  వేస్తారు దీని పొగ పీల్చడం వలన శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి.
ఇన్ని ఔషధ గుణాలున్న ఈ ఉత్తరేణి ఆకు తో ఆ గజాననుని   ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి అని పూజిద్దాము.



8. ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి

 తులసిమొక్క లేని ఇల్లు వుండదు తులసి మొక్క గురించి తెలియనివారుండరు. పరమపవిత్రమైనది, విష్ణుమూర్తికి ప్రీతికరమైనది, శ్రీ మహా లక్ష్మీస్వరూపం.తులసి ఆకులు,కొమ్మలు, వేర్లు అన్నింటిలోను ఎన్నో ఔషధ గుణాలున్నాయి.కఫ, పైత్య, వాత రోగాలను పెరగకుండా నిరోధించగల శక్తి ఒక్క తులసికి మాత్రమే ఉంది.చర్మరోగాలను నయం చేస్తుంది.రోజు తులసిఆకులు నమలడం వలన పంటి చిగుళ్ళకున్న  రోగాలు తగ్గి అరుగుదాలను, ఆకలిని పెంచుతాయి. తులసిరాసాన్ని తేనెతో కలిపి తీసుకోవడంవలన కఫం వలన వచ్చే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.  ఈమధ్య జగిన పరిశోధనలలో రోజుకు 22 గంటలు ప్రాణ వాయువు నిచ్చే చెట్టు తులసిమాత్రమే అని తేలింది.ఇంతగొప్ప లక్షణం మరే ఇతర మొక్కలకు లేదు. ఉత్తప్పుడు ఎప్పుడూ తులసితో గనేశుని పూజించరాదు. పురాణాల ఆధారంగా ఒక్క వినాయక చవితిరోజునే మనం తులసీదళాలతో ఆ స్వామిని పూజించాలి.  వినాయక చవితిరోజున    ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి అని ఆ స్వామికి తులసీదళం సమర్పిద్దాము.



9. ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి.


చూతపత్రం అనగా మామిడి ఆకు. మంగళకరమైన ఆకు మామిడాకు. ఎక్కడ ఏవిధమైన శుభకార్యం జరిగినా ముందుగా కావలసిన ముఖ్యమైన ఆకు మామిడాకు.దీనిని దేవతా వృక్షం అనికూడా అంటారు. దీని ఆకులే కాక... కాయలు కూడా  మామిడికాయపప్పు, పచ్చడి,పులిహోర, ఆవకాయ ..ఇలా మనకు వంటల్లో ఉపయోగపడతాయి. మామిడిపళ్ళ సీజన్ లో మామిడిపళ్ళ ను ఇష్టపడని వారుండరు. తినడానికే కాక ఆరోగ్య, ఔషధరీత్యా కూడామనకు ఎంతో ఉపయోగపడుతుంది. లేత ఆకులను పెరుగుతో కలిపి మెత్తగా నూరి తింటే అతిసారం తగ్గుతుంది. మామిడి లేత చిగుళ్ళను తింటే చిగుళ్ళ వాపు సమస్య తగ్గుతుంది . మామిడి జిగురులో ఉప్పు వేసి వేడిచేసి కాళ్ళ పగుళ్ళకు, చర్మవ్యాధులకు  పూస్తే తగ్గుముఖం పడతాయి. చెట్టునుంచి కోసిన కొన్ని గంటల వరకు ప్రాణవాయువు ను విడుదలచేస్తాయి. ఇంటిలో ఎదిక్కున  మామిడి చెట్టు ఉన్నా మంచిది.  మనకి ఇన్ని రకాల మేలు చేసే మామిడి చెట్టును కాపాడుకుంటూ.. ఆ మహా గణపతిని   ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి  అంటూ విశిష్టమైన    మామిడి పత్రంతో శ్రేష్టంగా ఆ గణనాధుని  పూజిద్దాము.



10. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి

  కరవీరపత్రం అనగా గన్నేరు! గన్నేరుకు శాస్త్రరీత్యాచాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా పువ్వులు కోస్తుంటే అవి క్రింద పడితే పూజకు పనికి రావు కాని గన్నేరు పువ్వులు కోసే సమయంలో క్రింద  పడితే పరవాలేదు వాటిపై నీళ్ళు చల్లి సమర్పించవచ్చు.గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా అది అనేక రోగాలు దూరం  చేస్తుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు గన్నేరుఆకులు కోసి పాలు కారడం తగ్గాక తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. కానీ గన్నేరు పాలు చాలా ప్రమాదం కాబట్టి వాటిని అస్సలు వాడకూడదు. 

            ఓం వికటాయ నమః  కరవీర పత్రం పూజయామి  అంటూ  గన్నేరు ఆకులను సమర్పిద్దాము.




11. ఓం భిన్నదంతాయ నమః  విష్ణుక్రాంత పత్రం పూజయామి


ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. ఇది జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.  ఆ మహా గణపతిని ఓం భిన్నదంతాయ నమః  విష్ణుక్రాంత  పత్రం పూజయామి అని పూజిద్దాము.



12. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి

దానిమ్మ పత్రాన్ని దాడిమీ పత్రం అంటారు. భారతదేశంలో చాలా చోట్ల ఈ చెట్టును పెంచుతారు. శ్రీ లలితా అమ్మవారి లలితాసహస్రనామాల్లో " తాంబూల పూరిత ముఖీ దాడిమీ కుసుమప్రభ " అనే నామం మనం చదువుతూ...వింటూ ఉంటాము. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీ ఫల నైవేద్యం అంటే  ఎంతో ఇష్టం.అంటే కాకుండా ఆరోగ్యరీత్యా కుడా మనకి దానిమ్మతో ఎన్నో ఉపయోగాలున్నాయి. దానిమ్మ ఆకు తింటే చర్మం కాంతి వంతమవుతుంది.  దానిమ్మరసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు. కీటకాలు కుట్టడంవలన వచ్చిన దద్దుర్లూఅవి తగ్గుతాయి. దానిమ్మపండు ఆకలిని పెంచి అరుగుదలను ఇస్తుంది.విరోచనాలను తగ్గిస్తుంది.దీని ఆకులకు నూనె రాసి కల్లవాపులు  ఉన్నచోట కడితే తగ్గుతాయి. దానిమ్మ ఆకులు దంచి కషాయం చేసుకుని అందులో పంచదార తగినంత వేసి తాగితే దగ్గు, నీరసం,ఉబ్బసం,అజీర్తి వంటి రోగాలనుంది ఉపసమనం లభిస్తుంది.ఇన్ని ఔషద గుణాలున్న ఈ దాడిమీ పత్రంతో ఆ గణపతిని  
         ఓం వటవే నమః దాడిమీ పత్రం     పూజయామి అని పూజిద్దాం.





13. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి
  దేవతలకు  అత్యంత ఇష్టమైన పత్రం దేవదారు. ఇది ఎక్కువగా అడవులు, వనాలలో పెరిగే వృక్షం. ఇది చల్లని ప్రదేశాలలో ఎక్కువగా హిమాలయాల వద్ద పెరుగుతుంది. పార్వతీ దేవికి అత్యంత ఇష్టమైనది. దీని మానుతో చెక్కే విగ్రహాలకు సహజత్వం వుంటుంది.ఆరోగ్యరీత్యా చూస్తే... ఇది అజీర్తి, చర్మసంబంధ వ్యాధులు తగ్గిస్తుంది.ఈ చెట్టు ఆకులను ఆరబెట్టి, ఆరిన ఆకులను కొబ్బరి నూనెలో వేసి కాచి చల్లార్చి ఆ నూనెను తలకి రాసుకుంటే మెదడు చల్లబడి కంటి సంబంధ రోగాలు దరిచేరవు. ఈ చెట్టు మానునుంచి తీసిన నూనె చుక్కలు వేడినీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. 
ఇన్ని ఉపయోగాలున్న ఈ దేవదారు పత్రాలతో  ఆ గణేశుని 

      ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి అని పూజిద్దాము.


14. ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి

    మరువక పత్రం అనగా మరువము.ఇది మంచి సువాసన కలిగి వుంటుంది. మనం నిత్యం దీనిని పువ్వుల దండలలో వాడటం చూస్తాము.  దీనిని అందరు ఇళ్ళల్లో నేలమీద లేదా కుండీల లోను కుడా పెంచుతారు. శరీరం దుర్వాసన వస్తుంటే వేడినీళ్ళలో మరువం వేసుకుని స్నానం చేస్తే ఆ దుర్వాసన తొలగిపోతుంది.  దీని ఆకులు ఎండిపోయినా కుడా ఎంతో సువాసన కలిగి ఉంటాయి. ఇంట చక్కని సువాసన కలిగించే ఈ మరువక పత్రంతో ఆ గజాననుని     ఓం  ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి అని ప్రార్ధిద్దాం.


15. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
    సింధువార పత్రం అనగా వావిలి ఆకు. వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు. దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు మరియు గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ కు బాగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి, తల క్రింద పెట్టుకొని పడుకుంటే, తరచుగా వచ్చే తలనొప్పి, జలుబు మటుమాయం అవుతుందని అంటారు. పత్రాల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, ప్రధమ చికిత్సగా పనిచేస్తుంది. వావిలి పత్రాలలో గాడిదగడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, గుంటగలగర, కుప్పింటి కలిపి రసం తీసి, నువ్వులనూనెలో వేసి కాచి, కీళ్ల వాపులకు పై పూతగా వూస్తారు. పత్రాల రసంలో అల్లరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.మనకు ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతున్న ఈ సింధురవార పత్రంతో ఆ ఆది గనాధిపతిని    
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి అని ఆరాదిద్దాం!!


16. ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి
 ఇది జాజి అనే  మల్లిజాతి మొక్క. ఇది అన్ని చోట్లా దొరుకుతాయి. ఇందులో సన్నజాజి, విరజాజి రెండు రకాలు కలవు. వీటి పువ్వుల నుంచి సుగంధతైలం తీస్తారు. జాజి పువ్వులు మంచి సువాసన కల్గి  మనసుకు,మనిషికి హాయిని ఉత్తేజాన్ని కలిగిస్తాయి. జాజి చర్మరోగాలనివారణకుమంచిదివ్యఔషదం.జాజిమొగ్గలతోనేత్రవ్యాదులునయంచేస్తారు. జాజి కషాయాన్ని రోజు తీసుకోవడంవలన క్యాన్సర్ నివారణ అవుతుందని చెపుతున్నారు. ఇన్ని మంచి సుగుణాలున్న ఈ జాజి పత్రం తో ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి అని ఆ ఆనందమూర్తిని వేడుకొందాము.

17. ఓం సుర పూజాయ నమః  గండకీ (గండలీ)  పత్రం పూజయామి
గండకీపత్రం అనగా దేవకాంచనం. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం,విరేచనాలు అరికట్టబడతాయి. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ వ్యాధికి చక్కని ఔషధం ఈ గండకీ  పత్రం. దీని ఆకులు మొండి,దీర్ఘవ్యధులకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. దగ్గు, జలుబులను తగ్గిస్తుంది.ఇన్ని వ్యాధులను నయం చేసే ఈ గండకీ పత్రంతో ఆ పార్వతీ తనయుని  "  ఓం సుర పూజాయ నమః గండకీ
 (గండలీ )పత్రం పూజయామి " అని పూజించి తరిద్దాం.

18. ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి
శమీపత్రం అనగా జమ్మి ఆకు. ఇది మనందరికీ తెలిసినదే. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు.  పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం ఈ  జమ్మి చెట్టు. ఈ చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాదించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు చెట్టు బెరెడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా లకు మందుగా పనిచేస్తుంది. దీని గాలి క్రిమిసంహారిణి. వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకులద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకులరసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ చెట్టును సురభి బంగారం అనే పేరు వచ్చింది. బంగారం లాంటి ఉపయోగాలున్న ఈ జమ్మిపత్రాలతో మన బంగారు గణపతిని 
 " ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి " అని
 బాగుగా పూజిద్దాము. 



19. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి

అశ్వత్థ పత్రం  అనగా రావిఆకు.  రావి  సాక్షాత్  శ్రీమహావిష్ణువు స్వరూపం. తులసిలేని ఇల్లు వేపలేని వీధి,రావిచెట్టులేని ఊరు ఉండదన్నది మన పెద్దల మాట. యజ్ఞయాగాదులలో  హోమాలలో రావికొమ్మలను ఉపయోగిస్తారు. రావి ఆకులు హృదయసంబంధమైన రోగాలకు ఉపయోగిస్తారు.రెఅవి వేర్లు దంతవ్యాధులకు  మంచి ఔషధము.ఎండిన రావిపుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి దానిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాస సంబంధవ్యాదులు నివారణ అవుతాయి. నోటిపూత, చర్మవ్యాధులు ఉదారసంబంధ వ్యాధులు నయం చేసే శక్తి ఈ రావి పత్రాలకి ఉంది.అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఈ రావి పత్రాలకి ఉంది.జీర్ణశక్తిని జ్ఞాపకశక్తిని పెపోదించే గుణం గల ఆకులు రావిఆకులు. ఇన్ని రకాల వ్యాధులు  వినాశనం
 చేసే శక్తి గల ఆ రావి పత్రాలతో ఆ విఘ్నేశ్వరుని మన విఘ్నాలు తొలగించమని
" ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి " విజ్ఞతతో వేడుకొందాము. 


20. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
అర్జున పత్రం అనగా తెల్లమద్ది. ఇవి చూడటానికి కొంచెం మర్రి ఆకులులాగా ఉంటాయి. మద్ది చెట్టు హృదయసంబంధిత  రోగాలకు దివ్య ఔషదం.ఇది శరీరానికి చలువ చేస్తుంది. రక్తనాళాలను గట్టి పరుస్తుంది.ఇది వాత రోగాలను పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజలు తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఈ అర్జునపత్ర బెరడు రుబ్బి ఎముకలు విరిగినచోట పెడితే తొందరగా నయం అవుతుంది. కీళ్ళనొప్పులు, మలాశయ దోషాల నివారణలో బాగా ఉపయోగపడుతుంది.ఈ  అర్జున పత్రంతో ఆ ఏకదంతుని 
" ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి " అని అర్చిద్దాము.


21. ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి.

ర్కపత్రం అనగా జిల్లేడు. ఈ చెట్టు  గణపతి స్వరూపం. ఇందులో రెండు  రకాలు కలవు. 1.తెల్లజిల్లేడు, 2. ఎర్ర జిల్లేడు,  అని అంటారు. రథసప్తమి రోజు జిల్లేడు పత్రాలు ధరించి నదీస్నానము చేస్తే చాలా పుణ్యమని హిందువుల నమ్మకం. పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెంపొందుతుంది.లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు తగ్గుతాయి.చర్మ సమస్యలను తగ్గిస్తుంది. శరీర సమస్యలకు ఉపయోగపదుతుంది. కీళ్ళ సమస్యలను తగ్గిస్తుంది. జిల్లెడుతో చేసిన నునె చేవుడుకు ఔషధం గా ఉపయోగపడుతుంది.ఇది రక్త శుద్ధిని చేస్తుంది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, వేర్లు, కొమ్మలు అన్ని ఔషధగుణాలు కలిగి మనకి ఎంతో ఉపయోగపడతాయి. కానీ జిల్లేడు పాలు కంటిలో పడటంవలన  తీవ్రమైన హాని కలుగుతుంది.మరి గణపతికి స్వరూపం అయిన ఈ జిల్లేడు ఆకులతో ఆ ఆర్క గణపతిని  

" ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి "  అని ఆరాదిద్దాము.


ఈ 21 పత్రులతో ఆ ఆది గనాదిపతిని,ఆనందమూర్తిని , ఆ పార్వతీ సుతుని భక్తితో  " ఓం వరసిద్ది వినాయక స్వామినే నమహః   (ఓం శ్రీ గణేశ్వరాయ నమః ) ఏక వింశతి ( 21 ) పత్రాణి సమర్పయామి " అని పూజిద్దాము.

సరేజనా సుఖినోభవంతు.
సత్యసాయి  - విస్సాఫౌండేషన్. 

No comments:

Post a Comment

Total Pageviews