Sunday, October 22, 2017

నాగుల చవితి

నాగుపామును హిందువులు ఎంతో ఆరాధ్యంగా, దైవంగా పూజించుకుంటారు. కార్తీక శుద్ధ చతుర్థిని నాగులచవితి అంటారు. ఇది దీపావళి అమావాస్య తరువాత వస్తుంది. నాగులచవితిని కొందరు శ్రావణశుద్ధచతుర్థినాడు కూడా జరుపుకుంటారు. ఈ పండుగరోజు నాగేంద్రుడిని అర్చిస్తే..శరీరంలో వున్న సర్వరోగాలు పోయి, సౌభాగ్యవంతులు అవుతారని భారతీయులు ప్రగాఢంగా నమ్ముతారు.
యోగాశాస్త్రం ప్రకారం.. మన శరీరంలో వున్న వెన్నెముక - కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘‘పాము’’ ఆకారంలో వుంటుందని తెలుపుతున్నారు. ఇది మానవునిలో సత్వగుణ సంపత్తిని తొలగిస్తూ వుంటుందంటారు. అప్పుడు నాగులచవితిరోజున విషసర్ప పుట్టలను ఆరాధించి, అందులో పాలుపోస్తే మానవునిలో వున్న విషసర్పం కూడా నశిస్తుందని నమ్ముతారు.
ఇలా ప్రతినాగులచవితినాడు స్త్రీలు ఆరాధిస్తే.. వారికి శుభప్రదమైన సంతానం కలుగుతుందని, ఆ పిల్లలు కూడా ఆచరిస్తే వారికి మంచి భర్తలు లభిస్తారని పలువురు విశ్వసిస్తారు.
ఈ నాగులచవితి ఈనాటినుంచి చేస్తున్న సంస్కృతికాదు.. పురాతనకాలాల నుంచి ఈ సంప్రదాయం నడుస్తూ వస్తోంది. దీంతో సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని, సంతానప్రాప్తి కలుగుతుందని పురాణాలలో కూడా ఎన్ని కథలున్నాయి.

నాగులచవితి నాడు
‘‘కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||’’
అనే శ్లోకాన్ని పఠిస్తే.. కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది.

వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఎందుకంటే.. సూర్యుడు ఈ నక్షత్రంలో సరిగ్గా కార్తీక శుద్ధ చవితినాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు.
ప్రస్తుతమున్న శాస్త్రీయపద్ధతి ద్వారా చెప్పాలంటే.. సర్పాలు మనకు పరోక్షంగా సహాయపడుతున్నాయి. ఎందుకంటే భూమి అంతర్భాగంలో వున్న క్రిముల్ని, పురుగుల్ని ఇవి తినేసి భూసారాన్ని కాపాడుతున్నాయి.

బ్రహ్మ పురాణంలో సంతానం కథ :
చంద్రవంశానికి రాజయిన శూర్యసేనుడు, అతని భార్య సంతానం కలగడం కోసం చాలారోజులు తపస్సు చేశారు. అయితే వారికి ఒక సర్పం (మగ) జన్మించింది. అయినా వీరు ఆ సర్పాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. కొన్నిరోజుల తరువాత ఆ సర్పం మనుషుల్లా మాట్లాడటం మొదలుపెట్టింది. దానిని చూసి రాజు, రాజుభార్య ఒక్కసారి ఖంగుతిన్నారు.

ఆ పాము తనకు ఉపనయనం చేయించమని కోరింది. ఆ రాజు అలాగే చేశాడు. కొన్నాళ్ల తరువాత ఆ సర్పం తనకు పెళ్లి చేయించమని కోరింది. దాంతో ఆ రాజు ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి తిరిగి రప్పించుకున్నారు.
అత్తింటికి వచ్చిన ఆ కోడలు తన భర్త పాము అని తెలుసుకుంటుంది. అయినా ఆమె ఏమాత్రం భయపడకుండా అతనితోనే కలిసిమెలిసి వుంటుంది. ఒకరోజు పాము ‘‘నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడటం లేదు’’ అని అడుగుతుంది. అప్పుడు ఆమె ‘‘భర్త ఎటువంటివాడైనా స్త్రీకి దైవంతో సమానం. దైవాన్ని చూసి ఎవరైనా భయపడతారా’’ అని సమాధానం ఇస్తుంది.

ఇది విన్న ఆ పాము ‘‘శివుని శాపం వల్ల నేను ఇలా పాములా అయ్యాను’’ అని చెబుతుంది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి చవితి వ్రతాన్ని ఆచరించి, గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపం నుండి విమోచనం పొందుతాడు.

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల
 అంతర్యమని చెప్తారు.
 
నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
మన భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.

No comments:

Post a Comment

Total Pageviews