కార్తిక పురాణము - ఇరవై అయిదవ అధ్యాయము


దూర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించెను. అయ్యా! నేను పాపుడను. పాపకర్ముడను. పాప మానసుడను. నిన్ను శరణు వేడెదను. నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మ మార్గమును దెలియక పాపమను బురదయందు పది దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను. పాపములను జేసితిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు. కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. మీవంటి మహా బుద్ధిమంతులు దయావంతులై మావంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయును. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి యిట్లనియె. రాజా! నేను దయ గలవాడను గాను. నాకు శాంతి లేదు. ఓర్పు లేనివారికి ఆలయమైతిని. గనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలిసికొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన యెడల శాంతులగుదురు. గానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించు వాడను గాను. ఇట్లని పలికి అంబరీషునుద్దేశించి శాపమిచ్చెను. ౧. మత్స్యము ౨. కూర్మము ౩. వరాహము 4. వామనుడు ౫. వికృత ముఖుడు ౬. బ్రాహ్మణుడై క్రూరుడు ౭. క్షత్రియుడై జ్ఞాన శూన్యుడు ౮. క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు ౯. దురాచారుడు - పాషండ మార్గవేడియు, 10. బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటె ముందు చేస్తినను గర్వముతో నున్న నీకు ఈ పదిజన్మలూ వచ్చును.అనగా పదింటియందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు. కనుక గర్వించిన వానికి గర్వ భంగకరములైన జన్మలను యిచ్చితిననెను. ఇట్లు పది శాపములు ఇచ్చి నన్ను అవమాన పరచిన వానికి ఇంకా శాపమివ్వలయునని తలంచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును, భక్తి ప్రియుడును, శరణాగత వత్సలుడునగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోను, బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన పది శాపములనూ తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలంచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్య కాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరుగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో మునివెంట బడెను. ముని ఆత్మ రక్షణమునకై భూమినంతయు తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింప బడెను గానీ చక్ర భయము చేత మునిని రక్షించు వాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులును, వసిస్టాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు, దుర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకొను మునీశ్వరుని అతి కోపముచేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను.
ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే పంచవింశాధ్యాయ సమాప్తః!!
No comments:
Post a Comment