Saturday, October 28, 2017

నైపుణ్య ప్రాప్తిరస్తు! enadu special article



‘పరీక్ష పాసైన ఆనందం పదినిమిషాలు కూడా ఉంచరా...’ అని వాపోతాడు ‘నేను లోకల్‌’ సినిమాలో హీరో. ఇంజినీరింగ్‌ పాసయ్యాననగానే అతడిని తల్లి అడిగే ప్రశ్న ‘వాట్‌ నెక్ట్స్‌’ అని. ఆమే కాదు స్నేహితులూ పరిచయస్తులూ అందరూ అదే ప్రశ్న- తర్వాతేం చేద్దామనీ? ఇది ఆ సినిమా హీరోకే కాదు మన దేశంలోని యువతకీ నిరంతరం ఎదురయ్యే ప్రశ్న. ఎందుకంటే ఏం చదివినా ఆ చదువుకు తగిన ఉద్యోగం దొరకడం అనేది అంత సులభం కాదు మరి.
అసలు పదో తరగతి పాసవడంతోనే మొదలవుతుంది సమస్య. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారో పిల్లలు ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌... ఏది చదివినా వాట్‌ నెక్ట్స్‌ - అన్న ప్రశ్న మాత్రం వారిని వదలదు. మళ్లీ పీజీనో, డిప్లొమానో మరో ట్రైనింగో... తప్పనిసరిగా చేస్తేనే ఉద్యోగానికి ఓ అర్హత లభిస్తోంది. ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌ లాంటివి ఉద్యోగం పొందడానికి కీలకం అవుతున్నాయి.
పరిస్థితి ఇలా మారడానికి కారణం... అభివృద్ధే.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. కానీ విద్యావిధానాల్లో మాత్రం అంత వేగంగా మార్పులు రావడం లేదు. కాలానికి తగినట్లు కొత్త కోర్సులు కొన్ని ప్రవేశపెట్టినా సంప్రదాయ విద్యావిధానం అలాగే కొనసాగుతోంది. అవే సబ్జెక్టులూ అవే పాఠ్యాంశాలూ. బోధనా విధానమూ పరీక్షల నిర్వహణా ఉత్తీర్ణతాశాతాలూ మార్కులూ ర్యాంకులూ... ఏవీ మారలేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన అభివృద్ధితో సమానంగా పిల్లలకు నేర్పే పాఠ్యాంశాల్లో విప్లవాత్మక మార్పులు రాలేదు. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉన్న అవసరానికీ విద్యావంతులైన యువత సామర్థ్యాలకీ మధ్య చాలా అంతరం ఉంటోంది. దీన్ని అధిగమించడానికే ప్రత్యేక శిక్షణ అవసరం అవుతోంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టీ నైపుణ్యాభివృద్ధి వైపు మళ్లింది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.
నైపుణ్యాలకే గుర్తింపు
హైదరాబాదులో ఏ ఆస్పత్రిలో చూసినా కేరళ నర్సులు కన్పిస్తారు. రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఏ పట్టణంలో ఆంగ్లమాధ్యమ పాఠశాల ప్రారంభించినా ‘మా దగ్గర కేరళ టీచర్లున్నారు’ అని గొప్పగా ప్రకటించుకునేవారు. ఎక్కువ జీతం ఇచ్చి మరీ వారిని నియమించుకునేవారు. కేరళ రాష్ట్రం మొదటినుంచీ అక్షరాస్యతలో అగ్రభాగాన ఉండేది. చదువుకున్న వారందరికీ అక్కడ ఉద్యోగాలు దొరకలేదు. దాంతో పురుషులు అరబ్‌ దేశాలకు వెళ్తే స్త్రీలు దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేవారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి కానీ నర్సులు లేరు. పట్టణాల్లో విపరీతంగా ఆంగ్లమాధ్యమం పాఠశాలలు వెలిశాయి కానీ ఆంగ్లం బోధించే టీచర్లు లేరు. ఈ పరిస్థితులు కేరళవారికి కలిసివచ్చాయి. ఇవే కాదు, ఏ రంగంలోనైనా నిపుణులకు అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. తగిన గుర్తింపూ ప్రతిఫలమూ లభిస్తాయి. పట్టణాలే కాదు, పల్లెల్లో పనుల్నే తీసుకున్నా అక్కడ అందరికీ అన్ని పనులూ తెలిసే ఉంటాయి. అయినా సరే పూరిళ్లు కప్పడానికీ గడ్డివాము వేయడానికీ తాళ్లు పేనడానికీ... ఇలా ప్రతి పనికీ వూళ్లొ పేరొందినవారు కొందరుంటారు. వూరివాళ్లంతా తమ వంతు వచ్చేవరకూ వేచి ఉండి మరీ వారి సేవల్ని వినియోగించుకుంటారు. పని అందరూ చేస్తారు. కానీ నైపుణ్యంతో చేసేవారు కొందరే. ఆ కొందరివల్లే జరిగే పని నాణ్యత స్థాయిని మరొక మెట్టు పైకి లేపుతుంది.
అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం
కృషి ఉంటే మనుషులు రుషులే కాదు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణులూ అవుతారు. నైపుణ్యం ఉన్నవాళ్లకు సవాళ్లే అవకాశాలుగా మారతాయి. ఇరవయ్యేళ్ల క్రితం సంగతి... సాఫ్ట్‌వేర్‌ సమాజమంతా మిలీనియం బగ్‌(వై2కే) భయంతో వణుకుతున్న సమయం. ప్రపంచ దేశాలన్నీ ఆ సవాలును పరిష్కరించడమెలా అని సతమతమవుతోంటే హైదరాబాద్‌ మాత్రం దాన్ని సువర్ణావకాశంగా మార్చుకుంది. అప్పటికే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లో ఇక్కడి యువత నిపుణులుగా రాణిస్తున్నారు. మిలీనియం బగ్‌ సమస్యని ఛేదించేందుకు వెల్లువెత్తిన ఉద్యోగావకాశాలను వారు అందిపుచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో విదేశాలకు వెళ్లగలిగారు. మన దేశంలో ఒక్క హైదరాబాద్‌ నుంచే అప్పుడు అత్యధిక సంఖ్యలో యువతీయువకులు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందారు. మరోపక్క మన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తృతపరుచుకోవడానికీ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికీ సైతం ఈ పరిణామం తోడ్పడింది.
గురుకులాల్లోనే నేర్పించారు!
నైపుణ్యాల్లో శిక్షణ పొందడమనేది ప్రపంచానికి నేడు కొత్త కావచ్చేమో కానీ మనకు కొత్త విషయం ఏమాత్రం కాదు. పురాతన విద్యాలయాలైన గురుకులాల్లో విద్యార్థులకు 64 కళలతో పాటు 14 విద్యలనూ నేర్పించేవారట. నాలుగు వేదాలూ నాలుగు ఉపవేదాలూ ఆరు వేదాంగాలూ కలిపితే 14 విద్యలు. ధనుర్విద్య, అర్థశాస్త్రం, ఆయుర్వేదం, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషశాస్త్రం... ఇలాంటివన్నీ ఆ విద్యల్లో భాగాలే. గురుకులంలోనే అన్నీ నేర్చుకుని ఆ తర్వాత తమకు ఆసక్తి ఉన్న విద్యలో మరింతగా అధ్యయనం చేసి ఆయా విద్యల్లో నిపుణులుగా రాణించేవారు నాటి విద్యావంతులు. ఉదాహరణకు మహాభారతంలో పాండవులనే తీసుకుందాం. వారంతా గురువు ద్రోణుడి దగ్గర అన్ని విద్యలూ నేర్చుకున్నారు. కానీ ఒక్కొక్కరూ విడివిడిగా ఒక్కో విద్యలో నిపుణులుగా రాణించారు. ధర్మరాజు ధర్మనిరతుడిగా పేరొందాడు. భీముడు గదాయుద్ధంలో నేర్పరే కాదు, వాయువేగంతో పరుగెత్తేవాడు కూడా. సవ్యసాచి అయిన అర్జునుడికి ధనుర్విద్యలో ఎవరూ సాటిలేరు. కవలలైన నకుల సహదేవులిద్దరూ కత్తియుద్ధంలో ప్రవీణులు. నకులుడు గుర్రాలను మాలిమి చేయడంలో దిట్ట. వర్షంలో తడవకుండా మెరుపు వేగంతో గుర్రపుస్వారీ చేయగల నేర్పరి. సహదేవుడు జ్యోతిషశాస్త్రంలో పండితుడైనా శాపవశాత్తూ అందులో తన ప్రతిభను ప్రదర్శించలేకపోయాడు. వీరేకాదు మన పురాణగాథల్లో ఎవరిని తీసుకున్నా వారు ఏదో ఒక విద్యలో నిపుణులై ఉంటారు.
నాలుగు శాతమే
చదువైపోగానే ఉద్యోగం, అది కూడా దొరకగానే పెళ్లీ... అదీ అయిపోతే అప్పుడు జీవితంలో సెటిలైపోయినట్లు లెక్క మన సమాజంలో. కానీ నిజంగా అలా ఉందా పరిస్థితి? ఒక ఉద్యోగంలో విజయవంతంగా కొనసాగాలంటే ఎన్నెన్ని నైపుణ్యాలు కావాలి? ఏటా కోటి మందికి పైగా ఉద్యోగజీవితంలోకి అడుగుపెడుతున్న దేశం మనది. వారిలో ఉపాధికి అవసరమైన సరైన శిక్షణ పొందినవారు నాలుగు శాతం కన్నా తక్కువేనట. ఎంప్లాయబిలిటీ... అంటే ఉద్యోగానికి సిద్ధంగా ఉండే విషయంలో మనదేశం ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే చాలా కింది స్థాయిలో ఉంది. ఉద్యోగాలన్నీ ప్రత్యేక నైపుణ్యాలను కోరుతున్న తరుణంలో మన దగ్గర అందుబాటులో ఉన్న శిక్షణ సౌకర్యాలు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా లేవు. దానికి తోడు ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం ఇప్పుడు చాలా ఆదరణ పొందుతున్న ఉద్యోగాలు భవిష్యత్తులో ఉండకపోవచ్చు. భవిష్యత్తు అంటే ఇక్కడ 40 ఏళ్లొ 50 ఏళ్లొ కాదు, ఐదు నుంచి పదేళ్లు మాత్రమే. ఉద్యోగాల తీరుతెన్నులే అంత వేగంగా మారిపోతున్నప్పుడు వాటికి తగ్గట్టుగా నైపుణ్యాలూ మార్చుకోవాలిగా మరి! సంప్రదాయ విద్యావిధానానికి ఆధునిక సాంకేతికతను జత చేయాలి. అప్పుడే సుశిక్షితులూ నిపుణులూ అయిన యువత ఉద్యోగాల్లోకి వస్తారు.
ఉద్యోగ సామర్థ్యంలో ఎవరెక్కడ?
నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలంటే ముందుగా అసలు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. పట్టభద్రులుగా విశ్వవిద్యాలయాలనుంచి బయటకువస్తున్న వారిలో ఉద్యోగార్హత ఏ మేరకు ఉందో తెలుసుకోవాలి. అందుకుగాను పలు అంశాలను పరిశీలిస్తారు. సంభాషణా చాతుర్యం, కంప్యూటర్‌ నైపుణ్యం, గణితం, విమర్శనాత్మక ఆలోచనాధోరణి, ప్రవర్తన, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి, కొత్త పరిస్థితులకు అలవాటు పడడం... ఇలాంటి ఎన్నో అంశాలను పరిశీలించి నిపుణులు ఏయే రాష్ట్రాల యువత ఏయే అంశాల్లో ముందు నిలుస్తోందో ప్రకటించారు. ఆంగ్లంలో నాలుగో స్థానంలో నిలిచిన తెలంగాణ న్యూమరికల్‌ ఎబిలిటీ, క్రిటికల్‌ థింకింగుల్లో టాప్‌టెన్‌లో లేదు. అన్ని విభాగాల్లోనూ విడి విడిగా టాప్‌టెన్‌లో చోటు సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఓవరాల్‌ టాప్‌టెన్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఈ స్కోరు ఎందుకు ఉపయోగపడుతుందీ అంటే... ఉద్యోగులను ఎంపిక చేసుకునే ముందు సంస్థలు చూసేది ఇలాంటి అధ్యయనాలనే. ఏయే రాష్ట్రాలు ఏయే అంశాల్లో వెనకబడుతున్నాయో తెలిస్తే ఆయా అంశాల్లో విద్యార్థుల నైపుణ్యాలు పెంచడానికి ప్రభుత్వాలూ యూనివర్శిటీలూ శ్రద్ధ తీసుకోవడానికి వీలవుతుంది. ఉద్యోగ నియామకాల్లో జెండర్‌ వైవిధ్యానికీ ప్రాధాన్యం పెరుగుతోంది. స్త్రీ పురుషుల మధ్య ఉద్యోగార్హతలో అంతరం పూర్తిగా తగ్గిపోయిందని అధ్యయనాల్లో తేలింది. భవిష్యత్తులో కార్యాలయాల్లో సమానావకాశాలకు ఇది మంచి సూచిక. స్త్రీలా పురుషులా అన్న వివక్ష చూపకుండా సమాజంలో అందరికీ సమానావకాశాలు కల్పించగలిగినప్పుడే ఏ వ్యవస్థ అయినా గౌరవప్రదమైన వ్యవస్థ అవుతుంది. ఈ విషయంలో ఏపీ రెండో స్థానంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి.
నాలెడ్జ్‌ ఎకానమీ... నైపుణ్యాలే పునాది
ఏ దేశమైనా ఆర్థికంగా సాంఘికంగా ఎదగడానికి తోడ్పడేది అక్కడి విద్యావంతులూ సుశిక్షిత మానవ వనరులే. దేశాన్ని ‘నాలెడ్జ్‌ ఎకానమీ’ దిశగా తీసుకెళ్లాలని కలలు కంటున్నారు ప్రణాళికాకర్తలు. వారి కలలు ఫలించాలంటే మారుతున్న అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు మారాలి. ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని చేరాలంటే 2022 సంవత్సరానికల్లా 50 కోట్ల మందిని నిపుణులైన శ్రమశక్తిగా మార్చుకోవాల్సి ఉంటుందని నివేదికలు చెప్తున్నాయి. అది సాధ్యం చేయాలంటే ఏడాదికి 30 లక్షల మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం మాత్రమే ఉన్న ప్రస్తుత మౌలిక వసతులను కోటీ 20 లక్షల మందికి శిక్షణ ఇవ్వగలిగే సామర్థ్యానికి పెంచాలి. నేడు ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగరంగంలో అడుగుపెడుతున్న 80 శాతం యువతకి నైపుణ్యాలు పెంచుకునే సౌకర్యాలే అందుబాటులో లేవు.
యువభారతం!
మరో నాలుగేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించబోతోంది. అంటే అత్యధిక మానవ వనరుల కేంద్రం మన దేశమే అవుతుంది. 120 కోట్ల జనాభాలో ఏకంగా సగం అంటే అరవై కోట్ల మందికి ఉద్యోగాలు కావాలి. ఇది ఎంత పెద్ద సవాలో... అంత గొప్ప అవకాశం కూడా. ఇంతటి యువశక్తిని నిపుణులుగా మార్చుకోవడం మన ముందున్న సవాలైతే, అలా మార్చుకోవడంలో విజయం సాధిస్తే అన్ని రంగాల్లోనూ దేశాన్ని అగ్రగామిగా నిలపగలిగే అవకాశం మనదే అవుతుంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం మొత్తమ్మీద ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలు మొత్తం కలిపి 87 ఉండేవి. వాటిల్లో 6600 సీట్లు ఉండేవి. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంజినీరింగ్‌, సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చే కళాశాలలు దాదాపు 7వేలు ఉన్నాయి. వీటి నుంచీ ఏటా దాదాపు 28 లక్షల మంది సుశిక్షితులై బయటకు వస్తున్నారు. వారంతా తాము చదివిన చదువుకు సార్థకత లభించే ఉద్యోగం చేయగలిగిననాడే ‘స్కిల్‌ ఇండియా’ ఆవిష్కృతమవుతుంది.
హిట్‌ రిఫ్రెష్‌... అందరికీ అవసరమే
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇటీవల ఓ పుస్తకం రాశారు. దాని పేరు ‘హిట్‌ రిఫ్రెష్‌’. తమ సంస్థలో, సిబ్బంది దృక్పథాల్లో రావాల్సిన మార్పులను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. కానీ నిజానికి అది ఒక్క మైక్రోసాఫ్ట్‌కే కాదు, అందరికీ వర్తించే విషయం. నైపుణ్యాల పెంపు అనేది ఒకసారి ఉద్యోగంలో చేరగానే ఆగిపోదు, పోకూడదు. పని ఒత్తిడి నుంచి బయటపడడానికి విహారయాత్రలకు వెళ్లినట్లే ప్రతి ఉద్యోగీ అప్పుడప్పుడూ తమ ఉద్యోగ జీవితంలోనూ రిఫ్రెష్‌ బటన్‌ నొక్కుతూనే ఉండాలి. ఉద్యోగానికి అవసరమైన కొత్త మెలకువలను నేర్చుకోవాలి. అనునిత్యం అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఏ రంగాన్నీ ఉన్నదున్నట్లుగా ఉండనీయడం లేదు. మార్పు... కొత్తదనం...
అభివృద్ధి... పేరేదైనా పెట్టుకోవచ్చు. కానీ అన్ని రంగాలూ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా తయారవుతున్నాయన్నది వాస్తవం. వాటికి తగ్గట్టుగా ఉద్యోగుల పనితీరూ మారిపోవాలి.
క్రికెటర్‌ ధోనీ పేరు చెప్పగానే అభిమానులకు అతని హెలికాప్టర్‌ షాట్‌ గుర్తొస్తుంది. క్రికెటర్‌గా అతని నైపుణ్యానికి నిదర్శనం ఆ షాట్‌. ధోనీ గురించి సినిమా తీయాలనుకున్నప్పుడు అతని పోలికలకు దగ్గరగా దొరికిన నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌. అతనికి క్రికెట్‌ రాదు. కానీ ఆ పాత్రలో నటించాలి కాబట్టి క్రికెట్‌ నేర్చుకున్నాడు. అంతటితో వూరుకోకుండా కష్టపడి ధోనీ ప్రత్యేకత అయిన హెలికాప్టర్‌ షాట్‌ని కూడా ప్రాక్టీస్‌ చేశాడు. ఆ కష్టం వృథా పోలేదు. ధోనీ సినిమా అతని కెరీర్‌ని మలుపు తిప్పింది. అతనే కాదు, ‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్‌ గుర్రపుస్వారీ, కత్తిసాము లాంటివన్నీ నేర్చుకున్నాడు. సుశాంత్‌ అయినా ప్రభాస్‌ అయినా అంతకు ముందు కూడా నటులే. కానీ కొత్త మెలకువలు నేర్చుకుని మరీ పాత్రలకు జీవం పోయడంతో కెరీర్‌లో వారు మరో మెట్టు పైకి ఎదగగలిగారు. ఏ నైపుణ్యం అయినా అంతే. అందుకే అంటున్నాం...
నైపుణ్య ప్రాప్తిరస్తు!
ప్రభుత్వ పథకాలివి! 
నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ఒకప్పుడు నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని వృత్తివిద్యా కోర్సులకే పరిమితమయ్యేవి. ఎప్పుడైతే చదువులకూ ఉద్యోగార్హతలకూ మధ్య అంతరం కన్పించడం మొదలైందో అప్పటినుంచీ ఉన్నత విద్యావంతులకు కూడా కొన్ని నైపుణ్యాల్లో శిక్షణ అవసరం అని గుర్తించి, ప్రభుత్వాలు ఆ దిశగా కృషి ప్రారంభించాయి. ‘స్కిల్‌ ఇండియా’ని ఆవిష్కరించడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం- ‘ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన’. పీఎంకేవీవైగా పేర్కొనే ఈ పథకం కింద వచ్చే నాలుగేళ్లలో రూ.12వేల కోట్ల ఖర్చుతో కోటి మందికి శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం.
* అర్ధాంతరంగా చదువు మానేసిన వారినుంచీ ఇంజినీరింగ్‌, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ లాంటి పెద్ద చదువులు చదివినవారివరకూ ఎవరికి అవసరమైన శిక్షణ వారికి ఇచ్చేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపొందించారు. శిక్షణలన్నీ పూర్తి ఉచితం.
* పీఎంకేవీవై కింద మొత్తం 34 విభాగాల్లో (స్కిల్‌కౌన్సిల్స్‌) 221 కోర్సుల్లో (స్కిల్స్‌) శిక్షణ ఇస్తారు. వ్యవసాయ విభాగంలో పది, బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ విభాగంలో 6, మైనింగ్‌లో 9, లెదర్‌ ఇండస్ట్రీకి సంబంధించిన విభాగాల్లో 6, టెలికాం రంగంలో 10, దుస్తులూ ఫర్నిషింగ్‌ విభాగంలో 9... ఇలా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. ఒకో కోర్సులోనూ అవసరాన్ని బట్టి 150 నుంచి 300 గంటలవరకూ శిక్షణ ఉంటుంది. ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రాల ద్వారా వీటిని నిర్వహిస్తారు.
* పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలోనూ, కేంద్ర నిధులతో రాష్ట్ర నిర్వహణలోనూ - రెండు రకాలుగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న శిక్షణ కేంద్రాలు ఈ కార్యక్రమాల షెడ్యూల్‌ను ఎప్పటికప్పుడు ప్రకటిస్తాయి.
* పీఎంకేవీవై కింద శిక్షణ మూడు ఫార్మాట్‌లలో ఉంటుంది. స్వల్పకాలిక శిక్షణ, అభ్యర్థికి అప్పటికే ఉన్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే అదనపు శిక్షణ, ఆసక్తి మేరకు ఏదైనా ప్రత్యేక శిక్షణ.
* పది రాష్ట్రాల్లో పాఠశాల స్థాయిలోనే వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ప్రవేశపెట్టారు. రెండున్నర లక్షల మంది విద్యార్థులు వృత్తి విద్యా శిక్షణ పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా 514 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకం గురించిన పూర్తి వివరాలనూ, శిక్షణా కేంద్రాల వివరాలనూ www.pmkvyofficial.orgలో చూడవచ్చు.
తెలంగాణలో ‘టాస్క్‌’ 
తెలంగాణ స్టేట్‌ స్కిల్‌కౌన్సిల్‌, స్కిల్‌ మిషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యక్రమాలను అమలుచేస్తోంది. అది కాకుండా విడిగా తెలంగాణ ప్రభుత్వం ‘టాస్క్‌’(తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌) పేరుతో ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక లాభాపేక్షలేని సంస్థను నెలకొల్పింది. ఇటీవలే వరంగల్‌లో టాస్క్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.
* కళాశాలల నుంచీ బయటకు వచ్చేటప్పటికే యువత అన్ని ఉద్యోగార్హతలనూ అందిపుచ్చుకోవాలన్నది ‘టాస్క్‌’ లక్ష్యం.
* కార్పొరేట్‌, పారిశ్రామిక, విద్యారంగాల సమన్వయంతో ఈ సంస్థ శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. నామమాత్రపు రుసుములతోనే అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు.
* ఈ పథకం కింద ఇప్పటివరకూ 588 కళాశాలలు నమోదు చేసుకోగా 1,09,303 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. 3156 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు.
* ఇంజినీరింగ్‌, ఎంబీఏ, డిగ్రీ, ఫార్మసీ... ఇలా వేర్వేరు కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌, టెక్నికల్‌ స్కిల్స్‌ నేర్పడానికి విడివిడిగా నిరంతరం బ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు.
* టాస్క్‌ మొబైల్‌ ఆప్‌ని రూపొందించారు. విద్యార్థులు తమ కళాశాల ద్వారా టాస్క్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. తమకు కావలసిన శిక్షణ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాల ఖాళీల గురించి కూడా వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
* సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ లాంటి జాతీయ సంస్థలు తరచూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల పూర్తి వివరాలను ఈ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. www.task.telangana.gov.in
tssm.cgg.gov.in
గ్రామీణ యువతకోసం...
పీఎంకేవీవైతో పాటు మరికొన్ని పథకాలనూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాటిల్లో ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ్‌ కౌశల్‌ యోజన’ గ్రామీణ యువతకోసం నిర్దేశించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అమలుచేస్తున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పదేళ్లుగా అసంఘటిత రంగ కార్మికుల కోసం మాడ్యులర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ స్కిల్స్‌ (ఎంఈఎస్‌) అనే పథకాన్ని అమలుచేస్తోంది. బడి మానేసినవారికీ, ఐటీఐ చదివినవారికీ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పీఎంకేవీవైని సమన్వయపరుస్తున్న నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ గత నాలుగేళ్లుగా 267 మంది ఇతర భాగస్వాములతో కలిసి దాదాపు 20 లక్షల మందికి పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. నైపుణ్యమంత్రిత్వ శాఖ కిందే ఉన్న మరో స్వతంత్ర సంస్థ నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ. రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలను సమన్వయపరచడంలో కీలకపాత్ర వహిస్తోంది. జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘ఆజీవిక స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ అనే పథకం మారుమూల గ్రామీణ యువజనులకోసం ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడమే కాక శిక్షణ అనంతరం వారు ఉపాధి పొందేలా చూస్తోంది.
నవ్యాంధ్రప్రదేశ్‌లో...
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధిది కీలక పాత్ర. కొత్త రాజధాని నిర్మాణమూ కొత్త పరిశ్రమల ఏర్పాటూ తదితర కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా సాగుతున్న నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ని ఏర్పాటుచేసింది.
* పదిహేనేళ్లలో రెండు కోట్ల మందిని నిపుణులైన ఉద్యోగులుగా మార్చుకోవాలన్న లక్ష్యంతో ఈ కార్పొరేషన్‌ పనిచేస్తోంది.
* ఇప్పటికే 4,48,202 మంది కార్పొరేషన్‌ నిర్వహిస్తున్న కోర్సుల్లో శిక్షణకు నమోదు చేసుకోగా మూడున్నర లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ పేర్కొంటోంది.
* యువతను ఏడు విభాగాలుగా విభజించి తదనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌, పీజీ, సాధారణ డిగ్రీ చేసినవారు, వృత్తి విద్యల్లో శిక్షణ పొందిన వారు, పదోతరగతి లేదా ఇంటర్‌తో చదువు ఆపేసిన వాళ్లు... ఇలా వారి అర్హతలను బట్టి శిక్షణ కార్యక్రమాలుంటాయి.
* క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌, ట్రైనింగ్‌కోసం ఎల్‌ఎంఎస్‌ అనే పథకాన్నీ, అర్థాంతరంగా చదువు ఆపేసిన గ్రామీణ విద్యార్థుల కోసం నిర్మాణ్‌ విద్య హెల్ప్‌లైన్‌నీ ఈ కార్పొరేషన్‌ నిర్వహిస్తోంది. జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాల వివరాలతో పాటు జాబ్‌మేళాల గురించి కూడా ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.
ఇప్పటివరకూ 193 జాబ్‌మేళాలు నిర్వహించగా 38 వేల మందికి ఉద్యోగాలు లభించాయి.
* ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిర్వహించే కార్యక్రమాల వివరాలకోసం www.apssdc.inచూడవచ్చు.
సామాజిక బాధ్యతగా...
ప్రభుత్వాలే కాకుండా పలు కార్పొరేట్‌ సంస్థలు కూడా సామాజిక బాధ్యతలో భాగంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు.
* డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ‘ల్యాబ్స్‌’ (లైవ్‌లీహుడ్‌ అడ్వాన్స్‌మెంట్‌ బిజినెస్‌ స్కూల్‌) పేరుతో యువత సాధికారతకు చేయూతనిస్తోంది.
* జీఎంఆర్‌ గ్రూపు ‘జీఎంఆర్‌ వరలక్ష్మి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌’, ‘జీఎంఆర్‌ వరలక్ష్మి సెంటర్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ లైవ్‌లీహుడ్స్‌’ పేరుతో ఏపీ తెలంగాణల్లో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
* నాట్కో ట్రస్టు తరఫున యువతకి కెరీర్‌ కౌన్సెలింగ్‌తోపాటు, ప్రత్యేకంగా ఫార్మసీ విద్యార్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు.
* యశోదా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుపేద, అనాథ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.


No comments:

Post a Comment

Total Pageviews