Sunday, September 13, 2015

పోలాల అమావాస్య

                         పోలాల అమావాస్య
                                   లేదా  
                            పోలాంబ వ్రతం.


 శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' అంటారు. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు

 తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు

అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం 
నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి,వరిపిండితోఅందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను ( కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకుంటారు.)అక్కడ వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను( ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 4 తోరాలు వుండవు 2 తోరాలే ఉంటాయి.) అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి,

 ఆతర్వాతఆకందమొక్కలోకిమంగళగౌరీదేవినిగానీ,సంతానలక్ష్మీదేవినిగానీఆవాహనచేసి,షోడశోపచారాలతోఅర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లుగారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు   ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక

 తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో
 కట్టాలి. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు.  ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు,మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే..,పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. ఇంకా పనసఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ  పిండి అందు లో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము. వీటినే పొట్టిక్క బుట్టలు అని అంటారు.  ఇవి ఎక్కువగా గోదావరి జిల్లాలో చేస్తాము.

 కొన్ని ప్రాంతాలలో ఇదే రోజున పితృదేవతలను పూజించడం,వాళ్లకి తర్పణాలు వదలడం ... పిండ ప్రదానాలు చేయడం  చేస్తూఉంటారు.  ఆవులను ఎద్దులను పూజించడం  కుడా చేస్తారు. దానికి కారణం ఒకానొకప్పుడు నందీశ్వరుడి సేవకు మెచ్చిన పరమశివుడు, ఆవులను ... ఎద్దులను శ్రావణ బహుళ అమావాస్య రోజున పూజించినవారికి సకల శుభాలు కలుగుతాయని వరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆవులను ... ఎద్దులను పూజిస్తూ వుంటారు. ఎప్పుడూ ఎంతో కష్టం చేసే ఎద్దులకు ఈ రోజున పూర్తి విశ్రాంతిని కల్పిస్తారు. 



 
                                                         కందమొక్క 
వ్రత కథ.
ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములుండేవారు. వారికి పెళ్లిళ్లయి భార్యలు కాపురానికి వచ్చారు. చాలామంది పిల్లలతో వారంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. కొంతకాలానికి ఆ ఏడుగురు తోడికోడళ్లూ పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నించారు. కానీ అదేరోజు చివరి కోడలి బిడ్డ మరణించడంతో నోచుకోలేకపోయారు. ఆ విధంగా వారు ఆరేళ్లు నోము నోచుకునే ప్రయత్నాలు చేయటం, చివరి కోడలి బిడ్డ మరణించటమూ జరిగాయి. మిగిలిన ఆరుగురూ ఏడవ ఆమెను దుమ్మెత్తి పోయటం జరుగుతున్నది. అదేవిదంగా  ఏడవ ఏడాది కూడా అందరూ నోము నోచుకొనుటకు అన్ని ప్రయత్నములు చేసుకొన్నారు. పూర్వమువలె ఆఖరి ఆమె బిడ్డ మరణించేను.  అలాగే జరగటంతో చివరికి ఆమె భయపడి, తనని అందరూ తిట్టిపోయుదురని బయపడి  మరణించిన బిడ్డను  గదిలోపెట్టి తాళంవేసి, తక్కినవారితో కలసి నోము నోచుకున్నది వేడుక ముగిసి ఇంటికి తిరిగివచ్చి చివరి కోడలు, తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని ఏడుస్తూ ఊరి చివరికి వెళ్ళి అక్కడున్న పోలేరమ్మ గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవసాగింది.అంతలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి " ఎందుకేడుస్తున్నావు" అని అడిగెను. అందుకామె " అమ్మా! ఏడవక ఏమి చేయమంటావు? ఏడేళ్ళ నుంచి ఏడాది కొకరి  చొప్పున  ఈ పోలేరమ్మకు అప్పగిస్తున్నాను. ఈ  బిడ్డ నేటి ఉదయమే చనిపోయెను. కానీ ప్రతి ఏడు నా పిల్లలు చనిపోవుట.. నోము ఆగిపోవుట   నా తోడి కోడళ్ళు  నన్నుతిట్టుట జరుగుతుండడంతో ఈ ఏడు వారి నోము ఆపుట ఇష్టంలేక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి ,  వారితో కలసి నోమునోచుకొని  ఇప్పుడు శవమును తీసుకుని ఇక్కడకి వచ్చాను "  అన్నది. ఆమాటలను విని పోలేరమ్మ జాలి కలిగి ఆమెకు అక్షింతలను ఇచ్చి, వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట జల్లి.. పేర్లతో చచ్చినవారిని పిలువమని చెప్పి వెళ్ళిపోయెను. ఆమె అమ్మవారు చెప్పినట్లు తనపిల్లలను పాతిన గోతులు మీద అక్షతలను చల్లి , చచ్చినవారిని పేర్లతో పిలువగా ఆ పిల్లలందరూ సజీవులై బయటకి వచ్చిరి. అంట ఆమె సంతోషించి ఆ ఏడుగురు పిల్లలను వెంటపెట్టుకొని ఇంటికి వెళ్ళెను. తెల్లవారేసరికి ఆమె తోడికోడళ్ళు, ఊరిలోనివారు ఆ పిల్లలని చూసి " వీళ్ళు ఎక్కడనుండి వచ్చిరి ? " అని అడుగగా ఏడవకోడలు గతరాత్రి జరిగిన విశేషములను చెప్పెను. ఆమె చెప్పిన మాటలకు అందరూ ఎంతో ఆశ్చర్యపడి  ప్రతి సంవత్సరము " పోలాల అమావాస్య " నోమును  నోచుకొనుచు సుఖసంతోషాలతో ఉండిరి.

కథ చదివినవాళ్ళు, విన్నవాళ్ళు అమ్మవారికి ఈ క్రింది విధంగా దణ్ణం పెట్టుకుని 

"పోలేరమ్మనీ ఇల్లు పాలతోనేతితో అలుకుతానునా ఇల్లు మల,మూత్రాలతో  అలుకు", అంటారు.వినడానికి కొం వింతగావుంటుంది.కాని  అదివారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగాకనిపిస్తుంది  కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు. 

దీనికి ఉద్యాపన ఏమీ లేదు. ఇది అందరూ చేసుకోవచ్చు. ఈ " పోలాల అమావాస్య " నోమును నోచుకొనుట వలన సంతానంలేనివారికి సంతానం కలుగును. సంతానం ఉన్నవారికి కడుపుచలువ కలుగుతుంది.

కనుక మాతృత్త్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన, సౌభాగ్యాలు పొందాలి.

                                     సర్వేజనా సుఖినోభవంతు!!!!

No comments:

Post a Comment

Total Pageviews