Wednesday, March 9, 2016

కాలచక్రం

రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు గడచినా అందరి హృదయాల్లో సర్వదా జీవించి ఉండేవాడే గొప్పవాడని ‘మనుధర్మశాస్త్రం’ చెబుతోంది. పోగొట్టు కొనేంత సమయం మనిషి వద్ద లేదు. అందుకే రానున్న అవకాశం కోసం అతడు త్వరపడాలి.
కాలం గురించి వివేకవంతంగా ఆలోచించాలి మనిషి. కాలాన్ని వృథా చేయడం వల్ల కలిగిన నష్టాన్ని తిరిగి భర్తీచేసుకోవడమన్నది కష్టం.

🌺భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, కాలం అంటే తానేనని ప్రవచించాడు. జననం నుంచి చివరి వరకు ఆయన నిర్వహించిన అన్ని పనులూ సమయం ప్రకారమే సాగాయని వ్యాసుడి ‘మహాభారతం’ వర్ణించింది.
మహాభారత యుద్ధం మరో రెండు రోజులకు ప్రారంభం కానుంది. శ్రీకృష్ణుడు కురుక్షేత్రానికి చేరువలో పాండవులతో వారి భార్యలతో ఒక సమావేశం ఏర్పాటుచేస్తాడు. రణరంగంలో అమలుపరచే వ్యూహాలను వివరిస్తూ ‘అదొక భీకర యుద్ధంగా పరిణమించనుంది’ అంటాడు. కలవరానికి గురైన ద్రౌపది ఆయన మాటలకు అడ్డుతగిలి ‘కృష్ణా! ఆ మహా సమరంలో కురుపాండవుల్లో మరణించేవారెవరు, జీవించి ఉండేవారెందరు’ అని ప్రశ్నిస్తుంది.
ఆమె వైపు శ్రీహరి గంభీరంగా చూస్తూ ‘చెల్లీ! యుద్ధంలో నీ అయిదుగురు భర్తలు తప్ప మరెవరూ మిగలరు’ అంటాడు. వేదనకు గురైన ద్రౌపది ‘కృష్ణా! మహాభారత యుద్ధాన్ని దయచేసి ఆపు. నాకు ఆ కడుపుకోత వద్దు. నేను భరించలేను’ అంటుంది.
అప్పుడు ఆయన చిరునవ్వుతో ‘అమ్మా ద్రౌపదీ! కాలానికి ఎదురీదే ప్రయత్నం చేయకు. కాలం అన్నింటికీ అతీతమైంది. ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు జన్మిస్తారో, ఎలా జీవిస్తారో, ఏ విధంగా తనువు చాలిస్తారో కాలం ముందుగా నిర్ణయించే ఉంటుంది. కాల నిర్ణయాన్ని నియంత్రించడం ఎవరి తరం కాదు. నా తరమూ కాదు. అంతా ముందుగా నిర్ణయమై ఉన్నదే! యుద్ధాన్ని నివారించడం నా చేతుల్లో లేదు. మనం లెక్కకట్టలేని కాలానికి ముందే, అన్ని నిర్ణయాలూ జరిగిపోయాయి. యుద్ధం తప్పదు ద్రౌపదీ!’ అని స్పష్టీకరిస్తాడు.

🌺అన్ని వనరులకంటే, కాలం చాలా విలువైనది. దాన్ని సక్రమంగా వినియోగించుకొనే జాగ్రత్త మనిషికి ఉండాలి. వ్యసనాలతో కాలాన్ని దుర్వినియోగం చేయడం తగదు. అందువల్ల పాపభారం పెరగడమే తప్ప, కాలం విలువ ఎన్నటికీ తెలియదు. ‘గీతాంజలి’లో రవీంద్రనాథ్‌ ఠాగూరు వ్యాఖ్యానించినట్లు ‘జీవరాశికి ప్రకృతి ప్రసాదించిన వరమే కాలం’. అందువల్ల జననం, మరణం మధ్య జీవికి లభించే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారాయన.

🌺కాలం గడచిపోతే, ఇక ఎప్పటికీ తిరిగి రాదు. అన్నింటినీ కాలమే పరీక్షిస్తుంది. అదే అన్నింటినీ పొందుతుంది, మింగేస్తుంది. క్షణాల కలయికే కాలం. అందులోని ప్రతి క్షణమూ ఇంద్రజాలమే! అది ఇలా వచ్చి అలా అదృశ్యమవుతుంటుంది.
ధనాన్ని కొంత దాచుకుంటాం. కొంత ఖర్చుచేసుకుంటాం. కాలాన్ని ఏమీ నిల్వ చేయలేం. నిరుపయోగంగా దాన్ని వదిలివేస్తే, మళ్లీ రాదు, దరిచేరదు. ఈ ప్రపంచంలో డబ్బుతో సహా దేనినైనా వృథా చేసుకుంటే, ఏదోవిధంగా తిరిగి సంపాదించుకొనే అవకాశముంది. కాలాన్ని వృథా చేస్తే అంతే! జీవితంలో అద్భుత క్షణాల్ని శాశ్వతంగా కోల్పోయినట్లే. వాటిని మళ్లీ సంపాదించడమన్నది కేవలం వూహాతీత భావన తప్ప మరొకటి కాదు. జర్మన్‌ తత్వవేత్త హుమ్స్‌ ‘నా ఎడమ జేబులో ఉన్న వెండి నాణెం తీసుకో. కుడి జేబును వదిలేయి. ఎందుకంటే, ఆ జేబులో నా బంగారు కాలం ఉంది’ అనేవారు!

🌺కాలాన్ని అనుసరించి, ఇంద్రజాలాన్ని ఛేదించుకొని చేసే జీవనయానమే ఓ అద్భుతమైన అనుభవం. ప్రతీ మనిషిలోని ఔన్న త్యాన్ని ఆ కాలమే నిర్ణయిస్తుంది. అది ఒక వరం. నిర్లక్ష్యం చేస్తే, కాలమే ఓ శాపంగా మారుతుంది!_______

No comments:

Post a Comment

Total Pageviews