Monday, October 23, 2017

కార్తిక పురాణం 3వ అధ్యాయము


కార్తీకమాస స్నాన మహిమ.






జనక మహరాజా! కార్తిక మాసమున యే ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తిక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు.
అధమము కార్తీకమాస శుక్ల పార్ణమి రోజు నయిననూ స్నానదాన జపతపాదులు చేయక పోవుట వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకి౦పుము.
బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట
ఈ భారతఖండమందలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వటవృక్ష౦బుపై భయంకర ముఖములతోను, దీర్ఘ కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయక౦పితము జేయుచు౦డిరి. తీర్థ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పఠించుచు "ప్రభో! ఆర్తత్రాణపరాయణ! ఆనాధరక్షకా! ఆపదలోనున్న గజేంద్రుని, ని౦డుసభలో అవమానాలు పాలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు బారినుండి నన్ను రక్షించు తండ్రీ!"యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులుకు జ్ఞానోదయ౦ కలిగి "మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయ౦ అయినది మమ్ము రక్షింపుడు" యని ప్రాధేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని "ఓయీ! మీరెవరు? ఎందులకు మికీ రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు" యని పలుకగా వారు "విప్రపుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపదా కలగదు" అని అభయమిచ్చి, అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును యీ విధముగా చెప్పసాగెను.
"నాది ద్రావిడ దేశం. బ్రహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయాన్యాయవిచక్షణలు మాని పశువువలె ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జన్యంగా ధనంలాగుకోనుచు, దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరచుచు, లుబ్ధుడనై లోకకంట కుడిగానుంటిని.
ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తల౦పుతొ పదార్ధసంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకొని యింటినుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి "ఓరి నీచుడా! అన్యాక్రా౦తముగా డబ్బుకూడాబెట్టినది చాలక, మంచిచెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామాగ్రిని దోచుకొంటివి గాన, నివు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు"గాక! యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైన తప్పించుకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా! కాన నాయపరాధము క్షమి౦పుమని వానిని ప్రార్ధి౦చితిని. అందుల కాతాడు దయదలచి "ఓయీ! గోదావరి క్షేత్రమ౦దొక వటవృక్షము గలదు. నెవందు నివసించుచూ యే బ్రాహ్మణుడు కార్తీకవ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణునివలన పునర్జన్మ నొ౦దుదువు గాక" యని వేడలిపోయెను. ఆనాటి నుండి నేని రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్నూ నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.
ఇక రెండవ రాక్షసుడు "ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మణుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించి వారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా యనునటులచేసి, వారి యెదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచు౦డెడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగును, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవర్తి౦చితిని. కాన, నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము" అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను.
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియజేసెను. "మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నానమైననూ చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డేడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక, భక్తులు గొనితేచ్చిన సంభారములను నా వుంపుడుగత్తెకు అందజేయుచు మధ్యమాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాన౦తరము యీ రూపమును ధరించితిని, కావున నన్ను కూడా పాపవిముక్తుని కావి౦పు"మని ప్రార్ధించెను.
ఓ జనక మహారాజా! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి "ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోరకృత్యంబులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతును"యని, వారినోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాతనావిముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంటమునకేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాది౦తురు. అందువలన, ఎంత ప్రయత్నించినాసరే కార్తిక స్నానాలనాచరించాలి.
ఇట్లు స్కాందపురాణా౦తర్గత, వశిష్టప్రోక్త కార్తిక మహాత్మ్యముందలి మూడవ రోజు అధ్యాయము - మూడవ రోజు పారాయణము సమాప్తము.

 




No comments:

Post a Comment

Total Pageviews