అత్రి ఇట్లు పల్కెను. అగస్త్య మునీంద్రా! నీకు కార్తిక వ్రతమందును, హరిభక్తి యందును ఆసక్తి ఉన్నది. కాన కార్తిక మహాత్మ్యమును చెప్పెద వినుము. సావధానముగా విన్న ఎడల పాపములు నశించును. కార్తిక మాసమందు శుక్ల ద్వాదశి హరి బోధిని, ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమును ఇచ్చును. అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది. సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి యిచ్చును. ఇది కాక ఈ ద్వాదశి హరియందును, ఏకాదశియందును, భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది. ద్వాదశి సూర్య చంద్ర గ్రహణముల కంటె అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటె నూరు రెట్లు ఎక్కువది. సమస్త పుణ్యమును ఇచ్చునది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును. ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలెను. కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు. ఇతర నియమములన్నింటిని విడిచి ద్వాదశి స్వల్ప కాలమందు పారణ చేయవలెను. కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడువ కూడదు.
ఏకాదశియందు ఉపవాస మాచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను. ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును. ఈ విషయము తెలిసియె పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారణ అనబడును. అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమను వంక చేత భోజనమును యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మనెను. దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి అతిస్వల్పముగా ఉండెను. దుర్వాసుడు రాకపోయెను. ద్వాదశి పోవుచున్నది. ఇట్టి సంకటము సంభవించినది. అపుడు హరిభక్తుడైన అంబరీషుడు విచార పడసాగెను. ఈ దుర్వాసుడు ముని శ్రేష్ఠుడు. పారణ కొరకు అంగీకరింపబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును. బ్రాహ్మణుని కంటె ముందు భుజించిన యెడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము? ఉపవాసమందెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణయందును ద్వాదశిని విడువరాదు. ద్వాదశిని విడిచిన యెడల హరిభక్తిని విడిచిన వాడనగుదును. ఏకాదశినాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడనగుదునో ద్వాదశిని విడిచినయెడల అట్టి దోషమే సంభవించును. ఇదిగాక ద్వాదశీ పారణాతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును బోగొట్టును. కాన ద్వాదశిని విద్వాంసుడు విడువకూడదు. హరివాసరము పుణ్యదినము గాన విద్వాంసుడు విడువరాదు. దానిని విడిచెనేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు. అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన యెడల నశించును. అందువలన గలిగెడి పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడువకూడదు. దీనికి ప్రతీకారము లేదు. అనేక వాక్యాలతో పనియేమున్నది. ఇది నిజాము. హరి వాసరమును విడిచిన యెడల హరిభక్తి యుండదు. హరిభక్తిని విడుచుట యందు నాకు మహా భయమున్నది. కాబట్టి యట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము. బ్రాహ్మణ శాపమువలన నాకేమియు భయములేదు. శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము. ద్వాదశిని విడిచినచో హరివాసరము (ఏకాదశులు) 10 విడువబడినవియగును. హరివాసరమును విడిచిన యెడల హరిభక్తి లోపించును. గనుక హరిభక్తిని విడుచుట కంటె బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది. కాబట్టి హరిభాక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్ద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది. అట్లయిన యెడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగెను.
ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే చతుర్వింశాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment